26వ సామాన్య ఆదివారము, YEAR C - ధనవంతుడు-లాజరు

26వ సామాన్య ఆదివారము, YEAR C
పఠనాలు: ఆమోసు 6:1,4-7; 1 తిమోతి 6:11-16; లూకా 16:19-31


ప్రియ సహోదరీ సహోదరులారా, నేడు మనం 26వ సామాన్య ఆదివారాన్ని కొనియాడు చున్నాం. ముందుగా, నేటి పఠనాల సందేశ వాక్యాలను ఆలకించుదాం:

ఆమోసు 6:4 - “దంతముపొదిగిన మంచాలపైపరుండి పాన్పులపై తమను దాచుకొనుచు మందలో మేలిమి గొర్రెపిల్లలను, శాలలల్లోని లేదూడలను వధించి మెక్కు మీకు అనర్ధము తప్పదు.”

1 తిమోతి 6:11-12 - “దైవజనుడవగు నీవు వీనికి దూరముగ ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము, అనువాని కొరకు నీవు యత్నింపుము. విశ్వాససంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్యజీవమును గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణము ఒనర్చినపుడు, దేవుడు నిన్ను ఈ జీవనమునకే పిలిచెను.”

లూకా 16:19-26 - “ధనవంతుడొకడు పట్టువస్త్రములు ధరించి నిత్యము విందులతో, వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీదనుండి జారిపడు మెతుకులకొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా, దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళమునుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని వున్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచూ ‘తండ్రీ అబ్రహామా! నన్ను కనికరింపుము. నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. తన వ్రేలికొనను నీటిలోముంచి, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము’ అనెను.‌ అందుకు అబ్రహాము, ‘కుమారా! మరువకుము. నీ జీవితములో నీవు సకలసంపదలను అనుభవించుచుండ, లాజరు అష్టకష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇపుడు కష్టపడుచుండ, అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మనమధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచటివారు ఇచటకు రాలేరు. ఇచటివారు అచటకు పోలేరు’ అని పలికెను.”

ప్రియ సహోదరీ సహోదరులారా, మనందరం ఈ లోకములో నిరీక్షణ ప్రయాణికులం. మన అంతిమ గమ్యం పరలోక రాజ్యం. ఈ భూమిపై మన జీవిత ప్రయాణం ముగిసి, తండ్రి రాజ్యంలోకి ప్రవేశించాలంటే, మన నడవడిక, మన జీవితం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. యేసుక్రీస్తు ఆజ్ఞలు, విలువలు, బోధనల ప్రకారం మనం జీవించాలి. మారుమనస్సు, పశ్చాత్తాపం మన జీవితాలకు చాలా అవసరం. దివ్యసంస్కారాల ద్వారా దైవానుగ్రహాన్ని, పవిత్రాత్మ వరాలను పొందుతూ, మన జీవితాలను ముందుకు నడిపించుకుందాం. ఎందుకంటే, ‘ఈ లోక జీవితం, గడ్డి పువ్వువంటి వైభవం, కాని, పరలోక జీవితం, శాశ్వతమైన నిత్యజీవము’.

ప్రియ సహోదరీ సహోదరులారా, ఈనాటి పఠనాలు, మనం సమాజములో, మన అనుదిన జీవితంలో ఎలా జీవించాలో స్పష్టంగా బోధిస్తున్నాయి. పేదవారిపట్ల, అవసరంలో ఉన్నవారిపట్ల మనం కలిగి ఉండవలసిన సామాజిక బాధ్యతను అవి నొక్కిచెబుతున్నాయి. పేదవారితో మన సంపదను పంచుకోవాలి, ఆకలిగొన్నవారికి ఆహారం, దప్పికగొన్నవారికి నీరు ఇవ్వాలి. పరదేశులను ఆదరించాలి, వస్త్రహీనులకు వస్త్రాలను ఇవ్వాలి. రోగులను, చెరసాలలో ఉన్నవారిని పరామర్శించాలి. ఎందుకంటే, ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికిని ఇవి చేసినా అవి ప్రభువుకు చేసినట్లవుతుంది (మత్త 25:31-44).

మొదటి పఠనంలో ఆమోసు ప్రవక్త విలాసవంతమైన జీవితం గడుపుతూ, పేదవారిని, బాధలలో ఉన్నవారిని పీడిస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు ఘోర శిక్ష తప్పదని ప్రవచిస్తున్నాడు. విలాసాలకు అలవాటు పడి, ఇతరుల కష్టాలను విస్మరిస్తే ఎదురయ్యే అనర్ధాన్ని ఆమోసు ప్రవక్త తెలియజేశాడు. ఇది మత్తయి 25:46వ వచనాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది: “అవినీతిపరులు నిత్యశిక్షకు వెడలిపోదురు. నీతిమంతులు నిత్యజీవంలో ప్రవేశింతురు.”

ఆమోసు ప్రవక్త చెప్పిన ప్రవచనం, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు (రాజధాని: సామరియ) మరియు దక్షిణ రాజ్యమైన యూదా (రాజధాని: యెరూషలేము) రెండింటికీ వర్తిస్తుంది. ముఖ్యంగా, ఇశ్రాయేలు రాజ్యం రాజైన యరోబాము పాలనలో ఆర్ధికంగా అత్యంత శ్రేయస్సు, సైనికపరంగా శాంతితో విలసిల్లుతున్న సమయంలో ఈ సందేశాన్ని ఇచ్చాడు. నేటి ప్రవచనాలు, ప్రధానంగా ధనవంతులైన నాయకులను, ఉన్నత వర్గాలను ఉద్దేశించి చెప్పబడ్డాయి. ఎందుకంటే, వారు అతి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ, సమాజంలో పెరుగుతున్న పేదరికాన్ని, అన్యాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ‘మేము దేవుని ప్రజలం’ అని అతి విశ్వాసాన్ని పెంచుకున్నారు. చుట్టుపక్కల దేశాలకు వినాశనం వస్తున్నప్పటికీ, తమకు మాత్రం విపత్తు రాదనే అహంకారంతో జీవించారు. తద్వారా రాబోయే దేవుని తీర్పును హాస్యాస్పదంగా భావించారు.

ఈవిధంగా, నేటి మొదటి పఠనం, ధనవంతుల నిర్లక్ష్య వైభోగాన్ని, సామాజిక బాధ్యతారాహిత్యాన్ని వ్యతిరేకిస్తుంది. మరి మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఆత్మపరిశీలన చేసుకుందాం! ప్రస్తుత సమాజంలో కూడా ఎంతోమంది సుఖజీవనాన్ని గడుపుతూ ‘మేము సురక్షితంగా ఉన్నాము’ అని భావిస్తున్నారు. విచ్చలవిడిగా జీవించడానికి ఎంతో ధనమును వృధా చేస్తున్నారు. కనుక ప్రియ సహోదరీ, సహోదరులారా! మనము ఎంత తగ్గించుకొని దేవుడు సమకూర్చిన దానిలో, మనము మంచిగా జీవిస్తూ, సాటి వారికి సహాయపడుతూ, సహాయం చేస్తూ, సాటివారి సహాయములో దేవుని చూడగలుగుతూ జీవిస్తే, అట్టి జీవితము ధన్యమవుతుంది. ముందు మన పక్కవారి పరిస్థితి ఎలా ఉందో మనం గమనించుకోవాలి. మనము చేతనైనంత సహాయం వారికి చేయగలగాలి.

నేటి మొదటి పఠనం నుండి మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏమిటంటే, సౌకర్యాల మధ్య, మన చుట్టూ ఉన్నవారి కష్టాలను, అన్యాయాన్ని విస్మరించకూడదు. సామాజిక న్యాయంపై దేవుని దృష్టి పెట్టాలి. దేవుని ప్రజలు అయినంత మాత్రాన, మన పాపాల నుండి, సామాజిక అన్యాయాల నుండి రక్షణ ఉంటుందని మనం భావించకూడదు. మన అహంకారం, నిస్సత్తువ కారణంగా, దేవుని తీర్పు అనివార్యమని మనం తెలుసుకోవాలి. కాబట్టి, భౌతిక సంపద, భద్రత పట్ల అతి విశ్వాసం, పొరుగువారి పట్ల ప్రేమ, కరుణ లేకపోవడం దేవుని ఆగ్రహానికి, తీర్పుకు దారితీస్తుందని మనమందరం గ్రహించాలి!

ప్రియ సహోదరీ సహోదరులారా, నేటి మొదటి పఠన సందేశాన్ని ప్రభువు ధనికుడు-లాజరు ఉపమానం (లూకా 16:19-31) ద్వారా స్పష్టంగా, అర్థవంతంగా తెలియజేస్తున్నారు. ప్రభువు ఈ ఉపమానాన్ని ధనాపేక్ష కలిగి, పేదవారిపట్ల కనికరంలేని పరిసయ్యులకు గుణపాఠం చెప్పడానికి బోధించారు. ధనవంతులే దేవుని ఆశీర్వాదం పొందినవారని, పేదరికం పాపానికి శిక్ష అని ఆ కాలంలో యూదులలో ఉన్న తప్పుడు భావనను సరిదిద్దడానికి కూడా ఈ ఉపమానాన్ని బోధించారు.

ఉపమానంలో మనం విన్నట్లు, ధనికుడు ఈ లోకంలో పట్టువస్త్రాలు ధరించి, విందులతో కాలాన్ని గడిపాడు. కానీ, తన ఇంటి వాకిట ఉన్న పేదవాడైన లాజరును ఎప్పుడూ పట్టించుకోలేదు, చేరదీయలేదు, పరామర్శించలేదు. మరణం తర్వాత, ధనికుడు పాతాళంలోకి త్రోయబడ్డాడు, లాజరును దేవదూతలు అబ్రహాము ఒడిలోనికి చేర్చారు. ధనికుడు తన సంపద కారణంగా పాతాళానికి పోలేదు. అతను మోషే మరియు ప్రవక్తల బోధనలను, పేదవారిపట్ల చూపవలసిన కనికరాన్ని పూర్తిగా విస్మరించాడు. ఇతరులకు శారీరకంగా హాని చేయకపోయినా, తన చుట్టూ కష్టంలో ఉన్నవారిని ఆదరించకపోవడం అతడు చేసిన ఘోరమైన తప్పు. దీనిని మనం ‘Sin of Omission’ అని అంటాం. అంటే, దేవుడు చేయమని ఆజ్ఞాపించిన లేదా నైతికంగా చేయవలసిన బాధ్యత ఉన్న మంచి పనిని చేయకపోవడం ద్వారా ఈ పాపం జరుగుతుంది. ఇది ఒక కార్యాన్ని చేయడంలో విఫలమవడం లేదా నిర్లక్ష్యం చేయడం. కొన్ని ఉదాహరణలు: పేదవారికి సహాయం చేయకపోవడం, దేవుని ఆరాధనను నిర్లక్ష్యం చేయడం, క్షమించాల్సిన వారిని క్షమించకపోవడం...లాంటివి. ఇలాంటి పాపము గురించి యాకోబు 4:17లో స్పష్టంగా చెప్పబడింది, “మేలైనది చేయ నెరిగియు అట్లు చేయని వాడు పాపము చేసిన వాడు అగును”. కనుక, మంచి పనులు చేయాలో తెలిసి కూడా చేయకపోతే, అది పాపమవుతుంది. మంచి పనులు చేయకుండా విఫలమవడం కూడా పాపమే. ఒక వ్యక్తి సరైన అవకాశాన్ని, బాధ్యతను లేదా ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తే, అది దేవుని దృష్టిలో పాపం అవుతుంది. ధనవంతుడు ఇలాంటి పాపాన్నే మూటగట్టు కున్నాడు. అందుకే దాటుటకు వీలులేని అగాధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

ప్రియ సహోదరీ సహోదరులారా, మనం ఈ భూలోకంలో ఉండగానే మారుమనస్సు పొంది, క్రీస్తు బోధనలను పాటించాలి. దేవుడు మనకు వరాలు, అనుగ్రహాలు పుష్కలంగా ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ ధనం, ఆరోగ్యం, సమయం, తెలివితేటలు - ఇలా ఒక్కొక్కరికి ఒకో విధముగా ప్రత్యేకమైన వరాలను ఇచ్చారు. ఈ దృష్టిలో, మనమందరమూ ధనికులమే! ఈ అనుగ్రహాలన్నింటిని స్వార్థంతో కేవలం మన కొరకే కాకుండా, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారి కొరకు ఉపయోగించాలి.

సమాజంలో, సంఘంలో స్వార్ధముతో జీవింపక, ఒకరికొరకు ఒకరం జీవించాలని, అలాగే, ఇతరుల పట్ల మనం బాధ్యతకలిగి జీవించాలని, మనకున్నవాటిని ఇతరులతో పంచుకోవాలని ఈ ఉపమానం మనకు బోధిస్తుంది. మత్తయి 25వ అధ్యాయంలో చూస్తున్నట్లుగా, మన తుది తీర్పు ఈ పంచుకోవడముపైనే ఆధారపడి ఉంటుంది. ఇతరులపట్ల దయ, కనికరం చూపాలి. జగమంతా ఒకే కుటుంబమన్న భావనతో ఐక్యంగా జీవించాలి.

ప్రభువు చెప్పిన ధనికుడు-లాజరు ఉపమానం కేవలం పేదలకు సహాయం చేయకపోవడం గురించి మాత్రమే కాదు; అది ధనం వలన కలిగే ప్రమాదాన్ని కూడా తెలియజేస్తుంది. ధనవంతుడు పేరు లేకుండా ఉన్నాడు (కేవలం ‘ధనికుడు’ అని మాత్రమే చెప్పబడింది). బైబిల్లో పేరు లేని వ్యక్తి తరచుగా గుర్తింపు లేని, ప్రాముఖ్యత లేని వ్యక్తిగా పరిగణించబడతాడు. ధనవంతుడికి పేరు లేకపోవడం గురించి పునీత అగస్టీనుగారు ఇలా అన్నారు, “పరలోకంలో అతని పేరు వ్రాయబడలేదు కాబట్టే, పరలోకంలో నివసించే దేవుడు ఆ ధనవంతుడి పేరును మౌనంగా ఉంచాడు. పేదవాడి పేరును మాత్రం చెప్పాడు, ఎందుకంటే ఆ పేరు పరలోకంలో వ్రాయబడి ఉంది.” కనుక, ఈ లోకంలో మనకు ఎంత పేరు, ప్రఖ్యాతి ఉన్నా, దేవుని రాజ్యంలో మన పేరు వ్రాయబడి ఉందా లేదా అనేదే ముఖ్యం. లోకసంబంధమైన గుర్తింపు నిత్యజీవానికి లెక్కలోనికి రాదు.

లోకసంపదలు మన కళ్ళు కప్పి, మన చుట్టూ ఉన్నవారిని, ముఖ్యంగా కష్టాలలో ఉన్నవారిని చూడకుండా అడ్డుకుంటాయి. ధనం దేవునికి బదులుగా మనకు భద్రతాభావం ఇస్తుంది. ఇది మనల్ని విలాసాలకు, స్వార్థానికి బానిసలను చేసి, మన ఆత్మీయ దృష్టిని దెబ్బతీస్తుంది. ధనవంతుడు లాజరును చూడగలిగాడు, కానీ పరిగణలోకి తీసుకోలేదు. మనం సంపద మనకు ఉపయోగపడేదిగా ఉంచుకుంటున్నామా, లేక సంపదకే మనం దాసులం అయ్యామా? అని ఆత్మపరిశీలన చేసుకుందాం!

ధనికుడు మరణం తరువాత మాత్రమే పశ్చాత్తాపపడ్డాడు, బాధ పడ్డాడు. ఎందుకంటే, అతడు పేదవాడికి దయ చూపక, తన సౌకర్యాలలో మునిగిపోయాడు. అయితే, అప్పుడు ఎంత వేడుకున్నా, ఫలితం లేకపోయింది. అబ్రహాము ‘దాటడానికి వీలులేని అగాధం’ గురించి చెప్పాడు. ఇది మరణానంతరం పశ్చాత్తాపానికి, మార్పుకు అవకాశం లేదనే సత్యాన్ని తెలియజేస్తుంది. కనుక, మారుమనస్సు కేవలం ఈ లోకంలో, ఈ జీవితంలో మాత్రమే సాధ్యమవుతుంది. “ఇదిగో, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము” అని 2 కొరి 6:2లో చదువుచున్నాం. రేపటి గురించి కాదు, మనం ఈ రోజు క్రీస్తు మార్గంలో నడవాలి, ఈ రోజు మన సంపదను పంచుకోవాలి, ఈ రోజు పేదవారిని ఆదుకోవాలి. మరణం తర్వాత వచ్చే నిత్యజీవానికి మనం ‘ఈ రోజు’ తీసుకునే నిర్ణయాలే ఆధారం. ‘తరువాత చూద్దాం’ అనే అలసత్వం ఆత్మీయ మరణానికి దారితీస్తుంది.

ధనికుడు పాతాళంలో బాధపడుతూ, తన సోదరులను హెచ్చరించడానికి లాజరును పంపమని అబ్రహామును వేడుకున్నాడు. దానికి అబ్రహాము స్పష్టంగా ఇలా బదులిచ్చాడు: “వారికి మోషేయు, ప్రవక్తల బోధనలు ఉన్నాయి; వారు వాటిని వినవలెను.” చనిపోయినవారిలో నుండి ఒకరు లేచినా కూడా వారు నమ్మరని ఆయన నొక్కి చెప్పాడు. ఈ భాగం యొక్క అంతరార్థం చాలా లోతైనది. అద్భుతాలు, సంకేతాలు, లేదా మరణం తర్వాత వచ్చే దర్శనాలు కాదు, మన నిత్యజీవితానికి నిజమైన ఆధారం మన చేతిలో ఉన్న దేవుని వాక్యం మాత్రమే. మనకు ఇప్పటికే పాత నిబంధన (మోషే ధర్మశాస్త్రం), కొత్త నిబంధన (క్రీస్తు సువిశేషం) రూపంలో సంపూర్ణమైన సత్యం లభించింది. ఈ వాక్యం పేదవారికి దయ చూపడం, కనికరం కలిగి ఉండడం వంటి దేవుని చిత్తాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. క్రీస్తు బోధనలు, మోషే ధర్మశాస్త్రం రెండూ ఒకే నీతి మార్గాన్ని బోధిస్తున్నాయి. ఆ మార్గం కనికరం, ప్రేమ, మరియు పంచుకోవడమే. మనం నిత్యం అద్భుతాల కోసం ఆరాటపడకుండా, దేవుడు మనకిచ్చిన లిఖితపూర్వక వాక్యాన్ని ఎంతవరకు చదువుతున్నాం? ఆ వాక్యం ద్వారా మనల్ని మనం నిజాయితీగా మార్చుకుంటున్నామా? అని ఆత్మపరిశీలన చేసుకుందాం! దేవుని వాక్యంపై ఉన్న నమ్మకం, దానిని నిత్యజీవితంలో పాటించడం మాత్రమే మన రక్షణకు, మోక్షానికి బలమైన పునాది. కేవలం వినడం కాదు, ఆచరించడం ద్వారానే మనం నిత్యజీవానికి వారసులమవుదాం.

ప్రియ సహోదరీ, సహోదరులారా! ధనికుడు-లాజరు ఉపమానం కేవలం అప్పటి కాలానికే పరిమితం కాదు. ఈ రోజు కూడా మన చుట్టూ ఎంతోమంది లాజరులు ఉన్నారు. ధనికుడంటే కోట్ల ఆస్తులున్న వ్యక్తి మాత్రమే కాదు. సమయం, ఆరోగ్యం, మంచి విద్య, స్థిరమైన ఉద్యోగం వంటి వరాలు పొందిన మనమందరమూ దేవుని దృష్టిలో ధనికులమే. కనుక పేదవారికి సహాయం చేయాలి. మన వద్ద ఉన్న సమయాన్ని పేదవారి సేవ కోసం పంచుకోకపోవడం, ధనాన్ని స్వార్థంతో ఖర్చుచేయడం, తెలివిని ఇతరులకు సహాయం చేయకుండా మనకోసమే వాడుకోవడం ఇవన్నీ ఆధునిక ధనికులు చేస్తున్న తప్పే. మరి మనమందరం ఆత్మపరిశీలన చేసుకుందాం! పునీత క్రిసోస్టమ్ గారు, “మన సంపదను పేదలతో పంచుకోకపోవడం అనేది పేదల నుండి దొంగిలించడమే మరియు వారి జీవనోపాధిని దోచుకోవడమే. మనం మన సంపదను కాదు, వారి సంపదను కలిగి ఉన్నాం” అని అన్నారు.

ఈనాటి రెండవ పఠనములో పౌలుగారు ఎఫేసు సంఘానికి అధిపతియైన (ఈనాటి పీఠాధిపతి) తిమోతిని హెచ్చరిస్తూ, సలహాలను ఇస్తున్నాడు. “ధనకాంక్ష సర్వ అనర్ధములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసం నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి” (1 తిమో 6:10) కనుక, ధనకాంక్షలకు దూరముగా ఉండమని పౌలుగారు తెలియజేస్తున్నారు. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యముతో జీవింప ప్రయత్నం చేయాలి (6:11). మనం ఈ లోకంలోనికి వచ్చునపుడు ఏమియు వెంట తీసుకొని రాలేదు, మనం ఈ లోకంనుండి నిష్క్రమించునపుడు ఏమియును వెంట తీసుకొని పోజాలము (6:7). కనుక, ఇహమందు ధనవంతులైనవారు గర్విష్ఠులుగా ఉండక, అస్థిరములగు సంపదలయందు నమ్మకముంచక, మనము సంతోషంగా అనుభవించుటకు ధారాళముగా కావలసిన దంతయు దయచేయు దేవునియందే నమ్మకము ఉంచాలి (6:17). ఇదియే నిజమైన జీవాన్ని సంపాదించు కోవడానికి, రాబోవు కాలానికి దృఢమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడం.

దేవుడు మనకు ఇచ్చిన సంపదను, వరాలను ఇతరులతో పంచుకోవడానికి ప్రయాసపడుదాం. పేదవారిని ఆదుకోవడానికి, వ్యాధిగ్రస్తులను పరామర్శించడానికి, కష్టంలో ఉన్నవారికి చేయూతనివ్వడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాన్ని ఇహలోక సంపదపై కాక, దేవుని పట్ల నమ్మకంపై నిర్మించుకుందాం. సాటివారికి సహాయ పడడం దైవస్వభావం. ఈ స్వభావాన్ని మనం అలవర్చుకోవాలి. ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టడం, దాహముతో ఉన్నవారికి మంచినీరు ఇవ్వగలగడం, కష్టాలలో ఉన్న వారికి మన చేతనయినంత సహాయం చేసి మనోధైర్యాన్ని ఇవ్వగలగడం మానవత్వం, దైవస్వభావం. యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడిచి, ఆయన బోధనలను పాటిద్దాం. మోక్షవాసులమవుదాం!

ప్రియ సహోదరీ, సహోదరులారా, ఈ లోకమునకు మనము ఏమీ తీసుకురాలేదు. సమస్తమును మనకు దేవుడు దయచేసియున్నారు. దేవుడు నీకు, నాకు, మనకు, ఇచ్చిన సమస్తమును, దేవుని చిత్తానికి, దేవుడు మననుండి ఇష్టపడే కార్యాలకు, సంతోషముగా ఖర్చుచేద్దాం. (దేవుడు మనకు దయచేసిన తెలివి కానీ, జ్ఞానము కానీ, సంపద కానీ, ధనమును కానీ, ఆస్తులను కానీ, మంచితనమును కానీ, ఏదైనా కానీ...) దేవుని కొరకు ఉపయోగిద్దాం. దేవుడు మెచ్చే కార్యాలను చేద్దాం. అప్పుడు దేవునికి ఇష్టమైన జీవితాలను మనం జీవిస్తున్నట్లే. పరలోక రాజ్యములో మన పేర్లను చేర్చుకునే ధన్యతను పొందుకుంటాం.

మనలో చాలామందిమీ, ఈ లోకాన్ని, ఈ లోక మనుషులను, నమ్ముకొని జీవిస్తున్నాం. వారు నన్ను కాపాడతారులే, వారు నా అక్కరలలో ఆసరాగా ఉంటారులే అని, మనుషులను నమ్ముతున్నాం. దేవుని వాక్కు చెప్తుంది కదా! దేవుని వాక్కుపై ఆధారపడు. దేవుని యందు విశ్వాసముతో జీవించు. నీవు మరణించి మట్టిలో కలిసిపోగానే నీ మంచి జీవితమును బట్టి దేవుని సన్నిధికి, నీ ఆత్మ చేరుకుంటుంది.

ఆత్మపరిశీలన చేసుకుందాం: మనలో ఎంతమందిమి దేవుని వాక్కును విశ్వసిస్తున్నాం? మనలో ఎంతమందిమి నీతి కలిగిన జీవితాలను జీవిస్తున్నాం? మనలో ఎంతమందిమి దేవుని యందు భక్తి/ విశ్వాసములను అలవర్చుకొని ప్రవర్తిస్తున్నాం? మనలో ఎంతమందిమి సాటివారి యెడల ప్రేమను/ సహనమును కలిగి నడుచుకుంటున్నాం?

No comments:

Post a Comment