పాస్క పరమ రహస్యము – విశ్వాసము


పాస్క పరమ రహస్యము – విశ్వాసము


    విశ్వాసము అనగా “మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగ ఉండుట; మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట” (హెబ్రీ 11:1). పునీత పౌలుగారు మన విశ్వాసము గూర్చి జ్ఞప్తికి చేస్తున్నారు. మన విశ్వాసమునకు మూలాధారమగు సువార్తను గురించి జ్ఞాపకము చేయుచున్నారు: “మీరు ఉద్దేశరహితముగ విశ్వసించి ఉండిననే తప్ప, నేను మీకు బోధించిన విధముగ మీరు దానికి గట్టిగ అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు.” మరి ఇంతకి మనం విశ్వసింప వలసిన మరియు పౌలుగారు బోధించిన ఆ పాస్క పరమ రహస్యము ఏమిటి? “పరిశుద్ధ గ్రంధమున వ్రాయబడినట్లు, క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పరిశుద్ధ గ్రంధము, వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి, మూడవ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను” (1 కొరి 15:3-4). ఇదే విషయాన్ని పౌలుగారు రోమీయులకు వ్రాసిన లేఖ 4:25 లో ఈ విధముగా చెప్పియున్నారు: “మన పాపమునకుగాను ఆయన మరణమునకు అప్పగించబడెను. మనలను దేవునికి అంగీకారయోగ్యులముగా ఒనర్చుటకుగాను (for our justification) ఆయన లేవనెత్తబడెను.”

    “అంగీకారయోగ్యులముగా ఒనర్చుట” ఎలా జరుగుతుంది? పౌలుగారు చెప్పిన విధముగా, పాస్క పరమ రహస్యమును గట్టిగ విశ్వసించుట వలన. అనగా, క్రీస్తు మన పాపముల కొరకు మరణించాడని, మన రక్షణ నిమిత్తమై మరల సజీవముగ లేవనెత్తబడ్డాడని విశ్వసించాలి. యాకోబు ప్రకారం, కేవలము విశ్వాసము వలనగాక, మన చేతల/క్రియల ద్వారా జరుగుతుందని చెబుతున్నారు: “నాకు విశ్వాసము ఉన్నది” అని చెప్పుకొనినచో, తన చేతలు దానిని నిరూపింపకున్న యెడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా?; క్రియలులేని విశ్వాసము నిర్జీవమే; చేతలు లేని విశ్వాసము నిష్పలమైనది; విశ్వాసము చేతలద్వారా పరిపూర్ణత పొందును; కేవలము విశ్వాసము వలన మాత్రమేకాక, చేతలవలన మానవుడు నీతిమంతుడుగా ఎంచబడును; ఆత్మలేని శరీరము నిర్జీవమైనట్లే, చేతలులేని విశ్వాసమును నిర్జీవమే” (యాకో 2:14-26):

    అయితే, విశ్వాసము, క్రియలు రెండు వేరువేరు కావు; అవి వ్యతిరేఖము కావు. పౌలుగారు “ధర్మ శాస్త్రములను” పాటించు విషయములను గూర్చి చెప్పినప్పుడు, వాటిని గుడ్డిగా పాటించడంకన్న, విశ్వాసం ముఖ్యమని చెప్పియున్నాడు. అంతేగాని, పౌలుగారు క్రియలను త్రోసివేయడము లేదు. “విశ్వాసము-క్రియలు” ఒకే నాణేనికి రెండు వైపులు. రెండింటిని వేరు చేయలేము. మన విశ్వాసము మన చేతలలో కనిపిస్తుంది; అలాగే, మన క్రియలు మన విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. అందుకే పౌలుగారు గలతీయులకు వ్రాసిన లేఖలో ఇలా అంటున్నారు: “క్రీస్తుతో ఐఖ్యమై ఉన్నప్పుడు, సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి భేదమును లేదు. కాని ప్రేమ ద్వారా పని చేయు విశ్వాసమే ముఖ్యము” (గలతీ 5:6) ధర్మశాస్త్రాన్ని ప్రేమతో పాటించాలి. అంతేగాని ఇతరుల మెప్పుకోసం కాదు, ప్రశంసల కొరకు కాదు.

    క్రీస్తుపై ఉన్న మన విశ్వాసము, మన అనుదిన జీవితములో ప్రదర్శింపబడాలి. ఇవియే పాస్క పరమ రహస్యమును విశ్వసించి ఫలవంతముగా జీవించాలంటే, మన అనుదిన జీవితములో, మొదటిగా, దేవుని ఆజ్ఞలను పాటించాలి: దైవ ప్రేమ మరియు సోదర ప్రేమ. వీటిని ప్రేమతో పాటించాలి. రెండవదిగా పశ్చాత్తాపము-మారుమనస్సు. క్రీస్తు పాస్క బలి మనకు వరముగా, అనుగ్రహముగా అందించిన స్వేచ్చలో జీవించాలంటే మనలో నిత్యము మన పాపాలకు పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాప ఫలితమే మారుమనస్సు: మార్పు – మన ప్రవర్తనలో, ఆలోచనలో మరియు చేతలలో.... “స్వతంత్రులుగ జీవించుటకై క్రీస్తు మనకు విముక్తిని (పాపమునుండి) కలిగించెను. కనుక దృఢముగ నిలబడుడు; బానిసత్వము (పాపము) అను కాడిని మరల మీపై పడనీయకుడు” (గలతీ 5:1).

    విశ్వాసము వలన మనము పాపాత్ములమని తెలుసుకొంటాము. ఉదా,, ప్రభువు పేతురుగారిని (జాలరులను) తన శిష్యునిగా పిలచినప్పుడు, పేతురుగారు ప్రభువు మాటను విశ్వసించిన తర్వాత (లూక 5:5-6), యేసు పాదములపై పడి, “ప్రభూ! నేను పాపాత్ముడను, నన్ను విడచి పొండు (లూక 5:8) అని చెబుతూ తన పాప జీవితమును తెలిసికొన్నాడు, తను పాపాత్ముడనని ఒప్పుకొన్నాడు. ఇదియే పశ్చాత్తాపపడటం, మారుమనస్సు పొందడం: మన అయోగ్యతను ప్రభువు సన్నిధిలో గుర్తించి, పాపాత్ములని గ్రహించి, ఒప్పుకోవడం నిజమైన పశ్చాత్తాపము మరియు మారుమనస్సుకు పునాది.

పాస్క పరమ రహస్యాన్ని నీవు విశ్వసిస్తున్నావా?
    హెబ్రీయులకు వ్రాసిన లేఖలో చదువుచున్నాము: దేవుని కుమారుడు మనవలె రక్తమాంసములను పొంది, “మృత్యువుపై అధికారముగల సైతానును తన మరణము ద్వారా నశింప చేయుటకును, తద్వారా, మృత్యువు భయముచేత తమ జీవితమంత బానిసత్వమును గడపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును, ఆయన అట్లయ్యెను” (2:14-15). మనము ఆయనతో జీవించుటకు అట్లు చేసెను. “మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరల జీవింతుము” (2 తిమో 2:11). సువార్త కొరకై, శ్రమలు మరియు మరణము క్రీస్తు ఉత్థానము ద్వారా, క్రొత్త జీవితానికి మార్గమును సుగమము చేయును. కనుక, క్రీస్తు శ్రమలలో మనం ఐక్యమయినచో, ఆయన మహిమలో మనం పాలుపంచుకొనెదము.

    యేసు మార్తమ్మను ఇలా ప్రశ్నించాడు: నీవు దీనిని విశ్వసిస్తున్నావా? అప్పుడు ఆమె “ప్రభువు మీరు ఇచట ఉండియున్నచో నా సహోదరుడు మరణించి ఉండేడివాడు కాడు. యేసు బదులుగా, “నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు.” నీవు దీనిని విశ్వసిస్తున్నావా? (యోహా 11:21-26). క్రైస్తవ జీవితము అనగా ఇదియే: మరణమునకును, జీవమునకును క్రీస్తులో ఐక్యమవడము. మనం ఒకేసారి మరణించి దేవుని తీర్పు పొందవలెను (హెబ్రీ 9:27). మనము ప్రభువు కొరకు జీవిస్తున్నట్లయితే, మరణం మరియు జీవితము ప్రభువుతో ఉండటానికి కేవలము అవి రెండు మార్గాలుగా మాత్రమే ఉంటాయి. పౌలుగారు చాల చక్కగా చెప్పియున్నారు: “మనలో ఎవ్వడును తనకొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము. మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక, జీవించినను, మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే.” (రోమీ 14:7-8).

మరణం మనకి ఏమి నేర్పుతున్నది?
    క్రీస్తు మరణముపై విజయము క్రీస్తు సువార్తప్రచారములో (kerygma) భాగము. మనం నిత్యము మరణము గురించి ధ్యానము చేయాలి. ఎందుకంటే, మరణమును గురించిన ఆలోచనలో మనలోని భయాన్ని తొలగించి, శాంతతను చేకూర్చును. మరణం మనలోని భ్రమలను, వ్యర్ధమైన పరవశములను మరియు శూన్యమైన పరవశతలను తొలగించును. మరణము సంపూర్ణమైన సత్యములోనికి మనలను నడిపించును. మరణము తర్వాత జీవితమును గమనిస్తూ ప్రస్తుత జీవితమును చూసినట్లయితే, మంచి జీవితము జీవించడానికి మనకు గొప్పగా సహాయము చేయును. భాదలతో, సమస్యలతో సతమతమగు చున్నావా? నీ మరణశయ్యపై నుండి వాటిని చూడు. నీవు ఎలా ప్రవర్తిస్తావో అలోచించు. మరణముపై ధ్యానము ‘ఈ భూమిపై మనకి స్థిరమగు నగరము ఏదియు లేదని, ఇక ముందు రాగల నగరము గూర్చి ఎదురుచూచునట్లు’ చేయును (హెబ్రీ 13:14). “చనిపోయినప్పుడు సొత్తును తన వెంట కొనిపోజాలడు. అతని సంపద అతని వెంట పోదు” (కీర్తన 49:17).

    మరణము జాగరూకులై ఉండునట్లు చేయును, సంసిద్దులుగా ఉండునట్లు చేయును. “కనుక మెలకువతో ఉండుడు. ఏలయన, ఆ రోజును, ఆ గడియను మీరెరుగరు” (మ 25:13). దావీదు మహారాజు ఇలా అన్నాడు: ప్రభువు నివసించును...కాని నాకును, చావునకును ఒక్క అడుగు ఎడమ మాత్రము ఉన్నది (1 సమూ 20:3). ఇది చాలా వాస్తవము. మనము మరణమునకు కేవలము ఒక్క అడుగు దూరములోనే ఉన్నాము. మరణం మన చుట్టూనే ఉన్నది. ప్రతీ నిమిషం ఎన్నో వేలమంది చనిపోవుచున్నారు. వారిలో ఎంతమంది మరణము గూర్చి ఆలోచించియున్నారు. కనుక మరణము, మనకి అనేక విషయములను నేర్పును. ఆమె మన సహోదరీ! విధేయతతో ఆలకించినచో ఎన్నో విషయాలను మనకు నేర్పును.

    మనము ఎల్లప్పుడూ దేవునకు ప్రార్ధన చేయవలసినది: ప్రభువా! మరణముతో హటాత్తుగా నన్ను చవిచూడకుము. కాని పశ్చాత్తాపపడుటకు, మారుమనస్సు పొందుటకు తగిన సమయమును ఇవ్వండి: ఓ తపస్కాలం, ఒక రోజు, ఒక గంట, ఓ మంచి పాపసంకీర్తనం! పునీత సిల్వెస్టర్ గోజ్జోలిని ఒకసారి తన బంధువు శవమును చూస్తున్నప్పుడు ఒక స్వరమును విన్నాడు: ‘ఇప్పుడు నీవేమిటో నేను ఒకప్పుడు; ఇప్పుడు నేను ఏమిటో నీవు ఉంటావు’. మనం మరణించవలసినదనే విషయాన్ని గుర్తు పెట్టుకుందాము. “నీవు మట్టినుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదవు” (ఆ.కాం. 3:19). మరణం మనకు అనేక విధములుగా పాఠాలను నేర్పిస్తూ ఉంటుంది... ప్రకృతి ద్వారా, ఉదాహరణకు రాలిపోయే ఆకుల ద్వారా... మరణాన్ని ఎవరుకూడా మౌనముగా ఉంచలేరు. మనం వినడం తప్ప మరో మార్గము లేదు. అలాగే, మరణం గురించి భయపడనవసరం లేదు. ఎందుకన, క్రీస్తు ఈ లోకానికి వచ్చినది మరణభయపు చేరలోనున్న వారిని విడుదల చేయుటకు కదా!

    “మరణపు ముల్లు పాపము” (1కొరి 15:56). పాపము వలన మరణము సంభవించును; పాపము వలన మరణ భీతి కలుగును. ప్రభువు ఇలా అంటున్నారు: “శరీరము నాశనము చేయువారికి భయపడకుడు. మిమ్ములను చంపి, నరకకూపమున పడవేయగల వానికి భయపడుడు” (లూకా 12:4-5). ఎప్పుడైతే పాపాన్ని తీసి వేస్తామో, అప్పుడు మరణపు ముల్లును తీసి వేయగలము.

No comments:

Post a Comment