19వ సామాన్య ఆదివారము, YEAR C

19వ సామాన్య ఆదివారము, YEAR C
సొ. జ్ఞాన. 18: 6-9; హెబ్రీ 11:1-2, 8-19; లూకా 12:32-48
ప్రభువు రాకడ - మన సంసిద్ధత

ఉపోద్ఘాతం: మన జీవితం ఒక ప్రయాణం. మన గమ్యం ఎటువైపో మనకు తెలియదు, అయినా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అయితే, ఈ ప్రయాణం చివరన, క్రీస్తును కలుసుకుంటామనేది వాస్తవం, ఖచ్చితం! మనలను కలుసుకొనుటకు, తన రాజ్యములోనికి మనలను ఆహ్వానించుటకు ప్రభువు సిద్ధముగా ఉంటారు. అది ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు, కనుక ఎల్లప్పుడు జాగరూకులమై, సంసిద్దులమై జీవించాలి. సంసిద్ధత యనగా, ప్రతీక్షణం క్రీస్తు కొరకే జీవించడం! అలా జీవిస్తే, ఏ క్షణములోనైనా ప్రభువును కలుసుకొనుటకు సిద్ధపడినవారమవుతాము. ఈ సంసిద్ధత మనం రోజు కలుసుకొను వారిపట్ల మన సేవా జీవితముపై కూడా ఆధారపడి యుంటుంది. “ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితిరి” (మత్త 25:40) అని ప్రభువు చెప్పియున్నారు. కనుక, ప్రతీరోజు మనకు అప్పగించబడిన బాధ్యతలను నెరవేర్చాలి. ఇతరులతో సఖ్యతతో, శాంతితో జీవించాలి. తద్వారా, ప్రభువు రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి. అలాగే, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఉన్నను, ప్రభువు జీవితానికి, ఆయన ప్రేషిత కార్యానికి కట్టుబడి జీవించాలి. విశ్వసనీయత కలిగి జీవించాలి.విశ్వసనీయత అనగా నిబద్ధత కలిగి జీవించడం.

ప్రసంగం: సృష్టి ఆరంభమునుండి దేవుడు మానవునికి ఎన్నో వాగ్దానాలను, ఒప్పందాలను చేస్తూ, వాటిని కార్యరూపణ దాల్చుతూ ఉన్నారు. ఆ దేవుని వాగ్దానాలను దృఢముగా విశ్వసించాలి అనేది ఈనాటి పఠనాల సారాంశం. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశములో ఫరోరాజు బానిసత్వములో ఉన్నప్పుడు, దేవునిపట్ల, దేవుని వాగ్దానాలపట్ల వారి విశ్వాసమే వారిని మోషే నాయకత్వములో స్వాతంత్రాన్ని పొందగలిగేలా చేసింది. తద్వారా వారు వాగ్దత్త భూమికి నడిపించబడినారు.

జ్ఞానగ్రంథం 18:6-9లోని మొదటి పఠనం, ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయుల విడుదల గురించి మనకు అద్భుతమైన చిత్రాన్ని చూపిస్తుంది. ఆ చివరి రాత్రి, దేవుడు ఐగుప్తీయుల మొదటి సంతానాన్ని శిక్షించినప్పుడు, ఇశ్రాయేలీయులు తమ ఇళ్లలో గడియలు వేసుకుని ఉన్నారు. ఇది కేవలం భద్రత కోసం తీసుకున్న చర్య కాదు, ఇది గొప్ప విశ్వాస ప్రకటన. బయట ఏం జరుగుతుందో వారికి తెలియదు. వారు చూసింది ఏమీ లేదు. అయినా, దేవుడు తమను రక్షిస్తాడని, వాగ్దానం చేసిన విధంగా వారిని విముక్తులను చేస్తాడని వారు లోతైన నమ్మకంతో ఉన్నారు. వారి నమ్మకం, వారిని దాక్కుని ఉండటానికి బదులు, దేవుని రక్షణ కోసం ఎదురుచూసేలా చేసింది. ఈ ఎదురుచూపు వారికి ఒకరినొకరు ధైర్యం చెప్పుకోవడానికి ఉపయోగపడింది. “సమయం వచ్చినప్పుడు దేవుడు మనలను రక్షిస్తాడు” అని వారు ఒకరికొకరు చెప్పుకున్నారు.

ఇది మనకు విశ్వాసం అంటే ఏమిటో ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. విశ్వాసం అంటే మనం చూడలేని విషయాలపై ఒక దృఢమైన నిశ్చయం. కష్టాలు వచ్చినప్పుడు, భవిష్యత్తు అంధకారంగా అనిపించినప్పుడు, మన కళ్ళకు ఏమీ కనిపించకపోయినా, దేవుని వాగ్దానంపై ఆధారపడటమే విశ్వాసం. ఇశ్రాయేలీయుల విశ్వాసం వారికి రాత్రి చీకటిలో ఒక మార్గదర్శి లాగా, వారి కష్టాల్లో ఒక స్థిరమైన ఆధారంలా నిలిచింది. అదేవిధంగా, మన జీవితాల్లో కూడా, మనం భయపడకుండా దేవుని శక్తిని, ఆయన ప్రేమను నమ్మితే, ఆయన మనకు ఆశ మరియు బలాన్ని ఇస్తాడు.

రెండవ పఠనము హెబ్రీ 11:1-2, 8-19 లో విశ్వాసం యొక్క నిజమైన అర్థం మరింత లోతుగా వివరించబడింది. బైబిలు విశ్వాసాన్ని ఒక అద్భుతమైన వాక్యంతో నిర్వచిస్తుంది; విశ్వసించుటయన, “మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట; మనము చూడజాలని విషయములనుగూర్చి నిశ్చయముగా ఉండుట” అని చదువుచున్నాము. దీని అర్థం ఏమిటంటే, మనం చూడని లేదా ఇంకా జరగని విషయాలపై మనకు గట్టి నమ్మకం ఉండటమే విశ్వాసం. ఇది కేవలం ఆశ కాదు, అది ఒక వాస్తవం లాగా దృఢంగా నమ్మడం.

ఈ విశ్వాసానికి గొప్ప ఉదాహరణ అబ్రహాము. దేవుడు అతన్ని తన సొంత దేశాన్ని, బంధువులను వదిలి, తెలియని ఒక ప్రదేశానికి వెళ్ళమని పిలిచాడు. అబ్రహాము ఏమాత్రం సందేహించలేదు. అతనికి ఎలాంటి ఆలోచన లేదు, ఎక్కడ ఉంటున్నాడో తెలియదు, కానీ దేవుని మాటపై నమ్మకం ఉంచి బయలుదేరాడు. స్వదేశమును విడచి, దేవుడు వాగ్దానము చేసిన శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరియున్నారు. “విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము” (హెబ్రీ 11:6). ఇది ఎంత గొప్ప విశ్వాసం! అబ్రహాము ఒక అజ్ఞాత ప్రదేశానికి ప్రయాణించాడు, ఎందుకంటే అతనికి దేవుని వాగ్దానంపై పూర్తి విశ్వాసం ఉంది. దేవుడు అతనికి ఒక గొప్ప జాతిని వాగ్దానం చేసినప్పటికీ, ఆ వాగ్దానం నెరవేరడం చూడకుండానే అతను చనిపోయాడు. అయినా, అతను దేవుని వాగ్దానంపై నమ్మకాన్ని ఎన్నడూ కోల్పోలేదు.

అబ్రహాము యొక్క విశ్వాసం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది: విశ్వాసం తక్షణ ఫలితాల కోసం కాదు. కొన్నిసార్లు దేవుని వాగ్దానాలు మన జీవితకాలంలో పూర్తిగా నెరవేరకపోవచ్చు. అయినప్పటికీ, దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని మనం నమ్మాలి. అబ్రహాము లాగే, మనం కూడా దేవునిపై నమ్మకంతో మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆయన వాగ్దానాల కోసం నిరీక్షిస్తూ, అదృశ్యమైన వాటిపై నిశ్చయంగా ఉండాలి. “పూర్వాకాలపు మనుజులు, తమ విశ్వాసము చేతనే, దేవుని ఆమోదము పొందిరి. కంటికి కనిపింపని వానినుండి, కంటికి కనిపించునట్లుగా, దేవుని వాక్కుచేత ప్రపంచము సృజింపబడినదని, విశ్వాసము వలన మనకు అర్ధమగుచున్నది” (హెబ్రీ. 11:2-3).

సువిశేష పఠనములో, ఈ విశ్వాసాన్ని మన రోజువారీ జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో యేసు సువార్తలో వివరించారు. తన రాజ్యములో శాశ్వత ఆనందమును ఒసగు దేవుడు వాగ్దానమందు విశ్వసించవలెనని యేసు తన శిష్యులను కోరుచున్నారు. అయితే, దానికొరకు ఎల్లప్పుడూ సిద్దముగా ఉండాలి. ఎందుకన, మనుష్యకుమారుడు ఏ ఘడియలో వచ్చునో ఎవరికినీ తెలియదు. యజమాని-సేవకుని ఉపమానము ద్వారా, మనము ఎల్లప్పుడూ ప్రేమాజ్ఞకు విధేయులై, ఇతరులకు విధేయతాపూర్వకమైన సేవలనందిస్తూ, దేవుని చిత్తమును నెరవేర్చవలయునని గుర్తుచేయుచున్నారు. యజమాని-దొంగ ఉపమానముద్వారా, మనం, ఎల్లప్పుడూ జాగరూకులై ఉండాలని, తద్వారా, దొంగ (సాతాను, శోధనలు) దైవానుగ్రహమైన మన సంపదను దోచుకోలేడు అని బోధిస్తూ ఉన్నారు.

ప్రభువును చవిచూచుటకు మనము ఎల్లప్పుడూ జాగరూకులై ఉండాలి. జాగరూకులై ఉండుటకు మనము నిత్యమూ ప్రార్ధన చేయాలి. ప్రార్ధనలో దేవున్ని ఆలకించాలి. దేవుని “మెల్లని స్వరమును” (1 రాజు 19:12) ప్రార్ధనలో వినగలగాలి. ఆ మెల్లని స్వరమును వినాలంటే, ప్రతీ రోజు మన ప్రార్ధన సమయాన్ని ప్రశాంతతో గడపాలి. ఈ ప్రశాంత వేళలోనే దేవుని స్వరమైన ప్రేమను, స్నేహాన్ని, శాంతిని వినుటకు మన వీనులను ట్యూన్ చేసుకోవచ్చు. “వినుము! నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును. వానితో భుజింతును. అతడును నాతో భుజింతును" (దర్శన 3:20).

క్రీస్తు రాకకై మనం ఎల్లప్పుడూ ఎదురు చూడవలయును. క్రీస్తు రాకకై ఎదురు చూడటమనగా, దేవుని రాజ్యము కొరకు పనిచేయడమే. అనగా, ఇతరులకు సేవచేయడముద్వారా, పేదరికాన్ని పోరాడటముద్వారా, మనలను విభజించే ద్వేషాన్ని తొలగించడముద్వారా, శాంతిని వ్యక్తుల మధ్య, దేశాల మధ్య స్థాపించడముద్వారా, ఇతరులను గౌరవించే సమాజాన్ని నిర్మించుట వలన దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే!

చేసిన వాగ్దానాలను అక్షరాల నెరవేర్చువారు మన తండ్రి దేవుడు. ఆయనయందు, ఆయన వాగ్దానాలయందు దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉందాము. ఆ విశ్వాసము ప్రతీక్షణం అధికమధికమవ్వాలంటే, మన జీవితములో ప్రశాంత క్షణాలతో కూడిన ప్రార్ధన ఎంతో అవసరము. ప్రార్ధనలో దేవుని స్వరమును వినుటద్వారా, ఆయన చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటయే, ఆయనలో జీవించడం. ఆయన రాజ్యము కొరకు జీవించడము. విశ్వాసులుగా, దేవుడు వాగ్దానము చేసిన శాశ్వత ఆనందాన్ని పొందాలంటే, ఇలాంటి జీవితము అవసరమని తెలుసుకొందాం!

ముగింపు: మనమందరం ఈ లోకంలో ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాము. మనకు ఎప్పుడు దేవుని పిలుపు వస్తుందో తెలియదు, కానీ మనం సిద్ధంగా ఉండాలి. ఇది కేవలం వేచి ఉండటం కాదు, కానీ దేవుని పనిని నమ్మకంగా చేయడం. సువార్తలో, యేసు “నమ్మకమైన మరియు వివేకవంతమైన గృహ నిర్వాహకుడి” గురించి చెప్పారు. ఈ నిర్వాహకుడు తన యజమాని లేనప్పుడు కూడా బాధ్యతతో తన పనిని కొనసాగించాడు.

మన జీవితంలో మనకు దేవుడు కొన్ని బాధ్యతలను అప్పగించాడు - కుటుంబం, పని, సమాజం. వీటిని మనం దేవుని కోసం చేస్తున్నట్లుగా భావించాలి. మనం మంచిగా ఉన్నా, చెడ్డగా ఉన్నా దేవుడు మనల్ని ఒక రోజు ప్రశ్నిస్తాడు. మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామా లేదా అని కాదు, మనం ఆయన కోసం ఎంత నమ్మకంగా పని చేశామో దేవుడు చూస్తాడు.

కాబట్టి, ప్రియమైన సహోదర సహోదరీలారా, మనం మన విశ్వాసాన్ని అబ్రహాములా, ఇశ్రాయేలీయులలా, ఆ సేవకులలా చూపిద్దాం. మనం దేవుని కోసం వేచి ఉండటాన్ని ఒక భారంగా కాకుండా, ఒక సంతోషకరమైన నిరీక్షణగా భావిద్దాం. మన హృదయాలను దేవుని సంపద వైపు మరల్చుదాం. మరియు మనం మన బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తిద్దాం.

No comments:

Post a Comment