ఐదవ సామాన్య ఆదివారము (YEAR C)
యెషయ 6:1-2, 3-8; 1 కొరి 15:1-11; లూకా 5:1-11
దైవపిలుపు – సువార్త ప్రకటన
యెషయ 6:1-8 నేపధ్యం: యెషయా దర్శనము, దైవపిలుపు గురించి నేటి మొదటి పఠనములో వింటున్నాము. ఈ దర్శనం యూదయా రాజైన ఉజ్జీయ మరణించిన సంవత్సరములో [క్రీస్తు.పూ. 742/40] జరిగింది. ఉజ్జీయ రాజు మరణం తరువాత దేశములో రాజకీయ మరియు ఆధ్యాత్మిక సంక్షోభం నెలకొన్నది. ఈ సమయములో, యెషయ దేవాలయములో చూసిన దర్శనములో దేవునియొక్క పరిశుద్ధత మరియు మహిమ అతనికి వెల్లడి చేయబడినది. ప్రభువు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై యుండగా మరియు సెరాఫీము దేవదూతలు నిలిచి యుండగా యెషయ దర్శనములో చూసాడు. దేవదూతలు, “సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది” అని గానం చేయడం ద్వారా దేవునియొక్క పవిత్రతను, మహిమను వెల్లడి చేయుచున్నారు (6:1-4). దేవునియొక్క పరిశుద్ధత మరియు మహిమ వెల్లడి చేయడముతో, ప్రతిస్పందనగా, యెషయ తన పాపపు స్థితిని, అపవిత్రతను, అయోగ్యతను గుర్తించాడు. అప్పుడు యెషయా ప్రవక్త ఇలా అనుకున్నాడు, “హా! చెడితిని గదా! నా నోటి నుండి వెలువడున వన్నియు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పల్కు ప్రజల నడుమ నేను వసించుచున్నాను” (యెషయ 6:5). అయినను దేవుడు తన దూతను పంపి యెషయను శుద్ధిచేసాడు (6:6-7). అప్పుడు యెషయ దేవుని పిలుపునకు సమాధానం ఇవ్వడం ద్వారా సేవకుడిగా / ప్రవక్తగా బాధ్యతలను స్వీకరించి యున్నాడు (6:8). యెషయకు దేవుడు ఎందుకు తన పరిశుద్ధతను మరియు మహిమను వెల్లడి చేసాడు అని ప్రశ్నిస్తే, దేవుడు తన దైవత్వమును, శక్తి, మహిమను ప్రదర్శించుటకు, యెషయకు తన పాపపు స్థితిని తెలియబరచుటకు, యెషయ పాపమును తొలగించుటకు, దోషముకు పరిహారము జరుగుటకు మరియు యెషయను ప్రవక్తగా తన సేవకు పిలుచుకొనుటకు అని అర్ధమగుచున్నది. దేవుని పవిత్రత, మహిమయందు, మన అయోగ్యతను, దేవుని కరుణను మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి? దేవుని పిలుపుకు మన ప్రతిస్పందనను, విధేయతను, సేవను ఆత్మపరిశీలన చేసుకోవాలి.
1 కొరి 15:1-11: ఈ పఠనములో పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి మూలాధారము అని అపోస్తలుడు పౌలు తెలియ జేయుచున్నాడు. క్రీస్తు పునరుత్థానం చెందనిచో మన విశ్వాసం వ్యర్ధం. మన పాపాలకు క్షమాపణ లేదు అని చెబుతున్నాడు. సువార్త యొక్క సారాంశాన్ని పౌలు వివరిస్తున్నాడు. సువార్త సారాంశం ఏమిటంటే, “క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. సమాధి చేయబడి, మూడవ దినమున సజీవుడుగ లేవనెత్తబడెను” (3-4). క్రీస్తు పునరుత్థానం చెందడం ద్వారా మనకు నిత్యజీవితం ఉంటుందని మన నిరీక్షణ. ఈ నమ్మకముతో మనం దేవునితో సమాధాన పడవచ్చు. కాబట్టి మనం విశ్వాసముతో జీవించాలి. క్రీస్తునందు విశ్వాసము కలిగి జీవించాలి. విశ్వాసం అనగా క్రీస్తును నమ్మడం మరియు క్రీస్తును అనుసరించడం.
రెండవ పఠన సారాంశం ఏమిటంటే, క్రీస్తు పునరుత్థానం మన విశ్వాసానికి మూలం. అదియే సువార్తా సారాంశం – దైవప్రేమ, పాపక్షమాపణ, విశ్వాసం, నిత్యజీవితం. కనుక, మనం విశ్వాసముతో జీవిస్తూ, ఆ సువార్తను [క్రీస్తు జీవితం, మరణ పునరుత్థానం] ప్రకటించాలి. సువార్త అనేది వ్యక్తిగతమైన మరియు సామూహికమైన అనుభవం. సువార్తను విశ్వసించినచో, అది మన జీవితాలను మార్చగలదు.
పౌలుకూడా దేవుని యందు తన అయోగ్యతను వెల్లడి చేయుచున్నాడు. “అపోస్తలులందరిలో నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తలుడనని పిలువా బడుటకు నేను అయోగ్యుడను (15:9) అని అంటున్నాడు. అయితే, ఆతరువాత వచనములో అంటున్నాడు, “కాని దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తలులకంటె ఎంతయో అధికముగా శ్రమించితిని. కాని అది నిజముగ నా ప్రయాస కాదు. అది నా ద్వారా పని చేయు దేవుని కృపయే” (15:10) అని అంటున్నాడు. పౌలు దమాస్కు దర్శనములో యేసు పవిత్రతను, మహిమను చూసి, యెషయవలె తన పాపాన్ని, అయోగ్యతను గుర్తించాడు, తప్పు తెలుసుకున్నాడు. మారుమనస్సు చెందాడు. జ దైవపిలుపును అందుకొని, క్రీస్తు సేవకునిగా, అపోస్తలునిగా చివరివరకు జీవించాడు.
సువిశేషం లూకా 5:1-11: యేసు తన సొంత గ్రామమైన నజరేతులో గడిపిన భాగాన్ని మనం ముందు అధ్యాయాలలో చదువుచున్నాము. తన స్వగ్రామమైన నజరేతులో ప్రజలు యేసును తృణీకరించారు. వారందరికీ తెలిసిన వ్యక్తిగానే వారు యేసును భావించారు. ఆయన మాటలు పెడచెవిన పెట్టారు. తననుతాను నిరూపించుకోవటానికి అద్భుతం చేయమన్నారు. కాని, యేసు వారి తిరస్కారాన్ని గ్రహించి, ప్రక్క గ్రామమైన కఫర్నామునకు తిరిగి వచ్చారు. అక్కడ ఆయన అనేక మహిమలను, అద్భుతాలను చేసారు. ఆయన పేరు ఆ ప్రాంతమంతా కూడా వ్యాప్తి చెందినది. ప్రజలు ఆయనను గుర్తించారు. ఆయన మాటలను ఆలకించారు. అందుకే యేసు ఎక్కడికి వెళ్ళినను ప్రజలు అనేకులు ఆయన చెంతకు వచ్చారు. కఫర్నాములో ప్రజలు యేసు చెంతకు వచ్చింది కేవలం ఆయనను చూడటానికి మాత్రమే కాదు. ఆయన చెప్పే మాటలను వినడానికి వచ్చారు.
దేవుని వాక్కు! ఎంత గొప్పదో, ప్రధానమైనదో, మనం చూస్తూ.... గ్రహిస్తూ.... ఉన్నాము. మనం, మన అనుదిన జీవితాలలో, మన ఆరాధన సమయములో, పూజాబలి అర్పణలో దేవుని వాక్కును విని, ధ్యానించి, జీవితములో ఆచరించడానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలి! దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధను కనబరుస్తూ ఉన్నామా? మనం చెప్పే మాటలు, చేసే క్రియలు దేవుని వాక్యానుసారముగా ఉంటున్నాయా?
ఈనాటి సువిషేశములో, యేసు తన రక్షణ కార్యాన్ని ఈ లోకములో కొనసాగించటాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే, ఈ రక్షణ ప్రణాళికలో యేసుకు మానవ తోడ్పాటు కూడా ఎంతో అవసరం. మనకున్న సంపద, సకల విద్యలు, తెలివితేటలు, నైపుణ్యమంతా కూడా దేవుని రాజ్యవ్యాప్తికై ఉపయోగపడాలి. దేవుడు మనకు ఒసగే సకల వరాలు, ఆశీర్వాదాలు, ఆయన మహిమ కొరకు వినియోగించాలి.
యేసు గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి యుండగా, జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. అందులకు అక్కడ ఉన్న సీమోను పడవనెక్కి, దానిని ఒడ్డుననుండి లోనికి కొద్దిగా త్రోయుమని అందు కూర్చుండి ప్రజలకు బోధించెను (5:1-3). బోధన ముగిసిన తరువాత, యేసు సీమోనుతో, “మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్లి చేపలకై మీ వలలను వేయుడు” అని చెప్పెను. వల వేయగనే, వల చినుగునన్ని చేపలు పడెను. సీమోను, యాకోబు, యోహానులు ఆశ్చర్య పడిరి. అపుడు యేసు సీమోనుతో, “భయపడవలదు. ఇకనుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు” అనెను (5:4-10). ఈవిధముగా, యేసు తన ప్రధమ శిష్యులను పిలుచుకున్నాడు. “ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి” (5:11).
లూకా తన సువార్తను వ్రాసే సమయానికి 'పడవ' శ్రీసభకు సూచనగా మారింది. క్రీస్తు సువార్త “భూదిగంతముల వరకు” (అ.కా. 1:8) ప్రకటింప బడవలెను. వల చినుగునన్ని చేపలు ఈ దైవరాజ్య వ్యాప్తిని సూచిస్తుంది. దానిలో మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. కాని ఉత్థానం తరువాత, యేసు ఆజ్ఞ ప్రకారం, వలవేయగా నూట ఏబది మూడు పెద్ద చేపలు పడెను (యోహాను 21:1-14). అవి మంచి చేపలు మాత్రమే!
ఇచ్చట యేసు తన అధికారాన్ని, శక్తిని, మహిమను ప్రదర్శించారు. యేసు పేతురుతో, “మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్లి మీ వలలను వేయుడు” (5:4) అని చెప్పి యున్నాడు. యేసు మాటలు పేతురులో ఆశను, విశ్వాసాన్ని నింపాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. వారు రాత్రంతా శ్రమించినను (5:5), యేసు మాటలు వారిలో కొత్త ఆశను నింపాయి. “మీ మాట మీద వలలను వేసెదము” (5:5) అంటూ గొప్ప ఆశతో వలను వేసినప్పుడు, వారికి వల చినుగునన్ని చేపలు పడ్డాయి (5:6). అద్భుతం, ఆశ్చర్యం! యేసుపై ఉన్న నమ్మకం, విశ్వాసం ఈ అద్భుతానికి తోడ్పడ్డాయి.
దేవుని [యేసు] వాక్కు! రెండంచుల ఖడ్గముకన్నా పదునైనది. గొప్పది. అద్భుత శక్తి కలది. మనలో కూడా దృఢవిశ్వాసం ఉండాలి. ప్రభువు వాక్కు మనలో జీవించినప్పుడు, మనలను ముందుకు నడిపించినప్పుడు, మన విశ్వాస ఎదుగుదలకు తోడ్పడినప్పుడు, దాని శక్తిని చూస్తాము. అప్పుడు మనము కూడా ఆయన మహిమను చూస్తాము. మొదటిగా మనకు దేవునిపై విశ్వాసం ఉండాలి.
యెషయా ప్రవక్త మరియు పేతురు, వారి అపవిత్రతను దేవుని ఎదుట ప్రకటిస్తున్నారు. వారు, దేవుని మహిమను, పవిత్రతను, గొప్పతనాన్ని చూచినప్పుడు, వాళ్ళు వారిలో ఉన్న చెడుతనమును, అయోగ్యతను గుర్తించారు. దేవుని పవిత్రతలో నిలబడలేక పోయారు. యెషయా ప్రవక్త తన అయోగ్యతను వెల్లడించిన విధముగనే (యెషయ 6:5). పేతురు కూడా యేసు పాదములపై పడి, “ప్రభూ! నేను పాపాత్ముడను, నన్ను విడచి పొండు” (5:8) అని పలికాడు. అయినను, ప్రభువు వారిని తన సేవకు పిలుచుకున్నారు. “ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించారు” (5:11). ప్రతీ పాపాత్ముడు, ప్రతీ రోగి యేసు వైపునకు మరలాలి. పేతురు, ఇతర శిష్యులవలె దృఢవిశ్వాసముతో ప్రభువును అనుసరించాలి.
గమనించాల్సిన విషయం: యేసు పేతురు పడవనుండే, ప్రజలకు దేవుని వాక్కును బోధించారు. అదే పడవనుండి, వల చినుగునన్ని చేపలు పడేలా చేసారు. పాపాత్ముడను అని పశ్చాత్తాప పడిన పేతురును, మనుష్యులు పట్టువానిగా, పునీతునిగా మలచాడు.
పాపాత్ములమైన మనలను దేవుడు తన ప్రేమ వలన, పవిత్రత వలన తన వారినిగా చేసికొని, తననుతాను మనకు అనుదిన సంఘటనలద్వారా, తెలియజేస్తూ ఉన్నాడు. మనం పాపాత్ములమైనప్పటికిని, యేసు మనలను పిలచుచున్నారు. మనలను బలపరచుచున్నారు. ప్రతీ పాపాన్ని అధిగమించేలా చేయుచున్నారు. ఈ అద్భుతాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలి! ఆయన ప్రేమను గుర్తెరిగి, ఆయన సేవలో జీవించుదాం! ఆయనకు సాక్షులుగా జీవించుదాం!
ఏదైనా! ప్రత్యక్షంగా మన జీవితంలో చూసినప్పుడే మనం విశ్వసిస్తాము. ఈ విధానము మానవులమైన మన నైజం. దేవుడు కూడా ఇప్పటివరకు మనం జీవించిన కాలంలో, మనం ఆయన యెడల ఉంచిన విశ్వాస జీవితంలో అనేక కార్యములు చేసి యున్నారు. మనమందరమూ, మన విశ్వాస జీవితాలలో, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. గుర్తించాలి. విశ్వాసము మనలను నీతి మార్గములో పవిత్ర మార్గములో ఉంచుతుంది. విశ్వాసము అంటే, దేవుని యెడల మనకు ప్రేమ/ భక్తి/ భయము/దేవున్ని వెంబడించే స్వభావము కలిగి యుండటమే!
ఒక వ్యక్తి యెడల మనుకు ఉన్న విశ్వాసమే, మనల్ని ప్రేమించేటట్లు చేస్తుంది. వారి యెడల నమ్మకముగా జీవించేటట్లు చేస్తుంది. వారిని నొప్పించకుండా జీవించేటట్లు చేస్తుంది. మనం సాటివారి యెడల విశ్వాసంతో జీవించడం కష్టమే. ఎందుకంటే, సాటివారు కూడా, మన యెడల విశ్వాసంతో ప్రవర్తించక పోవచ్చు. కానీ, దేవుడు నీతి గలవారు. అందరి యెడల ఆయన దయ, సమానముగా ఒకేలా ఉంటుంది. ఆయన ప్రేమ సమానత్వంగా ఉంటుంది. ఆయన క్షమాపణ సమానత్వంగా ఉంటుంది. ఒకరు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. అందుకనే మనం దేవునికి విశ్వాసముగా జీవించడం తప్ప, దేవునికి మనం ఇవ్వవలసినది, చేయవలసినది, ఏమీ లేదు.
దేవునికి విశ్వాసముగా జీవిస్తే మనం దేవునికి నచ్చిన జీవితంమునే జీవిస్తాము. నిత్యమూ, మనమందరమూ దేవుని యందు విశ్వాసముతో జీవించి, ఆ దైవరాజ్యంలో చోటును సంపాదించుకుందాం.
No comments:
Post a Comment