తపస్కాల రెండవ ఆదివారము, Year C
ఆది. 15:5-12, 17-18; ఫిలిప్పీ. 3:17-4:1; లూకా 9:28-36
యేసు దివ్యరూప ధారణ
ఉపోద్ఘాతము: మనము రెండవ తపస్కాల ఆదివారములోనికి ప్రవేశించియున్నాము. ఉత్థాన మహోత్సవమునకు సిద్ధపడుచున్నాము. గతవారము యేసు ప్రభువుయొక్క ‘ఎడారి అనుభవము’ లేదా సాతాను శోధనలను జయించిన విషయం గురించి ధ్యానించాము. తన ప్రేషిత కార్యము ఆరంభించుటకు ఎడారిలో నలుబది దినములు ప్రార్ధనలో, ఉపవాసములో తన తండ్రితో గడిపియున్నారు. ఆరంభములోనే, ఆకలి, అధికారము, విజయము అను శోధనలను ఎదుర్కొన్నారు. తండ్రి దేవుని సాన్నిధ్యముతో, పవిత్రాత్మ శక్తితో, సాతాను శోధనలను జయించారు. ప్రార్ధన, ఉపవాసముతో మనముకూడా శోధనలను జయించవచ్చని ధ్యానించాము.
ఈ వారం యేసు ‘పర్వతానుభవం’ లేదా యేసు ‘దివ్యరూప ధారణ’ గురించి ధ్యానిస్తున్నాం. 'నేను దేవునిచేత ఎన్నుకొనబడిన బిడ్డను' అనేదే ఈ పర్వతానుభవము! ఈ అనుభూతినే “మనం అబ్రహాము సంతతి” అని ఆ.కాం. 15:5లో, “మనం పరలోక పౌరులము” అని ఫిలిప్పీ 3:20లో చదువుచున్నాము.
సందర్భము: యేసు గలిలీయనుండి యెరూషలేమునకు పయణం (లూకా 9 నుండి), శిష్యులు యేసును “దేవుని క్రీస్తుగా” ప్రకటించుట (లూకా 9:18-20), క్రీస్తు తన పాటుల గురించి ప్రస్తావించుట (లూకా 9:21-22). యేసు యెరూషలేములో మరణించ వలసియున్నది; ఉత్థానం చెందవలసి యున్నది; పరలోకమునకు కొనిపోబడవలసి యున్నది. తన “దివ్యరూప ధారణ” ద్వారా, ఈ మూడింటిని ముందుగానే యేసు తన ముగ్గురు శిష్యులకు తెలియజేయుచున్నారు.
దివ్యరూపధారణ, యేసు జీవితములో జరిగిన మహత్కర సంఘటన. యేసు శ్రమలానంతరం పొందబోవు మహిమకు, ఉత్థానమునకు తార్కాణం. ఇదొక గొప్ప దివ్యదర్శనము. యేసు మెస్సయ్య అని, సజీవ దేవుని కుమారుడని ధృవీకరించబడిన సంఘటన. రాబోవు దైవరాజ్యమునకు సూచన!
ముఖ్య ధ్యానాంశం ఏమనగా: యేసు ప్రభువు మహిమతో దివ్యరూప ధారణమును పొందియున్నారు. ఆయనను అనుసరించు వారందరుకూడా ఆయనతోపాటు ఆ దివ్యరూప ధారణ మహిమలో పాలుపంచు కొనెదరు. దీనిద్వారా, ప్రభువువలె మనముకూడా మారవలెనను ఒక ఆశ మనలో కలుగుతుంది. ఈ మహిమలో పాలుగొనడానికి, మన అనుదిన శ్రమలను ఎదుర్కొనడానికి ధైర్యాన్ని పొందుతున్నాము. అలాగే, ప్రభువులో మన విశ్వాసం, నమ్మకం, ప్రేమ బలపడుతున్నది.
దివ్యరూప ధారణ: పర్వతం-ప్రార్ధన ఫలితం: “పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ప్రార్ధన చేసికొనుటకై యేసు ప్రభువు [తాబోరు] పర్వతముపైకి ఎక్కి వెళ్ళెను” (లూకా 9:28). పర్వతం - ప్రార్ధన స్థలముగా, దేవుని కలుసుకొను స్థలముగా ప్రసిద్ధి. పేతురు దివ్యరూప ధారణ గురించి చెబుతూ, “పవిత్రమగు పర్వతమున” అని చెప్పాడు (2 పేతు 1:18). కేవలం పర్వతంపైకి వెళితే సరిపోదు; పర్వతముపైకి ప్రార్ధనకై వెళ్ళాలి; ప్రార్ధన చేయాలి. కష్టాలలో, బాధలలో, నిరాశలో, నిరాకరణలో, హింసలలో 'కొండపైకి' అనగా 'ప్రార్ధనకు' వెళ్ళాలి.
మోషేకూడా దేవున్ని సినాయి కొండపై దర్శించుకున్నాడు. యావే తేజస్సు కొండ కొమ్మున ప్రజ్వరిల్లుచున్న అగ్నివలె కనబడెను (నిర్గ 24:17). యావేతో మాటలాడి వచ్చుటవలన మోషే ముఖము ప్రకాశించుచుండెను (నిర్గ 34:29). ప్రార్ధనలో తన తండ్రి దేవుని సాన్నిధ్యములో ఉండాలని యేసు ఆశించారు. ప్రార్ధన అనగా తండ్రి సాన్నిధ్యములో ఉండటం, దేవుని చిత్తమును ఆలకించి పాటించడం.
“ఆయన ప్రార్ధన చేసికొనుచుండగా, యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను” (9:29). దివ్యరూప ధారణ ప్రార్ధన ఫలితమై యున్నది. ప్రార్ధనలో, దేవుడు యేసు 'గుర్తింపు'ను (నా కుమారుడు) బయలు పరచారు. దేవునిలో ఐఖ్యమై యున్నప్పుడు, ఆయన ఆత్మలో నిమగ్నమై యున్నప్పుడు, ఒక వ్యక్తి దివ్యరూప ధారణ పొందును. మహిమ, వైభవమును పొందును. ముఖము సూర్యునివలె ప్రకాశించును. పరలోక మహిమతో వెలిగి పోవును. తెలుపు పవిత్రతకు సూచన! ఇదే మారుమనస్సు, హృదయపరివర్తన, శుద్ధీకరణ! త్రిత్వైక దేవునితో సహవాసము! ఇదే దైవరాజ్యము, పరలోకము! పర్వతముపై ప్రభువు పొందిన దివ్యరూప ధారణము, తన ఉత్థానములో పొందబోయే మహిమను ముందుగానే సూచిస్తున్నది. ‘మహిమ’ అనగా దేవుని మహిమ, వైభవం, తేజస్సు! తాను మరల “శక్తితోను, మహా మహిమతోను ఆకాశమున మేఘారూడుడై వచ్చునని” యేసు చెప్పియున్నారు (లూకా 21:27).
మోషే, ఏలీయా - ధర్మశాస్త్రము, ప్రవక్తలు: మోషే, ఏలీయా మహిమతో కనిపించిరి (9:30). మెస్సయ్య కాలమున, మోషే, ఏలీయాలు తిరిగి వత్తురని ఎదురుచూసేవారు. ఎందుకన, మోషే ధర్మశాస్త్రమును, ఏలీయా ప్రవక్తలను ప్రాతినిధ్యం వహించారు. వారి సాన్నిధ్యముతో, ప్రభువుతో సంభాషణతో రెండు విషయాలను సూచిస్తున్నారు: మొదటగా, పాతనిబంధనలో వాగ్ధానము చేయబడిన రక్షకుడు, మెస్సయ్య, క్రీస్తుప్రభువే అని ధ్రువీకరించు చున్నారు. రెండవదిగా, యెరూషలేములో మరణింపవలసిన విషయమును మాట్లాడుచూ, ప్రభువు తననుతాను సిలువపై అర్పించుకొంటూ లోకరక్షణను పరిపూర్తి గావిస్తాడని సూచిస్తున్నారు. ఈవిధముగా, దివ్యరూప ధారణయొక్క ప్రాముఖ్యతను వెల్లడించారు. యేసు మరణం మరో నిర్గమనం (exodus). మోషే ప్రజలను ఐగుప్తు బానిసత్వమునుండి విడిపించి, వాగ్ధత్త భూపికి నడిపించగా, యేసు పాపము, మరణము నుండి విడిపించి, దైవరాజ్యమునకు నడిపిస్తారు.
శిష్యుల స్పందన: “వారు నిద్రమత్తులో ఉండినను, మేలుకొనినపుడు, యేసు మహిమను, ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి” (9:32). శిష్యులు ఎప్పటికి అచ్చటనే ఉండాలని ఆశించారు (9:33). కాని ఈ దివ్యరూప ధారణ శాశ్వతం కాదని, రాబోవు గొప్ప మహిమను సూచిస్తున్నదని తెలుసుకోలేక పోయారు. కొండదిగి వాస్తవ జీవితమును (శ్రమలు, నిరాకరణ, మరణం) జీవించుటకు వారు ఇష్టపడలేదు. ప్రభువును ఎప్పుడు మహిమలోనే చూడాలని ఆశించారు. శ్రమలను పొందేవారిగా (బాధామయ సేవకుడు) ప్రభువును ఊహించుకోలేక పోయారు.
మేఘము - దేవుని స్వరము - ఈయనను ఆలకింపుడు: మోషే, ఏలీయాలు కనుమరుగై పోగానే, మేఘము నుండి ఒక వాణి, “ఈయన నా కుమారుడు. నేను ఎన్నిక చేసికొనిన వాడు. ఈయనను ఆలకింపుడు” (9:35; ద్వితీయ 18:15-19) అని తండ్రి దేవుడు సాక్ష్యమిచ్చి యున్నారు. యేసు దైవకుమారుడు. యోర్దాను నదిలో యేసు బప్తిస్మము పొందిన సమయములోకూడా తండ్రి దేవుని స్వరము వినిపించెను (మార్కు 1:11; లూకా 3:22). తండ్రి దేవుడు, తన కుమారుని 'గుర్తింపు'ను లోకానికి బయలు పరచు చున్నారు. కుమారునితో తనకున్న అతి సన్నిహిత సంబంధమును, బాంధవ్యమును, సహవాసమును వెల్లడిచేయు చున్నారు. మేఘమునుండి తండ్రి వాణి వినిపించెను. ఇశ్రాయేలీయుల జీవితములో 'మేఘము' దేవుని సాన్నిధ్యాన్ని సూచిస్తున్నది (నిర్గమ 16:10; 19:9, 16; 24:15-18; 33:9). యేసు పరలోకమునకు కొనిపోబడినప్పుడుకూడా, “ఒక మేఘము ఆయనను కమ్మివేసెను” (అ.కా. 1:9). తన స్వరముతో, కుమారుని ప్రేషిత కార్యమును తండ్రి తెలియజేయు చున్నారు. శిష్యుడు/విశ్వాసి రూపాంతరం (పునరుద్ధరణ, పరిపూర్ణమార్పు) చెందాలంటే, తండ్రి దేవుడు చెప్పిన విధముగా యేసును ఆలకించాలి. పాపజీవితాన్ని విడనాడాలి. విశ్వాసం కలిగి జీవించాలి. శ్రమల పరమార్ధాన్ని గ్రహించాలి. ప్రేమగా జీవించాలి.
అన్నింటికన్న ముఖ్యముగా, యేసును ఆలకించాలి: నేడు ఎన్నో స్వరాలను వింటున్నాము, కాని దేవుని (క్రీస్తు) స్వరమును వినలేక పోతున్నాము. ఆధ్యాత్మిక చెవిటివారిగా ఉంటున్నాం! తండ్రి దేవుని మాట - ఈయనను ఆలకింపుడు (లూకా 9:35); తల్లి మరియ మాట - "ఆయన చెప్పినట్లు చేయుడు" (యోహాను 2:5) - యేసును ఆలకించాలి; ఆలకించిన దానిని చేయాలి. నిజమేకదా?
దివ్యరూపధారణలో దాగియున్న పరమార్ధము: ఇప్పటి వరకు శిష్యులచేత ఒక బోధకునిగా, నాయకునిగా, రక్షకునిగా, మెస్సయాగా, పరిగణింపబడిన యేసు, తన నిజస్వరూపమును (దైవత్వం) తెలియపరచడం ఎంతోముఖ్యం. ఫలితముగా, శిష్యుల విశ్వాసము దృఢపరచ బడినది. ప్రభువులోనున్న దైవత్వమును చూపించి, ఫలితముగా, శిష్యులను బలపరచి యున్నారు. తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చు చున్నారు (యెషయ 42:1-4, లూకా. 9:35. యోహాను. 4:34). తాను మోషేతోను (ధర్మశాస్త్రము), ఏలియాతోను (ప్రవక్తలు) మాట్లాడుట ద్వారా తాను ప్రవక్తల ప్రబోధములను, ధర్మశాస్త్రమును రద్దుచేయక, సంపూర్ణ మొనర్చుటకు వచ్చితినని (మత్త 5:17) తెలియ జేయుచున్నారు.
అలాగే, యేసు దివ్యరూపధారణ, పరలోక పరమరహస్య అనుభూతిని తెలియజేయు చున్నది. పరలోకం అంటే ఒక స్థలము కాదని, అది ఒక వ్యక్తి అని, ఆ వ్యక్తి యేసు క్రీస్తు అని తెలియజేయు చున్నది. యేసు ప్రభువే ఆ దైవరాజ్యము. త్రిత్వైక దేవుడే ఆ పరలోక రాజ్యము (నిత్యజీవము).
యేసు ప్రార్ధనా జీవితానికి తార్కాణం ఆయన దివ్యరూప ధారణ. ప్రార్ధన, తండ్రి-కుమారుల మధ్యననున్న బాంధవ్యము. ప్రభువు ప్రేషిత పరిచర్య అంతయు కూడా అతని ప్రార్ధన ఫలమే!
ముగింపు: మనముకూడా క్రీస్తుమహిమను జ్ఞానస్నానములో పొందియున్నాము. వాక్యములో, దివ్యసంస్కారాలలో క్రీస్తు మహిమలో పాలుపంచుకొను చున్నాము. అయితే, ఇది మనము శాశ్వతముగా పొందబోవు మహిమను సూచిస్తున్నది. మనము ఆ మహిమ వైపునకు ప్రయాణం చేస్తున్నాము. మన గమ్యాన్ని మనం చేరుకోవలసి యున్నది. దానిని పొందవలెనంటే, ఈ లోక ప్రవాసమును ముగించాలి. కనుక, శాశ్వత మహిమ కొరకు మనము ఒక గొప్ప నమ్మకముతో ముందుకు సాగాలి! ముఖ్యముగా, మన అనుదిన ప్రార్ధనలో, మనం “ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలము” అని గ్రహించాలి. ఇది మనలను రూపాంతరం పొందునట్లు చేస్తుంది. మన శ్రమల పరమార్ధాన్ని గ్రహించేలా చేస్తుంది.
"దేవుని యందు! మన విశ్వాసమే, దేవుని ప్రేమను పొందుకొనేలా చేస్తుంది." "ప్రతి వ్యక్తిలో దేవుని యందు విశ్వాసము... దేవుని అనుసరణ... దేవుని యందు ఆసక్తి! దేవుని రాక కొరకై ఎదురుచూసే హృదయము ఉంటే, దేవుడు దయచేయు 'దివ్యత్వమును' పొందుకోవచ్చు!"
మొదటి పఠనం: “దేవుడు అబ్రహామును ఎన్నుకొని, పిలచుకొని, ఒడంబడిక చేసుకున్నారు. అబ్రహాము దేవుని నమ్మాడు. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను” (అ.కాం. 15:5-6). నేను దేవుని, ఆయన వాగ్దానాలను నమ్ముచున్నానా? అనునిత్యం.... దేవుడు తన వాక్కు ద్వారా... ఎన్నో వాగ్దానములు చేయుచున్నాడు! దేవుని వాక్కును ధ్యానించే వారికి ఇస్తూనే ఉన్నారు. దేవుని వాక్కు భద్రపరిచిన పవిత్ర బైబులు గ్రంధము సత్యము, ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానములు, ఆయన వాక్కు ప్రతి ఒక్కటీ! నెరవేరును, అని మనలో ఎంతమందిమి విశ్వసిస్తున్నాము...?? ఆ వాగ్దానములను! మన జీవితములలో నెరవేర్చుకుంటున్నాము....?? మనకు మనమే ప్రశ్నించుకోవాలి.
రెండవ పఠనం: క్రీస్తు సిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారికి తుదకు మిగులునది వినాశమే. వారికి దేహ వాంఛలే దైవము. లౌకిక విషయములను గూర్చియే ఆలోచింతురు (ఫిలిప్పీ 3:18-19). కాని మనము పరలోక పౌరులము (3:20). నేను లౌకిక విషయాలతో జీవిస్తున్నానా లేక దైవీక విషయాలతో జీవిస్తున్నానా?
తపస్సుకాల 2వ ఆదివార వాక్యోపదేశము
(ఆదికాండము 15:5-12, 17-18)
"దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొనివచ్చి "ఆకాశమువైపు చూడుము. లెక్కపెట్టగలిగినచో నక్షత్రములను లెక్కపెట్టుము. నీ సంతతి కూడా అలాగుననే అగును" అని చెప్పెను. అబ్రహాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను."
(పునీత పౌలు గారు ఫీలిప్పీయులకు వ్రాసిన లేఖ 3:17-4:1)
"క్రీస్తు సిలువ మరణమునకు శత్రువులుగ జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పియుంటిని. కన్నీటితో దానినే మరల చెప్పుచున్నాను. అట్టివారికి తుదకు మిగులునది వినాశనమే. వారికి దేహవాంఛలే దైవము. సిగ్గుపడదగిన విషయములనుగూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు. కాని మనము పరలోక పౌరులము. దివినుండి మన రక్షకుడును ప్రభువు అగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచియున్నాము."
(పునీత లూకా గారు వ్రాసిన సువార్త 9:28-36 )
"ఆ మేఘమునుండి ఒక వాణి "ఈయన నా కుమారుడు. నేను ఎన్నిక చేసికొనినవాడు. ఈయనను ఆలకింపుడు" అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవరికిని చెప్పలేదు."
"దేవుని యందు! మన విశ్వాసమే, దేవుని ప్రేమను పొందుకొనేలా చేస్తుంది." "ప్రతి వ్యక్తిలో దేవుని యందు విశ్వాసము... దేవుని అనుసరణ... దేవుని యందు ఆసక్తి! దేవుని రాక కొరకై ఎదురుచూసే హృదయము ఉంటే, దేవుడు దయచేయు 'దివ్యత్వమును' పొందుకోవచ్చు!"
---------------------------------------------------------------
దేవుడు ఇచ్చిన వాగ్దానమును అబ్రహాము విశ్వసించాడు. నీ సంతతిని కూడా ఆకాశ నక్షత్రములను వలె అగును అన్న దేవుని మాటలను అబ్రహాము విశ్వసించాడు. అబ్రహాము దేవుని యెడల ఉంచిన విశ్వాసమును, ఆ నమ్మకాన్ని బట్టి, అబ్రహాము నీతిమంతునిగా దేవునిచే యెంచబడ్డాడు. ఇది ఎంత గొప్ప ధన్యతో కదా?
అనునిత్యం.... దేవుడు తన వాక్కు ద్వారా... ఎన్నో వాగ్దానములు చేయుచున్నాడు! దేవుని వాక్కును ధ్యానించే వారికి ఇస్తూనే ఉన్నారు. దేవుని వాక్కు భద్రపరిచిన పవిత్ర బైబులు గ్రంధము సత్యము, ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానములు, ఆయన వాక్కు ప్రతి ఒక్కటీ! నెరవేరును, అని మనలో ఎంతమందిమి విశ్వసిస్తున్నాము...?? ఆ వాగ్దానములను! మన జీవితములలో నెరవేర్చుకుంటున్నాము....?? మనకు మనమే ప్రశ్నించుకోవాలి.
అబ్రహాము కాలంలో లాగా.... దేవుడు ఆయన స్వరాన్ని సూటిగా ... మనకు వినిపించే రోజులు కాదు ఇవి. కనుక, పవిత్ర బైబులు గ్రంధము నందు, ఆయన వాక్కును పొందుపరిచారు కాబట్టి, దేవుని వాక్కును మనము ధ్యానించాలి. దేవుని వాక్కును ఎవరికి వారు వ్యక్తిగతముగా ధ్యానించాలి. వ్యక్తిగతంగా స్వీకరించాలి. దేవుని సేవకులు చెప్పే సందేశాలు వినడం చాలా అవసరం. అదేవిధముగా.... నీవు/ నేను/ మనమందరమూ కూడా..... పవిత్ర బైబిల్ గ్రంధమును అనుదినమూ.... వ్యక్తిగతముగా, ధ్యానించాలి. దేవుని వాక్కు ద్వారా... మన ఆత్మతో.... దేవునితో మనమూ సంభాషించగలగాలి. అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లు, అబ్రహామును ఆశీర్వదించినట్లు, అబ్రహామును నీతిమంతుడు అని ఎంచినట్లు, నీతో.... నాతో.... మనందరితో కూడా మాట్లాడతారు. నిన్ను/ నన్ను/ మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. నిన్ను/ నన్ను/ మనందరినీ కూడా..... ధన్యుల గుంపులో కలుపుతారు.
మనమందరమూ... ఎందుకు అబ్రహము వలె ఆశీర్వదింప పడకూడదు....?? దేవునియందు... దేవుని వాక్కు యందు.... దేవుని వాగ్దానముల యందు.... దేవుడు చేయు అద్భుత కార్యముల యందు.... విశ్వాసము ఉంచి, దేవుని అనుసరణయే మన బాధ్యతగా.... మన ఆనందంగా.... మనం మంచిగా భావిస్తే, ప్రతి ఒక్కరు కూడా అబ్రహము వలె ఆశీర్వదింప బడుతారు. మనలో ఉండవలసినది విశ్వాసము. దేవుని వాగ్దానములన్నియూ... మన జీవితములలో నెరవేర్చుకోవాలి అంటే, మనలో దేవుని యందు విశ్వాసము ఉండాలి. మనల్ని దేవుడు ప్రేమించాలి అంటే, మనమూ.... దేవున్ని ప్రేమించాలి, ఆరాధించాలి, దేవున్ని అనుసరించాలి.
ఈ లోక జీవితములో కూడా మనము, ఇతరులను ప్రేమిస్తేనే, ఇతరుల యెడల ఆసక్తి చూపితేనే, ఇతరుల ఎడల ఇష్టాన్ని చూపితేనే, ఇతరులు మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమిస్తారు, విశ్వసిస్తారు, ఇష్టాన్ని చూపుతారు. మనల్ని ఎన్నటికీ వీడక, మనతో జీవించటానికి ప్రయత్నిస్తారు. దేవుడు కూడా అంతే! ఆయన యెడల నమ్మకం పెట్టుకున్న వారిని ఎప్పుడూ కూడా దేవుడు విడనాడరు.
అబ్రహాము ఏ విషయంలో కూడా దేవుని మాటను అశ్రద్ధ చేయలేదు. విశ్వసించాడు. అందుకేనేమో "జాతులకు తండ్రిగా అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు." "అబ్రహామును నీతిమంతుడుగా దేవుడు పెంచారు" విధేయత అనేది చాలా గొప్పది. దేవుని యందు విధేయతతో జీవిస్తే! దేవుని చిత్త ప్రకారంగా మనం జీవిస్తే! దేవునికి మనము నమ్మక పాత్రలముగా జీవిస్తే! దేవుడు మనకు నమ్మక పాత్రుడుగా ఉంటారు.
సువిశేషాన్ని మనం ధ్యానించినట్లయితే... దేవునికి ఇష్టముగా, నమ్మక పాత్రముగా, దేవుని యందు విశ్వాసముతో! దేవుని అనుసరణయే! జీవిత విధిగా తీసుకున్నవారు. క్రీస్తు ప్రభుని శిష్యులలో ప్రధానంగా ముగ్గురు ఉన్నారు. క్రీస్తు ప్రభువును! వారు ఎంతగానో విశ్వసించారు. క్రీస్తు ప్రభువు కూడా వారి యెడల ప్రత్యేకమైన ఇష్టాన్ని... శ్రద్ధను... చూపారు. ఆ శిష్యులే 'పేతురు, యాకోబు, యోహానులు"
ప్రార్థన చేసుకొనుటకై... తనను అనుసరించే, తన ప్రియమైన శిష్యులను! క్రీస్తు ప్రభువు పర్వతము పైకి తీసుకువెళ్ళారు. క్రీస్తు ప్రభువు ప్రార్థన చేసుకుంటుండగా... క్రీస్తు ప్రభుని ముఖ రూపము మార్పు చెందెను. వస్త్రములు తెల్లగా ప్రకాశించెను, అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే/ ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన విషయమును గూర్చి, ఆయనతో ముచ్చటించుచుండిరి. పేతురు, అతని తోడివారైన యోహాను... యాకోబులు ... నిద్ర మత్తులో ఉండిరి. వారు మేలుకొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న పురుషులిద్దరినీ వారు చూచారు.
పేతురు "ప్రభూ! మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు మూడు పర్ణశాలలను నిర్మింతుము" అని క్రీస్తు ప్రభువుతో పలికాడు. పేతురు పలుకునది తనకే తెలియక మాట్లాడెను.
ఒక మేఘము దిగివచ్చి, ఆ శిష్యులను ఆవరించెను, అపుడు వారు భయపడిరి.
ఆ మేఘము నుండి ఒక వాణి "ఈయన నా కుమారుడు నేను ఎన్నిక చేసికొనినవాడు. ఈయనను ఆలకింపుడు" అని వినిపించెను. వాణి వినిపించిన పిమ్మట, వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవరికిని చెప్పలేదు.
క్రీస్తు ప్రభువును! ఆలకిస్తే... విశ్వసిస్తే.... అనుసరిస్తే.... ప్రేమిస్తే.... గొప్ప అద్భుతాలను "పేతురు, యోహాను, యాకోబుల వలె" మనం కూడా మన జీవితాలలో చూడగలుగుతాం. తండ్రి దేవుని విశ్వసించిన అబ్రహాము వలె, మనం కూడా ఆ విధముగా విశ్వసించి, జీవిస్తే! ఆనందిస్తాం. పరవశిస్తాం. ధన్యులమవుతాం.
పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో! క్రీస్తు ప్రభువును అనుసరించకుండా... మానవులమైన మన పాపముల కొరకు, క్రీస్తు ప్రభువు పొందిన సిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు అని, చెప్తున్నారు. ఇది నిజమే కదా? మన ఆత్మసాక్షిని మనం ప్రశ్నించుకోవాలి. దేవునికి విరుద్ధముగా జీవించే వారందరూ... అంటే! శరీర ఆశలే ద్యేయంగా... విధిగా... అవే! దేవుడు వారికి అప్పగించిన చిత్తముగా మనలో చాలామందిమీ భావిస్తున్నాం. "తినుట, త్రాగుట, సుఖించుట!" ఇవే మన జీవిత ధ్యేయంగా .... మనలో ఎక్కువ శాతం భావిస్తున్నాం. ఇవే ఎంతో ఇష్టముగా .... ప్రాణముగా... జీవిస్తున్నాం. పాపము/ ద్రోహము/ విచ్చలవిడి జీవితము గూర్చి సిగ్గు పడకుండా గర్వించుచూ... కేరింతల కొట్టేవారు మనలో లేకపోలేదు. ఈ లోక జీవితమే ప్రధానంగా మనలో చాలామందిమీ భావిస్తున్నాం.
కానీ, "క్రీస్తును అనుసరించే" జీవితం అంటే ఇది కాదు కదా? మనము పరలోక రాజ్య పౌరులము అగుటకు... మన ధ్యేయం ఏంటి?? మన పరుగు ఎటువైపు.... నేను ఈ లోక జీవితం వైపు పరిగెడుతున్నానా ....?? పరలోక రాజ్య స్థానం కొరకు, దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు, పరుగులు పెడుతున్నానా ...?? అని మనకు మనం పరిశీలించుకోవాలి... ఆ విధంగా లేకపోతే మనల్ని మనం సరి చేసుకోవాలి. మనము మట్టి శరీరమైన మనుషులము! అటువంటి వారమైనకు మనకు, దేవుని శరీరము వలె మన శరీరము కూడా మహిమగా.... దివ్యముగా దేవుడు మార్చుతారు. మనం కూడా దేవుని వలే, దివ్యముగా మారాలి అంటే! అది మన జీవన విధానం పై ఆధారపడి ఉంది. మన ధ్యేయము దేవుని చిత్తము నెరవేర్చుట. దేవుని వాక్కును ఆలకించి, పాటించి, నెరవేర్చగలుగుట. ఈ విధంగా జీవిస్తే! ఈ విధంగా జీవించిన వారందరమూ.... పరలోక వారసులమవుతాము. దేవుని రాకడ రోజున! తీర్పు జరిగిన తర్వాత.... నీతివంతముగా దేవుని యందు విశ్వాసముతో మనము జీవించి ఉంటే! దేవుని శరీరము వలె, మన శరీరము కూడా మహిమగా మార్చబడుతుంది. ఆ క్రీస్తు ప్రభుని శరీరము.... రూపము... పర్వతము పైకి వెళ్ళి ప్రార్థించుకొనేటప్పుడు! క్రీస్తు ప్రభువుని ముఖ రూపము ఏ విధముగా రూపాంతరం చెందిందో! మనం కూడా క్రీస్తును అనుసరిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ... ఆయనను వెంబడిస్తూ.... ఆయనను విశ్వసిస్తూ.... జీవిస్తే! మనం కూడా రూపాంతరం చెందుతాము. ఈ లోక జీవితంలో కొట్టుమిట్టాడితే గొప్ప జీవితం మనకు దక్కదు. కేవలము దేవుని కొరకే మన పరుగు. ఆయన మాటే మనకు మన జీవితములకు చాలా ప్రాముఖ్యము అనుకొని జీవించుదాం. మట్టి మనుషుల మైన మనము.... అప్పుడు! దేవుని రెండవ రాకడ రోజున తీర్పు తీర్చబడి.... ఎంతో దివ్యముగా ... మనమందరము రూపాంతరము చెందుతాం. విశ్వసిద్దాం. పొందుకుందాం. ఆమెన్.
Very deep and simplified homily Father
ReplyDeleteThank you very much Father 🙏
Nice homily father...tq
ReplyDelete