మూడవ పాస్కా ఆదివారము, Year C

మూడవ పాస్కా ఆదివారము, Year C
అ.కా. 5:27-32, 40-41, దర్శన. 5:11-14, యోహాను 21:1-19
యేసును గూర్చి అపోస్తలుల సాక్ష్యం



విశ్వాసం దేవుని వరం. మన విశ్వాసానికి సాక్షమివ్వడానికి కూడా మనకు దేవుని యొక్క సహాయం అవసరం. పెంతకోస్తు పండుగకు ముందు పేతురుకి, పెంతకోస్తు పండుగ తరువాత పేతురుకి మధ్య ఉన్న తేడా మనకు సుపరిచితమే! పెంతకోస్తు ముందు అనగా ప్రభువు మరణానికి ముందు యేసు తనకు తెలియదని పేతురు మూడుసార్లు బొంకాడు. పెంతకోస్తు తరువాత, పవిత్రాత్మతో నింపబడిన పేతురు మరియు ఇతర అపోస్తలులు బాహాటముగా, నిర్భయముగా తమ విశ్వాసాన్ని ప్రకటించారు. భయమును వీడి ధైర్యముతో నింపబడ్డారు. పిరికితనం వీడి దృఢత్వం వారిలో చోటు చేసుకున్నది. బ్రతుకు జీవుడా! అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోయినవారు, ‘మేము నమ్మిన ప్రభువు కొరకు మా ప్రాణాలను సహితం ఇవ్వడానికి సిద్ధం’ అని బాహాటముగా ప్రకటిస్తున్నారు. తమ విశ్వాసానికి సాక్ష్యం ఇస్తున్న సంఘటనను మనం ఈ రోజు మొదటి పఠనములో చదువుతున్నాం. వారి ధైర్యానికి కారణం, ప్రభువు ఉత్థానము మరియు పవిత్రాత్మతో వారు నింపబడటం.

యేసుకు సాక్ష్యము ఇవ్వడములో శిష్యులు ఎదుర్కున్న సవాళ్లు

యేసును గూర్చి బోధిస్తున్నందులకు శిష్యులను బంధించి యూదుల విచారణ సభ ఎదుట నిలువ బెట్టారు. కాని పేతురు, ఇతర అపోస్తలులు, “మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను... దేవుడు తనపట్ల విధేయత చూపువారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును, మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము” అని ధైర్యముగా పలికారు. అదివిని, సభలోని సభ్యులు మండిపడి అపోస్తలులను చంపదలచారు. కాని, గమలీయేలు అను పరిసయ్యుని సలహా మేరకు ఆ ప్రయత్నాన్ని విరమించు కున్నారు. పిమ్మట, వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి [సాధారణముగా 40 కొరడా దెబ్బలు], మరల యేసు పేరిట బోధింప రాదని ఆజ్ఞాపించి వదిలి వేసారు. “యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యుల మైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభనుండి వెడలి పోయారు. ప్రతిరోజు వారు దేవాలయములోను, ప్రజల యిండ్లలోను ప్రబోధించుచు మెస్సయాయైన యేసును ప్రకటించుట మాత్రం మానలేదు” (అ.కా. 5:41).

మనము కూడా యేసుకు సాక్ష్యం ఇవ్వాలి

మన అనుదిన జీవితములో కూడా యేసుకు సాక్ష్యం ఇచ్చుటకు అనేక అవకాశములు ఉన్నాయి. వాటిని సద్వినియోగ పరచుకొని యేసుకు ధైర్యముతో సాక్ష్యం ఇవ్వగలగాలి. మన విశ్వాస అనుభవాలను ఇతరులతో పంచుకొనడము ద్వారా, ఇతరుల విశ్వాసాన్ని వికసింప జేసిన వారము అవుతాము. వారి కష్ట సమయాలలో, మన నోటిమాట ఒక మంత్రములా పనిచేసి, పరిష్కార మార్గాన్ని చూపవచ్చు. చిన్న చేతిస్పర్శ, ఒక చిరునవ్వు ఇతరులకు ఊరటను ఇవ్వవచ్చు. కాబట్టి, దైవప్రేమను పంచుటకు, పెంచుటకు ఉదార స్వభావముతో మనం ముందుకు వెళదాం!

మొదటి పఠనము అ.కా. 5:27-32, 40-41

మొదటి పఠనము నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠములు ఏమిటంటే, మొదటిగా, మానవ ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలకు విరుద్ధముగా ఉన్నప్పుడు, విశ్వాసులు దేవునికే విధేయులుగా ఉండాలి. రెండవదిగా, యేసు మృతులలో నుండి లేచాడు మరియు ఆయన ప్రభువు మరియు రక్షకుడు. ఆయనకు మారుమనస్సు మరియు పాపక్షమాపణను ఇచ్చే అధికారము ఉన్నది. మూడవదిగా, నిజమైన విశ్వాసులు క్రీస్తు నామము నిమిత్తము అవమానాలు మరియు బాధలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మరియు దానిని గౌరవముగా భావించాలి. నాలుగవదిగా, అపోస్తలులను బోధించడం నిషేధించినప్పటికినీ యేసు గురించి బోధించడం మాత్రము మానలేదు. సువార్తను ప్రకటించడం విశ్వాసుల యొక్క ముఖ్యమైన బాధ్యత. యూదుల నాయకులు అపోస్తలులను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, సువార్త వ్యాప్తి చెందుతూనే ఉంది. దేవుని యొక్క ప్రణాళికను మానవులు అడ్డుకోలేరు.

రెండవ పఠనము దర్శన గ్రంథము 5:11-14

రెండవ పఠనము దర్శన గ్రంథము 5:11-14లో యోహాను ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. దేవుని కుడి చేతిలో ఒక గ్రంథము ఉన్నది. అది లోపల మరియు వెలుపల వ్రాయబడి ఏడు ముద్రలతో ముద్రించబడి యున్నది. ఆ గ్రంథమును విప్పడానికి మరియు దాని ముద్రలను తెరవడానికి యోగ్యుడైన వాని కోసం ఒక బలమైన దేవదూత గొప్ప స్వరముతో ప్రకటిస్తున్నా, ఎవ్వరూ కనబడలేదు. దీనితో యోహాను చాలా దుఃఖిస్తాడు. అప్పుడు పెద్దలలో ఒకడు యోహానుతో మాట్లాడుతూ, “విలపింపకుము. చూడుము! యూదాజాతి సింహము, దావీదు సంతతిలో శ్రేష్టుడు, గెలుపొందినాడు. అతడే ఏడు ముద్రలను పగులగొట్టి గ్రంథమును తెరువ గలడు” అని చెప్తాడు. తరువాత యోహాను సింహము వలె కాక, వధింప బడిన గొఱ్ఱెపిల్ల వలె నున్న యేసుక్రీస్తును చూస్తాడు. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములు మరియు ఏడు కన్నులు ఉన్నాయి. అవి భూమి అంతటా పంపబడిన దేవుని ఏడు ఆత్మలు. ఆ గొఱ్ఱెపిల్ల సింహాసనముపై ఆసీనుడైన వాని (దేవుని) కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొంటాడు.

గొఱ్ఱెపిల్ల (యేసు) గ్రంథమును తీసుకొన్న తరువాత, సింహాసనము, నాలుగు జీవులు మరియు 24 పెద్దల చుట్టూ అనేక వేల కోట్ల దేవదూతల స్వరమును యోహాను వింటాడు. వారి సంఖ్య అసంఖ్యాకమైనది. ఇది దేవుని యొక్క మహిమ మరియు యేసు యొక్క విజయము ఎంత గొప్పదో ఇది తెలియ జేస్తుంది (5:11). ఈ దేవదూతల సమూహం గొప్ప స్వరముతో గొఱ్ఱెపిల్ల వధింప బడినప్పటికీ, శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము మరియు స్తోత్రము పొందడానికి యోగ్యుడని ప్రకటిస్తారు. యేసు యొక్క త్యాగము మరియు విజయము ఆయనను సర్వ స్తుతులకు అర్హునిగా చేస్తాయి (5:12). కేవలం దేవదూతలే కాకుండా, త్రిలోకములు అయిన పరలోకములో, భూమిపై, భూమి క్రింద మరియు సముద్రములో నున్న ప్రతి సృష్టి కూడా సింహాసనాసీనుడైన దేవునికి మరియు గొఱ్ఱెపిల్లకు స్తుతి, గౌరవము, వైభవము మరియు ప్రాభవము శాశ్వతమగును గాక అని ప్రకటిస్తాయి. ఇది యేసు యొక్క సర్వాధి పత్యమును మరియు దేవునితో ఆయనకున్న సమానత్వమును తెలియ జేస్తుంది (5:13). ఈ స్తుతికి ప్రతిస్పందనగా, నాలుగు జీవులు “ఆమెన్” (అనగా అలాగున జరుగును గాక) అని చెబుతాయి. 24 పెద్దలు సాగిలపడి నమస్కరించడం ద్వారా తమ ఆరాధనను మరియు అంగీకారాన్ని తెలియజేస్తారు. ఇది పరలోకములో సంపూర్ణమైన ఏకాభిప్రాయము మరియు ఆరాధన యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది (5:14).

సకల జీవకోటి ప్రభువును స్తుతించునట్లుగా యోహాను ఒక దివ్యానుభూతిని పొందాడు. కనుక, ప్రియ సహోదరీ సహోదరులారా! ప్రభువునకు స్తుతి, ఆరాధనలు, ఘనత, మహిమలు అర్పించడం ఇక్కడే మొదలు పెట్టాలి. అది ఒక అలవాటుగా మారాలి. మనము కూడా సంపూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించాలి. మన స్వభావములో భాగమై పోవాలి. అపుడు, మనము, మన సంఘము, పునీతులతో, దేవదూతలతో ఏకమై ప్రభువును నిరంతరము స్తుతించ గలుగుతాము. ఈ దర్శనము క్రీస్తు యొక్క అంతిమ విజయమును మరియు దేవుని రాజ్య స్థాపనను సూచిస్తుంది. విశ్వాసులమైన మనము ఈ నిరీక్షణతో జీవించాలి.

సువిశేష పఠనము యోహాను 21:1-19

సువిశేష పఠనములో రెండు ముఖ్యమైన భాగాలను చూస్తున్నాము. ఒకటి యేసు తన శిష్యులకు దర్శనమిచ్చి వారితో కలిసి భుజించడం. రెండు సంఘము గురించి పేతురును ప్రభువు ఆదేశించడం లేదా పేతురును నాయకునిగా నియమించడం.

(1). యేసు దర్శనము - కలిసి భుజించడం

ఉత్థాన ప్రభువు తిబెరియా సరస్సు తీరమున శిష్యులకు మరల [మూడవ పర్యాయము] దర్శనము ఇచ్చారు. మొత్తము ఏడుగురు శిష్యులు, యెరూషలేమును వీడి వారి స్వస్థలమైన గలిలీయాకు తిరిగివచ్చి, సరస్సున చేపలు పెట్టుటకు వెళ్ళారు. రాత్రియంతయు శ్రమించినను వారికి ఏమియు దొరకలేదు. ఎందుకంటే, ప్రభవును అనుసరించక ముందు అది వారి వృత్తి అయినప్పటికిని (మత్త 4:18), ఇప్పుడు కాదు. ఇప్పుడు వారు చేయవలసినది ప్రభువు ప్రేషిత కార్యము. దానిని వారు విడచి మరల పాత జీవితాలకు వెళ్లిపోయారు. “మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసెదను” అన్న ప్రభువు మాటలను బహుశా వారు మరచి పోయారు. అందుకే, పేతురు “నేను చేపలు పట్టబోవుచున్నాను” అని చెప్పగా, “మేమును నీ వెంట వచ్చెదము” అని మిగతా శిష్యులు అన్నారు (యో 21:3). ఇది వారి నిస్సహాయతకు, నిరాశకు నిదర్శనం! రాత్రియంతయు శ్రమించినను వారికి ఏమియు దొరకలేదు. ఎందుకన, వారు సరైన స్థలములో, మార్గములో లేరు. ప్రభువు మార్గమును వీడి, మన స్వంత మార్గములో, ప్రణాళికలో వెళితే మనము గమ్యాన్ని కోల్పోతాము. ప్రభువు శక్తిపైగాక, మన శక్తిపై ఆధారపడితే అంతా వ్యర్ధమే (కీర్తన 127:1-2).

ప్రాతఃకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. వారు ఆయనను గుర్తించలేక పోయారు. కాని, యేసు వారి శ్రమను, కష్టాన్ని, అలసటను, నిరాశను గుర్తించారు. ప్రభువుకు మన జీవితమంతా క్షుణ్ణముగా తెలుసు. మన ప్రతీ సమస్య, కష్టము ఆయనకు తెలుసు. మన పోరాటములో దైవీక సహాయాన్ని అందించడానికి ప్రభువు ఎప్పుడు సిద్ధమే! యేసు వారిని “బిడ్డలారా” (యో 21:5) అని సంబోధించారు. యేసు చెప్పినట్లుగా పడవకు కుడివైపున వల వేయగా ఎక్కువ చేపలు పడ్డాయి. అప్పుడు యోహాను “ఆయన ప్రభువే” అని గుర్తించాడు. ఆ క్షణములో వారు తప్పుడు స్థలములో ఉన్నామని గ్రహించారు. తప్పుడు మార్గములో ఉన్నామని గ్రహించారు.

వారు తీరమునకు రాగా, యేసు వారికోసం అచట ‘బొగ్గుల మంటను’ దానిపై ఉన్న చేపను, రొట్టెను చూసారు. “వచ్చి భుజింపుడు” అని యేసు వారిని పిలిచాడు. ప్రభువు లేనప్పుడు, వారికి తినుటకు ఏమియు లేకుండెను. కాని, ఇప్పుడు తినడానికి భోజనము సిద్ధముగా నున్నది. అదికూడా ప్రభువు ఏర్పాటు చేసిన భోజనము! ఎడారిలో ప్రజలకు తినడానికి ఏమియు లేనప్పుడు, ప్రభువు ఐదు రొట్టెలు, రెండు చేపలతో అందరికి సంతృప్తిగా భోజనమును వడ్డించారు (యో 6:1-14). “క్రీస్తు యేసు నందలి తన మహిమైశ్వర్యముల కనుగుణముగా నా దేవుడు మీ అవసరము లనన్నిటిని తీర్చును” (ఫిలిప్పీ 4:19) అని పౌలు సరిగానే చెప్పాడు.

ఇది చాలా సాధారణమైన సంఘటన అయినను, ప్రభువు భోజనము, దివ్యసత్ర్పసాదము, సంఘ కూడిక, ప్రభువు వాక్యం, బోధన... మొదలగు ఎన్నో గొప్ప విషయాలు ఈ సంఘటనలో దాగి యున్నాయి. అలాగే, పేతురు ఆ బొగ్గుల మంటను చూడగానే, తాను ప్రభువు ఎవరో తెలియదు అని మూడుసార్లు బొంకిన విషయం జ్ఞప్తికి వచ్చి యుండవచ్చు! ఈ సంఘటన వారికి ఎంతో ఊరటను ఇచ్చి యున్నది. వారి హృదయములోని తుఫాను, అలజడులను ప్రభువు శాంత పరచారు.

శిష్యులు ప్రభువును విడిచి వెళ్లినను, ప్రభువు వారికోసం వెదకు చున్నారని, వారివెంట ఉన్నారని స్పష్టమగు చున్నది. యేసు వారిని ఎన్నడూ కోపగించు కొనలేదు. ఇది ఆయన ప్రేమకు, దయకు తార్కాణం. వారికి ఎక్కువ చేపలు పడటం, శిష్యుల ప్రేషిత కార్యాన్ని సూచిస్తున్నది. క్రైస్తవ హింసల కాలములో, క్రైస్తవులు చేప గుర్తుతో సూచింప బడేవారు.

నేడు దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించుచున్న మనము, యేసు పట్ల విధేయతను చాటుదాం. ప్రతీ దివ్యబలి పూజలో, ప్రభువును కలుసు కోవాలి. దివ్యసత్ప్రసాదములో నున్న ప్రభువు సాన్నిధ్యాన్ని మనము గుర్తించాలి. మన నిరాశలో, ఆయన మనతో ఉంటాడని విశ్వసించుదాము. ప్రభువు ఉన్నారని ధైర్యముగా, నమ్మకముగా ఉందాము. శిష్యులవలె యేసును గుర్తించుదాం. ఆయన సన్నిధిలో జీవించుదాం. పాత జీవితాన్ని విడచి ప్రభువు మార్గములో పయనించుదాం. ప్రభువు సువార్త సేవలో పాల్గొందాం.

(2). యేసు-పేతురు సంభాషణ-నియామకం

వారు భుజించిన పిమ్మట, యేసు, సీమోను పేతురుతో, “యోహాను పుత్రుడవైన సీమోను! నీవు నన్ను వీరందరి కంటె ఎక్కువగ ప్రేమించు చున్నావా?” అని అడిగారు (యో 21:15). పేతురు ‘అవును ప్రభూ’ అని సమాధానం ఇచ్చాడు. ఇది అతని మారుమనస్సుకు సూచన (లూకా 22:62). అందుకే, తన సంఘానికి పేతురును కాపరిగా ప్రభువు నియమించారు. ‘మనుష్యులను పట్టడం’ మరియు వారిని ‘కాయడం’, అనగా వారిని ప్రభువు మార్గములో నడిపించడం. ఇది శ్రీసభ బాధ్యత. “మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసెదను” అని ప్రభువు శిష్యులతో చెప్పారు (మత్త 4:19; మార్కు 1:17; లూకా 5:10).

‘ప్రేమ’ నోటితో మాత్రమే చెప్పే విషయం కాదు. అది చేతలలో చూపెడిది. మనము ఆచరించేది. ‘నేను ప్రభువును ప్రేమిస్తున్నాను’ అని అనగా దానిని మన కార్యాలలో జీవించాలి. యేసు మంచి కాపరి. మంచి కాపరి అయిన యేసును ఆదర్శముగా తీసుకొని, ప్రేమ, సంరక్షణను, తన ప్రజల కాపరులు కూడా చూపాలని దేవుడు కోరుకుంటున్నారు. శ్రీసభ నాయకత్వము గురించి, పేతురుకు కూడా ఉత్థాన క్రీస్తు సవాలు విసిరాడు, “నీవు నన్ను ప్రేమించుచున్నావా?” అని మూడుసార్లు అడిగారు. ‘అవును ప్రభూ! నేను నిన్ను ప్రేమించుచున్నాను’ అని పేతురు చెప్పినప్పుడు, “నీవు నా గొర్రెపిల్లలను మేపుము” (యో 21:15), “నా గొర్రెలను కాయుము” (21:16), “నా గొర్రెలను మేపుము” అని ప్రభువు మూడుసార్లు కాపరి బాధ్యతలను అపోస్తలులకు అప్పగించారు. దీని నిమిత్తమై, పేతురు వేదసాక్షి మరణాన్ని పొందుతాడని కూడా ప్రభువు ప్రవచించారు (21:18-19). పేతురు ఇతర శిష్యులు అలాగే ప్రభువు కొరకు జీవించారు. వారి ప్రాణాలను కూడా అర్పించారు. వారి జీవితాలు నేడు మనకు ఆదర్శము!

ప్రేమ అనగా హృదయములో దేవునితో సహవాసాన్ని కలిగి యుండటం. “దేవుడు ప్రేమస్వరూపుడు” (1 యోహాను 4:8,16). ఆయన ప్రేమ అనంతమైనది, శాశ్వతమైనది. క్రైస్తవ ప్రేమ కూడా ఇట్టిదే! నేడు, జగద్గురువులు, మేత్రాణులు, విచారణ గురువులు, ప్రభుత్వాధికారులు, తల్లిదండ్రులు... కాపరులుగా సఫల మవ్వాలంటే, మొదటిగా ప్రేమ, మరియు అంకితభావము ఉండాలి. నిజమైన నాయకుడు, తన వారికొరకు తన సర్వాన్ని అర్పిస్తాడు. అంకితభావము కలిగిన నాయకులు, సమర్ధత, నిబద్ధత, పవిత్రత, మారుమనస్సు అను లక్షణాలను కలిగి యుంటారు. రెండవదిగా, జ్ఞానము కలిగి యుండాలి. నిజమైన నాయకుడు తన ప్రజలను ఎరిగి యుంటాడు (యో 10:3). మూడవదిగా, ఆదర్శముగా యుండాలి. నాయకులు సంఘములో వారి మాటల ద్వారా, చేతల ద్వారా ఇతరులకు ఆదర్శముగా ఉండాలి. గురువులు విశ్వాసులకు, తల్లిదండ్రులు పిల్లలకు, బోధకులు విద్యార్ధులకు... ఆదర్శముగా ఉండాలి.

పేతురు యేసును మూడుసార్లు నిరాకరించిన తరువాత, యేసు అతనిని మూడుసార్లు “నన్ను ప్రేమించుచున్నావా?” అని అడిగి అతనిని తిరిగి తన సేవలోకి పిలిచాడు. ఇది యేసు యొక్క క్షమాపణ మరియు పునరుద్ధరించే స్వభావాన్ని తెలియ జేస్తుంది. మనము పొరపాట్లు చేసినప్పటికీ, నిజమైన పశ్చాత్తాపముతో ఆయన వద్దకు వచ్చినచో, ఆయన మనలను క్షమించి తిరిగి తన సేవలో ఉపయోగించు కుంటాడు.

మరి “నీవు నన్ను మిక్కిలిగా ప్రేమిస్తున్నావా?” అని ప్రభువు నిన్ను అడిగితే, నీ సమాధానం ఏమిటి?

దేవుడు మిమ్ము దీవించునుగాక! ఆమెన్!

No comments:

Post a Comment