నాలుగవ పాస్కా ఆదివారము, Year C
అ.కా. 13:14, 43-52, దర్శన 7:9, 14-17, యోహాను 10:27-30
మార్పుకు మార్గం - వినుట - విశ్వాసమునకు మార్గం
‘వినగలిగేవాడే మాట్లాడగలడు’. వినడానికి విడ్డూరముగా ఉన్నా ఇది నిజం. మాటలురాని పిల్లలపై పరిశోధనలు జరిపిన వైద్యుల అంచనాల ప్రకారం, వినికిడిలేని పిల్లలే ఎక్కువగా మూగత్వమును కలిగి యుంటారు, మాట్లాడలేరు. భౌతిక విషయములో ఇదెంత వాస్తవమో, ఆధ్యాత్మిక విషయములో కూడా ఇది అంతకంటే వాస్తవం! ఈనాటి మూడు పఠనాలు కూడా, ‘వినుట'’ యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలియజేయు చున్నాయి.
నేడు పాస్కా నాలుగవ ఆదివారం. దీనిని ‘Good Shepherd Sunday’ అని ‘మంచి కాపరి ఆదివారము’ అని పిలుస్తూ ఉంటాము. ఎందుకంటే, నేటి సువార్త, మంచి కాపరి అయిన క్రీస్తును గూర్చి మాట్లాడు చున్నది. ఆయనే స్వయముగా ‘మన మంచి కాపరి’ అని మనకు గుర్తుచేయు చున్నారు. మనలను వ్యక్తిగతముగా ఎరిగియున్నారని తెలియజేయు చున్నారు. ఆయన స్వరమును ఆలకించి, ఆయనను అనుసరించి, నిత్యజీవము పొందాలని, మనలనందరినీ పిలుస్తున్నారు. అలాగే, నేడు ‘దైవపిలుపు కొరకు ప్రార్ధన దినము’. కనుక నేడు గురుత్వ జీవితము కొరకు, దైవపిలుపు కొరకు ప్రత్యేకముగా ప్రార్ధన చేద్దాం.
మొదటి పఠనము అ.కా. 13:14, 43-52: ప్రతి వ్యక్తి ప్రభువు వాక్కు వినుటకు వచ్చెను. పౌలు, బర్నబా మొదటిగా, అంతియోకియాలోని ప్రార్ధనా మందిరములో యూదులకు సువార్తను బోధించారు (13:14). యూదులు వారి బోధనలను ఆలకించక, తిరస్కరించడము వలన, వారు అన్యుల యొద్దకు వెళ్లి [గలతీ 3:28; ఎఫెసీ 2:11-22; కొలోస్సీ 3:11) సువార్తను బోధింప ఆరంభించారు. 13:44లో వింటున్నట్లుగా, “మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తియు ప్రభువు వాక్కును వినుటకు వచ్చెను”. అలాగే, 13:48లో “అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి, దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్యజీవమునకు నియమితులైన వారందరు విశ్వాసులైరి”.
కాని, ఇది చూచిన యూదులు మాత్రము అసూయ చెందారు. వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచు ధిక్కరించారు (13:45). ప్రభువు వాక్కు ఆ ప్రదేశము లందంతటను వ్యాప్తి చెందెను. అయితే, యూదులు హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమి వేసారు. శిష్యులు సంతోషముతోను, పవిత్రాత్మతోను నిండియున్నారు (13:49-52). యూదులైనను, అన్యులైనను నిత్యజీవితానికి మార్గము ఒకటే - యేసు స్వరమును ఆలకించి, విశ్వసించడం. కనుక, ఒకే కాపరి, ఒకే సంఘము!
క్రీస్తు వలెనె శిష్యులు కూడా తిరస్కారానికి గురి అయ్యారు. అలాగే, నేడు విశ్వాసుల మయిన మనము కూడా తిరస్కారానికి గురి అవుచున్నాము. అయినను, అధైర్యపడక, మన విశ్వాసాన్ని మనము ప్రకటించాలి, జీవించాలి. ఇతరులకు సాక్షులుగా ఉండాలి. మన విశ్వాసము ఎప్పటికప్పుడు పునరుద్దరింప బడాలి.
సువార్త పఠనము యోహాను 10:27-30: “నా గొర్రెలు [విశ్వాసులు] నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును”. ఇచట యేసు తననుతాను ఒక కాపరిగా తెలియజేయు చున్నారు (యో 10:11). గొర్రెల కాపరివలె, ఆయన మనలను నడిపించును, మార్గమును చూపును. మనలను ప్రేమించును. అపాయములనుండి రక్షించును. ఆయన మనలను వ్యక్తిగతముగా ఎరిగి యున్నారు. మన పేర్లు కూడా ఆయనకు తెలుసు. మనము నిజముగా ఆయన గొర్రెలమైతే, ఆయన మందకు చెందిన వారమైతే, ఆయన స్వరమును గుర్తిస్తాము, ఆలకిస్తాము, వింటాము. అయనను అనుసరిస్తాము. నిజమైన విశ్వాసులు యేసు బోధనలను మరియు పిలుపును గుర్తిస్తారు మరియు వాటికి ప్రతిస్పందిస్తారు. వారికి ఆయన స్వరం సుపరిచితమైనది. నిజమైన విశ్వాసులు యేసును అనుసరించడానికి ఎంచుకుంటారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు, వారి జీవిత విధానంలో మార్పును కలిగి ఉంటుంది. వారు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు మరియు ఆయన మార్గములో నడుస్తారు.
ఈ లోకములోనే ఏ ఇతర స్వరములు మనలను బంధింప లేవు. యేసు స్వరమును నేడు మన మనస్సాక్షిలో, హృదయములో వినగలగాలి. ఆయనను అనుసరిస్తే మనకు నిత్యజీవితము లభిస్తుంది. శ్రమలను, బాధలను తట్టుకొని జీవించగలము. తండ్రిలో, యేసులో ఏకమై, ఐఖ్యమై జీవించగలము.
యేసు, తాను మెస్సయ్య అని స్పష్టముగా చెప్పినను, యూదులు ఆయనను తిరస్కరించారు. ఎందుకంటే, వారు ఆయనను ఆలకించలేదు, తద్వార ఆయనను విశ్వసించలేదు. వారు ఆయన గొర్రెలు కారు కనుక ఆయనను నమ్మలేదు. యూదులకు ప్రభువు మాత్రమే కాపరి (కీర్తన 23:1). కాని, యేసు గొర్రెలు ఆయన మాట వినును. ఆయనను వెంబడించును. ఆయనను ఆలకించి, విశ్వసించి, అనుసరించు వారికి నిత్యజీవమును ప్రసాదింతునని వాగ్దానము చేసారు. వారు ఎన్నటికిని నాశనము చెందరు. ఎవరిచేత అపహరించ బడరు (10:27-29). యేసు గొర్రెలమైన మనము, ఆయనతో సహవాసము కలిగి (ఐఖ్యమై, ఏకమై) జీవించినచో, ఆయన మనలను తండ్రి యొద్దకు నడిపించును. “నేనును, నా తండ్రియు ఏకమై యున్నాము” (10:30) అని యేసు పలికారు. అనగా యేసు నిజ దేవుడు.
సందేశం: “నేను నా తండ్రి వినినదంతయు మీకు విశదపరచితిని” (యో 15:15). యేసు తండ్రి స్వరమును విన్నారు. మాట రావాలన్న, మాటలాడాలన్నా, వినగాలగాలి. వినటము ద్వారా ఏమి జరుగుతోంది? వినటము ద్వారా తెలుసుకుంటాము. తెలుసుకొనటము ద్వారా అర్ధం చేసుకొంటాము. అర్ధము చేసుకొనటము ద్వారా ఎదుగుతాము, అభివృద్ది చెందుతాము! ఆ ఎదుగుదల ఆత్మయందు, సత్యమందు, ఆయనయందై యుండాలి! అందుకే పౌలుగారు, రోమీయులకు వ్రాసిన లేఖలో, “వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును” (10:17) అని స్పష్టముగా చెప్పియున్నారు.
తండ్రి దేవుడుకూడా పదేపదే ఈ మాటను పలికియున్నారు. ఉదాహరణకు, ద్వితీ 6:4-9లో “వినుము, ప్రేమింపుము, భోధింపుము, ముచ్చటింపుము, వ్రాసికొనుము మరియు జ్ఞప్తియుంచు కొనుము” అని చదువుచున్నాము. క్లుప్తముగా వివరించాలంటే, దేవుని మాటను మనము వినాలి, విన్నదానిని పాటించాలి, పాటించే దానిని భోధించాలి, భోధించే దానిని ముచ్చటించాలి, ముచ్చటించిన దానిని వ్రాసి, జ్ఞప్తియందుచు కోవాలి.
మనము ఏమి వినాలి? వినికిడి శక్తియున్న ప్రతిఒక్కరు వినగలరు. వినిపించే ప్రతి శభ్దమును వినగలరు. కాని, మనము ఏమి వినాలి? ఎవరి మాట వినాలి? ఎందుకు వినాలి? ఈ ప్రశ్నలకు సమాధానం యాకోబుగారు వ్రాసిన లేఖలోని మొదటి అధ్యాయములో మనకు లభిస్తుంది. “ఆయన మీ హృదయముల పైన ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి కలది” (1:21). “స్వాతంత్రము నొసగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగా పరిశీలించి కేవలము విని మరచుట కాక, దానిని ఆచరించువాడు దేవుని దీవెనలు పొందును” (1:25). దేవుని పరిశుద్ధమైన వాక్కు మనందరి హృదయములపై ముద్రించ బడినది. దాని ప్రకారము నడచుకొనువాడు, నీతిమంతుడగును (రోమీ 2:14,15). మనలను నీతి మంతులుగా చేసే శాసనం (మాట, వాక్యం) ఎంతో దూరంలో లేదు. అది “మీ (మన) చెంతనే ఉన్నది, మీ (మన) నోటనే, మీ (మన) హృదయముననే ఉన్నది” (ద్వితీ 30:14). దానిని మనము శ్రద్ధతో ఆలకించాలి (మార్కు 4:24). మనం వినుచున్న దానిని “ఎట్లు వినుచున్నామో గమనించాలి” (లూకా 8:18).
ఆ పరిశుద్ధ వాక్యమును వినేముందు, రైతు భూమిని విత్తనములు వెదజల్లుటకు సిద్ధము చేసిన విధముగా, మన హృదయమును శుద్ది చేసుకోవాలి. పాపములు ఒప్పుకొనుచు క్షమాపణను అర్ధిస్తూ... (1 యో 1:9), హృదయ కాఠిన్యతను తొలగిస్తూ... (యిర్మియా 4:3) మరియు సాత్వికతను కలిగి యుంటూ (యాకో 1:21) వాక్యమును వినాలి. ఈవిధముగా పరిశుద్ధ వాక్యాన్ని వింటే, స్వీకరిస్తే మనయందు ఆత్మబలం నూత్నీకరించ బడుతుంది, విశ్వాసపు పునాదులు గట్టిపడతాయి.
అందుకే, మన మాటలను తగ్గించి, మాట్లాడే ప్రభుని మాటలను, జీవమునిచ్చు మాటలను, నడిపించే మాటలను, స్వస్థపరచే మాటలను, బలపరచే మాటలను మనము ఆలకించాలి
నేడు “మంచి కాపరి ఆదివారము”. కాపరిగా యేసు ప్రతీ క్రైస్తవ సంఘ కాపరులకు, నాయకులకు ఆదర్శం. కాపరి అంటే ‘అధికారం, పేరు-ప్రతిష్ట’ అని భావించక, సంఘం పట్ల సేవ, బాధ్యత అని గుర్తించాలి. కాపరి ప్రధాన స్వభావం, సుగుణము ప్రేమ-త్యాగం. గతవారం సువార్తలో విన్నట్లుగా, యేసు తన సంఘానికి పేతురును కాపరిగా నియమించారు. పేతురు తరువాత ఎంతోమందిని ప్రభువు తన సంఘానికి కాపరులుగా నియమించారు. నేటి కాపరులు (బిషప్పులు, గురువులు, దీకనులు, ఉపదేషులు, ఇతరులు...) ఎలాంటి దృక్పధముతో సంఘాలను [మేత్రాసణాలు, విచారణలు, కుటుంబాలు] నడిపిస్తున్నారు? నిస్వార్ధముగా, నిష్పక్షపాతముగా, నిగర్వముగా ఉంటున్నారా? మందలోని [సంఘము] వారందరిని ఎరిగి యున్నారా? విశ్వాసుల రక్షణ కొరకు పాటుపడు చున్నారా? సంఘ ఐఖ్యత కొరకు కృషి చేస్తున్నారా? ఎలాంటి బోధనలు చేస్తున్నారు? ప్రజలు చెప్పేది ఆలకిస్తున్నారా, వారిని అర్ధం చేసుకుంటున్నారా? వారితో కలిసి ప్రయాణం చేస్తున్నారా? మంచి కాపరి లక్షణాలను కలిగి జీవిస్తూ, విశ్వాసులకు ఆదర్శముగా ఉంటున్నారా?
నేడు మన కాపరుల కొరకు, మన ఆధాత్మిక నాయకుల కొరకు ప్రార్ధన చేద్దాం. యేసు ఆదర్శములో వారు జీవించు లాగున ప్రార్ధన చేద్దాం.
No comments:
Post a Comment