28 వ సామాన్య ఆదివారము, Year B

28 వ సామాన్య ఆదివారము, Year B
సొ. జ్ఞాన. 7:7-11; హెబ్రీ. 4:12-13; మార్కు. 10:17-30

ధనం కన్నా దైవం ముఖ్యం

మానవుడు ఈ లోకంలో అనేక సందర్భాలలో, అనేక విషయాలలో దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాన్ని మరచిపోయి, ధనమే దైవంగా భావిస్తూ, విశ్వ ప్రయత్నాలు చేస్తూ, నిజమైన జ్ఞానం కలిగి జీవించలేక పోతున్నాడు.

ఈనాటి మొదటి పటనంలో దైవభక్తుడు ఇజ్రాయేలు ప్రజలకు రాజు అయిన సొలోమోను, జ్ఞానంకోసం ప్రార్ధించాడు. “నేను ప్రార్ధన చేయగా దేవుడు నాకు వివేకమును ఒసగెను. నేను మనవి చేయగా, జ్ఞాన ఆత్మను నా మీదికి దిగి వచ్చెను అని సొలోమోను దైవ జ్ఞానముతో తన ప్రజలను పరిపాలించెను. ఆ దేవుని జ్ఞానమే నూతన నిబంధనలో యేసుక్రీస్తు రూపంలో ప్రజల మధ్య ప్రత్యక్షమై ఉన్నది. అందుకే ఈనాటి రెండవ పటనములో దేవుని యొక్క వాక్కు గురించి దాని ప్రతిఫలం గురించి పౌలుగారు అర్థవంతంగా వివరించారు: “దేవుని వాక్కు సజీవ మును చైతన్యవంతం అయినది అది కత్తి రెండంచులకంటే పదునైనది… మానవుల హృదయము నందలి ఆశలను, ఆలోచనలను అది వీక్షింపగలదు” (హెబ్రీ. 4:12).

దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకోవాలంటే ప్రతి మానవునికి దేవుని యొక్క జ్ఞానం చాలా అవసరం. ఎందుకంటే, కీర్తన కారుడు 119:105 లో ఈ విధముగా సెలవిస్తున్నాడు “నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు.”

మన అనుదిన జీవితంలో, మన నడవడికలో, దేవుని యొక్క వాక్కురూపంతో కూడిన జ్ఞానం చాలా అవసరం. బైబిల్ గ్రంధంలో పలుచోట్ల దేవుని వాక్కుగురించి ఈ విధంగా వివరించబడింది:

దేవుని అద్భుతం: కంటికి కనిపించని వానిని నుండి కంటికి కనిపించునట్లుగా దేవుని వాక్కుచేత ప్రపంచం సృజింపపబడింది.

దేవుని వాక్కు యొక్క ఫలం: “వానయు మంచుయు ఆకాశము నుండి దిగివచ్చి, అచ్చటికి మరలిపోక… దేవుని నోట నుండి వెలువడు వాక్కు నిష్ఫలంగా తిరిగి పోక దేవుని సంకల్పం నెరవేర్చును” (యెషయ 55:10-11).

దేవుని వాక్కు నూతన సృష్టి: ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు తన వాక్కు ద్వారా సృష్టిని, జీవరాసులను, కాలములను, యుగములను చివరికి మానవుని తనదైన రీతిలో వాక్కు ద్వారా సృజించెను.

ఇటువంటి గొప్పదైన జ్ఞానమును మరచిపోయి ధనాపేక్ష వలన పరలోకాన్ని కోల్పోయిన ఒక యువ ధనికుని ఉపమాన రీతిలో ప్రభువు ఈనాడు తానే నిజమైన జ్ఞానాన్ని అని నిరూపిస్తున్నారు. నేటి సువిశేష పఠనాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు:

ధనాన్ని పేదలకు పంచి యేసుని అనుసరించి ఇష్టము లేని ధనవంతుని పాత్ర.

యేసుని అనుసరించటానికి తనకు ఉన్న సమస్తమును త్యజించాలన్న శిష్యుని పాత్ర.

దైవ రాజ్యంలో ప్రవేశించటం ధనవంతులకు అసాధ్యం అన్న యేసు పాత్ర.

ఈ మూడింటిపై మనకు దేవుడు ఇచ్చే గొప్ప జ్ఞానం ధనం కంటే దేవుని యొక్క రాజ్యం చాలా విలువైనది అని తెలుపబడుతుంది. సకల అనర్థాలకు మూలం ధనాపేక్ష (1 తిమో 6:10). మనం ఈ లోకాన్ని గమనించినట్లయితే ధనం ఉన్నవారు ఏదైనా చేయగలరు అనునది నిజమైన జ్ఞానం కాదు. ఎందుకంటే, ధనం మానవుడు తన మనుగడకు సృజించుకొన్న ఒక వ్యాపనం. దీపం విలువ చీకట్లో తెలుస్తుంది; రూపాయి విలువ అవసరంలో తెలుస్తుంది; స్నేహితుని విలువ ఒంటరితనంలో తెలుస్తుంది; కానీ దేవుని ప్రేమ, కృపను మనం వెలకట్టలేము; దాన్ని అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది.

ధనానికి దైవానికి ఉన్న వ్యత్యాసం

ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం (1 తిమో. 6:10)

ధనమును నమ్ముకున్నవాడు పాడయిపోవును (సామె. 11:28)

నీ ధనము ఎక్కడ ఉండునో, అక్కడే నీ హృదయము ఉండును (మత్త. 6:21)

భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు (మత్త. 6:19)

పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడు (మ 6:20)

వారు సమృద్ధిగా కానుకలు వేసిరి కాని పేద విధవరాలు తన లేమినుండి ఉన్నదంతయు త్యాగం చేసింది (మార్కు. 12:44).

దేవుడు ధనవంతునితో, ఓరి! అవివేకి, ఈ రాత్రికి నీ ప్రాణములు తీసివేయబడును. నీ సంపద ఎవరిదగును? (లూకా. 12:20).

ఈనాటి మూడు పఠనాల సారాంశమును గ్రహిస్తే, సొలోమోనువలె జ్ఞానవంతులై, ధనానికి దైవానికి గల వ్యత్యాసాన్ని గ్రహించగలం. ధనము అనేది మంచికి ఉపయోగించాలి కాని దానికి మనం లొంగితే దేవుని జ్ఞానాన్ని, ప్రేమను, ఆశీర్వాదాన్ని, పరలోక సంపదను కోల్పోతాము. దేవుడు మనకు కలిగించిన దానిని, దేవుని సేవకై, దేవుని వాక్కు ప్రకటనకై, వెచ్చిస్తూ సంతృప్తి కలిగిన దైవ బిడ్డలవలె జీవించుదాం!!!

No comments:

Post a Comment