27వ
సామాన్య ఆదివారము, YEAR C
హబ. 1:2-3,
2:2-4; 2 తిమో. 1:6-8, 13-14; లూకా. 17:
5-10
విశ్వాసము,
వినయంగల సేవ
ప్రియ సహోదరీ సహోదరులారా, నేడు మనం 27వ సామాన్య ఆదివారాన్ని
కొనియాడుచున్నాం.
ఈనాటి మూడు పఠనాలు కూడా, విశ్వాసం మరియు వినయంతో కూడిన సేవ గురించి, వాటి
ప్రాముఖ్యతను గూర్చి, మరియు విశ్వాసం మన జీవితంలో ఎలా పనిచేస్తుందనే విషయం గూర్చి
స్పష్టం చేస్తున్నాయి. విశ్వాసం అనేది కేవలం ఒక నమ్మకం కాదు, అది మన జీవితాన్ని నిలబెట్టే ఒక శక్తి. ఈ పఠనాలలో మన విశ్వాసాన్ని
ఎలా పెంపొందించుకోవాలి మరియు దానిని ఎలా ఆచరణలో పెట్టాలి అనే విషయాలు
చర్చించబడ్డాయి.
విశ్వాసం: కష్టకాలంలో నిరీక్షణ: “నీతిమంతులు
భక్తి విశ్వాసముల వలన జీవింతురు” అని హబక్కూకుద్వారా ప్రభువు తెలియ జేస్తున్నారు. క్రీ.పూ.
686-642 మద్యకాలములో హబక్కూకు ప్రవక్తగా
ప్రవచించియున్నాడు. యూదానేలిన మనష్శే (క్రీ.పూ. 687-642) కాలములో ఈ ప్రవక్త జీవించాడు.
హీబ్రూ
భాషలో ‘హబక్కూకు’ అనగా “కౌగిలించుట” [‘హాబక్’ అనే ధాతువు నుండి వచ్చింది]. “కౌగిలించుట” అనే అర్థాన్ని మూడు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు:
ఒకటి, దేవునితో సంఘర్షణ మరియు
సన్నిహితత్వం – మనం జాగ్రత్తగా గమనిస్తే, హబక్కూకు గ్రంథం ఒక
సాధారణ ప్రవక్త సందేశంలా కాకుండా, ప్రవక్త దేవునితో
నేరుగా సంభాషించే విధంగా ఉంటుంది. ప్రవక్త తన చుట్టూ ఉన్న అన్యాయం మరియు హింసను చూసి,
“ప్రభూ!, నీవు నా వేడుకోలును ఆలించుటకు, మమ్ము ‘హింస’
నుండి కాపాడుటకు నేనింకెన్నాళ్ళు మొరపెట్ట కోవలెను?” అని దేవున్ని ప్రశ్నిస్తున్నాడు. (హబక్కూకు 1:2-4).
ఈ ప్రశ్నలు దేవుని న్యాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రవక్త సంఘర్షణ పడడాన్ని సూచిస్తాయి.
యూదా రాజ్యములోని దుర్మార్గాన్ని, అన్యాయాన్ని, హబక్కూకు
దేవునికి ఫిర్యాదు చేసాడు. ప్రజలు హింసతో, అన్యాయముతో జీవిస్తున్నారు. దుష్టులు సజ్జనులను
అణగద్రొక్కుచున్నారు. న్యాయము తారుమారు అగుచున్నది.
అప్పుడు
ప్రభువు ప్రవక్తతో ఇలా అంటున్నారు, “నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీతకాలమున
జరుగును. కాని, ఆ కాలము త్వరలో వచ్చును, ఆ
సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరునట్లు కన్పించినను, నీవు దానికొరకు
వేచియుండుము. అది తప్పక జరుగును, ఇక
ఆలస్యము జరగదు” (2:3). ప్రవక్తకు వెల్లడి చేసిన ఆ సంగతి ఏమిటంటే,
“దుష్టులు కొనసాగరు. కాని నీతిమంతులు భక్తివిశ్వాసముల వలన జీవింతురు” (2:4). మనం
దేవుడు చెప్పిన ఆ నిర్ణీత కాలములోనే ఉన్నాము. కనుక మన చెడు మార్గాలను, జీవితాలను
వీడి నీతిన్యాయముతో, విశ్వాసముతో జీవించాలి. దేవుని ఆజ్ఞలను
పాఠించాలి. అప్పుడే మనం శాశ్వతముగా దేవుని రాజ్యములో జీవింపగలము.
రెండు: సంఘర్షణ తర్వాత, ప్రవక్త నిరీక్షణతో దేవుని
జవాబు కోసం వేచి ఉంటాడు (2:1). చివరికి, గ్రంథం ముగిసేసరికి, ఆయన తన
చుట్టూ ఎంతటి విపత్తు ఉన్నా, దేవుని యందు నిశ్చలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. ప్రవక్త అంటున్నాడు, “నేను
ప్రభువునందు ఆనందించెదను. నా రక్షకుడైన దేవుని యందు సంతసించెదను. సర్వోన్నతుడైన
ప్రభువు నాకు బలము నొసగును” (3:17-19). ఈ మొత్తం ప్రక్రియ “కౌగిలించుట”
లాంటిది. అంటే, దేవుని ప్రణాళికలోని విషయాలను అర్ధంచేసుకోవడానికి
కష్టమైనను, చివరికి విశ్వాసంతో
మరియు ప్రేమతో దేవుని చిత్తాన్ని అంగీకరించడం, లేదా
దేవుని ప్రణాళికను గట్టిగా పట్టుకోవడం (కౌగిలించుకోవడం)
అని అర్ధం!
కనుక, హబక్కూకు
ప్రవక్త ప్రధాన సందేశం ఏమిటంటే, “నీతిమంతులు భక్తివిశ్వాసముల వలన జీవింతురు” (2:4). ప్రవక్త
నామార్ధములోనున్న ‘కౌగిలి’, ఒక వ్యక్తి విశ్వాసాన్ని
గట్టిగా పట్టుకోవడాన్ని సూచిస్తుంది.
చుట్టూ పరిస్థితులు దారుణంగా ఉన్నా, దేవుని న్యాయం ఆలస్యం అవుతున్నట్లు
కనిపించినా, దేవునిపై ఉన్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకపోవడం ఈ ‘కౌగిలి’.
సాహిత్యపరంగా, “కౌగిలించుట” అనేది ఇతరులకు ఓదార్పునివ్వడం లేదా భరోసా ఇవ్వడం అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. ప్రవక్త హబక్కూకు ప్రజల
దుఃఖాన్ని, సందేహాలను తన హృదయంలోకి తీసుకుని, దానిని
దేవుని ముందుకు తీసుకువెళ్లి, తిరిగి వారికి నిరీక్షణ
సందేశాన్ని అందించాడు. కాబట్టి, ‘హబక్కూకు’ అనే పేరు కేవలం ఒక పదం కాదు,
ఇది సందేహం
నుండి విశ్వాసానికి మారే ప్రవక్త యొక్క లోతైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, దేవుని
వాగ్దానాన్ని గట్టిగా పట్టుకునే మానవ
అనుభవాన్ని సూచిస్తుంది.
విశ్వాసం: దేవుని వరం మరియు మన బాధ్యత: రెండవ పఠనములొ పౌలుగారు తిమోతికి వ్రాసిన లేఖలో
క్రీస్తు బోధించిన స్వచ్చమైన సిద్ధాంతమును ఆదర్శముగ పాటించాలని, క్రీస్తుయేసునందు
లభించు విశ్వాస ప్రేమలందు నిలిచి ఉండాలని, ఒప్పగింపబడిన ఉత్తమ విషయములను మనయందు
వసించు పవిత్రాత్మ సహాయముతో పదిల పరచుకొన వలయునని
తెలియజేస్తున్నాడు. ఎందుకంటే, ఎఫేసు సంఘములో కొందరు వ్యక్తులు తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తూ, సంఘంలో అనవసరమైన గందరగోళం
సృష్టిస్తున్నారు.
“దేవుడు
మనకు పిరికితనముగల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ,
ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను” (1:7) అని పౌలుగారు అంటున్నారు. కనుక కష్టములో, బాధలలోను
విశ్వాసముతో జీవించాలి. దేవుని శక్తివలన సువార్తకై పాటుపడాలి. క్రీస్తు సందేశమును
మన జీవితముద్వారా ఇతరులకు బోధించాలి. మనమందరమూ దేవుని ప్రవక్తలుగా మారాలి.
ప్రభువునకు సాక్షిగా ఉండాలి (1:8).
విశ్వాసం: ఆవగింజంత ఉంటే చాలు: నేటి
సువిశేషంలో, శిష్యులు ప్రభువుతో “మా విశ్వాసమును పెంపొందింపుము” (17:5) అని కోరియున్నారు.
దేవుని ఆజ్ఞలను పాటించడానికి, క్రీస్తును నిత్యమూ అనుసరించడానికి, మనకు విశ్వాసము
ఎంతో అవసరము. మన క్రైస్తవ జీవితం మన విశ్వాసముపై ఆధారపడి యున్నది. శిష్యులు వారికి
ముందుగానే విశ్వాసమున్నదని భావించి, వారి విశ్వాసాన్ని పెంపొందింపుము అని
కోరియున్నారు. అయితే ప్రభువు “మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో, కంబళి
చెట్టును వేరుతో పెల్లగిల్లి సముద్రములో నాటుకొనుము అని ఆజ్ఞాపించిన అది మీకు
లోబడును” (17:6) అని అన్నారు. మన
జీవితములో ఉన్న అనేక అడ్డంకులు తొలగి పోవాలంటే, మనలో
విశ్వాసం ఉండాలి.
విశ్వాస
జీవితం బాధ్యతతో కూడిన జీవితమని నేటి సువిశేశంలో ప్రభువు చెప్పిన ఉపమానం ద్వారా
స్పష్టమగుచున్నది. ఈ ఉపమానం కర్తవ్యాన్ని గురించి, సేవ యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని గురించి స్పష్టం చేస్తుంది. ఈ ఉపమానంలో, యేసు ఒక యజమాని మరియు ‘సేవకుని’ మధ్య
ఉన్న సంబంధాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఒక సేవకుడు పొలం పనులు పూర్తి చేసి వచ్చిన
తర్వాత, వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకోమని యజమాని
వెంటనే అడగడు. బదులుగా, యజమాని తన భోజనాన్ని సిద్ధం చేయమని,
వడ్డించమని ఆదేశిస్తాడు. ఈ ఉదాహరణ, ‘సేవకుని’ యొక్క సమయం మరియు శక్తి పూర్తిగా యజమాని
అధీనంలో ఉంటాయని చూపిస్తుంది.
దేవుని శిష్యులుగా, మనం కూడా దేవునికి పూర్తిగా
చెందినవారం. ‘సేవకుడు’ తాను ఆజ్ఞాపించబడిన పని చేసినందుకు యజమాని అతనికి
ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడు. ఎందుకంటే, అతను చేసింది తప్పనిసరిగా చేయవలసిన తన కర్తవ్యం కాబట్టి!
ఈ ఉదాహరణను అనుసరించి, యేసు శిష్యులకు ఒక ముఖ్యమైన విషయాన్ని
నేర్పుతున్నారు. వారు తమకు ఆజ్ఞాపించినదంతా చేసిన తర్వాత, ఇలా
చెప్పుకోవాలి: “మేము అయోగ్యులమగు సేవకులము; మేము
మా కర్తవ్యమునే నెరవేర్చితిమి” (లూకా 17:10).
ఈ వచనాల యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే, మనం ఎన్ని గొప్ప పనులు లేదా మహత్కార్యాలు చేసినా,
దేవుడు మనకు కృపతో
రుణపడి ఉన్నాడని లేదా ప్రతిఫలం
ఇవ్వాలని మనం ఎన్నటికీ భావించకూడదు. దేవుని సేవ చేయడం అనేది ఒక పవిత్రమైన
ప్రత్యేక హక్కు మరియు మన ప్రాథమిక
కర్తవ్యం. ఇది మనకు దేవునిపై ఎటువంటి హక్కును ఇవ్వదు. నిజానికి, మన సేవ
అనేది దేవుని అపారమైన దయ మరియు నిస్వార్థ ప్రేమకు మన
హృదయం నుండి వచ్చే సహజమైన ప్రతిస్పందన
మాత్రమే. అయితే మన సేవలో అహంకారం తగదు. దయ మరియు కర్తవ్యం కలిగి
యుండాలి. దేవుని సేవలో, ముఖ్యంగా ఆయన ఆజ్ఞలను
పాటించే విషయంలో, మనం అహంకారాన్ని పూర్తిగా నివారించాలి. ఆజ్ఞలను అనుసరించడమే మన
క్రైస్తవ జీవితానికి ప్రాథమిక పునాది. మనం
దేవుని కోసం చేసే ప్రతీ కార్యం, అది ఎంత చిన్నదైనా లేదా ఎంత గొప్పదైనా, కేవలం
మన కర్తవ్యాన్ని నిస్వార్థంగా నెరవేర్చడమే. లూకా
సువార్తలోని ఉపమానం సేవకుడిని ‘నిష్ప్రయోజకుడిగా’ లేదా యోగ్యుడిగా’
వర్ణించినప్పటికీ, మనం ఈ సత్యాన్ని గుర్తుంచుకోవాలి: అదేమిటంటే, మనకు
లభించే శాశ్వత ప్రతిఫలం దేవుని అపరిమితమైన దయాదాక్షిణ్యాల ద్వారానే
వస్తుంది, మనం చేసిన పనుల వల్ల
కాదు. దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలని రుణపడి
లేరు. ఆయన తన అపారమైన
ప్రేమ మరియు దయతో
దాన్ని మనకు ఉచితంగా అందిస్తారు. ఒక క్రైస్తవునిగా జీవించడం అంటే, తనను
తాను పూర్తిగా దేవునికి అప్పగించుకుని, ఈ భూలోకంలో క్రీస్తు
రాజ్యాన్ని నిర్మించడానికి నిరంతరం శ్రమించడం. మనం ఎంత చేసినా, దేవుడు
మన పట్ల చూపిన మరియు చూపిస్తున్న అపారమైన
త్యాగం మరియు కృపతో
పోలిస్తే అది ఏమాత్రం సరిపోదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి.
కాబట్టి,
మన అహంకారాన్ని నిరోధించడానికి
నేటి సువిశేషం ఒక శక్తివంతమైన ఉపదేశం యేసు ఈ ఉపమానం ద్వారా
మనకు ఏమి బోధిస్తున్నారంటే: మన ఆధ్యాత్మిక జీవితంలో గొప్పతనాన్ని లేదా ప్రత్యేక
ప్రతిఫలాన్ని ఆశించకుండా, దేవుని
ఆజ్ఞలను మరియు సేవను కేవలం మన విధిగా
(కర్తవ్యంగా) భావించి, వాటిని వినయంగా మరియు విధేయతతో నెరవేర్చాలి. మన సేవ వెనుక ఉన్న ఏకైక ప్రేరణ కృతజ్ఞత మరియు ప్రేమ మాత్రమే
అయి ఉండాలి, ఏ విధమైన స్వార్థపూరిత ఆశ ఉండకూడదు.
విశ్వాసాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి?: విశ్వాసం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప
వరం. ఈ విశ్వాసం ద్వారానే అసాధ్యమైనవి సైతం సుసాధ్యమవుతాయి. అయితే, ఈ
వరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి మనం ముందుగా, నిరంతర ప్రార్థన చేయాలి. మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ,
మన విశ్వాసమును మరింత దృఢపరచమని దేవున్ని ప్రార్థించాలి. దేవునితో నిరంతరం సంభాషించడం ద్వారా
మన విశ్వాసానికి శక్తి లభిస్తుంది. ప్రార్థన మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. ఇతర
విశ్వాసులతో కలిసి ప్రార్థించడం, వారి
అనుభవాలను పంచుకోవడం మన విశ్వాసాన్ని మరింత దృఢపరుస్తుంది. సహవాసం మనకు మద్దతునిస్తుంది. అలాగే,
దేవుని పవిత్ర వాక్యాన్ని చదవడం, ధ్యానించడం ఆయనపై మనకున్న విశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే, దివ్యపూజాబలిలో, ఆరాధనలో
పాల్గొనడం, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి, మన
విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి లభించే
అద్భుతమైన అవకాశం.
లౌకిక
ఆకర్షణల నుండి విముక్తి పొందాలి: ఈ
లోకంలోని ఆశలలో మరియు సంపదల వెంట
పడిపోయి దేవుని ఉదారతను, ఆయన
చేసిన మేలులను మరచిపోకూడదు. దేవుడు మనకు చేసిన ప్రతి మేలుకు తప్పక కృతజ్ఞతలు
తెలపాలి.
అలాగే,
సేవ ద్వారా మన విశ్వాసం బలపడుతుంది: కేవలం
మాటల ద్వారానే కాకుండా, ఇతరులకు సేవ చేయడంలో మన
విశ్వాసం బలపడుతుంది. మన విశ్వాసాన్ని ఆచరణలో చూపడమే దానిని పెంపొందించుకునే ఉత్తమమైన మార్గం. ఎందుకంటే, నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ క్రియల
ద్వారా వ్యక్తమవుతుంది.
ముగింపు: విశ్వాసం – కౌగిలి, కర్తవ్యం, మరియు శక్తి!
ప్రియ
సహోదరీ సహోదరులారా, నేటి 27వ సామాన్య ఆదివారపు పఠనాలు విశ్వాసం మరియు వినయంగల సేవ యొక్క
ప్రాముఖ్యతను మన హృదయాలపై ముద్రించాయి. ఈ మూడు పఠనాల సారాంశం మూడు ప్రధాన అంశాలుగా
తీసుకోవచ్చు:
1. విశ్వాసం ఒక కౌగిలి (హబక్కూకు): చుట్టూ అన్యాయం, హింస
ఉన్నా... దేవుని న్యాయం ఆలస్యం అవుతున్నట్లు కనిపించినా... ప్రవక్త హబక్కూకు
చేసినట్లుగా, దేవుని వాగ్దానాన్ని, ఆయన
ప్రణాళికను గట్టిగా పట్టుకోవడం లేదా కౌగిలించుకోవడం
విశ్వాసం. మన జీవిత కష్టాల మధ్య కూడా, “నీతిమంతులు భక్తివిశ్వాసముల వలన
జీవింతురు” అన్న సత్యాన్ని మనం దృఢంగా నమ్మాలి.
2. సేవ మన కర్తవ్యం (లూకా సువార్త): ఆవగింజంత విశ్వాసం అసాధ్యమైన వాటిని సుసాధ్యం
చేయగలదని ప్రభువు బోధించారు. కానీ, మనం ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని
గొప్ప పనులు చేసినా, “మేము అయోగ్యులమగు సేవకులము; మేము
మా కర్తవ్యమునే నెరవేర్చితిమి” అని
వినయంగా చెప్పుకోవాలి. దేవుని సేవ చేయడం మనపై ఆయన ప్రేమకు, దయకు
కృతజ్ఞతగా మనం చేయవలసిన ప్రాథమిక కర్తవ్యం. ఇందులో అహంకారానికి తావులేదు.
3. విశ్వాసం
దేవుని వరం మరియు మన బాధ్యత (2 తిమోతి): దేవుడు
మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహముగల ఆత్మను ఇచ్చారు. కనుక,
పిరికితనం వీడి, క్రీస్తు సువార్తకు సాక్షిగా ఉండడం మన బాధ్యత.
నిరంతర ప్రార్థన, దేవుని
వాక్యం చదవడం మరియు నిస్వార్థ
సేవ ద్వారా ఈ అద్భుతమైన విశ్వాసాన్ని మనం నిత్యం
పెంపొందించుకుందాం.
కనుక, ప్రియ
సహోదరీ సహోదరులారా, మనమందరమూ కూడా, దేవుని యందు భక్తితో.... విశ్వాసముతో... జీవించి, దేవునికి ఇష్టమైన జీవన
విధానమును అలవరచుకొని, దేవుడు మనకు ఒసగిన ఆత్మానుసరణలో శక్తిని పొందుకొని, సాటివారి యెడల
ప్రేమను కలిగి, మన ఇంద్రియములను, అనగా! మన ఈలోక జీవిత కోరికలను, ఆశలను, నిగ్రహించుకొని...
మన ఆధీనంలో ఉంచి, దేవుని కార్యాలను నెరవేర్చే వారముగా దేవుని సేవకులముగా... ఆవగింజంత
విశ్వాసముతో... ఎన్నో ఫలితాలను పొందుకొని, దేవుని సేవకులమై, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి కావలసిన
ఆత్మశక్తిని! దేవునియందు భక్తిని/ విశ్వాసమును/ దైవ అనుసరణను/ మనందరికీ దయచేయుమని
ఆ దేవాది దేవున్ని ప్రార్థించుదాం.
మనం ఈ వారం ముందుకు సాగేటప్పుడు, ఈ శక్తివంతమైన సందేశాన్ని గుర్తుంచుకుందాం. మన విశ్వాసం ఒక నిశ్చలమైన కోటలా, మన సేవ నిస్వార్థమైన ప్రేమ యొక్క వ్యక్తీకరణలా ఉండుగాక! దేవుడు మన పట్ల చూపిన అపారమైన ప్రేమకు, మన కృతజ్ఞతను వినయంతో కూడిన విధేయత ద్వారా, నిత్యమూ మన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ తెలియజేద్దాం. ఆవగింజంత విశ్వాసంతో మన జీవిత కంబళి వృక్షాలను వేరుతో పెల్లగించి, క్రీస్తు రాజ్యంలో ఫలిద్దాం. ఆమేన్.
No comments:
Post a Comment