24 వ సామాన్య ఆదివారము, YEAR C

24 వ సామాన్య ఆదివారము, YEAR C
నిర్గమ. 32: 7-11,13-14; I తిమో. 1:12-17; లూకా. 15:1-32

దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, కోపపడువాడు, కాని క్షమించువాడు. దేవుని కోపం, ఆయన ప్రేమతో సమానం. తను ఎన్నుకొన్న ప్రజలు అవిధేయించినప్పుడు, అవిశ్వాసములో జీవించినప్పుడు, కోపపడినను, తన కరుణాహృదయముతో వారిని క్షమించి, వారిపై తన ప్రేమను చాటుకొంటూ ఉంటారు. మనందరి వ్యక్తిగత జీవితములో, దేవుని ప్రేమను, కరుణను, క్షమను పొందియున్నాము. దానినిమిత్తమై, ముందుగా దేవునికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొందాము. "మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక! యేసుక్రీస్తు పునరుత్థానముద్వారా మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము" (1 పేతు. 1:3).

మొదటి పఠనములో, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను క్షమించడం చూస్తున్నాము. వారు చేసిన పాపం చాలా పెద్దది: బంగారు దూడను చేసి, విగ్రహారాధన చేసారు, దానిని బలులతో ఆరాధించారు, వారు మతభ్రష్టులైరి, తద్వారా దేవుని ఆజ్ఞను మీరారు. ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడు నెలలకు, యిస్రాయేలీయులు సినాయి అరణ్యమునకు వచ్చిరి. అచటనే కొండకెదురుగా విడిది చేసిరి. మోషే కొండనెక్కి దేవుని కడకు వెళ్ళెను. దేవుడు కొండనుండి అతనిని పిలచి యిస్రాయేలీయులకు తన ఆజ్ఞలను, నియమాలను, కట్టడలను వెల్లడించుమని చెప్పెను (నిర్గమ. 3). మోషే కొండమీదికి వెళ్లి చాలా కాలము వరకు తిరిగి రాలేదు. ఈలోగా వారు మోషే ఇక తిరిగి రాడని భావించి, బంగారు దూడను చేసి పూజించారు, ఆరాధించారు, బలులు అర్పించారు. ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన దేవర యితడే అని పల్కారు. అది చూసిన దేవుడు కోపపడ్డారు. ఆయన కోపము గనగన మండి వారిని బుగ్గి చేయాలని హెచ్చరించారు. ఆ తరువాత, మోషేనుండి మహాజాతిని పుట్టించ తలచాడు. కాని, మోషే దేవునికి వారిని నాశనం చేయవద్దని మొరపెట్టుకొన్నాడు, మనవి చేసుకొన్నాడు, ప్రార్ధన చేసాడు. కనుక ప్రభువు తన తలంపును మార్చుకొన్నారు, యిస్రాయేలీయులకు తలపెట్టిన కీడును విరమించుకొన్నారు (నిర్గమ. 32). దీనినిబట్టి, దేవుని ప్రేమను, కరుణను, క్షమను మనం అర్ధం చేసుకోవచ్చు. మానవుని పాపం - దేవుని క్షమ గురించియే, బైబిలు చరిత్రనంతయును చూస్తూ ఉంటాము. ఆనాడు మోషే వేడుదల వలన, ఇశ్రాయేలు ప్రజలు క్షమించబడినారు. ఈనాడు మనం క్రీస్తు పాస్కా పరమరహస్యము ద్వారా (శ్రమలు, మరణం, ఉత్థానం) క్షమించబడియున్నాము.

రెండవ పఠనములో, పౌలుగారు దేవుని కృపకు, దయకు, కనికరమునకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. సౌలుగా అతను క్రీస్తును, క్రీస్తానుచరులను దూషించి, హింసించి అవమానపరచాడు. అయితే  క్రీస్తు అతనిని కనికరించి, ఎంచి తన సేవకు, పరిచర్యకు నియమించుకొన్నారు. ఆయనను విశ్వసింపవలసిన వారందరికి, పౌలు ఆదర్శప్రాయుడుగా ఉండునట్లు చేసారు. దేవుని ప్రేమకు, దయకు, కరుణకు, క్షమకు పౌలుగారి జీవితం ఓ గొప్ప నిదర్శనం! "దేవుని కృప అపారము. మన పట్ల ఆయన ప్రేమ అమితము" (ఎఫెసీ. 2:4). కనుక, మనము నిత్యము దేవునకు కృతజ్ఞతలు అర్పించవలయును.

సువిశేష పఠనము - యేసు మూడు ఉపమానములను (త్రోవతప్పిన గొర్రె, పోగొట్టుకొన్న నాణెము, తప్పిపోయిన కుమారుడు). చెప్పుచున్నారు. ఈ మూడు కూడా, హృదయపరివర్తనమును గురించిన ఉపమానములు. ఇవి దేవుని ప్రేమ, దయ, కరుణలను తెలియజేస్తున్నాయి. పాపులు, సుంకరులు అందరును యేసు బోధలు వినుటకు (వినుటకు, ఆలకించుటకు 5:1; 6:47; 9:35) ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూసి పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు యేసు పాపులను చేరదీయుచు వారితో కలసి భుజించుచున్నాడని సణుగుకొనసాగిరి (సుంకరులకు, పాపాత్ములకు మిత్రుడు 7:34. 5:30; 19:7). అయితే ప్రభువు ఉద్దేశం, 5:32లో స్పష్టం చేయబడినది: "హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువ వచ్చితినికాని, నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు." అలాగే 19:10 - "మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు." అప్పుడు యేసు వారికి ఉపమానములను చెప్పారు (15:3). ఈ ఉపమానములద్వారా, సుంకరులను, పాపాత్ములను చేరదీయడాన్ని సమర్ధించుకుంటున్నారు. ఎందుకన, తన ఉద్దేశ్యం - వారి హృదయపరివర్తనము.

"త్రోవతప్పిన గొర్రె" - పాత నిబంధనలో, దేవుడు మంచి కాపరిగా చెప్పబడినారు (ఆ.కాం. 48:15; 49:24; కీ. 23; యిర్మియా 23:3). మంచికాపరి అయిన ప్తరభువు ప్పిపోయిన గొర్రెలను వెదకునని, యెహెజ్కేలు 34:16లో చూడవచ్చు. దేవుని దృష్టిలో ప్రతీ ఒక్కరు ముఖ్యమే. వందలో ఒకటి అని కాకుండా, ప్రతీ ఒక్కరు సమానమే! తప్పోపియిన వారిని కనుగొన్న తరువాత, ఆయన తన భుజములపై మోస్తారు (15:5). ప్రవాసమునుండి తిరిగి వచ్చు సమయములో, దేవుడు తన ప్రజలను తన భుజములపై మోసెను (చదువుము యెషయ 40:11; 49:22). తిరిగి వచ్చిన వారిని తిరిగి దేవుడు పునరుద్దరించును. పరివర్తన చెందినవారిపట్ల పరలోకములో ఆనందము ఉండును (15:7 అలాగే దేవదూతలు సంతోషించును (15:10). ఆ ఆనందాన్ని స్నేహితులతో, ఇరుగుపొరుగు వారితో కూడా పంచుకోవాలి (15:9). యెహెజ్కేలు 18:23లో ఇలా చదువుచున్నాము: "దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలగుట వలన కాదా అని ప్రభువు నుడువు చున్నాడు".

"పోగొట్టుకొన్న నాణెము" - తప్పిపోయిన వారిని దేవుడు "పట్టుదలతో" (15:8) వెదకునని తెలియజేయుచున్నది.

యేసు పాపులకొరకై, వారి రక్షణ నిమిత్తమై వచ్చెను. అందరూ పాపాత్ములే. మనలో పాపము చేయనివారు ఎవరునూ లేరు. నీతిమంతులని చెప్పుకొనెడి పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు కూడా పాపాత్ములే! పాపులు, సుంకరులు పశ్చాత్తాపముతో యేసు బోధనలను ఆలకించుటకు వచ్చారు. కాని పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు దైవకుమారుడైన యేసునే త్రునీకరించారు. మనం అందరం ఈలోకములో పాపము వలన తప్పిపోయిన వారమే! ప్రభువు పరలోకమును వీడి మనలను వెతుక్కొంటూ ఈ లోకానికి వచ్చియున్నారు. ఆయన మంచి కాపరి. గొర్రెలకాపరి ఎలా తప్పిపోయిన గొర్రెను వెదకుతాడో, మనం పోగొట్టుకున్న నాణెమును (ఒక రోజు వేతనము) ఎలా వెతకుతామో, తప్పిపోయిన కుమారుని రాకకై ఓ తండ్రి ఏవిధముగా ఎదురు చూస్తాడో, పాపముచేసి తప్పిపోయిన మనందరి కోసం కూడా దేవుడు తన ప్రేమ, దయ, కరుణతో మన రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. "పశ్చాత్తాపము అవసరములేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతులకంటే (పరిసయ్యులు - హృదయ పరివర్తనము అవసరంలేదని భావిస్తారు 18:9), హృదయపరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును" (లూకా. 15:7) అని ప్రభువు చెప్పియున్నారు.

"తప్పిపోయిన కుమారుడు" - ఉపమానం ప్రపంచములోనే అతి గొప్పదైన కథగా పేరు. దీనిద్వారా, పరలోక తండ్రి దయ, ప్రేమ, కరుణా స్వభావములు మనకు అర్ధమగుచున్నాయి. తండ్రి ప్రేమ అనంతమయినది. ఆ ప్రేమకు ఎలాంటి షరతులు లేవు. తప్పిపోయిన కుమారుడు తిరిగివచ్చినప్పుడు ఆ తండ్రి అతనిపై కోపపడలేదు. దానికి బదులుగా, మేలిమి వస్త్రములను కట్టబెట్టెను, వ్రేలికి ఉంగరమును, కాళ్ళకు చెప్పులను తొడిగెను, క్రొవ్విన కోడెదూడను వధించి విందును ఏర్పాటు చేసెను. తండ్రి అనంత ప్రేమకు, కరుణకు నిదర్శనం!

ఒకనికి ఇద్దరు కుమారులు ఉండిరి (15:11): ఆ ఒకరు తండ్రి దేవుడు. పెద్ద కుమారుడు - ఇస్రాయేలు ప్రజలను (చదువుము నిర్గమ 4:22). చిన్న కుమారుడు - దూరదేశమున వసించుచు, ధర్మశాస్త్రమును పాటించక, పందులను మేపుకొను చిన్నకుమారుడు అన్యులను సూచిస్తుంది. 15:12-24 చిన్నకుమారుని గురించి, 15:25-32 పెద్దకుమారుని గురించి వేరువేరుగా వింటున్నాము. ఈ ఇరువురు కుమారుల మధ్యనున్న వ్యత్యాసాన్ని చూస్తున్నాము. అయితే, ఇరువురి విషయములో తండ్రిదే ఆఖరిమాట!

15:12 - తండ్రి మరణం తరువాతనే ఆస్తి పంచబడాలి (సంఖ్యా 27:8; సీరా. 33:20-24). చిన్న కుమారుడు ఆస్తిని పంచమని అడిగాడు. తన తండ్రి తనకు చనిపోయినట్లేనని భావించాడు. చిన్నకుమారుని కోరిక మేరకు తండ్రి ఆస్తిని పంచి యిచ్చాడు. ద్వితీయ. 21:17 ప్రకారం, పెద్దకుమారునికి ఆస్తిలో రెండువంతులు పంచి ఇవ్వాలి, కనుక, చిన్నకుమారునికి రావలసినది పంచి ఇచ్చాడు.
15:13-16 - చిన్నకుమారుడు దూరదేశమునకు వెళ్ళాడు. అక్కడ భోగవిలాసములతో, ధనమంతయు దుర్వినియోగము చేసి, తన ఆస్తిని మంట కలిపాడు. కరువు దాపురించుటచే, పందులను మేపాడు. యూదులకు పందులు అపరిశుభ్రమైన జంతువులు (లేవీ. 11:7; ద్వితీయ 14:8 అశుచికరమైనది). అనగా అతను అన్యులవలె "చాలా దూరముగా" జీవిస్తున్నాడు అని అర్ధం. అతను ఇస్రాయేలు సంఘము నుండి వెలివేయబడినవాడు. దేవుడు లేకుండా ఈ ప్రపంచమున జీవించడం అని అర్ధం (చదువుము ఎఫెసీ 2:12-13).
15:17-19 - తనకు కనువిప్పు కలిగినది. తన తండ్రి చనిపోయాడని భావించిన అతను ఇప్పుడు చనిపోవుచున్నది తానే అని గుర్తించాడు. తాను తప్పిపోయానని గుర్తించాడు. తన పశ్చాత్తాపాన్ని తనలోతాను అనుకొని (18-19), తండ్రి వద్ద తన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాడు (15:21): "పరలోకమునకును, నీకును ద్రోహము చేసితిని..." - తోటివారిపట్ల పాపం చేసినప్పుడు, చివరికి దేవునికి వ్యతిరేకముగా కూడా పాపము చేసినట్లే అని అర్ధం (నిర్గమ 10:16). పశ్చాత్తాప సూచనలు - తండ్రి దయను గుర్తించడం (15:17); "లేచి తండ్రి వద్దకు వెళ్ళడం" (15:18, 20); "లేవడం" అనే పదం క్రీస్తు ఉత్థానమును గురించి కూడా వాడబడింది (లూకా 18:33; 24:7, 46). అనగా, "మరణించిన" కుమారుడు "మరల జీవము" పొందుచున్నాడని అర్ధం (15:24, 32).
15:20 - దేవుడు పాపి హృదయపరివర్తన కొరకు ఓపికతో ఎదురుచూచుచున్నాడు. దూరమున ఉండగానే, తండ్రి అతనిని చూచాడు. అతని మనసు కరిగింది (యేసు కనికరం 7:13; 10:33). కుమారుని వద్దకు పరుగెత్తి వెళ్ళాడు. కుమారున్ని కౌగలించుకున్నాడు. కుమారున్ని ముద్దు పెట్టుకున్నాడు. ఇవన్నీ దేవుని కనికరమునకు నిదర్శనాలు.
15:21-24 - తండ్రి కుమారుని పశ్చాత్తాపాన్ని మధ్యలోనే అడ్డుకున్నాడు. పూర్తిగా చెప్పేవరకు కూడా ఆగలేదు. మేలివస్త్రములను కట్టబెట్టమని, వ్రేలికి ఉంగరమును, కాళ్ళకు చెప్పులను తొడుగుడని, క్రొవ్విన కోడె దూడను వధింపమని సేవకులకు ఆజ్ఞాపించాడు. వీటన్నింటికి అర్ధం, తిరిగి "కుమారుని" స్థానాన్ని తండ్రి తిరిగి ఇచ్చాడు. మరణించినవాడు, బ్రతికాడని, పోయినవాడు తిరిగి దొరికాడని తండ్రి గుర్తించాడు. అనగా, తండ్రి పూర్తిగా క్షమించాడు. దీనిని పౌలు ఎఫెసీ 2:1, 4-5లో విచారించాడు (చదువుము). కనుక, ఆనందముతో, సంతోషముతో విందు చేసుకున్నారు.
15:25-28 - రెండవ భాగములో పెద్దకుమారుని గురించి చూస్తున్నాము. జరిగిన విషయాన్ని పనివానిద్వారా తెలుసుకున్నాడు. అందుకు పెద్దకుమారుడు "మండి పడ్డాడు" (15:28). తండ్రి వెలుపలకు వచ్చి పెద్దకుమారున్ని బ్రతిమాలాడాడు.
15:29-30 - పెద్దకుమారుడు తననుతాను సేవకునిగా, పనివానిగా భావించాడు. "తండ్రీ!" అని ఎప్పుడు సంభోదించలేదు. చిన్నకుమారుని సోదరునిగా భావించలేదు. "నేను ఎన్నడు నీ ఆజ్ఞను మీరలేదు" అని అన్నాడు (ద్వితీయ 26:13). తండ్రి కనికరాన్ని గుర్తించలేదు. ఒకరకముగా, పెద్దకుమారుడు కూడా తప్పిపోయిన వాడే!
15:31-32 - పెద్దకుమారుడిని "కుమారా!" అని సంబోధించాడు. విందునకు ఆహ్వానిస్తున్నాడు. పెద్దకుమారుడు, విందులో చేరినది లేనిదీ చెప్పబడలేదు. అనగా, ఎవరివారే నిర్ణయం చేయాలి అని అర్ధం.

ప్రతీ దివ్యపూజా బలిలో, తన శరీర రక్తములను స్వీకరించుటకు, తన క్షమను పొందుటకు క్రీస్తు మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు. పెద్దకుమారుడు, 'ఇతరులు మనకన్న ఎక్కువ' అని భావించి బాధపడ్డాడు. తండ్రి పక్షపాతం చూపిస్తున్నాడని భావించాడు. హృదయపరివర్తనం చెంది ఇంటికి తిరిగి వచ్చిన తమ్ముని ఆదరించక, తండ్రిని తప్పుబట్టాడు. కాని, దేవునిదృష్టిలో అందరమూ సమానమే. అసమానతలు, ఎక్కువ-తక్కువ, పేద-ధనిక, మొ.నవి, మన స్వార్ధము వలన ఏర్పరచుకొన్నవే! దేవుని కుటుంబములో అందరం సమానమే!
1. ఆత్మపరిశీలన చేసుకొందాం. పాపములోనున్న మనలను, దేవుడు తన కరుణతో క్షమించి స్వీకరించుటకు సిద్దముగా ఉన్నారు. క్రీస్తు పాపాత్ములను ఆదరించారు. దేవుని ప్రేమ, క్షమ మన జీవితములోనికి రావాలని ప్రార్ధన చేద్దాం. అదే ప్రేమను, క్షమను ఇతరులపై చూపునట్లు శక్తినివ్వమని ప్రార్ధన చేద్దాం. "మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు. ఆయనకు పరిశుద్దులును, ప్రియులును అయినవారు. కాబట్టి, మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరచుకొనుడు. ఎవడైనను మరియొకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగియున్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమించవలయును. మిమ్ములను ప్రభువు క్షమించునట్లుగానే, మీరు ఒకరినొకరు క్షమించవలయును. వీనికంటే అధికముగా, ప్రేమను అలవరచుకొనుడు. అది అన్నింటిని, ఐక్యముగా ఉంచగలదు" (కొలస్సీ. 3:12-14). "మీ తండ్రి వలె మీరును కనికరము కలిగి ఉండుడు" (లూకా. 6:36).
2. హృదయ పరివర్తనము చెంది, పశ్చాత్తాపముతో మన పాపాలను ఒప్పుకొని తిరిగి మరల శాంతిని, దేవుని స్నేహాన్ని పొందుదాము. దుడుకు చిన్నవాడు, తాను చేసిన తప్పును తెలుసుకొన్నాడు. పశ్చాత్తాప పడ్డాడు. హృదయ పరివర్తనముతో తండ్రి చెంతకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకొన్నాడు. తండ్రి కుమారున్ని చూసినప్పుడు, కుమారుని కళ్ళల్లో పశ్చాత్తాపాన్ని చూసాడు. అందుకే తండ్రి అతనిని కుమారునిగా అంగీకరించి, గొప్ప విందును ఏర్పాటు చేసాడు. "హృదయ పరివర్తనము చెందు పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును." మార్పు, కనువిప్పు, పశ్చత్తాపం మనకూ కలగాలి. అప్పుడే దేవుడు మనపట్ల సంతోషిస్తాడు. దేవుని చెంతకు తిరిగి రావాలని నిర్ణయించుటకు పవిత్రాత్మ శక్తికి ప్రార్ధన చేద్దాం.

No comments:

Post a Comment