పునీత చిన్న యాకోబు, పునీత ఫిలిప్పు, 3 మే

పునీత చిన్న యాకోబు

పునీత చిన్న యాకోబు గారినే జేమ్సు అని కూడా అంటాము. అనగా యాగప్ప గారు. వారు అల్ఫయీ కుమారుడు (అ. కా. 1:13) వీరు యేసు ప్రభువుకు శిష్యులు వరుసకు సహోదరుడు అవుతాడు. (మ. 13: 55, మా. 6: 3, గల. 1: 19) చిన్న యాకోబు గారి తల్లి క్లోఫా మరియా (యో. 19: 25), కన్య మరియమ్మ అక్క చెల్లెండ్రు అవుతారని చరిత్ర తెలియచేస్తుంది. చిన్న యాకోబు గారు అనగా యాగప్ప గారు అనగా అందమైన, భక్తి గల, విరక్తత్వము గల వ్యక్తి అని తెలుస్తుంది.

చిన్న యాకోబు గారు పవిత్ర నగరం జెరూసలేం పీఠం కు బిషప్ గా సేవలు అందించారు. ప్రేమదాత్రుత్వాలకు పెట్టింది పేరుగా ఎల్లప్పుడు దేవాలయంకు వేద ప్రచారం కు అతుక్కు పోయి ఉండేవారు. యూదుల ఆచారాలంటే ఎక్కువ ఇష్టం. హేరోదు అగ్రిప్ప వేదహింసలు ప్రబలినపుడు తమ గొప్ప పదవికి న్యాయం చేయలేక పోతున్నందుకు గాను మవునముగా రాజీనామా చేశారు.

పునీత యాకోబు గారు వ్రాసిన లేఖను వారు క్రీ.శ. 47 లో వ్రాసారు. ఈ లేఖ సిరియా శ్రీ సభను ఉద్దేశించి వ్రాసినట్లు అర్ధమౌతుంది. ఎందుకంటే, కొత్తగా వచ్చిన దైవ ప్రేమ, సహోదర ప్రేమ పునాది పై గల క్రైస్తవ వేదం అనుసరించడం వల్ల సమాజంలో తాము తక్కువగా చూడబడడం, అనగద్రొక్కబడడం అనుభవిస్తున్న క్రొత్త విశ్వాసుల కోసం వారిని ప్రోత్సహిస్తూ ఈ లేఖ వ్రాసారు.

బట్టలు ఉతికే వారల సంఘం వారు ఆగ్రహం తో విరుచుకు పడి చిన్న యాకోబు గారిని దేవాలయంకు వున్న పిట్ట గోడపై నుండి బలం గా విసిరివేసి కొట్టి చంపారు. వారు క్రీ. శ. 62 లో వేద సాక్షి మరణం పొందారు. వీరు డ్రగ్గిస్ట్ లు, చాకలి వృత్తి వారు, దొర టోపీ తయారీ దార్ల పాలక పునీతులు.

ధ్యానంశం: కేవలము వినుటయేనని ఆత్మ వంచన చేసికొనకుడు. దానిని ఆచరింపుడు. (యాకోబు. 1: 22)

అపోస్తలుడైన పునీత ఫిలిప్పు: (వేదసాక్షి క్రీ.శ. – 80)

గేన్నేసరేతు సరస్సుకు వొడ్డున గల బెత్సయిదా పుర నివాసి ఈ ఫిలిప్పు గారు. యేసు క్రీస్తు ప్రభుని 12 మంది తొలి అపోస్తులలో ఒకరు. అప్పటికి వారికి వివాహమైంది. చాలా మంది ఆడపిల్లల తండ్రి. ఎప్పటి నుండో వేద ప్రవచనం చొప్పున ఎదురు చూస్తున్న మెస్సియ కంటికగుపించి శిష్యుడు గా చేరిన వెంటనే, తన ఈ ఆనందాన్ని, పంచుకోవడానికి తన ఆప్త మిత్రుడైన నతనయేలు వద్దకు వెళ్లి “మోషే ధర్మశాస్త్రమందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియును అగు యేసు” అని చెప్పారు. “నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా?” అని నతనయేలు ప్రశ్నింపగా “వచ్చి చూడుము” అని జవాబుచెప్పింది ఫిలిప్పు గారే (యోహాను 1:45,46) నతనయేలు (బర్తలోమియో) గారు కూడా ఫిలిప్పు గారితో పాటు వెళ్లి యేసు నాధుని శిష్యులవడం మనకు తెలుసు.

తియోడోరేత్ మరియు ఎవుసేబియస్ గార్లు గట్టిగా చెప్పేదేమంటే పెంతెకోస్తు దినాన పవిత్రాత్మను స్వీకరించిన పిమ్మట ఫిలిప్పు గారు కన్యకలుగా ఉన్న తన కుమార్తెలను వెంట నిడుకొని ఆసియా మైనరు (టర్కీ) ప్రాంతంలో సువార్తా ప్రచారం చేసి, ప్రిగియా ప్రాంతంలోని హీరాపోలిస్ ఊరిలో సిలువలో కొట్టబడి చంపబడ్డారు. బహుశా క్రీ.శ. 80లో కావచ్చు. వీరి గుర్తు రెండు రొట్టెలు ఫిలిప్పు అనగా అశ్వప్రియుడు, గుర్రముల అభిమాని అని అర్ధం.

ధ్యానంశం: నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటి వాడు. అట్టి వాడు దొరికినచో నిధి దొరికినట్లే. (సిరా 6:14).

No comments:

Post a Comment