ఆరవ పాస్కా ఆదివారము, Year C

ఆరవ పాస్కా ఆదివారము, Year C
అ.కా. 15:1-2,22-29, దర్శన. 21:10-14, 22-23, యోహాను 14:23-29
పవిత్రాత్మ వాగ్దానము - శాంతి దానము

నేడు పాస్కా 6వ ఆదివారము. ఇది క్రీస్తు మొక్షారోహణ మహోత్సవ ఆదివారమునకు ముందు వారము. ప్రభువు నేడు శిష్యులకు పవిత్రాత్మను వాగ్దానం చేయుచున్నారు. శాంతిని ఒసగుచున్నారు. భయపడకుడి అని అభయాన్ని ఇస్తున్నారు. మొదటి పఠనములో, పవిత్రాత్మ శక్తితో సంఘములోని సమస్యలను శిష్యులు, పెద్దలు, విశ్వాసులు ఎలా పరిష్కరించుకున్నారో తెలియజేయబడుచున్నది.

మొదటి పఠనము
ఈనాటి మొదటి పఠనములో, ఆదిమ సంఘములో యూదక్రైస్తవులు, అన్యక్రైస్తవులమధ్య రక్షణకు సంబంధించిన బేదాభిప్రాయాలనుగూర్చి, ఆ సమస్యను వారు ఏవిధముగా సామరస్యముగా, దేవుని సహాయముతో, సమాలోచన, సంప్రదింపులద్వారా, ప్రార్ధనద్వారా, పవిత్రాత్మ నడిపింపుద్వారా పరిష్కరించుకున్నారో వివరించబడినది. ఆదిసంఘములో వచ్చిన సమస్యయొక్క మూలాలు, ఆదిలో ఆ సమస్యను ఉద్దేశించి ఇవ్వబడిన నియమాలయొక్క ఉద్దేశాలు, ఈ సమస్యను పరిశీలించడంద్వారా, ఈ ఆధునిక కాలములో విశ్వాసులమధ్య వచ్చు సమస్యలను ఏవిధముగా పరిష్కరించవచ్చో, మన జీవితాలను ఏవిధముగా దేవునికి ప్రీతికరమైనవిగా మలచుకోవచ్చో తెలుసుకుందాము!
సమస్య: యూదయానుండి కొందరు మనుష్యులు, అనగా యూదమతమునుండి క్రైస్తవులుగా మారిన కొందరు అంతియోకియాకు వచ్చి, అచ్చటనున్న క్రైస్తవ సోదరులతో, అనగా అన్యమతములనుండి క్రీస్తుని రక్షకునిగా స్వీకరించి, 'నూతన మార్గము'లో నడుస్తున్న వారివద్దకు వచ్చి బోధింపసాగిరి. వారి బోధనలో మోషేయొక్క నియమములను, మరిముఖ్యముగా సున్నతి నియమములను తప్పనిసరిగా యూదులుగాని క్రైస్తవులుగాని పాటింపవలసినదేనని, సున్నతి లేకుండా వారికి రక్షణలేదని వారికి బోధింపసాగిరి. ఈ బోధనవలన నూతనముగా క్రీస్తును స్వీకరించిన వారు కలత చెందిరి. ఈ నూతన బోధన వలన వారు కలవరపడిరి. ఆ సంఘమునుండి, ఆ విశ్వాసులను క్రీస్తులో నడిపిస్తున్న పౌలు, బర్నబాసులను, యూదయానుండి వచ్చిన నూతన బోధకులకుమధ్య వాదప్రతివాదనలు జరిగాయి. దీనివలన సంఘము ప్రశాంతతను కోల్పోయినది. ఈ సమస్యనుండి, సంధిగ్దావస్థనుండి సంఘమును కాపాడుటకు పౌలు, బర్నబాసులు యెరుషలేమునకు వెళ్లి అక్కడనున్న అపోస్తులతో, సంఘపెద్దలతో ఈ విషయమునుగూర్చి క్షున్నముగా చర్చించి వారి సలహాలను, సంప్రదింపులను కోరియున్నారు. అన్యమతములనుండి క్రైస్తవులుగా మారుతున్న వారికి ఒక నిర్దిష్టమైన సూచన, మార్గదర్శకములు కావాలని వారు కోరియున్నారు. ఈ సందర్భములో అన్నింటికంటే ముఖ్యముగా "సున్నతిని" గురించి ప్రముఖముగా ప్రస్తావించిరి. అసలు సున్నతి అంటే ఏమిటి? దానిని ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆచరించారు (యూదులు ఇప్పటికికూడా ఆచరిస్తూనే ఉన్నారు)? ఇశ్రాయేలీయుల జీవితములో దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ సున్నతి యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోకుండా, దాని యొక్క ఆవశ్యకతనుగాని, అనావశ్యకతనుగాని మనం ప్రతిపాదించలేము.

ఆదికాండము 17లో సున్నతినిగూర్చి వివరింపబడినది. దేవుడు అబ్రాముతో చేసుకున్న ఒడంబడికకు సూచనగా (గుర్తుగా) అబ్రాము సంతతిలోని పురుషులందరు, అలాగే అబ్రాము సంతతితో కలసి పనిచేయువారు, కలిసి జీవించు పురుషులందరు కూడా సున్నతి పొందవలెనని దేవుడు ఆదేశించాడు. వారి జీవితములో, కుటుంబములో పాలుపంచుకొనువారు, బానిసలుకూడా సున్నతి చేయబడవలెనని అజ్ఞాపించెను. ఈ సున్నతి దేవునియొక్క ఒడంబడికలో పాలుపొందుటకు చిహ్నము. దేవునికి అబ్రామునకుమధ్య జరిగిన ఒప్పందమునకు నిదర్శనము (ఒప్పందము / నిబంధన అనగా, "నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు") ఇశ్రాయేలు ప్రజలు దేవునికి చెందినవారు, దేవుని మార్గములో నడచువారు, దేవునితో నడచువారు, దేవుని ప్రజలుగా జీవించువారు అని లోకమునకు తెలియజేయుట కొరకు, అదేవిధముగా, దేవుడు తన ప్రజలను నడిపించువారిగా, కాపాడువారిగా, కాపరిగా, మేపరిగా, సంరక్షించువారిగా, పోషించువారిగా ఉంటారని తెలియపరస్తుంది. దీనికి సాక్ష్యముగా, సంకేతముగా అబ్రాము సంతతిలోని పురుషులందరు సున్నతి చేయించుకొనేవారు. ఈ సాంప్రదాయం వంశపారంపర్యములో యేసుక్రీస్తుకూడా భాగస్తుడై, జన్మించిన ఎనిమిదవ దినమున సున్నతి చేయబడినాడు. క్రీస్తు అనుచరుల్లో, శిష్యులందరు ఇశ్రాయేలు సంతతికి చెందిన వారగుటచే వారికి సున్నతిని గూర్చిన సందేహములు రాలేదు. ఎప్పుడైతే, దేవుని వాక్యము యెరూషలేముదాటి (అ.కా. 1:8) దాని పరిసర ప్రాంతములు, భూదిగంతముల వరకు ప్రసరించడం ఆరంభమైనదో, ఎప్పుడైతే అన్యులు క్రీస్తును అంగీకరించడం ఆరంభించారో, అప్పుడే సున్నతినిగూర్చి, దానితో ముడిపడియున్న ఒడంబడికనుగూర్చి, దేవుని వాగ్దానములనుగూర్చి తర్కం మొదలైనది. సున్నతిలోని నిగూఢ అర్ధమును, బాహ్యపు సంకేతమును వేరుచేసి చూడటం మొదలుపెట్టారు. అప్పుడే విశ్వాసులమధ్య సమస్యలు ప్రస్పుటించాయి. అందుకే మోషే ఇశ్రాయేలీయులను హృదయం శుద్ధిచేసుకోమన్నాడు (ద్వితీ. 10:11,12). వారి హృదయం దేవునికి అంకితమవ్వాలి. ఆ హృదయం దేవుని మాట వినాలి, దేవుని మాటకు స్పందించాలి, దేవునికి సింహాసనం కావాలి. ఇస్రాయేలీయుల చరిత్రను పరిశీలించినట్లయితే, వారు ఈవిషయములో శ్రద్ధ తీసుకోలేదు. బాహ్యపు విషయములలోపడి, అంతరంగికమైన విషయములను మరచిపోయారు (యెషయ 1:3-5). కాని, బాహ్యమైన సాంప్రదాయమైన సున్నతిని పాటిస్తూనే ఉన్నారు. అంతరంగికముగా దేవునికి దూరముగా ఉన్నా, దేవునితో ఉన్నామన్నట్లు నటిస్తూ వచ్చారు. అందుకే, హృదయశుద్ధిపై కాకుండా శారీరకపు, బాహ్యపు సంకేతమునకు ప్రాముఖ్యతనిచ్చారు. అంతరంగికశుద్ధిని, ఆత్మశుద్ధిని త్యదించారు, మరచిపోయారు.

పరిష్కారం: నూతన సంఘములో వచ్చిన 'సున్నతి' సమస్యను అందరూ కలసి కూర్చొని, ఒకరితో ఒకరు మాట్లాడుకొని, ఒకరి వాదనను ఒకరు విని, సావధానముగా, సామరస్యముగా వారి సమస్యను పరిష్కరించుకున్నారు. ఈవిధమైన సమస్యల పరిష్కారం మనకు మాతృక కావాలి. ఈ సమావేశం చివరిలో పేతురు, యాకోబులు మాట్లాడుతున్నారు, వారిద్దరి మాటల్లో, క్రీస్తు సంఘములో ఉన్న నూతన దృక్పథం స్పురిస్తుంది. పేతురు చెప్పినట్లు, యూదులు ఎన్నికద్వారా, సున్నతి ద్వారా దేవునితో సహవాసమును పొందితే, అన్యులు సువార్తను విని, విశ్వసించుటద్వారా అదే భాగ్యమును పొందుతున్నారు (అ.కా.15:7). వారి విశ్వాసమును బట్టి దేవుడు వారి హృదయాలను శుద్ధిచేశాడు (అ.కా.15:9). అదేవిధముగా, యాకోబుకూడా పేతురు చెప్పినది వక్కానిస్తూ, వారు ఏమి చేయకూడదో వివరిస్తున్నాడు (అ.కా.15:29). దేవుని దగ్గరికి రావాలంటే, కొన్ని త్యజించుకోవాలి. కొన్ని తగ్గించుకోవాలి. మలిన పరచువాటిని మార్చుకోవాలి. వినుటద్వారా వచ్చిన విశ్వాసమును హృదయములో పదిలముగా బద్రపరచుకోవాలి. అది క్రియల్లో, జీవితంలో వ్యక్తపరచబడాలి. అమూల్యమైన ఆ విశ్వాసం మాటలద్వారా, అలవాట్లద్వారా, ఆలోచనలద్వారా, మలినం కాకుండా చూసుకోవాలి. ఇలా జరగాలంటే, హృదయమంతా ఆయనకు అంకితమవ్వాలి. హృదయంనిండా ఆయనను నింపుకోవాలి. ఆయనకే ప్రధమ ప్రాధాన్యతను యివ్వాలి. ఆయన స్థానమును ఏవ్యక్తిగాని, శక్తిగాని, వస్తువుగాని, యితర వ్యాపకంగాని ఆక్రమించకూడదు. ఆయనను పూర్ణఆత్మతోను, పూర్ణశక్తితోను, పూర్ణమనస్సుతోను ప్రేమించి, సేవించాలి (ద్వితీ 10:12). నీ హృదయం దేవునితో నిండాలి, దేవునికి మాత్రమే చెందాలి. మనం క్రీస్తుద్వారా (కొలోస్సీ 2:11) సున్నతి పొందాము కనుక, ఆయన ప్రసాదించు శక్తిద్వారా శరీరేచ్చలకు వ్యతిరేకముగా పోరాడాలి. క్రీస్తును మన హృదయంలో ప్రతిష్టింప చేయకుండా ఈ పని చేయలేము. అందుకే హృదయంనిండా, క్రీస్తును నింపుకుందాం! ప్రేమను పంచుకుందాం! (కొలోస్సీ 3:15,16). సమస్యలు మన వ్యక్తిత్వాన్ని, సంఘాన్ని భయపెట్టకూడదు. అవి మనలను దృఢపరచాలి. బలపరచాలి. ఒకరికొకరిని దగ్గర చేయాలి. దేవుని సామీప్యానికి మనలను నడిపించాలి.

సువిశేష పఠనము
సువిశేష పఠనము - ప్రభువు తన శిష్యులతో వీడ్కోలు మాటలను పలుకుచున్నారు. "నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును" (యోహాను 14:23) అన్న వాక్యముతో ప్రారంభమగుచున్నది. దేవున్ని ప్రేమించడం ఏమిటో స్పష్టం చేయుచున్నది. ప్రభువు వారి మధ్యనుండి త్వరలో వెళ్ళిపోతారు, కాని, ప్రభువు దైవరాజ్య ప్రేషిత కార్య ఆగిపోదు. కొనసాగుతూ ఉంటుంది. తన మరణం-ఉత్థానం ద్వారా మహిమోపేతుడైన ప్రభువు, ఇక ప్రత్యక్షముగా గాక, పవిత్రాత్మ రూపమున తన సాన్నిధ్యాన్ని కొనసాగిస్తారు. ఆయన ఎన్నటికి వారిని అనాధలుగా విడచి పెట్టడు. ఎందుకన, ఆయన వారిని ప్రేమించారు. స్నేహితులని పిలిచారు (15:15). ప్రభువును గూర్చి సమస్తమును ఎరుకపరచు ఒదార్చువాడగు పవిత్రాత్మను వారిపైకి పంపును (15:16). పవిత్రాత్మశక్తి సహాయముతో వారు ప్రభువు కార్యమును కొనసాగించెదరు: రక్షణ ఒసగు సువార్తను ప్రపంచ మంతటా ప్రకటించెదరు. 

"నన్ను ప్రేమించువారు" అనగా ప్రభువు నందు విశ్వాసులు, అయన అనుచరులు లేదా ఆయన శిష్యులు లేదా క్రైస్తవులు. క్రీస్తుకు-క్రైస్తవులకు మధ్యన నున్న బంధం ప్రేమ బంధం. ప్రభువును ప్రేమిస్తే (క్రైస్తవులు), ఆయన మాటను పాటించాలి. ఆయన బోధనలను ఆలకించాలి. అపుడు పరలోక తండ్రి వారిని ప్రేమించును. అపుడు, తండ్రియును, యేసు ప్రభువును వారితో నివసించును (15:23).

"నా మాటను పాటించును."  మన జీవితములో మాటలు ఎంతో ముఖ్యమైనవి. మాట మీదనే ఎన్నో విషయాలు ముందుకు వెళుతూ ఉంటాయి. మన ప్రేమనుగాని, సత్యాన్నిగాని మాటతోనే వ్యక్తపరుస్తూ ఉంటాము. మాటలు ఎంతో శక్తిగలవి. అవి ఇతరులను బాధించగలవు మరియు ఒదార్చగలవు; అవమానపరచగలవు మరియు పొగడగలవు. కాని, యేసు మాటలు నిత్యజీవము గలవి, కనుక ఆయన మాటలను మనం తప్పక పాటించాలి.

"శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను" (యోహాను 14:27) అని ప్రభువు వారితో పలికారు. "శాంతి" అనగా ఏమిటి? పునీత అగుస్తీను ప్రకారం, శాంతి యనగా, "మనస్సు యొక్క ప్రశాంతత, హృదయ సరళత, ఆత్మ నిశ్చలత." అందుకే ప్రభువు, "మీ హృదయములను కలవరపడ నీయకుడు. భయపడనీయకుడు" (యోహాను 14:27) అని చెప్పారు. కలవరపాటు, భయము వలన నిద్రలేని రాత్రులను గడుపుచున్నాము. ప్రభువు ఒసగు శాంతి మనకు ప్రశాంతతను, నిశ్చలతను ఒసగును.

శాంతి యనగా, క్షమాపణ, సఖ్యత, ఐఖ్యత ఫలితమైన దేవునితో సంబంధమును కలిగి యుండటం. మన కుటుంబాలలోని, విచారణలోని, సంఘములోని సమస్యలను దేవుని సహాయముతో, పవిత్రాత్మ శక్తి ప్రభావముతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిష్కరించు కోవడానికి ప్రయత్నం చేద్దాం. నాయకుల పట్ల, అధికారులపట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని ఉంచుదాం. నాయకులు, అధికారులు కూడా విశ్వాసుల సలహాలను, అభిప్రాయాలను తెలుసుకోవడం ఎంతో అవసరం! అందరు కలిసి చర్చించుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలు మంచివికావు. దేవునిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే, పరిష్కారాలు అందరికీ ఉపయుక్తముగా ఉంటాయి. విశ్వశ్రీసభతో కలిసి నడుద్దాం!

No comments:

Post a Comment