23 వ సామాన్య ఆదివారము, YEAR C

23 వ సామాన్య ఆదివారము, YEAR C
సొ. జ్ఞాన. 9:13-18; ఫిలే. 9-10, 12-17; లూకా 14:25-33

క్రీస్తు - శిష్యరికం


క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా! నేడు మనం 23వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుచున్నాం. నేటి పఠనాల సందేశం నిజమైన క్రైస్తవ శిష్యరికం అంటే ఏమిటి? లేదా క్రీస్తును అనుసరించడం అంటే ఏమిటి? క్రీస్తును అనుసరించాలంటే మనం ఏమిచేయాలి? క్రీస్తు శిష్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? క్రీస్తు శిష్యులముగా, మనం మన రోజువారి జీవితాలలో ఎలా జీవించాలి? అన్న ముఖ్యమైన విషయాలను నేడు ధ్యానిస్తున్నాం.

 మన భౌతిక జీవితాలు ఎంతో ఉన్నతముగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం. మరి అలాగే, మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా ఇంకా మహోన్నతముగా ఉండాలని కోరుకోవాలి! ఆధ్యాత్మికముగా మనం ఎదగాలంటే, అభివృద్ధి చెందాలంటే, విశ్వాసము, నమ్మకము, దైవభక్తి, సోదరప్రేమ కలిగియుండాలి. దేవుని చిత్తానుసారముగా జీవించాలి. అన్నింటికన్నా ముఖ్యముగా, క్రీస్తును అనుసరించాలి. క్రీస్తును అనుసరించడమంటే, క్రీస్తులోనే మన సంపూర్ణ నమ్మకం. క్రీస్తు బోధనలను పాటించడం.

క్రీస్తునకు నిజమైన, జీవితకాలం శిష్యులముగా ఉండాలంటే, క్రీస్తు మనలనుండి ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకోవాలి. ఈనాటి సువిశేష పఠనములో అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు స్పష్టముగా తెలియజేస్తున్నారు. నేటి పఠనాలు మన జ్ఞానస్నానపు వాగ్దానాలను సవాలు చేస్తూ, దేవుని చిత్తానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని, మన జీవితాల్లో దేవునికే మొదటి స్థానం ఇవ్వాలని బోధిస్తున్నాయి. నిజమైన క్రైస్తవ శిష్యరికం అంటే ఇదే!

ప్రియ సహోదరీ సహోదరులారా! నేటి సువిశేషం క్రీస్తు శిష్యరికంగూర్చి, శిష్యులకు ఉండవలసిన లక్షణాలగూర్చి బోధిస్తుంది. ప్రభువు గ్రామాలలో, పట్టణాలలో దైవరాజ్యముగూర్చి బోధిస్తున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు, గుంపులు గుంపులుగా ఎంతోమంది ఆయనను అనుసరించారు. అయితే, వారిలో ఎంతమంది నిజమైన క్రీస్తు అనుచరులు ఉన్నారు? ఈరోజు మనం జ్ఞానస్నానముద్వారా క్రీస్తు అనుచరులం అయ్యాం. రోజూ ప్రార్ధనలు చేస్తూ ఉన్నాం. ఆరాధనలో, దివ్యపూజాబలిలో పాల్గొంటున్నాం. అయితే, మనలో ఎంతమందిమి నిజమైన క్రీస్తు అనుచరులం? ఇది తెలుసుకోవాలంటే, క్రీస్తును అనుసరించడానికి మనలనుండి ఆయన ఏమి కోరుతున్నారో తెలుసుకోవాల్సిందే!

నేటి సందేశం మనకు మన రోజువారి జీవితాలకు ఎంతో ప్రాముఖ్యం, ఎందుకంటే, ఈనాడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లు, లోకం యొక్క ఒత్తిడిల మధ్య, క్రీస్తుకు నిజమైన శిష్యులంగా ఎలా ఉండాలో ఈ పఠనాలు మనకు స్పష్టంగా మార్గం చూపిస్తున్నాయి.

1. మొదటిగా, లూకా 14:26లో ప్రభువు అంటున్నారు, “నన్ను వెంబడింపగోరి, తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు”. మన కుటుంబాన్ని, మన ప్రాణాన్ని త్యజింపాలి అని ప్రభువు కోరుచున్నారు. గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను (11:29; 12:1). యేసు యెరూషలేమునకు ప్రయాణం చేయుచున్నారు (9:51). అనగా శ్రమలు, మరణం వైపునకు (9:22; 13:31-35). మరి జనసమూహము ఏ ఉద్దేశముతో క్రీస్తును అనుసరిస్తున్నారు? రాజకీయ స్వతంత్రము కొరకా? స్వస్థత కొరకా? భోజనం కొరకా?

యేసు వెనుకకు తిరిగి వారితో ఇలా అన్నారు: నన్ను వెంబడింపగోరి, తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు, నా శిష్యుడు కానేరడు (లూకా 14:26). మన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ద్వేషించాలని కాదు. యేసు తన తల్లిదండ్రులను ఎప్పుడు ద్వేషించలేదు! వారికన్న ఎక్కువగా ప్రభువును ప్రేమించాలి అని అర్ధం. ప్రభువు తరువాతనే ఏదైనా, ఎవరైనా అని అర్ధం. ప్రభువునకు ప్రాధాన్యత ఇవ్వాలని అర్ధం. ఇదే విషయాన్ని మత్త 10:37లో చూస్తున్నాము.తన తండ్రినిగాని, తల్లినిగాని, నాకంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారునిగాని, కుమార్తెనుగాని, నాకంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. కనుక, ప్రియ సహోదరీ సహోదరులారా, క్రీస్తు శిష్యులు తమ కుటుంబముకన్న, తమ ప్రాణముకన్న, ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి. క్రీస్తును మనం సంపూర్ణముగా అనుసరించాలంటే, ఇహలోక బాంధవ్యాలను వీడి, క్రీస్తుతో బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలి. తన ప్రాణమునైనను త్యజింపనివాడు అనగా, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం; అవసరమైతే, వేదసాక్షి మరణాన్ని పొందడం.

ప్రియ సహోదరీ సహోదరులారా, మన రోజువారి జీవితంలో ప్రభువు పలికిన ఈ మాటలను మనం ఎలా జీవించాలి: “కుటుంబాన్ని త్యజించడం అంటే మన రోజువారీ జీవితంలో దాని అర్థం ఏమిటి? వాస్తవంగా కుటుంబాన్ని విడిచిపెట్టమని కాదు. దాని అసలైన భావం ఏమిటంటే: (1) దేవునికి మొదటి స్థానం ఇవ్వడం: మన జీవితంలో దేవునికి, ఆయన చిత్తానికి, ఆయన రాజ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మన కుటుంబ సభ్యుల ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పదని గుర్తించాలి. అంటే, కుటుంబ సభ్యుల కోరికలు లేదా ఆసక్తులు దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ఉన్నప్పుడు, మనం దేవుని పక్షాన నిలబడాలి. (2) దేవుని చిత్తాన్ని అనుసరించడం: దేవుడు మనలను ఏదైనా చేయడానికి పిలిచినప్పుడు, అది మన కుటుంబం అనుకుంటున్న దానికి భిన్నంగా ఉన్నప్పటికీ, మనం దేవుని మార్గాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీరు సువార్త పరిచర్య చేయాలని దేవుడు కోరుకున్నప్పుడు, మీ కుటుంబం దానికి అంగీకరించకపోయినా, మీరు ఆ పనిని కొనసాగించాలి. (3) ప్రేమలో ప్రాధాన్యతను గుర్తించడం: మనం మన కుటుంబ సభ్యులను ప్రేమించకుండా ఉండకూడదు. బదులుగా, దేవునిపై మనకున్న ప్రేమ కుటుంబ ప్రేమ కంటే చాలా గొప్పది మరియు దృఢమైనదిగా ఉండాలి. దేవుని ద్వారానే మనకు నిజమైన ప్రేమ లభిస్తుంది, ఆ ప్రేమను మనం మన కుటుంబ సభ్యులతో పంచుకోగలం. ఈ విధంగా, కుటుంబాన్ని త్యజించడం అనేది త్యాగాన్ని సూచిస్తుంది, దానిద్వారా మనం క్రీస్తు శిష్యులుగా మారడానికి అవసరమైన నిబద్ధతను కలిగి ఉంటాము. ఈ నిబద్ధతతో మనం దేవునిని అనుసరిస్తే, ఆయన మనకు, మన కుటుంబాలకు కూడా దీవెనలు కురిపిస్తారు.

అలా జీవిస్తే, మనం పొందుకొనే ప్రతిఫలం గురించి లూకా 18:29-30లో చదువుచున్నాం: “దేవుని రాజ్యము నిమిత్తము ఇంటిని, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను పరిత్యజించిన ప్రతివాడు ఇహలోకమున నిత్యజీవమును పొందును”. కుటుంబం మనకు ఎంతో విలువైనది, కానీ దేవుని పిలుపు దానికి మించినది. మన కుటుంబం, మన నిర్ణయాలు లేదా మన ఆలోచనలు దేవుని మార్గానికి అడ్డు వచ్చినప్పుడు, దేవుని వైపే నిలబడాలి. దేవుని మార్గంలో నడవాలంటే, కొన్నిసార్లు కుటుంబంతో విభేదాలు రావచ్చు లేదా మనం వారికి దూరంగా ఉండాల్సి రావచ్చు. అప్పుడు, మన విశ్వాసం కోసం ఆ బాధను స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి.

2. రెండవదిగా, లూకా 14:27లో ప్రభువు అంటున్నారు, “తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు, నాకు యోగ్యుడు కాడు (9:23). ఈ మాటలు, ఆత్మత్యాగాన్ని సూచిస్తుంది. మన సిలువను ఎత్తుకొని ప్రభువును అనుసరింపవలెను. అనగా, ప్రభువు నిమిత్తము మన ప్రాణమును ధారపోయాలి. “తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగుట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించు కొనును” అని లూకా 9:24లో చదువుచున్నాం. క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు, విశ్వాసము కొరకు ఎన్నో కష్టాలను, అవమానములను, బాధలను పొందవలసి ఉంటుంది. ఇరుకైన మార్గమున ప్రవేశించవలసి ఉంటుంది. రోమను కాలములో, సిలువ మరణం, అవమానానికి చిహ్నం. సిలువపై మరణ శిక్షను పొందెడివారు, వారి సిలువను ఎత్తుకొని వెళ్ళెడివారు. అయితే, సిలువ మరణాన్ని పొందిన క్రీస్తు, దానికి ఓ నూతన అర్ధాన్ని ఇచ్చారు. ఇప్పుడు సిలువ ప్రేమకు, క్షమకు, త్యాగానికి, దైవానుగ్రహానికి చిహ్నం. సిలువ ఎత్తుకోవడం అనగా, అది ఒక భారముగాని, అవమానముగాని కాదు. క్రీస్తును అనుసరించుటకు, మనలను మనం త్యజించుకోవడము. ప్రేమతో, ఓర్పుతో, క్షమతో, త్యాగముతో జీవించడం.

ఆనాటి ప్రజలు, యేసును రాజుగా భావించారు. రోమనులపై జయించి, ఒక నూతన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడని భావించారు. ఆ రాజ్యము త్వరలోనే అవతరింపనున్నదని వారు తలంచారు (లూకా 19:11). అయితే, ఎప్పుడైతే యేసు తాను అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, మరణాన్ని పొందవలసి యున్నారని బోధించినప్పుడు (లూకా 9:22), అనేకమంది ఆయనను తృణీకరించారు. వారి ఆలోచనలను, పద్ధతులను, కోరికలను ప్రభువు కొరకు విడనాడలేక పోయారు. అంతా మంచిగా, సాఫీగా సాగుతున్నప్పుడు, క్రీస్తును అనుసరించడం సులభమే! కాని, కష్టాలు, బాధలు, అవమానములు, సమస్యలు వచ్చినప్పుడు మన అనుసరణ ఎంత సత్యమో తెలుస్తుంది! ఆయనను అనుసరించువారు, లోకమున కష్టాల పాలగుదురని, ప్రభువే చెప్పియున్నారు (యోహాను 16:33). లూకా 9:57-62 లో చూస్తున్నట్లుగా, ముగ్గురు వ్యక్తులు క్రీస్తును అనుసరించాలని ఎంతో ఉత్సాహముతో వచ్చారు. కాని, దానికి కావలసినటువంటి త్యాగాన్ని వారు చేయలేక పోయారు.

ప్రియ సహోదరీ సహోదరులారా, మన రోజువారి జీవితములో, ప్రభువు పలికిన ఈ మాటలను మనం ఎలా జీవించాలి: సిలువను ఎత్తుకోవడం అంటే శారీరకంగా ఒక పెద్ద బరువును మోయడం కాదు. దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం చాలా లోతైనది.

మొదటిగా, ఆత్మత్యాగం మరియు స్వార్థాన్ని విడిచిపెట్టడం: సిలువను ఎత్తుకోవడం అంటే, మన స్వంత కోరికలు, సుఖాలు, స్వార్థపూరితమైన ఆలోచనలను విడిచిపెట్టడం. క్రీస్తు మన కోసం తనను తాను త్యాగం చేసుకున్నారు. అదేవిధంగా, మనం కూడా మన స్వంత ఆశలను, ప్రణాళికలను దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఉదాహరణ: మీరు ఎవరిపైనైనా కోపంగా ఉన్నప్పుడు, ఆ కోపాన్ని మనసులో పెట్టుకోకుండా, క్షమించడానికి ప్రయత్నించడం. మనకు ఇష్టం లేకపోయినా, పేదవారికి లేదా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి ముందుకు రావడం.

రెండవదిగా, కష్టాలను సహనంతో స్వీకరించడం: క్రీస్తును అనుసరించినప్పుడు మన జీవితంలో సమస్యలు, బాధలు, అవమానాలు రావచ్చు. ఇవి కూడా మన సిలువలో భాగమే. వీటిని మనం ఓర్పుతో, విశ్వాసంతో ఎదుర్కోవాలి. సమస్యల నుండి పారిపోకుండా, వాటిని దేవుని మహిమ కొరకు స్వీకరించాలి. ఉదాహరణ: మీ విశ్వాసం కోసం ఇతరుల నుంచి వ్యతిరేకత లేదా విమర్శ ఎదురైనప్పుడు, దానిని ధైర్యంగా ఎదుర్కొని, దేవునిపై మీ నమ్మకాన్ని కొనసాగించాలి. కుటుంబంలో లేదా ఉద్యోగంలో ఎదురయ్యే కష్టాలను, దేవునిపై ఆధారపడి సహనంతో భరించడం.

మూడవదిగా, దేవునిపట్ల నిబద్ధత కలిగి జీవించడం:సిలువను ఎత్తుకోవడం అనేది కేవలం ఒక్కరోజు చేసే పని కాదు. అది మన జీవితాంతం కొనసాగే ఒక నిబద్ధత. ప్రతి రోజు మనం చేసే పనులు, ఆలోచనలు, నిర్ణయాలు దేవునికి మహిమ కలిగించేవిగా ఉండాలి. ఉదాహరణ: ప్రతిరోజు ప్రార్థన, బైబులు పఠనంలో సమయం గడపాలి. మీ పనులు, మాటల ద్వారా క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించాలి. సిలువను ఎత్తుకోవడం అంటే మన కష్టాల ద్వారా క్రీస్తుతో ఐక్యమవ్వడం. ఈ ప్రక్రియలో మనల్ని మనం దేవునికి పూర్తిగా సమర్పించుకుంటాము. ఈ మార్గంలో మనం నడిచినప్పుడు, దేవుడు మనకు బలం ఇస్తారు మరియు ఆశీర్వదిస్తారు.

3. ప్రియ సహోదరీ సహోదరులారా, ఇక మూడవదిగా, లూకా 14:33లో, “తన సమస్తమును త్యజియించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు” అని ప్రభువు పలుకుతున్నారు. అనగా మన సంపదలను త్యజింపాలి. సమస్తమును త్యజించడం అనగా అన్నీ వదలి అనామకముగా జీవించడము కాదు. పేదరికంలో జీవించాలని కాదు. మనకున్న సంపదలపై వ్యామోహాన్ని విడనాడాలి. ఇహలోక సంపదలపై అత్యాశను విడనాడాలి. భౌతిక సంపదలు దేవుని కంటే ముఖ్యమైనవిగా మారకుండా చూసుకోవాలి. పరలోక సంపదలపై మన దృష్టిని సారించాలి. మనకున్న దానిని ఇతరులతో పంచుకోవాలి. పొరుగు వారిని ప్రేమించాలి. న్యాయం కోసం కృషి చేయాలి. మత్త 19:21లో ప్రభువు పలికిన మాటలను గుర్తుచేసుకుందాం, నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము. అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము”. అలాగే, లూకా 12:15లో ఇలా ప్రభువు ఇలా చెప్పుచున్నారు, “జాగరూకత వహింపుడు. ఎట్టి లోభమునకును లోనుకాకుడు. ఏలయన, మానవ జీవితము సిరిసంపదల సమృద్దిలో లేదు”.

ప్రియ సహోదరీ సహోదరులారా, మన రోజువారీ జీవితంలో మనకున్న సంపదలను త్యజించాలి” అన్న మాటలను మనం ఎలా జీవించాలి:

మొదటిగా, దాతృత్వం మరియు పంచుకోవడం: మనకున్న సంపదలో కొంత భాగాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలి. ఇది డబ్బు రూపంలోనే కాకుండా, మన సమయాన్ని, తెలివిని, వనరులను కూడా పంచుకోవచ్చు. ఉదాహరణకు: నిరుపేదలకు ఆహారం, బట్టలు ఇవ్వడం. నిస్సహాయులకు సహాయం చేయడం. అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించడం.

రెండవదిగా, వస్తు వ్యామోహాన్ని విడిచిపెట్టడం: మనం కొత్త వస్తువుల మీద లేదా విలాసవంతమైన జీవితం మీద అధికంగా ఆసక్తిని చూపకూడదు. డబ్బును అనవసరమైన వాటిపై ఖర్చుచేయకుండా, దేవుని రాజ్యానికి, ఇతరులకు సహాయపడటానికి ఉపయోగించాలి.

మూడవదిగా, దేవునిపై ఆధారపడటం: మన సంపద మన భద్రతకు మూలం అని భావించకుండా, దేవుడే మనకు ఆశ్రయం, భద్రత అని విశ్వసించాలి. మన అవసరాలను తీర్చడానికి దేవుడు ఉన్నాని మనం నమ్మాలి. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా, దేవుడు మనకు మార్గం చూపిస్తాని ప్రార్థించాలి. ఈ విధంగా, సంపదను త్యజించడం అంటే మన హృదయాలను సంపదల నుంచి వేరుచేసి, దేవునిపై సంపూర్ణంగా కేంద్రీకరించడం. మనం ఈ లోకంలోని సంపదలపై వ్యామోహం లేకుండా, పరలోకంలోని నిత్య జీవితానికి విలువ ఇవ్వాలని ఈ వాక్యం బోధిస్తుంది.

ప్రియ సహోదరీ సహోదరులారా, నేడు క్రీస్తు శిష్యులు కానేరని వారు ఎవరంటే, దేవుని వాక్యాన్ని చదివి, విని దానిని పాటించనివారు; అటువంటివారు క్రీస్తు శిష్యులు కానేరరు. శ్రమలను భరించలేనివారు శిష్యులు కానేరరు. సువార్తను బోధించి పాటించనివారు, శిష్యులు కానేరరు. కనుక, క్రీస్తును అనుసరించడం అనగా, ఆయనకు ప్రధమ స్థానాన్ని ఇవ్వడం. క్రీస్తును అనుసరించడం అనగా, సంపూర్ణ పరిత్యాగం. నిత్యజీవితానికి ఏ ఆటంకాన్నైనను మనం తీసివేయాలి. లూకా 16:13లో “మీరు దైవమును, ద్రవ్యమును సేవింప లేరు” అని చదువుచున్నాం. కనుక, ఇహలోక వ్యామోహాలలో జీవిస్తూ, పాపములో జీవిస్తూ మనం క్రీస్తును అనుసరించలేము. ఆయన శిష్యులు కానేరము. కనుక, మనలో పరివర్తన కలగాలి.

క్రీస్తును అనుసరించుటకు తగిన విధముగా మనం సిద్ధపడాలి. యేసును అనుసరించడం అనేది అంత తేలికగా తీసుకొనే నిర్ణయం కాదు! ఈ విషయాన్ని ప్రభువు రెండు ఉపమానములతో స్పష్టముగా వివరించారు (లూకా 14:28-32). మొదటిది,

గోపురము కట్టువాడు దానిని పూర్తి చేయుటకు తగిన వ్యయము ఉన్నదా లేదా అని ఆలోచింపడా? ఈ ఉపమానం, క్రైస్తవ శిష్యరికంలో మనకు కావలసిన ముందుచూపు మరియు నిబద్ధత గురించి తెలియజేస్తుంది. ఈ ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, క్రీస్తును అనుసరించడం అనేది ఒక గొప్ప నిర్ణయం, దీనికి తగినంత సంసిద్ధత మరియు త్యాగం అవసరమని తెలియజేస్తుంది. క్రీస్తు శిష్యులుగా మారాలనుకునేవారు, దానివల్ల వచ్చే కష్టాలు, సవాళ్లు మరియు త్యాగాలను ముందుగానే లెక్కించుకోవాలి. గోపురము కట్టడం మొదలుపెట్టి పూర్తి చేయకుండా ఆపేయడం ఎలాగైతే అవమానమో, అలాగే క్రీస్తును అనుసరించడం మొదలుపెట్టి మధ్యలో ఆపేయడం కూడా అంతే. క్రీస్తు శిష్యరికం అనేది జీవితాంతం కొనసాగే ఒక ప్రయాణం. దానికి స్థిరమైన నమ్మకం మరియు ఓర్పు అవసరం. ఈ ఉపమానంలో, వ్యయమును లెక్కించకుండా మొదలుపెట్టిన వ్యక్తిని చూసి ఇతరులు ఇతడు ఆరంభశూరుడేకాని కార్యసాధకుడు కాలేక పోయెను” అని వెక్కిరిస్తారు. అలాగే, దేవుని మార్గంలో నిబద్ధత లేకపోతే, మన విశ్వాసం అవమానానికి గురవుతుంది. ఈ ఉపమానం ద్వారా క్రీస్తు మనకు చెప్పదలుచుకున్న సందేశం ఏమిటంటే, క్రీస్తును అనుసరించాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు, దానికి అవసరమైన త్యాగానికి, కష్టాలకు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఈ మార్గం సులభమైనది కాదు, కానీ పూర్తి నిబద్ధతతో ముందుకు వెళ్తేనే నిత్యజీవపు ప్రతిఫలం లభిస్తుంది.

రెండవది, యుద్ధమునకు వెళ్ళు రాజు తన దగ్గర కావలిసినంత సైన్యము, బలగము ఉన్నదా లేదా అని  ఆలోచింపడా? ఈ ఉపమానం, క్రీస్తును అనుసరించేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. యుద్ధానికి వెళ్లే రాజు ఎలాగైతే తన శక్తిని, బలగాన్ని అంచనా వేసుకుంటాడో, అదేవిధంగా క్రైస్తవ శిష్యులు కూడా తమ ఆధ్యాత్మిక ప్రయాణానికి అవసరమైన నిబద్ధత, బలం ఉన్నాయో లేదో తెలుసుకోవాలని ఈ ఉపమానం బోధిస్తుంది. క్రీస్తును అనుసరించే మనం కూడా మనకు ఎదురయ్యే ఆధ్యాత్మిక యుద్ధంలో మన శత్రువైన సాతాను బలం ఎంత ఉందో తెలుసుకోవాలి. క్రీస్తు శిష్యులుగా మారాలంటే, శత్రువైన సాతానుపై విజయాన్ని సాధించాలంటే, మనకు దేవుని సహాయం, పవిత్రాత్మ బలం అవసరమని గుర్తించాలి. ఈ ఉపమానం ద్వారా, క్రీస్తును అనుసరించడం అనేది ఒక చిన్నపాటి ప్రయాణం కాదు, ఇది ఒక యుద్ధం లాంటిదని యేసు హెచ్చరిస్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో గెలవాలంటే, మనం పూర్తిగా క్రీస్తుకు కట్టుబడి ఉండాలి. లేకపోతే, మనం ఓడిపోతాం. కాబట్టి, క్రీస్తు శిష్యులుగా మనం అన్ని పరిస్థితులకు, సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. ఆయనను అనుసరించడానికి, మన సర్వస్వాన్ని ధారపోయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం దేవునితో కలిసి ఈ యుద్ధంలో విజయం సాధించగలం.

మొదటి పఠనం: క్రీస్తును అనుసరించుటకు కావలసిన ధృడనిర్ణయాన్ని తీసుకోవడానికి మనకు దైవజ్ఞానం ఎంతో అవసరం. ఈ దైవజ్ఞానాన్ని కేవలం పవిత్రాత్మ మాత్రమే మనకు ఇవ్వగలదు. అందుకే, నేటి మొదటి పఠనంలో ఇలా వింటున్నాం, నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గమునుండి నీ పవిత్రాత్మమును పంపిననే తప్ప, నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడు? ఈ రీతిన నీవు దయచేసిన జ్ఞానముద్వార భూమి మీది నరులు ఋజుమార్గమున నడచుచున్నారు. నీకు ప్రీతికరమైన కార్యము ఏదో తెలుసుకొనుచున్నారు (సొ.జ్ఞాన. 9:17-18). కనుక, క్రీస్తుకు నిజమైన శిష్యులుగా జీవించుటకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ నుండి వివేచన, బలం కోసం ప్రార్థించాలి.

క్రీస్తు చెప్పిన విధముగా పవిత్రాత్మ శక్తి, మనకు మార్గము, సత్యము, జీవము గూర్చి తెలియజేయును. దేవున్ని సంతృప్తి పరచుట ఎలాగో మనకు తెలియ జేయును. మరియు ఆత్మయొక్క దైవజ్ఞానము ద్వారా మనము రక్షింపబడుదము. ఆత్మశక్తిద్వారా మనం మరల నూతనముగా జన్మించియున్నాము. మనం ఆత్మశక్తిచేత నడిపింపబడుచున్నాము. కనుక, క్రీస్తును అనుసరించుటకు నిత్యము ప్రార్ధన చేయాలి.

చివరిగా, క్రీస్తు శిష్యులముగా కొనసాగాలంటే, 1. ప్రతీ దినము ప్రార్ధన చేయాలి. 2. ఆదివార దివ్య పూజాబలిలో పాల్గొని, దివ్యసత్ప్రసాదాన్ని యోగ్యరీతిన స్వీకరించాలి. 3. దివ్యగ్రంధ పఠనం చేయాలి. 4. సేవాపూరిత జీవితాన్ని జీవించాలి. 5. అందరితో ఆధ్యాత్మిక స్నేహాన్ని చేయాలి. 6. దైవకార్యము కొరకు మన సమయాన్ని, శక్తిని వెచ్చించాలి.

నేటి రెండవ పఠనంలో, క్రీస్తుకు నిజమైన శిష్యునికి విరక్తత్వము, త్యాగం చాలా అవసరమని బోధిస్తుంది. క్రీస్తుకు బాధ్యతాయుతమైన అపోస్తలుడిగా, ఉత్సాహవంతుడైన శిష్యుడిగా, పౌలు తన కొత్త సహాయకుడు నేసిము యొక్క సేవను వదులుకొని, అతని యజమాని వద్దకు తిరిగి పంపవలసి వచ్చింది. అదేవిధంగా, క్రీస్తుకు నూతన శిష్యుడిగా నేసిము పౌలును విడిచిపెట్టి, పారిపోయిన బానిసగా తన యజమానిని ఎదుర్కొని, దాని పర్యవసానాలను అంగీకరించాల్సి వచ్చింది.

ప్రియ సహోదరీ సహోదరులారా, క్రైస్తవ శిష్యరికపు సవాలును మనం గొప్ప నిబద్ధతతో స్వీకరించి, ఆచరణలో పెట్టాలి. ఇది ఈ క్రింది విధాలుగా సాధ్యమవుతుంది:

మొదటిగా, ప్రార్థన ద్వారా: ప్రతిరోజూ దేవునితో మాట్లాడటం, బైబిల్ పఠనం, ధ్యానం ద్వారా ఆయన మాట వినడం వంటివి చేయడం ద్వారా మన ఆధ్యాత్మిక శక్తిని పునరుద్ధరించుకోవాలి.

రెండవదిగా, దివ్య సత్ప్రసాదంలో భాగస్వామ్యం ద్వారా: తరచుగా దివ్యసత్ప్రసాద వేడుకల్లో పాల్గొనడం వల్ల దేవుని జీవితంలో మనం పాలుపంచుకోవచ్చు. అలాగే, మనం పాపం చేసినప్పుడు, ఆయనకు దూరం అయినప్పుడు సమాధాన దివ్యసంస్కారంను కృతజ్ఞతతో స్వీకరించాలి.

మూడవదిగా, విరక్తత్వము మరియు త్యాగం ద్వారా: చెడు అలవాట్లను వదిలి, విరక్తత్వం మరియు త్యాగ భావనలను అలవరచుకోవాలి.

నాలుగవదిగా, సేవ ద్వారా: మన సమయాన్ని, ప్రతిభను, వనరులను విశ్వవ్యాప్తమైన సంఘానికి, ముఖ్యంగా మన విచారణ సంఘంలో దేవుని సేవకోసం దాతృత్వంతో ఉపయోగించాలి. ఈ విషయంలో పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంపై ఆధారపడాలి.

ఐదవదిగా, ప్రేమ, దయ ద్వారా: అణగారిన వారితో సహా దేవుని బిడ్డలందరినీ ప్రేమించాలి. వినయం, నిస్వార్థంతో దయ, కరుణ, క్షమ, సేవ వంటి పనులను చేయాలి.

ఆరవదిగా, బాధ్యతతో కూడిన జీవనం ద్వారా: మన వృత్తిలో, జీవితంలో మనకు అప్పగించిన బాధ్యతలను, విధులను నిబద్ధతతో నెరవేర్చాలి. ఉదాహరణకు, వివాహంలో విశ్వాసంగా ఉండటం, మన జీవితంలో, వృత్తిలో న్యాయానికి కట్టుబడి ఉండటం.

ఆత్మపరిశీలన చేసుకుందాం: ఈ రోజు నేను నా జీవితంలో క్రీస్తుకు మొదటి స్థానం ఇస్తున్నానా? లేదా నా కుటుంబం కంటే దేవున్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానా? క్రీస్తుకు నిజమైన, నిబద్ధత కలిగిన శిష్యులముగా జీవించుటకు కావలసిన వరమును, శక్తిని, బలమును, పవిత్రాత్మ శక్తిని ఒసగమని ప్రార్ధన చేద్దాం!


No comments:

Post a Comment