మ్రాని కొమ్మల (శ్రమల) ఆదివారము

మ్రాని కొమ్మల (శ్రమల) ఆదివారము
యెషయ 50:4-7; ఫిలిప్పి 2:6-11; లూకా 22:14-23, 56
పాస్కా పవిత్ర వారాన్ని క్రైస్తవులందరూ కూడా ఈ ఆదివారముతో ప్రారంభిస్తూ ఉన్నారు. తపస్సు కాలము పరిశుద్ద సమయముగా చెప్పబడుతుంది. దేవుని ఆశీర్వాదములు నిండుగా పొందుతూ ఉన్నాము. అయితే, ఈ ఆదివారముతో మనం దైవార్చన సం,,లో అతి పవిత్రమైన, ముఖ్యమైన సమయములోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ సమయాన్ని మనం యేసు యెరూషలేములో ప్రవేశించే ఘట్టాన్ని గుర్తు చేసుకొంటూ ఆరంభిస్తూ ఉన్నాము.
ప్రపంచ చరిత్రలో తప్పుచేసిన అనేక మంది శిక్షించబడటం మనం చదువుకొని యున్నాము. చాలా మంది సిలువ మరణాన్ని కూడా పొందియున్నారు. అనేక శతాబ్దాలుగా కొన్ని దేశాలలో సిలువపై మరణ దండన విధించడం అనేది తరచుగా జరుగుతూ ఉంది. అయితే, ఇలా సిలువపై మరణించిన వారి గురించి కాని, శిక్షను పొందిన వారి గురించి కాని, మనం ఎక్కువగా మాట్లాడుకోము, చర్చించుకోము. కాని ఈ సిలువపై మరణించిన ఒక వ్యక్తి గురించి ఈనాడు ప్రత్యేకముగా ధ్యానము చేసుకొంటున్నాము. ఆ వ్యక్తి మరణాన్ని స్మరించు కొంటున్నాము. అతడే నజరేయుడైన యేసు ప్రభు. ఈ రోజు తిరుసభ ప్రత్యేకముగా యేసు శ్రమల, మరణ ఘట్టాలను చదువుకొని ధ్యానించు కొంటున్నాము.
ఈనాటికి కూడా మనం ఆయనను గురించి తలంచి, ఆయన శ్రమలను, మరణాన్ని గురించి మాట్లాడు కొంటున్నాము. ఆయనే దేవుని ఏకైక కుమారుడు. ఈ లోకానికి ఒక చిహ్నాన్ని, ప్రేమ చిహ్నాన్ని ఇవ్వడానికి, ఈ లోకానికి రక్షణను, విమోచనమును ఇవ్వడానికి, తన తండ్రి చిత్తం ప్రకారముగా శ్రమలను, సిలువ మరణాన్ని అనుభవించాడు, భరించాడు.
ఆయన తన జీవితాన్ని సర్వ మానవాళి కోసం సమర్పించాడు. దైవ కుమారుడిగా దేవుని ప్రేమను గురించి మాట్లాడాడు. ఆ ప్రేమతోనే అనేక మందికి స్వస్థతను, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఆ ప్రేమ కారణం చేతనే దేవుని కరుణను, ఓదార్పును పంచి పెట్టాడు. చివరికి ఆ ప్రేమ కారణముగానే, శ్రమలను, సిలువ పాటులను తన పూర్తి స్వేచ్చతో అంగీకరించి, మనoదరికి కూడా నిజమైన ప్రేమ ఎలా ఉండాలో చూపించాడు. ఈ చిహ్నాన్నే యేసు సిలువ, శ్రమల పాటుల ద్వారా ఇస్తూ ఉన్నాడు.
మానవుని జీవితం, వెలుగు చీకటిల మధ్య ఒక సమరముగా చూస్తూ ఉన్నాము. కష్ట సుఖాలు కావడి కుండలు అంటారు. అవి అందరి జీవితాలలో ఒక భాగం ఈ కష్ట సుఖాలు అనేక రకాలుగా మనకు తారస పడతాయి. అయితే యేసు ఈ లోకానికి వచ్చింది మనకు కష్టం రాకుండా ఆపడానికి కాదు. ఆయన వచ్చింది మన కష్టాలలో పాలు పంచుకోవడానికి, మన కష్టాలలో మనతోఉండటానికి, మనతో జీవించడానికి, మన మధ్య జీవించడానికి, తన సన్నిధానముతో మనలను నింపడానికి. ఆయన మనలో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన మనతో ఉండుట వలన, మనం శక్తిని, బలాన్ని పొందుతూ ఉన్నాము.
కనుక, మనం ఎక్కడ ఉన్న ఎలా ఉన్న, క్రీస్తు వైపు చూడటానికి ప్రయాస పడదాం! క్రీస్తు మనలను తన వెలుగులోనికి, ఉత్తాన పండుగ సంతోషములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానాన్ని అందుకొని, ధైర్యముగా ముందుకు సాగుదాం.
యేసు యేరుషలేము పట్టణ మార్గాన్ని ఎంచుకొని, ఆ పట్టణములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రజలు ఆయనకు జయజయ ధ్వానాలు పలికారు. అయితే, యేసు యేరుషలేము ప్రయాణాన్ని ఈనాడు మనoదరి జీవితాలలో పోల్చుకోవాలి. ఈ లోకాన్ని రక్షించడానికి యేసు ఎన్నుకున్నది యేరుషలేము మార్గము. అయితే ఈ మార్గమే ఆయనను సిలువ మరణానికి గురి చేసింది. ఈనాడు యేసు తన రక్షణ కార్యాన్ని ఈ లోకములో కొనసాగించ డానికి, జ్ఞానస్నానం పొందిన ప్రతీ బిడ్డను ఎన్ను కొంటున్నాడు. యేసు ఏవిధముగా యేరుషలేము పట్టణములో ప్రవేశించాడో, అదే విధముగా మనందరి హృదయాలలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆయన మన జీవిత బాటలో ప్రయాణిస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్న, ఆయన మన చెంతకు వస్తూనే ఉంటాడు. ఆయన మనతోనే ఉన్నాడు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. కనుక మన కష్ట బాధలను ఆయనతో పంచుకొందాం. ఈ పవిత్ర వారములో ఆయనతో ఎక్కువ సమయాన్ని గడపటానికి ప్రయత్నిద్దాం. ఆయన మనలను ఎన్నటికి మోసం చేయడు. కారణం, ఆయన మన తండ్రి మరియు ఆయన ప్రేమ స్వరూపుడు.