ఎనిమిదవ సామాన్య ఆదివారము, YEAR C
సీరా 27:5-8; 1 కొరిం 15:54-58; లూకా 6:39-45
ఈనాటి సువిశేషములో యేసుప్రభువు మూడు ఉపమానముల ద్వారా, అష్టభాగ్యాల సందేశమును (లూకా 6:20-26) మనం ఎలా జీవించాలో మనకు స్పష్టముగా బోధిస్తున్నారు. దీనిలో భాగముగా, గతవారం "శత్రువులను ప్రేమింపుడు" (లూకా 6:27-36) గురించి, "పరులను తీర్పు చేయకుడు" (లూకా 6:37-38) గురించి ధ్యానించాము. నేటి ఉపమానములన్నీ కూడా, మనం యేసుకు మంచి శిష్యులుగా ఎలా జీవించాలనే విషయాలను బోధిస్తున్నాయి.
మొదటి ఉపమానం (6:39-40) - మార్గచూపరి
ఒక మంచి 'గురువు'గా కావలయునంటే, సంపూర్తిగా శిక్షణపొంది యుండవలయును (6:39-40): ఒక గ్రుడ్డివాడు మరో గ్రుడ్డివానికి మార్గమును చూపలేడు. అట్లు చేసినచో ఇరువురును గోతిలో పడుదురు! ఎన్నుకొనబడి, ప్రజలకు మార్గదర్శకులుగా ఉండవలసిన వారిగురించి ఈ వాక్యము బోధిసున్నది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను నడిపింపవలసిన పరిసయ్యుల గురించి చెప్పబడుతుంది. యేసు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను "అయ్యో! అంధులైన మార్గ దర్శకులారా!" అని గద్దిస్తున్నారు (మత్త 15:12-14; 23:16,17,19,24,26). సత్యమును ఎరిగియున్నామని తలంచి ప్రజలను తప్పుత్రోవ పట్టించే నాయకులకు, గురువులకు ఇది ఒక హెచ్చరికగా ఉన్నది. వారు ఇతరులు ఎలా జీవించాలో చెబుతారు కాని వారి జీవితములో వారు బోధించేది ఏదీకూడా పాటించరు. ఇటువంటి మార్గదర్శకులు సత్యమును ఎరుగని ప్రజలను నడిపించినచో ఇరువురి ఆధ్యాత్మిక జీవితాలకు ముప్పు ఉంటుంది. అందులకే, ఇలాంటి మార్గదర్శకులకు "సంపూర్ణ శిక్షణ" అవసరమని ప్రభువు తెలియజేయుచున్నారు. "సంపూర్ణ శిక్షణ పొందిన శిష్యుడు తన గురువువలె ఉండును'' (6:40).
గొప్ప గురువు అయిన ప్రభువు మనకు ఆదర్శం. ఆయన బోధించిన వాక్కును ఆయన జీవితములో పాటించారు: "మీరు నన్ను బోధకుడనియు, ప్రభువుననియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలయన, నేను మీ బోధకుడను, ప్రభువునై యున్నాను. ప్రభువును, బోధకుడను అయిన నేను మీ పాదములను కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరియొకరు కడుగవలయును. నేను చేసినట్లు మీరును చేయవలయునని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని" (యోహాను 13:13-15). గురువు ఏమిటో శిష్యులు అలాగే ఉండవలయును. శిష్యుడు గురువుతో పోల్చుకొనవలయును, "ఇక జీవించునది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నారు" అని పౌలుగారు చెప్పియున్నారు (గలతీ 2:20). కనుక ప్రజలను నడిపించాలనేవారు 'సంపూర్ణ శిక్షణ' పొందవలయునని ప్రభువు తెలియజేయుచున్నారు. అలాగే, మన ఆధ్యాత్మిక జీవితములో మనం ఎవరిని ఆదర్శముగా తీసుకుంటున్నామో, ఎవరి మాటలు ఆలకించు చున్నమో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి! తప్పు ద్రోవలో నడిపే వారినుండి జాగ్రత్త వహించాలి! యేసు మన 'నిత్యగురువు' అని గ్రహించాలి. ఈ ఉపమానం ద్వారా, యేసుక్రీస్తు ఆధ్యాత్మిక గుడ్డితనం గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి తన సొంత లోపాలను, బలహీనతలను గుర్తించకుండా ఇతరులకు మార్గనిర్దేశం చేయాలని ప్రయత్నిస్తే, ఇద్దరూ ప్రమాదంలో పడతారని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ గుడ్డివాడు అంటే ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉన్న వ్యక్తి. అతనికి సరైన జ్ఞానం, వివేచన లేవు. అలాంటి వ్యక్తి ఇతరులకు దారి చూపిస్తే, ఇద్దరూ తప్పుదారిలో వెళ్లే ప్రమాదం ఉంది. శిష్యుడు తన గురువుకంటె గొప్పవాడు కాడు; పరిపూర్ణమైన ప్రతివాడును తన గురువువలె నుండును (40వ వచనం): ఈ వచనం శిష్యరికపు స్వభావం గురించి మాట్లాడుతుంది. శిష్యుడు తన గురువు నుండి నేర్చుకుంటాడు, అతనిని అనుసరిస్తాడు. గురువు పరిపూర్ణంగా ఉంటే, శిష్యుడు కూడా పరిపూర్ణతకు చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. యేసుక్రీస్తు తన శిష్యులు తనను అనుసరించి, తనలాగే పరిపూర్ణతకు చేరుకోవాలని కోరుకుంటున్నాడు. అయితే, ఇది సులభం కాదు. దీనికి నిరంతరమైన అభ్యాసం, శిక్షణ అవసరం.
సందేశం: మన సొంత లోపాలను, బలహీనతలను గుర్తించి, వాటిని సరిదిద్దుకోవాలి. ఆధ్యాత్మికంగా పరిపూర్ణులైన వారి నుండి నేర్చుకోవాలి. ఇతరులకు మార్గనిర్దేశం చేసే ముందు, మనకు సరైన జ్ఞానం, వివేచన ఉన్నాయో లేదో చూసుకోవాలి. యేసుక్రీస్తును అనుసరించి ఆయనలా పరిపూర్ణతకు చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఈ వచనాలు మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా ముఖ్యమైనవి. ఇవి మనల్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరుచున్నాయి.
రెండవ ఉపమానం (6:41-42) - మారుమనస్సు
41-42 వచనాలలో మనలోని తప్పులను చూడకుండా ఇతరుల తప్పులను ఎత్తిచూపే వారి గురించి యేసు వివరిస్తున్నాడు. చూపు స్పష్టముగా నుండవలయునంటే, కంటిలోని దూలమును, నలుసును తీసివేయవలయును (6:41-42; మత్తయి 7:3-5): “ఊపిన జల్లెడలో మట్టి పెళ్లలు మిగులునట్లే నరుని సంభాషణమున దోషములు కన్పించును” (సీరా 27:4). ఈ ఉపమానము ద్వారా, ప్రతీ ఒక్కరు అంత:రంగికముగా శుద్ధిపొందాలని, మారుమనస్సు పొందాలని ప్రభువు బోధిస్తున్నారు. మన కంటిలోని దూలమును గమనింపనిచో, మన సోదరుల కంటిలోని నలుసును వ్రేలేత్తి చూపలేము (6:41). సోదరులను సరిచేయడం మంచిదే, కాని సరి చేయాలంటే, ముందు మనము సరిగా ఉండవలయును. తననుతాను సరిచేసుకోలేనివాడు, ఇతరులను సరిచేయలేడు. అలా చేయువారిని ప్రభువు, వంచకులని, కపట భక్తులని, అంధులని, అవివేకులని చెప్పుచున్నారు. ఏది ఏమైనప్పటికిని, ఇతరులను పక్షపాతముతో తీర్పుచేయరాదు. సహోదరభావముతో ఇతరులను వారిని వారిగా అంగీకరించి, సహోదర సమూహమును ఏర్పాటు చేయవలయును. అంత:రంగిక శుద్ధి ఇతరులను మన్నించి, ప్రేమించేలాగున చేయును. ఈ విషయం గురించి, అనగా ఇతరులకు అపకారము, కీడు చేయకూడదని, పౌలు రోమీ 12:17-21లో తెలియజేయుచున్నాడు.
“నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల?” (41): ఇక్కడ యేసుక్రీస్తు ఇతరుల చిన్నచిన్న తప్పులను కూడా పెద్దవిగా చూసే వారి గురించి మాట్లాడుతున్నాడు. తనలో ఉన్న పెద్ద తప్పులను పట్టించుకోకుండా, ఇతరుల చిన్న తప్పులను కూడా ఎత్తిచూపే వారి గురించి ఈ వచనం వివరిస్తుంది. ‘దూలము’ అంటే పెద్ద కర్ర, ‘నలుసు’ అంటే చిన్న ధూళి కణం. మనలో పెద్ద తప్పులు ఉన్నప్పుడు, ఇతరుల చిన్న తప్పులను ఎత్తిచూపడం ఎంత అవివేకమో యేసుక్రీస్తు ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తున్నాడు. “నీ కంటిలో ఉన్న దూలమును చూచుకొనక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెట్లు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు స్పష్టముగా కనబడును” (42): ఈ వచనంలో యేసుక్రీస్తు కపటవేషధారుల గురించి మాట్లాడుతున్నాడు. తమలో ఉన్న పెద్ద తప్పులను సరిదిద్దుకోకుండా, ఇతరుల చిన్న తప్పులను ఎత్తిచూపే వారిని ఆయన కపటవేషధారులుగా పిలుస్తున్నాడు. ముందుగా మనలోని తప్పులను సరిదిద్దుకుంటే, ఇతరుల తప్పులను సరిదిద్దడానికి మనకు సరైన అర్హత ఉంటుందని యేసుక్రీస్తు బోధిస్తున్నాడు. కనుక, ఇతరులను తీర్పు తీర్చే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనలోని పెద్ద తప్పులను సరిదిద్దుకోకుండా, ఇతరుల చిన్న తప్పులను ఎత్తిచూపడం కపటవేషధారణ. ఇతరులను సరిదిద్దే ముందు, మనల్ని మనం సరిదిద్దుకోవాలి. మనలో ఉన్న తప్పులను సరిచేసుకున్నాక, ఇతరులలోని తప్పులను సరిచేయడానికి ప్రయత్నించాలి. ఇతరులను తీర్పు తీర్చే ముందు, మనల్ని మనం సరిదిద్దుకోవాలని ఈ వచనాలు బోధిస్తున్నాయి.
మూడవ ఉపమానం (6:43-45) - సజ్జనుడు
43-45 వచనాలలో మనిషి యొక్క స్వభావం అతని ప్రవర్తన ద్వారా ఎలా తెలుస్తుందో యేసుక్రీస్తు వివరిస్తున్నాడు. ఒక చెట్టు మంచి పండ్లను ఈయవలయునంటే, దానికి తగిన పోషణ ఇవ్వబడవలయును (6:43-45; మత్తయి 7:16-20): “చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహించ వచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలమును గుర్తింప వచ్చును” (సీరా 27:6). ఈ మూడవ ఉపమానములో ప్రభువు ఒక మంచి చెట్టుయొక్క స్వభావమును గుర్తుచేయుచున్నారు. ప్రతీ చెట్టుకూడా మంచి పండ్లను ఇవ్వాలనే నాటబడుతుంది. ప్రతీచెట్టులో సహజముగానే వృద్ధిచెంది ఫలించే గుణము ఉంటుంది.
చెట్టువలె మనిషికూడా సహజముగానే మంచివాడు. తనలో మంచితనము సృజనాత్మకత మెండుగా ఉంటాయి. మంచి ఫలాలను ఫలించి ఇతరుల పోషణకుకూడా ఉపయోగపడగలడు. “చెడుచెట్టు మంచి ఫలమును, మంచిచెట్టు చెడు ఫలమును ఫలింపనేరదు” (43): ఈ వచనంలో యేసుక్రీస్తు మనిషి యొక్క స్వభావం అతని ప్రవర్తన ద్వారా ఎలా తెలుస్తుందో వివరిస్తున్నాడు. మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇస్తుంది. అలాగే, మంచి స్వభావం కలిగిన వ్యక్తి మంచి పనులు చేస్తాడు, చెడు స్వభావం కలిగిన వ్యక్తి చెడు పనులు చేస్తాడు. ఇక్కడ చెట్టు అంటే మనిషి, ఫలం అంటే మనిషి చేసే పనులు. మనిషి యొక్క స్వభావం అతని పనుల ద్వారా బయటపడుతుంది. ప్రతి చెట్టు దాని ఫలములవలననే తెలియబడును. “ముండ్లచెట్లనుండి అంజూరపు పండ్లను కోయరు గదా? ముండ్లపొదనుండి ద్రాక్షపండ్లను కోయరు గదా?” (44): ఈ వచనంలో యేసుక్రీస్తు మనిషి యొక్క స్వభావం అతని ప్రవర్తన ద్వారా ఎలా తెలుస్తుందో మరింత స్పష్టంగా వివరిస్తున్నాడు. ముండ్లచెట్టు నుండి అంజూరపు పండ్లను, ముండ్లపొద నుండి ద్రాక్షపండ్లను కోయలేము. అలాగే, చెడు స్వభావం కలిగిన వ్యక్తి నుండి మంచి పనులు ఆశించలేము. “సజ్జనుడు తన హృదయమందలి మంచి నిధిలోనుండి మంచిని, దుర్జనుడు తన హృదయమందలి చెడు నిధిలోనుండి చెడును తీయును. హృదయము నిండియుండు దానినిబట్టి అతని నోరు మాటలాడును” (45): ఈ వచనంలో యేసుక్రీస్తు మనిషి యొక్క హృదయం అతని ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తున్నాడు. మంచి హృదయం కలిగిన వ్యక్తి మంచి మాటలు మాట్లాడుతాడు, మంచి పనులు చేస్తాడు. చెడు హృదయం కలిగిన వ్యక్తి చెడు మాటలు మాట్లాడుతాడు, చెడు పనులు చేస్తాడు. మనిషి యొక్క మాటలు, పనులు అతని హృదయంలోని ఆలోచనలను ప్రతిబింబిస్తాయి.
అంత:రంగిక శక్తికి గ్రుడ్డివాడైనప్పుడు, అహంకారము, స్వార్ధము అనే దూలాలు తనలో ఉండినప్పుడు, తన సహజసిద్ద శక్తిని, స్వభావమును నాశనము చేయుచున్నాడు. కనుక ఈ ఉపమానము ద్వారా ప్రభువు, మానవునిలోనున్న శక్తినిగూర్చి గుర్తుచేయుచున్నారు. తన చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకొని, తననుతాను వృద్ధిచెందుతూ, ఫలిస్తూ, ఇతరుల అభివృద్ధికి, సమాజాభివృద్ధికి తోడ్పడాలి. తద్వారా, సంపూర్ణ శిక్షణ ద్వారా, మంచి గురువుగా కాగలడు. అంత:రంగిక శుద్ధి, సంసిద్ధతో ఇతరులకు మంచి సహోదరుడు కాగలడు. మంచి ఫలాలను ఫలించే వానిగ కాగలడు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును. దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలయన, హృదయ పరిపూర్ణత నుండి నోటిమాట వెలువడును (లూకా 6:45). “నరుని సంభాషణమే అతనికి పరీక్ష. కనుక ఏ నరుని గాని అతడు మాటలాడక ముందు స్తుతింప వలదు” (సీరా. 27:7).
రెండవ పఠనములో, పౌలు, “మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు విజయమును ప్రసాదించెను” (1 కొరి 15:57) అని తెలుపుచున్నారు. కనుక, మనం ఎల్లప్పుడు మంచిని చేయాలి. క్రీస్తు విజయము హృదా కాకూడదు. ప్రభువు సేవలో మనం జీవించాలి. అందుకై, నేడు ప్రభువు తన ఉపమానముల ద్వారా బోధించి నట్లుగా, మన ఆధ్యాత్మిక అంధత్వము నుండి, కపట వేషధారణ నుండి బయట పడాలి. సహృదయము కలిగి యుండాలి.
No comments:
Post a Comment