పునీత చిన్న యాకోబు, పునీత ఫిలిప్పు, 3 మే

పునీత చిన్న యాకోబు, పునీత ఫిలిప్పు (3 మే)

పునీత చిన్న యాకోబు: పునీత చిన్న యాకోబు గారినే జేమ్సు అని కూడా అంటాము. అనగా యాగప్ప గారు. యాగప్ప అనగా అందమైన, భక్తి గల, విరక్తత్వము గల వ్యక్తి. వారు అల్ఫయీ కుమారుడు (అ. కా. 1:13). యేసు ప్రభువుకు శిష్యులు మరియు వరుసకు సహోదరుడు అవుతాడు. (మత్త 13: 55, మార్కు 6: 3, గల. 1: 19) చిన్న యాకోబు గారి తల్లి క్లోఫా మరియ (యో. 19: 25), కన్య మరియమ్మ అక్క చెల్లెండ్రు అవుతారని చరిత్ర తెలియచేస్తుంది. చిన్న యాకోబు గారు పవిత్ర నగరం జెరూసలేం పీఠంకు బిషపుగా సేవలు అందించారు. ప్రేమదాత్రుత్వాలకు పెట్టింది పేరుగా ఎల్లప్పుడు దేవాలయంకు వేదప్రచారంలో ఉండేవారు. యూదుల ఆచారాలంటే ఎక్కువ ఇష్టం. హేరోదు అగ్రిప్ప వేదహింసలు ప్రబలినపుడు తమ గొప్ప పదవికి న్యాయం చేయలేక పోతున్నందుకుగాను మౌనముగా రాజీనామా చేశారు. పునీత యాకోబుగారు వ్రాసిన లేఖను క్రీ.శ. 47లో వ్రాసారు. ఈ లేఖ సిరియా శ్రీసభను ఉద్దేశించి వ్రాసినట్లు అర్ధమౌతుంది. ఎందుకంటే, దైవ ప్రేమ, సహోదరప్రేమ పునాదిపై గల క్రైస్తవవేదం అనుసరించడం వల్ల సమాజంలో తాము తక్కువగా చూడబడడం, అనగద్రొక్కబడడం అనుభవిస్తున్న క్రొత్త విశ్వాసుల కోసం వారిని ప్రోత్సహిస్తూ ఈ లేఖ వ్రాసారు. బట్టలు ఉతికే వారల సంఘం వారు ఆగ్రహంతో విరుచుకు పడి చిన్న యాకోబు గారిని దేవాలయంకు వున్న పిట్ట గోడపై నుండి బలంగా విసిరివేసి కొట్టి చంపారు. వారు క్రీ.శ. 62 లో వేదసాక్షి మరణం పొందారు. వీరు డ్రగ్గిస్టులు, చాకలి వృత్తివారు, దొర టోపీ తయారీ దార్ల పాలక పునీతులు.

ధ్యానంశం: కేవలము వినుటయేనని ఆత్మ వంచన చేసికొనకుడు. దానిని ఆచరింపుడు. (యాకోబు. 1: 22)

అపోస్తలుడైన పునీత ఫిలిప్పు: (వేదసాక్షి క్రీ.శ. – 80): గేన్నేసరేతు సరస్సుకు వొడ్డునగల బెత్సయిదాపుర నివాసి ఈ ఫిలిప్పు గారు. యేసుక్రీస్తు ప్రభుని 12మంది తొలి అపోస్తులలో ఒకరు. అప్పటికి వారికి వివాహమైంది. ఎప్పటినుండో వేద ప్రవచనం చొప్పున ఎదురు చూస్తున్న మెస్సియ కంటికగుపించి శిష్యుడుగా చేరిన వెంటనే, తన ఈ ఆనందాన్ని, పంచుకోవడానికి తన ఆప్తమిత్రుడైన నతనయేలు వద్దకు వెళ్లి “మోషే ధర్మశాస్త్రమందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియును అగు యేసు” అని చెప్పారు. “నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా? అని నతనయేలు ప్రశ్నింపగా “వచ్చి చూడుము” అని జవాబుచెప్పింది ఫిలిప్పుగారే (యో 1:45,46) నతనయేలు (బర్తలోమియో) కూడా ఫిలిప్పు గారితో పాటు వెళ్లి యేసు నాధుని శిష్యులవడం మనకు తెలుసు. తియోడోరేత్ మరియు ఎవుసేబియస్ గార్లు గట్టిగా చెప్పేదేమంటే పెంతెకోస్తు దినాన పవిత్రాత్మను స్వీకరించిన పిమ్మట ఫిలిప్పుగారు ఆసియా మైనరు (టర్కీ) ప్రాంతంలో సువార్తా ప్రచారం చేసి, ప్రిగియా ప్రాంతంలోని హీరాపోలిస్ ఊరిలో సిలువలో బహుశా క్రీ.శ. 80లో కొట్టబడి చంపబడ్డారు. రొట్టెలు ఫిలిప్పు అనగా అశ్వప్రియుడు, గుర్రముల అభిమాని అని అర్ధం.
ధ్యానంశం: నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటి వాడు. అట్టి వాడు దొరికినచో నిధి దొరికినట్లే. (సిరా 6:14).

No comments:

Post a Comment