తపస్కాల మొదటి ఆదివారము, Year C
ద్వితీయ 26:4-10; రోమీ 10:8-13; లూకా 4:1-13
శోధనలు
మనము తపస్కాలములో ఉన్నాము. విభూతి బుధవారముతో, తపస్కాల ప్రయాణాన్ని ప్రారంభించాము. ఈ 40 రోజులు మనము ఈస్టర్ పండుగ వైపునకు ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ ప్రయాణములో ఎన్నో సంతోషాలు ఉంటాయి, అలాగే మన ప్రయాణాన్ని భంగపరచడానికి ఎన్నో శోధనలు, అడ్డంకులు కూడా ఉంటాయి. అయినప్పటికిని మన ప్రయాణాన్ని కొనసాగించాలి. మన గమ్యాన్ని చేరుకొనుటకు ఒక గొప్ప ఆశతో ముందుకు సాగాలి. ధైర్యము, అంకింతభావము ఉంటే ఇది సాధ్యమే!
తపస్కాలము ఆధ్యాత్మిక పునరుద్ధరణ కాలము. ఈ కాలములో మనము పాత జీవితానికి అనగా ఈ లోకాశాలకు బై బై చెప్పి క్రీస్తుని ఆత్మను మనము ధరించవలయును. ఈ కాలములో మన ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఏవిధముగా ఉండాలో ప్రభువు మనకు వాక్యము - ప్రార్ధన, ఉపవాసము, దానధర్మాలు - ద్వారా తెలియజేస్తూ ఉంటారు. తపస్కాలము మన అంత:రంగిక జీవితములోనికి పయణించడం. ఆత్మపరిశీలన చేసుకొనే సమయం.
“యేసు ఆత్మప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింప బడెను” అని లూకా 4:1లో చదువుచున్నాము. యేసు జ్ఞానస్నానం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ ఆయనను ఎడారికి నడిపించింది. ఇది దేవుని ప్రణాళికలో భాగంగా మనకు అర్ధమగుచున్నది. సాతాను చేత శోధించబడటానికి యేసు ఎడారికి వెళ్ళాడు. ఇది ఆయన పరిచర్యకు ముందు జరిగిన ముఖ్యమైన పరీక్ష. 40 రోజులు ఉపవాసం ఉండి, ప్రార్థన చేస్తూ, శోధనలను జయించడం ద్వారా యేసు తన విధేయతను చూపించాడు. ఎడారిలో గడిపిన సమయం యేసు తన పరిచర్యకు సిద్ధం కావడానికి సహాయపడింది. ఇది ఆయనకు ఆత్మీయంగా బలపడేందుకు, దేవుని చిత్తాన్ని ధ్యానించేందుకు అవకాశం కల్పించింది. యేసు తన పరిచర్యను ప్రారంభించడానికి ముందు దేవునితో ప్రత్యేక సమయం గడపడానికి, మరియు శోధనలను ఎదుర్కోవడానికి ఎడారికి వెళ్ళాడు.
మన ఆధ్యాత్మిక పునరుద్ధరణకు కూడా 'ఎడారి అనుభవము' (desert experience) ఎంతో అవసరము. ‘ఎడారి' అనగానే మనకు గుర్తుకు వచ్చేది నిర్జీవము, ఆకలిదప్పులు, భయము... మొదలగునవి. కాని, ఆధ్యాత్మికముగా, 'ఎడారి' అనునది దేవునిని కలుసుకొను స్థలము. ఎడారిలో నిశబ్దత, ఏకాంతము ఉంటుంది. హృదయ నిశబ్ధతలో మనలోని దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించి, ఆయన స్వరమును వినగలము. ఏకాంతములో ప్రభువు సాన్నిధ్యాన్ని అనుభవించగలము. ఎడారిలో బాహ్యమైన ఆటంకాలు ఉండవు. శోధనలో పడవేసేవి ఏమి అక్కడ ఉండవు. అచ్చట మనతో మనం మరియు దేవునితో ఏకాంతముగా ఉండగలము. కనుక ఎడారి అనుభవము మనలను మనము ఆత్మపరిశీలన చేసుకొనుటకు, పరలోకము వైపునకు నడచుటకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ ఎడారి అనుభవమునకు తపస్కాలము సరియైన కాలము అని మనం గుర్తించాలి.
ఈరోజు, యేసు ప్రభువు ఎడారిలో శోధించబడిన సంఘటనను మనం ధ్యానిస్తున్నాము. ఈ సంఘటన మనకు శోధనలను ఎలా ఎదుర్కోవాలో, దేవునిపై విశ్వాసం ఎలా ఉంచాలో నేర్పుతుంది. ఎడారిలో ప్రభువు శోధనలను ఎదుర్కొన్నారు, కాని వాటినన్నింటిని జయించారు. ఎందుకన, ఆయన అంత:రంగిక జీవితం తండ్రి దేవుని సాన్నిధ్యముతో, సన్నిహితత్వముతో నిండియున్నది. అందుకే సాతాను ఆయన అంత:రంగమును శోధించలేక పోయింది. మన బలహీనతలో సాతాను ప్రవేశిస్తాడు. కాని మనము ఆత్మతో, దేవుని సాన్నిధ్యముతో, సన్నిహితత్వముతో నింపబడి యున్నప్పుడు, సాతాను మన అంత:రంగమును శోధించలేదు.
పాత నిబంధనలో, సాతాను అనగా విరోధి లేదా నేరారోపణ చేసేవాడు అని అర్ధం. వ్యతిరేక శక్తిని లేదా వ్యక్తిని సూచిస్తుంది. నూతన నిబంధనలో, సాతాను శక్తివంతమైన దుష్టజీవిగా, దేవునికి, మానవాళికి విరోధిగా చూస్తున్నాము. శోధకునిగా (మత్త 4:1-11; మార్కు 1:12-13; లూకా 4:1-13), ఈ లోకాధికారిగా (యో 12:31; 14:30; 16:11), ఈ లోక సంబంధమైన దేవరగా (2 కొరి 4:4), మోసగానిగా (దర్శన 12:9), నేరారోపణ చేసేవాడు (దర్శన 12:10) చూస్తున్నాము. అంతిమంగా సాతాను ఓటమి పాలు అవుతుందని, అగ్ని గుండములో పడవేయ బడతాడని దర్శన గ్రంధములో చూస్తాము.
సాతాను కేవలము మన బాహ్య బలహీనతలను మాత్రమే శోధించగలదు. సాతాను ప్రభువును మూడు విధాలుగా శోధించింది: ఆకలి, అధికారము, విజయము. ఈ మూడు విషయాలలో మనము కూడా శోధనలలో పడిపోతూ ఉంటాడు. మన కోరికలన్నీ కూడా వీటికి సంబంధించినవై ఉంటాయి. వీటిని మన అంత:రంగిక శక్తితో జయించ వలయును. ప్రభువు శోధనలను దేవుని వాక్యముతో, ప్రార్ధనతో జయించారు. ఆయన తండ్రి దేవున్ని నమ్మియున్నారు. ప్రతీ శోధనకు దేవుని వాక్యాన్ని పలికి యున్నారు. కనుక మనము కూడా దేవుని వాక్యశక్తితో మన శోధనలను జయించాలి. యేసు నామమున మన శోధనలను జయించాలి. మన శోధనలో మనము దేవునిపై నమ్మకాన్ని ఉంచాలి.
మొదటి శోధన: సైతాను యేసు వద్దకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్ళను రొట్టెలుగా మారునట్లు ఆజ్ఞాపింపుము” (లూకా 4:3) అని శోధించింది. స్వప్రయోజనం కొరకు తన శక్తిని ఉపయోగించమని శోధన. అధికారమునకు శోధన. కాని, ప్రభువు సైతానుతో, “మనుష్యుడు కేవలం రొట్టె వలననే జీవింపడు. దేవుని నోటినుండి వచ్చు ప్రతిమాట వలన జీవించును” (4:4, ద్వితీయ 8:3, నిర్గమ 16) అని సమాధానమిచ్చి, ఆ శోధనను జయించాడు. ఆత్మ వరాలను, స్వలాభం కొరకుగాక, సంఘము కొరకు, “అందరి మేలు కొరకై” ఉపయోగించాలి (1 కొరి 12:7). యేసు ప్రేషిత సేవలో, అయిదు రొట్టెలను, రెండు చేపలను ఐదువేలమందికి పంచిపెట్టాడు. యేసు తన ఆకలి తీర్చుకోవడానికికాక, ఇతరుల ఆకలి తీర్చడానికి గొప్ప అద్భుతాన్ని చేసాడు (మత్త 14:13-21). ఆనాడు ఎడారిలోనున్న యిశ్రాయేలు ప్రజలకు ఇలాంటి శోధనే ఎదురయింది. వారు ఆకలిగొనినపుడు, శోధింప బడినపుడు, ప్రభువు అద్భుతరీతిన ఎర్రసముద్రాన్ని రెండుపాయలుగా చీల్చి వారిని దాటేటట్లు చేశాడన్న విషయంకూడా మరచిపోయి, ఈజిప్టులో మాంసం భుజించుచూ ఎంతో సంతోషముగా ఉండేవారమని సణుగుకున్నారు. అప్పుడు ప్రభువు మరల, అద్భుత రీతిలో ఆకాశమునుండి మన్నా (ఆహారము) కురిపించి, తనకు అసాధ్యమైనది ఏమీలేదని నిరూపించాడు. యిశ్రాయేలు ప్రజలవలెకాక, యేసు 40 రోజులు ఉపవాసముండి ఆకలిగొనినపుడు సణుగుకొనక, దేవుని వాక్కును ఉపయోగించి, శోధనను ఎదుర్కొని జయించారు. మనంకూడా మన దేహాన్ని కాపాడుకొనుటకు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కాని ఈ కృపాకాలం మనకు గుర్తుచేసే విషయమేమిటంటే, దేహాన్ని మించినది ఆత్మ. ఆత్మనికూడా మనం పోషించాలి. మనం కోరుకొనే ఈ భూసంబంధమైన వస్తువులకన్న దేవుడు మనకు ముఖ్యమని, దీనినే ఉపవాసం (దగ్గరవ్వటం) చూపిస్తుందని యేసు మనకు నేర్పిస్తున్నాడు.
రెండవ శోధన: “అంతట సైతాను యేసును పైకి తీసుకొని పోయి, రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములను అన్నింటిని చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును, వాని వైభవముల నెల్ల నీకు ఇచ్చెదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాటిని ఈయగలను. కనుక, నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగును” (4:5-7) అని రెండవసారి శిధించింది. సంపద, ఐశ్వర్యం కొరకు శోధన. మనం (గురువులు, నాయకులు, అధికారులు) ఇతరులకు సేవ చేసే బదులుగా, ఇతరులు మనకు సేవచేయాలి అనే శోధన! అందుకు యేసు, “నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును” (4:10, ద్వితీయ 6:13, నిర్గమ 32) అని పలికి ఆ శోధనను జయించాడు.
యిశ్రాయేలు ప్రజలతో చేసుకున్న ఒడంబడిక ప్రకారం ప్రభువు వారిని వాగ్ధత్త భూమికి మోషేను నాయకత్వములో నడిపిస్తున్నపుడు, వారు ఆ వాగ్ధత్త భూమిని త్వరగా చేరుకోలేక పోతున్నామే అని తలంచి, ప్రభువుపై విశ్వాసముంచక, మోషే సినాయి పర్వతంపై నున్నపుడు వారంతా బంగారు దూడను ఆరాధించారు (నిర్గమ 32: 8). ఇలా, దేవుని కోపానికి గురయ్యారు. యేసునకు ఇలాంటి సందర్భం ఎదురైనపుడు తను ఏమియూ ఆలోచింపక, ఈలోక రాజ్యానికి, సంపదలకు, అధికారానికి ఆశపడక, సాతానును ఆరాధించకుండా, కేవలం ప్రభువైన దేవునినే పూర్ణమనస్సుతో ఆరాధించాలని తెలియజేస్తున్నారు. పాఠం: ప్రార్ధన, ఆరాధనలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని యేసు మనకు తెలియజేయు చున్నాడు.
మూడవ శోధన: “పిమ్మట సైతాను యేసును నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో, క్రిందికి దూకుము. నిన్ను రక్షింప దేవుడు తన దూతల ఆజ్ఞ యిచ్చి యున్నాడు. మరియు నిన్ను రాళ్ళపై పడి గాయపడ కుండునట్లు, నిన్ను వారు చేతులతో ఎత్తి పట్టుకొందురు” (లూకా 4:9-11; కీర్తన 91:11) అని మూడవ సారి శిధించింది. ఇది ప్రతిష్ట కొరకు శోధన. నేడు జనాదరణ కోసం, సంపాదనకోసం శోధన. కాని, యేసు, “ప్రభువైన నీ దేవుని నీవు శోధింప రాదు” (4:7, ద్వితీయ 6:16, నిర్గమ 17) అని పలికి ఆ శోధనను జయించాడు. ‘ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప, సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను’ (4:13) అని చదువుచున్నాము.
బైబిల్లో ‘శోధన’ అనేది పాపం చేయడానికి, నైతికంగా తప్పు చేయడానికి లేదా దేవుని చిత్తానికి దూరంగా వెళ్లడానికి ప్రేరేపించడం లేదా ఆకర్షించడం. శోధన యొక్క మూలం: మన స్వంత కోరికలు: యాకోబు 1:14-15 మన అంతర్గత కోరికలు మనలను తప్పుదారి పట్టించగలవు. సాతాను: సాతానును అంతిమ శోధకుడిగా బైబిలులో చూస్తాము. సాతాను ప్రజలను దేవునికి దూరంగా నడిపించడానికి ప్రయత్నిస్తాడు. ప్రపంచం: బైబిలు కోణంలో ‘ప్రపంచం’ అంటే దేవునికి వ్యతిరేకమైన విలువలు, కోరికల వ్యవస్థను సూచిస్తుంది.
శోధన అనేది స్వతహాగా పాపం కాదు. శోధనకు లొంగిపోవడం వల్ల పాపం వస్తుంది. యేసు స్వయంగా శోధించబడ్డాడు, అయినప్పటికీ అతను పాపం లేకుండా ఉన్నాడు (హెబ్రీ 4:15). శోధనను ఎలా ప్రతిఘటించాలో బైబిలు మార్గదర్శకత్వం అందిస్తుంది - ప్రార్థన: “మమ్మును శోధనలోనికి పడనీయకుము” అని యేసు తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు (మత్త 6:13). దేవుని వాక్యం: సాతాను శోధనలను ప్రతిఘటించడానికి యేసు దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు (మత్తయి 4:1-11).
సాతాను శోధనను ఎదుర్కొనటంద్వారా క్రీస్తు, తన తండ్రిపట్ల తనకున్న ప్రేమ అన్నిటికంటే బలమని నిరూపించారు. శ్రీసభ మనలనుండి ఈనాటి దివ్యపఠనాలద్వారా కోరేది ఇదే. మనం, క్రీస్తును ఆదర్శంగా తీసుకొని, శోధనలను అధిగమించి, ప్రభువు ప్రేమను గుర్తించి, అతని ప్రేమబాటలో, అతని చిత్తప్రకారం జీవించి, అతని ప్రణాళికను నెరవేర్చాలి. మనం అనారోగ్యంతో బాధపడినప్పుడు, వైద్యుని దగ్గరకు వెళితే ఒక చీటిలో మందు రాసి వాటిని వాడమంటాడు. అలాగే మన ఆత్మకు ఎదుగుదల కావాలని, శోధనలను ఎదుర్కొనే శక్తి కావాలని శ్రీసభ, కృపాకాలంలో మనకు ఇచ్చే మందు చీటీ: ప్రార్ధన, ఉపవాసం, దానధర్మాలు. వీటిని సాధనాలుగా మలచుకొని ప్రభువు చిత్తప్రకారం నడుచుటకు ప్రయత్నిద్దాం. కనుక, శోధనలను జయించడానికి దేవుని వాక్కు, ప్రార్ధన ఆయుధాలుగా కావాలి. శోధనల సమయములో ప్రార్ధన చేయాలి. పాపములో పడిపోయే పరిస్థితులకు (వ్యక్తులు, స్థలాలు, వస్తువులు) మనము దూరముగా ఉండాలి.
ఆత్మపరిశీలన చేసుకుందాం: నేను నిజముగా దేవున్ని ఆరాధిస్తున్నానా? లేదా నా హృదయం లోకసంపదలపై దృష్టి సారించినదా? నేను దేవునిపై ఆధారపడుచున్నానా? లేదా నాకున్న సంపదలపై ఆధారపడుచున్నానా? నేను దేవునిపై సంపూర్ణ నమ్మకాన్ని కలిగియున్నానా? నా జీవితములో ప్రధానముగా నేను మార్చుకోవలసిన ఆ ఒక్క విషయం ఏమిటి? ఈ తపస్సు కాలములో నెమ్మదించి, దేవుని వాగ్దానాలను ఆలకించి, పాప మరణములనుండి క్రీస్తు మనకొసగిన స్వతంత్రమును కొనియాడుదాం.
మొదటి పఠనము ఇశ్రాయేలు ప్రజలు ఏవిధముగా ఐగుప్తునుండి రక్షింపబడిరో గుర్తుచేస్తుంది. ఇది మన రక్షణనుకూడా గుర్తుచేస్తుంది. ఆత్మతో కూడిన జీవితమును జీవించాలని రెండవ పఠనము బోధిస్తుంది. “సైతాను మాయాపూరిత జిత్తులను ఎదుర్కొన గలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు” అని పౌలు ఎఫేసి 6:11లో చెప్పియున్నారు. సత్యము, నీతి, శాంతి, విశ్వాసము, రక్షణ, దేవుని వాక్కు, ప్రార్ధన అనే కవచాలను (6:14-18) మనం ధరించినపుడు, సాతాను శోధనలను తప్పక జయించ గలము.
Thank u for inspiring message father......
ReplyDelete