తపస్కాల మూడవ ఆదివారము, Year C
నిర్గమ 3:1-8, 13-15; 1 కొరి 10:1-6, 10-12; లూకా 13:1-9
హృదయ పరివర్తనము
“హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరు అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను" (లూకా 13:3, 5).
ఈనాటి మొదటి పఠనము యొక్క నేపధ్యం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. వారు దేవునికి మొరపెట్టుకోగా వారి ఆక్రందన దేవుని చెవిన బడింది. అదేసమయములో ఒకప్పుడు ఐగుప్తునుండి పారిపోయి వచ్చిన మోషే మిద్యానులో గొర్రెలు కాసుకుంటూ, తన మామ యిత్రో వద్ద ఉన్నాడు. హోరేబు పర్వతం (దేవుని పర్వతం) దగ్గర మోషేకు దేవుడు మండుతున్న పొదలో ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తననుతాను అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవుడిగా పరిచయం చేసుకుంటాడు మరియు ఇశ్రాయేలీయుల బాధలను చూశానని, వారిని ఐగుప్తు నుండి విడిపించడానికి వచ్చానని చెబుతాడు. మోషేతో దేవుడు తాను “నేను ఉన్నవాడను” అని తన నామాన్ని తెలియజేసాడు. దేవుడు మోషేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి, వారిని ఐగుప్తు నుండి విడిపించడానికి తనను పంపాడని చెప్పమని ఆజ్ఞాపిస్తాడు.
ఈవిధముగా, ప్రభువు మోషేను తన పనికొరకు, తన ప్రజలకొరకు, వారి విముక్తికొరకు పిలుచుచున్నారు, ఎన్నుకొంటున్నారు. మోషే యొక్క బలహీనతలను తెలిసికూడా అతనిని తన కార్యమునకై ఎన్నుకొంటున్నారు. బలహీనుడైన మోషేను, బలపరచి తన ప్రజల యొద్దకు పంపుతున్నారు. ఎందుకంటే, బలహీనుడైన అతడే తన ప్రజల బలహీనతలను బాగా అర్ధం చేసుకోగలడని ప్రభువు యొక్క నమ్మకం. పిలచిన అతన్ని మలస్తున్నారు, తన సేవకుడిగా మార్చుకొంటున్నారు. అతనికి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. “బలహీన సమయమందు బలపరచుటకు నేనున్నాను” అని ధైర్యమును నూరిపోస్తున్నారు. అందుకే, తననుతాను ఉన్నవాడుగా బయలు పరచుకొంటున్నారు. అందుకే ప్రభువు, “నా ప్రజల బాధను చూచాను, వారి ఆక్రందనను విన్నాను, వారు వేదనను తెలుసుకొన్నాను” అని పలుకుతున్నారు.
బాధలలో ఉన్న తన ప్రజలకు ప్రేమతో స్నేహాస్తాన్ని అందిస్తున్నారు. మోషేద్వారా, వారిని తిరిగి తన అక్కున చేర్చుకొనడానికి ప్రయత్నిస్తున్నారు. ‘పెక్కు విధములుగా, పెక్కు మార్లు’ (హెబ్రీ 1:1) తన ప్రజలు తనతో ఉండాలని ఆశించి, వారిని పిలుస్తున్నారు.
మొదటి పఠనము నుండి మనం నేర్చుకోవలసిన సందేశం ఏమిటంటే, దేవుడు తన ప్రజల బాధలను చూస్తాడు మరియు వారిని విడిపించడానికి చర్యను తీసుకుంటాడు. ఇశ్రాయేలీయులు బానిసలుగా బాధపడుతున్నప్పుడు, దేవుడు వారిని విడిపించడానికి మోషేను పంపాడు. దేవుడు పరిశుద్ధుడు మరియు మన ఆరాధనను కోరుతాడు. మోషేను తన చెప్పులు విప్పమని చెప్పడం ద్వారా, దేవుడు తన పరిశుద్ధతను మరియు మన వినయాన్ని చూపించాడు. దేవుడు తనను తాను “నేను ఉన్నవాడను” అని వెల్లడి చేసుకుంటాడు. ఈ పేరు దేవుని శాశ్వతమైన మరియు స్వయం సమృద్ధిగల స్వభావాన్ని సూచిస్తుంది. దేవుడు మనలను తన ప్రణాళికలో భాగం చేసుకోవడానికి పిలుస్తాడు. మోషే మొదట భయపడినప్పటికీ, దేవుడు అతన్ని ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఉపయోగించాడు. దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు.
ఈవిధముగా, మొదటి పఠనము దేవుని శక్తి, పరిశుద్ధత మరియు విమోచన ప్రణాళికను తెలియజేస్తుంది. దేవుడు తన ప్రజలను విడిపించడానికి మరియు తన ప్రణాళికలను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని అర్ధమగుచున్నది.
రెండవ పఠనము, ప్రభువుయొక్క పిలుపును, ఆ పిలుపును పెడచెవిన పెడితే జరిగే ఫలితాన్ని తెలియ జేస్తుంది. రెండవ పఠనములో పౌలుగారు కొరింతు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇశ్రాయేలీయులలోని కొందరిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, క్రైస్తవులు ఎలా జీవించాలో, ప్రవర్తించాలో వివరిస్తున్నాడు. వారు ప్రభువు నీడలో రక్షణను అనుభవించారు. ఎర్ర సముద్రమును ప్రభువు అండతో, మహిమతో దాటారు. నమ్మశక్యంకాని విధముగా, శిలనుండి నీటిని త్రాగారు. ప్రేమతో ప్రభువు చేసిన ఇన్ని అద్భుత కార్యములను చూసికూడా, వారు తమ మనసులను, మార్గములను మార్చుకోలేదు. దేవునిపట్ల అవిధేయతను చూపారు. వారి హృదయ కాఠిన్యమును చూచి ప్రభువు సంతోషించలేదు. అందుకే వారి ప్రేతములు ఎడారినందు చెల్లాచెదరయ్యాయి (1 కొరి 10:5). ఇశ్రాయేలు ప్రజల జీవితం మనకు గుణపాఠము కావాలని పౌలుగారు తెలియజేయు చున్నారు. పాపములో పడిపోకుండా జాగ్రత్త పదాలని హెచ్చరిస్తున్నాడు.
రెండవ పఠనము యొక్క సందేశం ఏమిటంటే, జాగ్రత్తగా ఉండాలి: గతంలో దేవుని ఆశీర్వాదాలు పొందినంత మాత్రాన మనం పాపానికి అతీతులం కాదని పౌలు హెచ్చరిస్తున్నాడు. కనుక, మనం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. దేవుని వాక్యముతో శోధనలను జయించవచ్చు. దేవునిపై ఆధారపడి జీవించాలి.
ఇదే సందేశాన్ని ప్రభువు సువిశేష పఠనములో వక్కాణిస్తున్నారు: “హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరు అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను” (లూకా 13:3, 5). హృదయ పరివర్తనం అనే ఫలము కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. అంజూరపు చెట్టు ఉపమానము ద్వారా, హృదయపరివర్తన, మంచి ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని ప్రభువు బోధిస్తున్నారు.
అంజూరపు చెట్టుకు తోటమాలి పాదుచేసి, ఎరువువేసి నీళ్లు పోసాడు. అయినను మూడేండ్లనుండి ఎటువంటి ఫలాలను ఇవ్వలేదు. అందుకు ఆ యజమాని ఆ చెట్టును నరికి పారవేయమన్నాడు. నాశనం చేయమన్నాడు. కానీ తోటమాలి మరొక్క ఏడు చూద్దామని, ఓపిక పట్టమని చెప్పాడు. మనము కూడా అంజూరపు చెట్టువలె మన జీవితం, ప్రవర్తన ద్వారా ఎలాంటి ఫలాలను దేవునికి ఇవ్వకపోతే, దేవుడు మనలను కూడా నరికి పారవేస్తాడు. అయితే, ఫలించడానికి మనకు కావలసినంత సమయాన్ని ఇస్తారు. ఆయన దయగలవారు. కనుక, మనం హృదయ పరివర్తనము చెందాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి. శ్రీసభ నాయకులు తోటమాలి వలె, తోటయైన శ్రీసభను సంరక్షించాలి, కాపాడాలి. వారి ఆధ్యాత్మిక పోషణకై సర్వత్రా కృషి చేయాలి. అవసరమైతే, దేవుని ఓపిక కొరకు, దయ, కరుణ కొరకు ప్రాధేయ పడాలి.
మనం ఎలా జీవిస్తున్నాము? ఒకసారి హృదయపు లోతులలో పరిశీలించుకొందాం! ఫలించే వారిగా ఉన్నామా? మన మార్పు కొరకు, హృదయ పరివర్తన కొరకు ప్రభువు ఎదురు చూస్తున్నారు. మోడుపోయిన అంజూరపు చెట్టువలె మన జీవితాలు ఉండకూడదు. ఫలించే అంజూరపు చెట్టువలె మన జీవితాలు ఉండాలి. ఫలించని అజూరపుచెట్టు దేవుని వాక్యాన్ని ఆలకించక పోవడాన్ని, ప్రజల అవిశ్వాసాన్ని సూచిస్తుంది. మన జీవితాలను, దేవుని వాక్కుతో పోషించాలి.
అంజూరపు చెట్టు ఉపమానము యొక్క ముఖ్య సందేశం: ఇది పశ్చాత్తాపం యొక్క ఆవశ్యకతను తెలియ జేస్తుంది. అంజూరపు చెట్టు ఉపమానం దేవుని సహనాన్ని తెలియజేస్తుంది. దేవుడు మనకు పశ్చాత్తాపపడటానికి మరియు ఫలవంతమైన జీవితాన్ని గడపడానికి సమయం ఇస్తాడు. దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.
సువిశేష పఠనములో విన్నట్లుగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, వాటిలో నశించువారు (పిలాతు సైన్యం గలిలీయ దేశీయులను చంపడం, సిలోయము బురుజు కూలి పదునెనిమిది మంది మరణించడం), లేదా నష్టపోయిన వారు పాపులా? కాదా? అని ఆలోచించడంమాని (ఇతరులపై తీర్పు చేయడం మాని), అవి మనకు ఎటువంటి సందేశాన్ని, మనలనుండి ఎటువంటి ప్రతిచర్యను, మనకు ఎటువంటి హెచ్చరికను ఇస్తున్నాయో తెలుసుకోవాలి. ఎటువంటి మార్పును ప్రభువు మననుండి కోరుతున్నారో తెలుసుకోవాలి (1 కొరి 10:11-12).
ఎందుకంటే, ప్రభువు “ఎవరును వినాశనము కావలెనని కోరడు. అందరు పాపమునుండి విముఖులు కావలెనని ఆయన వాంఛ” (2 పేతురు 3:9). ఎవడు చనిపోవుట వలన ఆయన సంతోషించరు. పాపమునుండి వైదొలగి బ్రతుకుటయే ఆయన మనలనుండి ఆశించునది (యెహెజ్కెలు 18:32).
వైరసులు, ప్రకృతి విపత్తులు, రోగాలు... దేవునినుండి వచ్చేవి కాదు. అవి మానవ తప్పిదాల వలన సంభవిస్తున్నాయని మనం గ్రహించాలి. ఎవరికైనా ఏదైనా విపత్తు జరిగితే, వారేదో పాపం చేశారని, అందుకే దేవుడు వారిని శిక్షించాడని అనుకోవడం తప్పు. అటువంటి మూఢ నమ్మకాలను వదిలేయాలి.
మన మార్గాన్ని మార్చుకొని, తన వైపుకు మరలమని ప్రభువు మనలను పిలుస్తున్నారు. మనం తపఃకాలములో ఉన్నాము. ఇది పరివర్తన చెందు కాలం. దేవుడు మనకు తగిన సమయాన్ని, అవకాశాన్ని ఇస్తున్నారు. ఆత్మపరిశీలన చేసుకొను సమయం. మన తప్పులను మనం తెలుసుకొని సరిచేసుకొను సమయం. పాపాలకు పశ్చాత్తాప పడి, దేవుని వైపునకు మరలుదాం! దేవునితోను, తోటివారితోను సఖ్యత పడుదాం.
Gud sermon fr but I have one doubt why did pilate kill Galilians
ReplyDelete