25వ
సామాన్య ఆదివారము, YEAR C
ఆమో. 8:4-7;
1తిమో. 2:1-8; లూకా 16:1-13
న్యాయంగా
జీవించడం
ప్రియ సహోదరీ సహోదరులారా, నేడు మనం 25వ సామాన్య ఆదివారమును కొనియాడుచున్నాం.
మన సమాజం అన్యాయం, అవినీతితో నిండిపోయింది. మనలో కొందరం ఈ
అన్యాయాలకు బలవుతూ ఉంటే, మరికొందరం అన్యాయం,
అవినీతికి కారణమయ్యే అవకాశం ఉంది! ఈ పరిస్థితుల్లో, మనం నీతి, న్యాయం కలిగి జీవించాలని, దేవుని రాజ్యాన్ని స్థాపించాలని ఈరోజు పఠనాల
ద్వారా దేవుడు మనలను కోరుతున్నారు.
మనమందరమూ దేవుని దత్తపుత్రులం. క్రీస్తు
విశ్వాసులం, క్రీస్తు అనుచరులం. దేవుని బిడ్డలముగా, ఈ లోకములో దైవరాజ్యాన్ని
స్థాపించడమే మన పిలుపు. ఇందుకోసం దేవుడు మనకు
ఎన్నోవరాలను, అనుగ్రహాలను ఇచ్చారు. వాటిని వివేకముతో, దైవానుచిత్తముగా
ఉపయోగించు కోవాలి.
ఈరోజు పఠనాలు దైవరాజ్యమును స్థాపించుటకు మనమందరమూ
నీతి న్యాయాలతో జీవించాలని మనకు బోధిస్తున్నాయి. మత్త 6:33లో “మొదట
ఆయన రాజ్యమును, నీతిని వెదకుడు” అని చదువుచున్నాం. మీకా 6:8లో “నీవు
న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలుగుము, నీ
దేవునిపట్ల వినయముతో ప్రవర్తింపుము” అని చదువుచున్నాం. కనుక,
ఈరోజు పఠనాలు మనం దేవుని సేవకులమని, ఆయన మన నుండి విశ్వసనీయమైన మరియు వివేకవంతమైన జీవితాన్ని ఆశిస్తున్నారని
గుర్తుకు చేస్తున్నాయి. దేవుడు మనకిచ్చిన ప్రతిభను, సంపద వంటి ఆశీర్వాదాలను స్వర్గాన్ని చేరుకోవడానికి తెలివిగా
ఉపయోగించుకోవాలని ఈ పఠనాలు మనకు సవాలు చేస్తున్నాయి.
‘న్యాయం’ అంటే ఏమిటి?
న్యాయం అంటే ఇతరుల హక్కులను గౌరవించడం. ఆ హక్కులు వారికి
లభించేలా చూడటం న్యాయాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు: సామాజిక
సేవ మరియు సామాజిక న్యాయం. సేవ అప్పటికప్పుడు ఇతరుల
కష్టాలను, బాధలను తీర్చటం లేదా ఒదార్చటం. ఉదాహరణకు, ఆకలితో
నున్నవారికి అన్నం పెట్టడం. అదే సామాజిక న్యాయం ఆ కష్టాలకు, బాధలకు
కారణాన్ని కనుగొని శాశ్వత పరిష్కారం చేయడం. ‘న్యాయం’ అనగా ఇతరులకు చెందిన దానిని
వారికి చెందేలాగున చేయడం.
పునీత అలోషియస్ గోన్జాగ వారు ఇలా అన్నారు, “మన పొరుగువారు మనకు సేవ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు, మనం అన్నింటినీ త్యజించి వారికి సహాయం చేయాలి.” ప్రతి మానవుడు దేవుని
స్వరూపంలో సృష్టించబడ్డాడు కాబట్టి, ప్రతి ఒక్కరికీ
గౌరవం ఇవ్వాలి. ఈ గౌరవం వారి ఆర్థిక పరిస్థితి, సామాజిక అంతస్తు, మతం, జాతితో సంబంధం లేకుండా ఇవ్వాలి. పేదలు, వలసదారులు, అణగారిన వర్గాల ప్రజల గౌరవాన్ని
రక్షించడం మనందరి బాధ్యత. కనుక, ఈనాటి మన సమాజ దుస్తుతికి, అనగా
అసమానతలకు కారణం సామాజిక న్యాయం లేకపోవటం వలననే అని స్పష్టంగా చెప్పవచ్చు! నేడు
మనం ఎదుర్కుంటున్న సైబర్ మోసాలు, కార్పొరేట్ అన్యాయాలు, నిజాయితీ లేని ప్రకటనలనుండి, ప్రభుత్వాలు, సామాజిక
సంఘాలు అలాగే మనమందరమూ సామాజిక న్యాయం కొరకు కృషి చేయాలని ఆశిద్దాం. సమాజంలో ప్రతి ఒక్కరికీ శ్రేయస్సు లభించినప్పుడే అది నిజమైన
అభివృద్ధి అవుతుంది. సామాజిక శ్రేయస్సు అంటే ప్రతి వ్యక్తి తన సామర్థ్యాలను
పూర్తిగా వినియోగించుకోవడానికి, అభివృద్ధి చెందడానికి అవసరమైన
పరిస్థితులను సృష్టించడం. ప్రభుత్వాలు, సంస్థలు,
వ్యక్తిగతంగా మనమందరం ఈ లక్ష్యం కోసం కృషి
చేయాలి.
న్యాయముగా జీవించడం దేవుని వరం. ఇది కేవలం
వరదాయకమైనదేకాక, రక్షణదాయకమైనది కూడా.
ఈనాటి పఠనాలను ధ్యానిద్దాం
మొదటి పఠనం ఆమో. 8:4-7 వరకు
ఆలకిస్తున్నాం, “దీనుల తలమీద కాలు మోపుచు, పేదలను
నాశనము చేయువారలారా వినుడు!” అనే ఒక హెచ్చరికతో
ప్రారంభ మవుతుంది. తెకోవకు చెందిన ఆమోసు ప్రవక్త ఇస్రాయేలు రాజ్యంలో
రెండవ యరోబాము (క్రీ.పూ. 782-753) రాజు కాలమున, మరియు యూదా రాజ్యంలో ఉజ్జియా (క్రీ.పూ. 767-740)
రాజు కాలములో జీవించి, ప్రవచించిన ప్రవక్త. ఆమోసు యూదారాజ్యానికి చెందినవాడు.
గొర్రెలకాపరిగా జీవితం గడుపుతూ అత్తిపండ్లను అమ్ముకొంటూ జీవనోపాధిని సాగిస్తూ
ఉండేవాడు. ఆమోసు యూదా రాజ్యమునకు చెందిన వాడైనప్పటికినీ దేవుడు అతనిని పిలిచి, ప్రవక్తగా
ఎన్నుకొని, ఇస్రాయేలు రాజ్య ప్రజలకు
ప్రవచనము చెప్పమని పంపుచున్నారు. ఆమోసు అనగా “బరువు మోయువాడు” అని అర్ధము.
ప్రియ సహోదరీ సహోదరులారా, యరోబాము కాలములో ఇస్రాయేలు రాజ్యము
బాగా విస్తరించింది. వ్యాపార పరంగా, ఆర్ధిక పరంగా ప్రజలు పుంజుకున్నారు,
ఎంతగాని అభివృద్ధి చెందారు. అయితే, ఈ అభివృద్ది మత్తులో పడిపోయి, ప్రజలు
జీవన విధానం, మతాచార వ్యవహారాలలో, ఆధ్యాత్మిక విషయాలలో చిత్తశుద్ది లోపించి అంతా
బాహ్యమైన తంతుగానే ఉండిపోయింది. అవినీతి, అన్యాయం, మోసం
బాగా పెరిగి పోయాయి. ఈ పరిస్థితుల్లో అవినీతి, అన్యాయాలకు
వ్యతిరేకముగా ఆమోసు ప్రవచించాడు. ప్రజల అవినీతిని ఎదురించడం ప్రవక్త కర్తవ్యం.
పశ్చాత్తాపపడి దేవునివైపు తిరగాలనే దేవుని హెచ్చరికలను ఆమోసు ప్రవక్త ప్రజలకు
తెలియ జేశాడు. దురాశ పరులు, అవినీతి పరులు నిరుపేదలను వంచించడం వంటి సాంఘిక
అన్యాయాలను ఎత్తిచూపి, సాంఘిక న్యాయం కోసం పోరాడిన ప్రవక్త ఆమోసు.
ఈనాటి పఠనములో, ప్రజల
వ్యాపారములో అవినీతి, అన్యాయపు కార్యాలను ఆమోసు ఎత్తిచూపుతున్నాడు.
తప్పుడు కొలమానములు, తూకములతో, దొంగత్రాసులతో
ప్రజలను మోసగిస్తున్నారు. తాలు గోధుమలనుకూడా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. బాకీలు
చెల్లింపలేని పేదలను, చెప్పులజోడు వెలకూడా చెల్లింపలేని పేదలను
కొంటున్నారు. ఇది అన్యాయం, అవినీతి అని ప్రవక్త వారికి తెలియ జేస్తున్నాడు. సామె.
20:10లో “దొంగ తూకములకు, దొంగ కొలతలకు పాల్పడు వారిని ప్రభువు
అసహ్యించుకొనును” అని చదువుచున్నాం. అలాగే, సామె. 14:31లో “పేదవానిని
పీడించువాడు అతనిని కలిగించిన సృష్టికర్తను అవమానించును. దరిద్రుని గౌరవించువాడు
దేవుని గౌరవించును” అని చదువుచున్నాం. అలాగే, తన
ప్రవచనాల ద్వారా, దేవుడు ఏర్పాటు చేసుకొన్న ఒడంబడికకు ఇస్రాయేలు ప్రజలు
విశ్వాసులుగా ఉండాలని ఆమోసు ప్రవక్త కోరుచున్నాడు.
దేవుడు నమ్మకస్తుడు కావున, ఆయన
ప్రజలుకూడా నమ్మకముగా ఉండాలి. దేవుడు అందరికి సమానముగా న్యాయ తీర్పును చేయువాడు.
ఆయనకు అందరు సమానమే. 11వ కీర్తన 7లో, “ప్రభువు నీతిమంతుడు, నీతికార్యములనే
ప్రేమించును” అని చదువుచున్నాం. ద్వితీయోపదేశకాండము 32:4లో
“ప్రభువు న్యాయవంతుడు, విశ్వసనీయుడు, న్యాయమును, ధర్మమును పాటించువాడు” అని
చదువుచున్నాం. 1 యోహాను 2:1లో
“నీతిమంతుడైన యేసు క్రీస్తు మనకు కలడు” అని చదువుచున్నాం. “క్రీస్తు యేసునందు
మీరందరునూ ఒక్కరే’ అని గలతీ. 3:28లో చదువుచున్నాం. క్రీస్తుప్రభువు పేదలు, బలహీనులు,
అనారోగ్యంతో ఉన్నవారితో ఎక్కువ సమయం గడిపారు.
ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, మనం కూడా పేదల అవసరాలకు, హక్కులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది కేవలం దాతృత్వం కాదు,
న్యాయం కోసం జీవించడం.
ప్రియ సహోదరీ సహోదరులారా, ఆత్మపరిశీలన
చేసుకుందాం! మీరు ఒక వ్యాపారి అయితే, మీ కస్టమర్లకు సరైన తూకంతో, సరైన ధరకు
వస్తువులను అమ్ముచున్నావా? ఎవరినీ మోసం చేయకుండా ఉంటున్నావా? రోజువారీ లావాదేవీలలో
నీవు నిజాయితీగా ఉంటున్నావా? సమాజంలో అన్ని వర్గాల ప్రజలను సమానంగా
గౌరవించుచున్నావా? పేద, ధనిక, సామాజిక అంతస్తుతో సంబంధం లేకుండా అందరితో మర్యాదగా ప్రవర్తిస్తున్నావా?
ఇక ప్రియ సహోదరీ సహోదరులారా, నేటి రెండవ పఠనం, తిమోతికి
వ్రాసిని మొదటి లేఖలో అందరికొరకు ప్రార్ధన చేయాలని పౌలు కోరుతున్నాడు.
తిమోతి పౌలుకు ప్రీతిపాత్రుడు. ప్రభువునందు విశ్వసనీయ సహచరుడు. పౌలు లేఖలు
రాయడానికి సాయపడ్డాడు. పౌలు తిమోతిని ఫిలిప్పు సంఘానికి తన రాయబారిగా పంపాడు. ఆ పిమ్మట
ఎఫేసు, తెస్సలోనిక సంఘాలలో పనిచేసాడు. తిమోతి అనగా “దేవున్ని
గౌరవించడం” అని అర్ధం. విశ్వాసాన్ని పటిష్టం చేయడానికి పౌలు ఈ లేఖను రాసాడు. ఇతరుల
కొరకు ప్రార్ధన చేయడం క్రైస్తవ బాధ్యత. ఇది దైవచిత్తం. ప్రార్ధన శక్తివంతమైనది.
అధికారములోనున్న వారికొరకు ప్రార్ధన చేయాలి. మన ప్రార్ధనలద్వారా అన్యాయం, అవినీతిని,
దేవుడంటే అయిష్టత ఉన్న వారి హృదయాన్ని మార్చవచ్చు. ప్రతీ ఒక్కరు
సత్యమును తెలుసుకొని, రక్షణ పొందాలని ప్రార్ధన చేయాలి.
ఇక, ప్రియ సహోదరీ సహోదరులారా, ఈనాటి సువిశేష
పఠనములో, “ముందు చూపుగల గృహ నిర్వాహకుడు” అను ఉపమానమును
ప్రభువు చెప్పుచున్నారు. ఈ గృహనిర్వాహకుడు మొదటగా అవినీతిపరుడు. యజమానుని సంపదను
వృధా చేయుచున్నాడని నేరము అతనిపై మోపబడినది. యజమాని అతనికి ఎంతో స్వేచ్చను,
స్వతంత్రాన్ని యిచ్చి, గృహ నిర్వాహణ బాధ్యతలు అప్పజెప్పాడు. గృహ నిర్వాహణలో
యజమానికి లాభాలు చేకూర్చవలసి ఉంటుంది. కాని, గృహ నిర్వాహకుడు
ఇదే అదనుగా తీసుకొని స్వలాభంకోసం ఎక్కువ వడ్డీలను వసూలు చేసాడు. అది తెలుసుకున్న
యజమాని ‘లెక్కలు అప్పజెప్పుమని, ఇక గృహ నిర్వాహకుడిగా ఉండ వీలుపడదు’ అని
చెప్పియున్నాడు. అయితే, తన పని కోల్పోయిన తరువాత ఋణస్తుల ఆశ్రయం, సహాయం
పొందుటకు వారిని పిలిపించి వారి ఋణాలను తక్కువగా చేసియున్నాడు. ఆ గృహ నిర్వాహకుడు
యుక్తిగా, ముందుచూపుతో ప్రవర్తించినందులకు యజమానుడు
మెచ్చుకొన్నాడు.
ప్రియ సహోదరీ సహోదరులారా, ఈ ఉపమానమునుండి మనం
ఏమి నేర్చుకోగలము?
1. గృహ నిర్వాహకుని అవినీతిని అన్యాయాన్ని, ఉపమానం
చెప్పిన ప్రభువు కాని, ఆ యజమాని కాని, మనం
కాని సమర్ధించడం లేదు. అయితే, అతడు చూపిన యుక్తిని లేదా తెలివైన ఆలోచనను మరియు
అతని ముందుచూపుతనాన్ని మాత్రమే మెచ్చుకొంటున్నాము.
ఋణాలను తగ్గించి రాయడం వలన, అతను యజమానుని మోసం చేయలేదు. తన స్వలాభాన్ని
త్యజించాడు. కారణం ఏదైనా, తను చేసిన తప్పును సరిచేసుకోవడానికి ప్రయత్నం
చేసాడు. మనం కూడా, మన అనుదిన జీవితాలలో అవినీతికి, అన్యాయాలకు
దూరముగా ఉంటూ, యుక్తిగా ప్రవర్తించుటకు ప్రయాసపడాలి. బైబులులో జ్ఞానం అనేది కేవలం తెలివితేటలు కాదు, అది దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం, దాని ప్రకారం జీవించడం. మనం ఈ లోకంలోని జ్ఞానాన్ని మంచి కోసం,
అంటే, దేవుని రాజ్యం
కోసం, దేవుని రాజ్య స్థాపనకోసం ఉపయోగించాలి.
2. ప్రభువు అంటున్నారు, “స్వల్ప విషయములలో
నమ్మదగినవాడు, గొప్ప విషయములలోనూ, నమ్మదగిన
వాడిగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగనివాడు, గొప్ప
విషయములలోనూ నమ్మదగని వాడుగా ఉండును” (లూకా 16:10). “చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండడమే ఒక గొప్ప విషయం” అని పునీత జాన్ క్రిసోస్తం
గారి మాటలను, అలాగే, “చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయండి” అని పునీత
మదర్ తెరెసా గారి మాటలను గుర్తుకు చేసుకుందాం! నమ్మకం
చాలా గొప్పది. మన బంధాలలో, మనం చేసే పనిలో, చెప్పే మాటలలో తప్పకుండ నమ్మకం
ఉండాలి. క్రైస్తవులముగా, మనం ఈ లోకములో ఎన్నో బాధ్యతలను కలిగియున్నాము.
నమ్మకముగా వానిని నేరవేర్చుదాం. ఈలోక సంపదలయందు నమ్మకముగా ఉన్నప్పుడే, పరలోక
సంపదలను దేవుడు మనకు అప్పజెప్తారు. లూకా 16:11లో “ఈలోక
సంపదలయందు మీరు నమ్మదగిన వారు కానిచో, పరలోక సంపదలను ఎవడు మీకు ఇచ్చును?” అని చదువుచున్నాం. కనుక, చిన్న
పనులను గొప్ప ప్రేమతో చేయాలి.
3. మనకున్న ఆధ్యాత్మిక వనరులను మనం తెలివిగా
సద్వినియోగ పరచుకోవాలి. దివ్యసంస్కారాలు దేవుడు మనకిచ్చిన గొప్ప వరాలు. వాని ద్వారా
దైవానుగ్రహాన్ని పొందగలుగు చున్నాము. అలాగే దివ్యగ్రంధము, తిరుసభ
బోధనలు గొప్ప వరాలు. గృహ నిర్వాహకునివలె మనంకూడా మనకు ఇవ్వబడిన వరాలనుబట్టి అనగా
మన సమయం, సామర్ధ్యం, అవకాశాలు,
ఆరోగ్యం, తెలివితేటలు, విద్య
మొదలగు వానిని బట్టి దేవునికి మనం లెక్క జెప్పవలసి ఉంటుంది. 2 కొరి 5:10లో “మనము అందరమును న్యాయ విచారణకై,
క్రీస్తు ఎదుట అగపడవలెనుగదా! అప్పుడు వారివారి అర్హతలనుబట్టి మంచివిగాని, చెడ్డవిగాని
భౌతికశరీరమున వారువారు ఒనర్చిన కృత్యములనుబట్టి వారికి ప్రతిఫలము ఒసగబడును” అని చదువుచున్నాం.
4. ఈ లోక సంపదలు ఏవీ శాశ్వతం కాదు. ఈలోక సంపదలు మనకు
శాశ్వత ఆనందమును ఇవ్వలేవు. శాశ్వత ఆనందము నొసగు పరలోకములో మన సంపదలను కూడబెట్టు కోవాలి.
“నీ సంపదలున్న చోటనే నీ హృదయ ముండును” అని మత్త 6:21లో
చదువుచున్నాం. ఈ లోక సంపదలు మన అవసరాల కొరకు ఇవ్వబడ్డాయి.
అంతేగాని వాటిమీద మనం ఎప్పటికి ప్రేమను పెంచుకోరాదు. అత్యాశతో వాటిని
కూడబెట్టుకోవడం మంచిది కాదు. మనం సామాజిక న్యాయంకోసం కృషి చేయాలి. ఎవరికి చెందిన
దానిని వారిని చెందనివ్వాలి. సామాజికన్యాయం లోపించుట వలననే, నేడు
మన సమాజంలో ఊహించని అసమానతలు, ఘోరాలు, బేదాభిప్రాయాలను చవిచూస్తున్నాం. కనుక, అవినీతి,
అన్యాయంతో డబ్బు సంపాదించిన అది శాశ్వతం కాదు అని నేడు మనం గ్రహించాలి.
అది ఎలా వస్తుందో అలాగే పోతుంది. అవినీతి, అన్యాయాలు చేసేవారు, ఉపమానంలోని గృహ నిర్వాహకునివలె
బాధ్యతలనుండి తప్పించ బడతారు, అనగా వారి జీవనోపాధిని కోల్పోతారు. దేవుని
తీర్పుకు, ఖండనకు గురియవుతారు అన్నది వాస్తవం!.
5. దైవరాజ్య స్థాపనకై కృషిచేయాలి. దైవరాజ్యం
ఈలోకానికి చెందినది కాదు. పాత ఒప్పందములో, దేవుడు మహారాజుగా, తన
శక్తితో, ఈ లోక దుష్టశక్తులతో కూడిన అన్యాయాన్ని అంతం చేసి
న్యాయాన్ని, సంతోషాన్ని, శాంతిని
నెలకొల్పి యున్నారు. ఇదే దేవుని సృష్టి ఉద్దేశాన్ని పరిపూర్ణం చేయడం. ఇదే తండ్రి
దేవుని కార్యాన్ని, పుత్రుడైన యేసు నూతన ఒప్పందములో గావించారు. మార్కు
1:15లో “కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము
చెంది సువార్తను విశ్వసింపుడు” అని ప్రభువు ప్రకటించారు. ఇదే
దైవ పాలనారంభం! రక్షణకు మార్గం. ఇది దైవరాజ్య స్థాపనకు శుభవార్త, సువార్త! యేసు తన
బోధనల ద్వారా, అద్భుతముల ద్వారా, తన
వ్యక్తిత్వం ద్వారా, మరణ-పునరుత్తానముల ద్వారా దేవుని ప్రేమ రాజ్యమును
స్థాపించారు. ఈ దైవరాజ్యమును పవిత్రాత్మ శక్తి వలన కొనసాగించే బాధ్యత తిరుసభది,
అనగా మనందరిది. కాబట్టి యుక్తిగా ప్రవర్తించుదాం.
ఈ విషయంలో, మనం బైబులునుండి ఇద్దరు వ్యక్తులను
ఆదర్శంగా తీసుకోవచ్చు: ఒకరు యోసేపు, అతను ఐగుప్తులో ఒక బానిసగా, తరువాత ఖైదీగా
ఉన్నప్పటికీ, తన తెలివితేటలు, జ్ఞానంతో ఫరో రాజుకు ప్రధానమంత్రిగా ఎదిగాడు. భవిష్యత్తులో రాబోయే
ఏడు సంవత్సరాల కరవును గురించి కలల ద్వారా గ్రహించిన యోసేపు, ఈ విపత్తును ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. ఆయన ఈ
ప్రణాళికను కేవలం తన సొంత లాభం కోసం కాకుండా, మొత్తం ఐగుప్తు ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేశాడు. యోసేపు
ఐగుప్తులోని ప్రజలందరి నుంచి సమృద్ధిగా ఉన్న సంవత్సరాలలో ధాన్యాన్ని సేకరించి,
దాన్ని గిడ్డంగుల్లో నిల్వ చేశాడు. ఈ చర్య అతని
జ్ఞానానికి, ముందుచూపుకు నిదర్శనం. కరవు
వచ్చినప్పుడు, ధాన్యాన్ని కేవలం ధనవంతులకు మాత్రమే
కాకుండా, పేదలకు, బలహీనులకు కూడా అందించేలా యోసేపు చూశాడు. ఈ నిర్ణయం ద్వారా అతను
సమాజంలో అసమానతలు పెరగకుండా, ప్రతి ఒక్కరూ కష్టకాలంలో జీవించగలిగేలా
సహాయపడ్డాడు. యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకోగలిగేది ఏమిటంటే, అధికారం అనేది స్వలాభం కోసం కాకుండా, ప్రజల కష్టాలను తీర్చడానికి, సమాజంలో
న్యాయాన్ని స్థాపించడానికి ఉపయోగ పడాలి.
ఇంకొకరు మోషే, మోషే జీవితం సామాజిక
న్యాయం కోసం చేసిన ఒక మహత్తరమైన పోరాటం. మోషే ఒక రాజకుటుంబంలో పెరిగినప్పటికీ,
తన ప్రజలైన ఇస్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా
పడుతున్న కష్టాలను చూసి చలించి పోయాడు. వారి దుస్థితిని గమనించిన మోషే, వారిని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుని ఆదేశం మేరకు పోరాటం
మొదలు పెట్టాడు. మోషే ఫరో రాజును ఎదుర్కొని, తమ ప్రజలను విడిచి పెట్టమని కోరాడు. ఇది అధికారాన్ని దుర్వినియోగం
చేస్తున్న పాలనపై ఒక ధైర్యవంతమైన నిరసనగా చూడవచ్చు. మోషే నాయకత్వంలో, ఇస్రాయేలీయులు బానిసత్వం నుండి విముక్తిని పొందారు. ఈ సంఘటన
అణచివేతకు గురైన ప్రజలకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, దానికోసం పోరాడటం ఎంత అవసరమో తెలియజేస్తుంది. మోషే జీవితం మనకు ఇచ్చే
సందేశం ఏమిటంటే, సామాజిక న్యాయం కోసం పోరాడాలంటే ధైర్యం,
కరుణ, దైవభక్తి ఎంతో
అవసరం. అణచివేతకు వ్యతిరేకంగా నిలబడమని, అణగారిన వర్గాల
ప్రజల హక్కుల కోసం కృషి చేయమని మోషే జీవితం మనలను ప్రేరేపిస్తుంది.
ప్రియ సహోదరీ సహోదరులారా, ఆత్మపరిశీలన చేసుకుందాం! ఒక ఉద్యోగిగా, నీ పనిని నిజాయితీగా, సమయానికి పూర్తి చేయుచున్నావా? నీవు
పని చేసే సంస్థకు నష్టం కలిగించకుండా ఉంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన వనరులను, సమయం,
తెలివితేటలు, ధనమును, నీవు ఎలా ఉపయోగిస్తున్నావు?
పునీత ఇగ్నేషియస్ లొయోలా గారు “మన సంపదను, మన సమయాన్ని, మన తెలివితేటలను దేవుని మహిమ కొరకు
మాత్రమే ఉపయోగించాలి” అని అన్నారు. ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన పని చేసే హక్కు
ఉంది. శ్రమ కేవలం జీవనోపాధి కోసం మాత్రమే కాకుండా, మానవ గౌరవాన్ని పెంచుతుంది. కార్మికులకు సరైన వేతనం, భద్రత కల్పించడం యజమానుల నైతిక బాధ్యత.
యేసుక్రీస్తు కూడా ఈ లోకమున అన్యాయాన్ని, అవినీతిని
వ్యతిరేకించారు. సామాజిక న్యాయం కోసం తపించారు. దైవరాజ్యాన్ని స్థాపించారు. “చిన్న
బిడ్డలదే దేవుని రాజ్యం” అని మార్కు 10:14లో ప్రభువు పలికారు. అనగా చిన్న
పిల్లలవలె ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలని అర్ధం. దేవుని రాజ్యం పవిత్రాత్మతో
నింపబడిన రాజ్యం. ప్రేమ, శాంతి సమాధానాలు కలిగిన రాజ్యం. నీతిన్యాయములు
నెలకొనిన రాజ్యం. ఇది ఆధ్యాత్మికమైన రాజ్యం. విమోచన కలిగిన రాజ్యం. ఈ రాజ్యములో
అందరూ సమానమే. “మీ రాజ్యం వచ్చును గాక” అని ప్రతీ రోజు మనం ప్రార్ధన చేస్తున్నాం.
ఇలాంటి రాజ్యమే మన ఈ భూలోకములో స్థాపించబడాలని ప్రార్ధన చేద్దాం. పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు, “దేవుని రాజ్యం మన హృదయంలో, మన చర్యలలో మొదలవుతుంది” అని అన్నారు.
ముగింపు
ప్రియ సహోదరీ సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించిన పఠనాలు, మనం
జీవించే సమాజంలో నీతి, న్యాయం, మరియు
విశ్వసనీయత ఎంత ముఖ్యమో మనకు స్పష్టంగా తెలియజేశాయి. ఈ పఠనాల్లోని సారాంశాన్ని మన
జీవితాల్లో అమలు చేద్దాం! మనలో ఉన్న ప్రతిభ, సమయం, సంపద వంటి దైవిక వరాలను కేవలం మన స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా, దైవరాజ్య స్థాపన కోసం ఉపయోగించుకుందాం. సమాజంలో అణగారిన, నిస్సహాయ ప్రజల హక్కుల కోసం నిలబడదాం. అన్యాయం, అవినీతి
మన హృదయాన్ని, సమాజాన్ని కలుషితం చేయకుండా జాగ్రత్త పడదాం.
చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా, నిజాయితీగా ఉందాం. ఎందుకంటే, దేవుని
దృష్టిలో చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయడమే అత్యంత ముఖ్యమైనది. మన నిత్య జీవితంలో,
మన వృత్తిలో, మన సంబంధాలలో న్యాయాన్ని
పాటిస్తూ, మన క్రియల ద్వారా మనం దైవబిడ్డలమని లోకానికి చాటి చెబుదాం.
దీని ద్వారా, మనం కోరుకునే దైవరాజ్యం మన హృదయాల్లోనూ,
మన సమాజంలోనూ నిజమవుతుంది. దేవుడు మిమ్ము దీవించుగాక! ఆమేన్. 🙏
No comments:
Post a Comment