పాస్క పరమ రహస్యము – పాప పరిహారార్ధ బలి

పాస్క పరమ రహస్యము – పాప పరిహారార్ధ బలి

    క్రీస్తు పాస్కా బలి పాప పరిహారార్ధ బలి (హెబ్రీ 10:18). ఇది పాప క్షమాపణ బలి. క్రీస్తు పాస్కా బలి ఫలితం ‘పాప క్షమాపణ’. మన రక్షణ నిమిత్తమై ‘పాప క్షమాపణ’ ఎంతో ముఖ్యమైనది మరియు చాలా అవసరం. “పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగుతుంది” (లూకా 1:77). మొట్ట మొదటిగా, పాప క్షమాపణ దేవుని వరం; దేవుని నుండి వస్తుంది. దేవుడు మాత్రమే పాపాన్ని క్షమించగలడు. ఉదా,, యేసు ప్రభువు దేవుని కుమారునిగా, ఎంతోమంది పాపాలను క్షమించాడు. పాపాన్ని క్షమించి స్వస్థతను చేకూర్చాడు. ఈ విధముగా ఆధ్యాత్మిక స్వస్థతయే ‘పాప క్షమాపణ’.

    యేసు ఈ లోకానికి అనగా సర్వమానవాళికి, జీవితమును దానిని సమృద్ధిగా ఇవ్వడానికి; నిత్యజీవమును, దేవుని రాజ్యమును, రక్షణను ఒసగడానికి వచ్చియున్నాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను” (యోహా 3:16) మరియు దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెను (యోహా 3:17). ఈ రక్షణ పాప క్షమాపణ ద్వారా ఇవ్వబడుతుంది.

    క్రైస్తవ జీవితము ‘సంతోషము’ మరియు ‘విజయము’తో కూడినటువంటి జీవితము. నిజమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటాడు. ఎందుకనగా, క్రీస్తు పాస్కా బలిద్వారా, పాప క్షమాపణను ఒసగియున్నాడు. అయితే, ఈ సంతోషాన్ని, విజయాన్ని, మన అనుదిన జీవితములో సమృద్ధిగా పొందాలంటే, దైవ ప్రేమను, దేవుని క్షమను మనం పొందియుండాలి. అప్పుడే మన జీవితం మారుతుంది.

    ఈనాటి ప్రపంచం చింతన, విచారం, ఆత్రుత, భయం, భీతి, బెదరు, ఆందోళన, ప్రాణభీతి, ఆపద, ఆపత్కాలం, జబ్బులు, నేరాలు, అవినీతి, చట్టవిరుద్ధమైన పనులు, మాదకద్రవ్యాలు, తాగుబోతుతనము, అశ్లీలత, అబార్షన్లు, విడిపోయిన కుటుంబాలు, విడాకులు మొ,,గు వాటితో నిండియున్నది. ఈ ప్రపంచం క్రీస్తును కలుసుకోవాలి. అప్పుడే నిజమైన జీవితాన్ని ఈ లోకం పొందగలదు. అదియే క్రీస్తుతో కూడిన జీవితము. క్రీస్తు ఒసగే ఈ జీవితం, ‘దేవునికి అంగీకార యోగ్యలముగా’ ఉండే జీవితము. ఇది కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం.

    ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న ఈ లోకం దేవుని ప్రేమను, దేవుని క్షమాపణను పొందాలంటే ఎలా? “క్రీస్తు మరణం” క్షమాపణకు మూలం. క్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని వెలగా పెట్టి, మన పాపములకు క్షమాపణను కల్పించాడు. “క్రీస్తు శరీర బలి అర్పణచేత (మరణము) మనమందరమును, పాపమునుండి, శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి” (హెబ్రీ 10:10). “పాపమునుండి శుద్ది పొందిన వారిని, తన ఒకే ఒక బలిద్వారా శాశ్వతముగా పరిపూర్ణులను చేసియున్నాడు” (హెబ్రీ 10:14). క్రీస్తు అర్పించిన ఈ సిలువ బలి పాప పరిహారార్ధ బలి. కనుక, దేవుని క్షమాపణను మనం పొందాలంటే, మన పాపములను ఒప్పుకోవాలి. పాప సంకీర్తనము చేయాలి. “దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో, ఆయన మన పాపములను క్షమించి, మన అవినీతినుండి మనలను శుద్ది చేయును” (1 యో 1:9).

    ‘ఒప్పుకోవడం’ అనగా దేవునితో మన పాపములను ఒప్పుకోవడం. ఇచ్చట మూడు విషయాలు ఉన్నాయి:
(అ) మన పాపములు దేవున్ని దు:ఖపెట్టునని, నొప్పించునని మనం గ్రహించాలి;
(ఆ) దేవుడు ఇప్పటికే మన పాపములను, తన కుమారుడు క్రీస్తు మరణము ద్వారా, ఆయన రక్తమును చిందించడము ద్వారా, క్షమించాడని మనం తెలుసుకోవాలి;
(ఇ) మనలో మారుమనస్సు/మార్పు రావాలి: అనగా ‘దేవుని చిత్తాన్ని నెరవేర్చడం’.
కాబట్టి పాపములను ఒప్పుకొనుట ద్వారా, దేవుని క్షమాపణను పొందగలము. దేవుని క్షమాపణను పొందలేని వారు ఎప్పుడు బాధలలో, వేదనలలో ఉంటారు; వారి హృదయము గాయపడి ఉంటుంది. దేవుని క్షమాపణను పొందని వారు, ఎప్పుడు నిరుత్సాహముతో ఉంటారు; కలవరపడుతూ ఉంటారు; భయముతో ఉంటారు; అసహనముతో ఉంటారు; కోపము, ద్వేషము, అసూయతో ఉంటారు.

    పాప క్షమాపణ స్వతంత్రాన్ని ఇస్తుంది. ఇదియే నిజమైన పాస్క. పాప క్షమాపణ, “ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత మరియు నిగ్రహము” (గలతీ 5:22-23) అను ఆత్మ ఫలాలను ఒసగుతుంది:

    మనం క్షమాపణను పొందాలంటే, మనం ఇతరులను క్షమించాలి. క్షమించినప్పుడే క్షమను పొందుతాము. “పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు” (లూకా 6:38). “మా పాపములను క్షమింపుము. ఏలయన, మేమును, మా ఋణస్తులందరును క్షమించుచున్నాము” (లూకా 11:4). తోటివానిని క్షమించని సేవకుడు (మ 21:23-35) మనందరికి గుణపాటం. “ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని యెడల పరలోకమందలి నా తండ్రియు మీ యెడల అట్లే ప్రవర్తించును” (మ 21:35) అని ప్రభువు చెబుతున్నారు.

    అయితే, మన తోటివారిని మనం ఎన్నిసార్లు క్షమించాలి? (మ 18:21-22). “ఏడు కాదు ఏడు డెబ్బది పర్యాయములు” (మ 18:22) అని ప్రభువు చెప్పియున్నారు. అనగా లెక్కకు లేనన్ని సార్లు. పాప క్షమాపణ దేవుని వరం; దేవుడు మనలను క్షమించడానికి ఎప్పుడూ సిద్దముగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని తండ్రివలె, ప్రేమతో, దయతో మనకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మనం చేయవలసినదెల్ల – పాపమును ఒప్పుకోవడం, పశ్చాత్తాపము-మారుమనస్సు పొందడం.

    యేసు సిలువపైనుండి, గొప్పనేరము చేసిన వానితో, “నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు” అని చెప్పాడు (లూకా 23:43). ఎందుకు? ఎందుకనగా, “యేసూ నీవు నీరాజ్యములో ప్రవేశించునప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుడు” (23:24) అని ఆ నేరస్తుడు ప్రభువును విన్నవించుకొన్నాడు. ఆ విన్నపాన్ని ఎలా చేయగలిగాడు? తన తోటి నేరస్తునితో “మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది” (23:40) అని చెబుతూ తన పాపాన్ని, పాప జీవితాన్ని ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపపడ్డాడు, మారుమనస్సు చెందాడు కనుక.