పునీత కాస్కియ రీట (రీత)మ్మ (22 మే)

పునీత కాస్కియ రీట (రీత)మ్మ (22 మే)
(వితంతువు, అగస్టిన్ వారి సభ మఠవాసిని, అసాధ్యము, నిరాశ నిస్పృహ స్థితిలో ఉన్నవారికి పాలక పునీతురాలు)
క్రీ.శ. 1381 – 1457

పునీత రీట లేక రీతా గారినే మార్గరీట లేక మార్గరీత లేక మార్గరేట్ అని కూడా పిలుస్తారు. వారు ఇటలీదేశ, ఉంబ్రియ మండలం అపెన్నైస్ పర్వత శ్రేణులకు ఆనుకొని వున్న స్పోలేటో పట్టణ దాపునగల రోక్కీపోరేనా గ్రామములో క్రీ.శ. 1381లో జన్మించారు. తల్లిదండ్రులు సామాన్య వ్యవసాయదారులు. రీటాగారు నిండు దైవభక్తితో ప్రభువు పాటులను అధికంగా ధ్యానించేవారు. అందుకే క్రీస్తుకోసం ఎవ్వరు కోపము, పగ, ద్వేషం, స్వార్ధం కారణంగా, పోట్లాటలు, కొట్లాటలకు సమయం వృధాచేయరాదు అని చెప్తుండేవారు. అందుకే “యేసు క్రీస్తుని శాంతి స్థాపకురాలని” ఆమెను ఇరుగు పొరుగువారు సంభోదించేవారు. ఆమెయొక్క ప్రార్ధన, దయ, ప్రేమ, ఏకాంత వాసతత్వానికి వేనోళ్ళ పొగుడుతూ వుండేవారు.

క్రీ.శ. 1399లో రీటమ్మగారి 18వ ఏట ఆమెకాస్కియ పట్టణంలోని పునీత అగస్టీన్ గారి సభలో ప్రవేశించి కన్యాస్త్రీగా జీవించాలని ఆశించారు. కాని తల్లిదండ్రుల బలవంతంమీద పాల్ ఫెర్డినాండు అను వ్యక్తిని పెండ్లాడాల్సివచ్చింది. ఇది దైవచిత్తమని నమ్మి తల్లిదండ్రులకు విధేయించారు. అయితే ఫెర్డినాండు అసలిరంగు వివాహమైనాకగాని తెలియరాలేదు. కోపిష్టి, పోట్లాడే మనస్తత్వం, తాగుబోతు. అందువల్ల రీతమ్మగారికి చాలా మనసు కష్టమేసింది. కాని దేవుని దయవల్ల వారికి ఇద్దరు మగపిల్లలు కలిగారు. వారే రీతమ్మగారి ఓదార్పు, ఆశ. ప్రతీరోజు పూజకు వెంటబెట్టుకుని వెళ్ళేవారు.

రీతమ్మగారి విడువని ప్రార్ధనలు, పరిత్యాగ క్రియలు, పేదలు, రోగుల సందర్శన దేవుని కృపకు పాత్రురాలునిగా చేసింది. భర్తలో మార్పు కలిగి కొద్ది సంవత్సరాలలోనే గుడికి రావడంకూడా మొదలుపెట్టాడు. అయితే ఒకసారి పర్వతదారిలో పోతుండగా పాత కక్షల వల్ల ఎవరో శత్రువు ఫెర్డినాండును కత్తులతో పొడిచి హత్యచేశారు. పాపం రీతమ్మగారి దు:ఖానికి అవధులు లేవు. తన భర్తను హత్యచేసిన దుర్మార్గుడిని క్షమించి అతని మనోపరివర్తనకై దేవున్ని వేడుకున్నారు. అయితే పగబట్టిన పిల్లలు ఇద్దరు ఆ శత్రువును చంపేస్తామని ప్రతినబూనారు. తల్లి రీటాగారి మాట వినేస్థితిలో లేరు. అందుకు రీతమ్మగారు దేవున్ని ప్రార్ధించారు. తిరిగి హత్యానేరంతో తమ పిల్లలు పాపాత్ములు కాకముందే నీ రాజ్యంలోనికి పిలచుకొనండి దేవుడా! అని ఏడ్చి వేడుకున్నారు. కొద్ది నెలల్లోనే ఆ ఇద్దరి కుమారులను దేవుడు పిలుచుకున్నాడు.

వితంతువు అయిన రీతమ్మగారు ఒంటరివారు అయ్యారు. తన పూర్వపు కోరికను నెరవేర్చుకోవాలని కాస్కియా పట్టణంలోని పునీత అగస్టీన్ వారి మఠాలయంలో ప్రవేశింప ప్రయత్నించి విఫలమయ్యారు. కన్యాస్త్రీలకే ప్రవేశం అనే నిభందన వారిపట్ల అభ్యంతరం అయ్యింది. అయితే దేవుడు వారికి ఒక అద్భుతం నెరవేర్చారు. క్రీస్తు పునరుత్థాన పండుగ ముందురోజు (శనివారం) ఆమె ప్రార్ధనా సమయంలో తలుపువద్ద ఆమెకు ముగ్గురు పునీతులు దర్శనమయ్యారు, పునీత అగస్తీను, బాప్తిస్మ యోహాను, పునీత తోలంతినో నికోలస్ గార్లు ప్రత్యక్షమయ్యారు. రీతమ్మగారిని తోడుకొని పోయి కాస్కియా పట్టణములోని కన్యాస్త్రీ మఠ గుడిలో దివ్యసత్ప్రసాద పీఠం ముందు మోకరింపచేసి అదృశ్యమయ్యారు. యథాప్రకారం మఠ కన్యాస్త్రీలు ఉదయకాల ప్రార్ధనల కోసం గుడి తాళం తీసి లోనికిరాగా వారికి రీతమ్మగారు కనిపించారు. వారికి ఆశ్చర్యం వేసింది. తప్పక పరలోకపు పని అని గ్రహించారు. దేవుని చిత్తాన్ని అర్ధంచేసుకున్నారు.

రీతమ్మగారికి మఠంలో ప్రవేశం లభించింది. వారు తమ పరిశుద్ధతలో దినదిన ప్రవర్తమానమయ్యారు. నోవిషియేట్ ముగించి మఠనియమావలి ప్రకారం క్రీ.శ. 1413లో మాటపట్టు, ఉడుపులు స్వీకరించారు. మఠకన్యగా దేవున్ని స్తోత్రించారు, ఇలా ఆత్మశాంతితో 25 సంవత్సరాలు గడిపారు. అక్కడ కాన్వెంట్ గోడపై ప్రభువు శ్రమల చిత్రం కనబడుతూ వుంటుంది. అది చూసినప్పుడల్లా రీతమ్మగారు తనకు కూడా ఆ క్రీస్తు శ్రమల్లో భాగస్వామ్యం కావాలని ఆశించేవారు. ఒక రోజు ఆయమ్మ అలా తలస్తుండగా ప్రభువు శిరముపైగల ముళ్ళ కిరీటము నుండి ఒక దివ్య కాంతి కిరణం దూసుకు వచ్చి ఆమె నొసటికి తాకింది. ఆమె కనుబొమ్మపై గ్రుచ్చుకున్నట్లు అయ్యి గాయమైంది. అది అలాగే ఉండిపోయి రోజురోజుకూ కుళ్ళిపో సాగింది. ఆ భాద వర్ణనాతీతం. ఇది క్రీ.శ. 1441లో జరిగింది. అప్పటినుండి ఆయమ్మ వెలుపలకు రాకుండా తన గదిలోనే ఉంటూ 8 దీర్ఘ సంవత్సరాలు అజ్ఞాతవాసం గడిపారు. వారి ప్రధాన ఉపవాస క్రియలు ఫలితంగా ఎంతోమంది కతోలికులు అయ్యారు. ప్రొటెస్టాంటుల దుష్ప్రచారం కాస్త సన్నగిల్లింది.

ఇంతలో క్రీ.శ. 1450 జూబిలీ సంవత్సరంలో రోము నగరంలో పరిశుద్ధ  పోపుగారు సియోన  బెర్నర్దీన్ గారికి పునీత పట్టము ఒసగే ఉత్సవ తేదీ ప్రకటించారు. అప్పటికి తీర్ధ యాత్రకు వెళ్ళాలని కన్యాస్త్రీలు నిర్ణయించారు. రీతమ్మగారు కూడా ఎంతో ఆశతో ఆ యాత్రను చేయ సమ్మతి తెలిపారు. మరుక్షణమే ఆమె కంటిపై గాయం మాయం అయ్యింది. దైవాద్భుతం మఠవాసినులందరిని మరింత భక్తి పరవశుల్ని చేసింది. 64 సం,,ల రీతమ్మగారు, 90 మైళ్ళు కాలినడకన పవిత్ర రోముకు బయలుదేరారు. బవిష్యత్తులో పునీతులు అయిన మరో నలుగురు పుణ్యాత్ములుకూడా ఆ ఉత్సవమునకు హాజరయ్యారు. వారు పునీత బొలోనా కత్తెరీనమ్మ, పునీత యోహాను కపిస్త్రాను, పునీత మర్బెస్ జేమ్స్, పునీత కాడిస్డిగో గార్లు.

రీతాగారు క్రీ.శ. 1457 మే నెల 22వ తేదీన కాస్కియా మఠంలోనే అంతిమశ్వాస విడిచారు. ఆయమ్మ మధ్యవర్తిత్వాన ప్రార్ధించిన వారికి ఎనలేని అద్భుతాలు కోరికలు నెరవేర్చు, స్వస్థతలు చేకూరాయి. క్రీ.శ. 1900 జూబిలీ సంవత్సరంలో 13వ సింహరాయలు పోపుగారిచే పునీత పట్టము ఇవ్వబడింది. నిరాశా పరిస్థితిలో వేడుకోదగిన పునీతురాలిగా భక్తులు గుర్తించారు. రీతా లేక రీటా అంటే ఆణిముత్యం, రత్నం, మణి అని అర్ధం.

ధ్యానాంశం: పేదవారంగా భౌతిక అవసరాలపట్ల తక్కువ శ్రద్ధ కలిగివుంటే, మనల్ని గురించి అంతగా లక్ష్యపెట్టకుండావుంటే, ఇంద్రియ విషయాసక్తిని అదుపులో పెట్టగలం (పునీత కాస్కియా రీట).

No comments:

Post a Comment