తపస్కాల మూడవ ఆదివారము, 24 మార్చి 2019

తపస్కాల మూడవ ఆదివారము, 24 మార్చి 2019
నిర్గమ. 3: 1-8, 13-15; 1 కొరింతు 10:1-6, 10-12; లూకా 13:1-9

పిలుపు - మలుపు
''ఆయన పిలుస్తాడు
పిలుపుతో మలుస్తాడు
మరలిన వారికి బయలు పరుస్తాడు
వారి ప్రతీ అడుగులో బలపరుస్తాడు.''

తపస్కాలములోని 3 వ ఆదివారమున ప్రభువు మనకు ఇచ్చు సందేశమిదే! ఈనాటి మొదటి పఠనమునందు ప్రభువు మోషేను తన పని కొరకు, తన ప్రజల కొరకు, వారి విముక్తి కొరకు ఎన్నుకొంటున్నాడు. మోషే యొక్క బలహీనతలను తెలిసికూడా అతనిని తన కార్యసాధన కొరకు ఎన్నుకొంటున్నాడు. బలహీనుడైన మోషేను, బలపరచి తన ప్రజల యొద్దకు పంపుతున్నాడు. ఎందుకంటే, బలహీనుడైన అతడే తన ప్రజల బలహీనతలను బాగా అర్ధం చేసుకోగలడని ప్రభువు యొక్క నమ్మకం. పిలచిన అతన్ని మలస్తున్నాడు, తన సేవకుడిగా మార్చుకొంటున్నాడు. అతనికి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ''బలహీన సమయమందు బలపరచుటకు నేనున్నాను'' అని ధైర్యమును నూరి పోస్తున్నాడు. అందుకే, తననుతాను 'ఉన్నవాడు'గా బయలు పరచుకొంటున్నాడు. అందుకే, ''నా ప్రజల బాధను చూచాను, వారి ఆక్రందనను విన్నాను, వారి వేదనను తెలుసుకున్నాను'' అని పలుకుతున్నాడు.

బాధలలో ఉన్న తన ప్రజలకు ప్రేమతో స్నేహాస్తాన్ని అందిస్తున్నాడు. మోషే ద్వారా, వారిని తిరిగి తన అక్కున చేర్చుకొనడానికి ప్రయత్నిస్తున్నాడు. పెక్కు విధములుగా, పెక్కు మార్లు (హెబ్రీ 1:1) తన జనులు తనతో ఉండాలని ఆశించి, వారిని పిలుస్తున్నాడు.

రెండవ మరియు సువార్త పఠనములలో ప్రభువుయొక్క పిలుపును పెడచెవిన పెడితే జరిగే ఫలితం ఏమిటో తెలియ జేయబడినది. రెండవ పఠనములో పౌలుగారు కొరింతు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఉదాహరణగా, ఇశ్రాయెలీయులలోని కొందరిని ప్రస్తావిస్తున్నారు. వారు ప్రభువు నీడలో రక్షణను అనుభవించారు. అడ్డముగానున్న ఎర్ర సముద్రమును ప్రభువు అండతో, మహిమతో దాటారు. నమ్మశక్యం కాని విధముగా, శిలనుండి నీటిని త్రాగారు. ప్రేమతో ప్రభువు చేసిన ఇన్ని అద్భుత కార్యములను చూసికూడా వారు తమ మనసులను, మార్గములను మార్చుకోలేదు. వారి హదయ కాఠిన్యమును చూచి ప్రభువు సంతోషించలేదు. అందుకే వారి ప్రేతములు ఎడారినందు చెల్లా చెదరయ్యాయి (1 కోరింతి 10:5).

ఇదే సందేశాన్ని ప్రభువు సువార్త పఠనములో తిరిగి వక్కాణిస్తున్నారు (లూకా 13:5). హదయ పరివర్తనం అనే ఫలం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇదే ఫలాన్ని మనలనుండి కూడా ఆశిస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా వారు అంజూరపు చెట్టువలె, తీసుకొనేవారిగా మాత్రమే ఉన్నారు తప్ప ఒసగేవారిగా మారలేదు.

మనం ఎలా ఉన్నాము? ఒకసారి మన హదయపు లోతులలో పరిశీలించుకొందాం! ఫలించేవారిగా, ఒసగేవారిగా  ఉన్నామా? లేదా కేవలము పొందేవారిగా మాత్రమే ఉన్నామా? మన మార్పు కొరకు, ప్రభువు ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే, ప్రభువు ''ఎవరును వినాశనము కావలెనని కోరడు. అందరు పాపమునుండి విముఖులు కావలెనని ఆయన వాంఛ'' (2 పేతురు 3:9). ఎవడు చనిపోవుట వలన ఆయన సంతోషించడు. పాపమునుండి వైదొలగి బ్రతుకుటయే ఆయన మననుండి ఆశించునది (యెహెజ్కెలు 18:32).

మనం సువార్త పఠనములో విన్నట్లుగా ప్రకతి విపత్తులు సంభవించినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, వాటిలో నశించువారు, లేదా నష్టపోయినవారు పాపులా? కాదా? అని ఆలోచించడం మాని, అవి మనకు ఎటువంటి సందేశాన్ని, మననుండి ఎటువంటి ప్రతిచర్యను, మనకు ఎటువంటి హెచ్చరికను ఇస్తున్నాయో గ్రహించాలి. ఎటువంటి మార్పును ప్రభువు మననుండి కోరుకుంటున్నాడో గ్రహించాలి (1 కొరింతి 10:11-12). అలా తెలుసుకొని, మన మార్గాన్ని మార్చుకొని, తన వైపుకు మరలమని ప్రభువు మనలను పిలుస్తున్నాడు. మలపుకోరే, ఆ పిలుపు సందేశం మనకు వినబడుతోందా?

No comments:

Post a Comment