తపస్కాల మూడవ ఆదివారము, YEAR C

తపస్కాల మూడవ ఆదివారము, Year C 
పఠనములు: నిర్గమ 3:1-8అ,13-15; 1 కొరి 10:1-6,10-12; లూకా 13:1-9. 
పిలుపు - మలుపు ªహృదయ పరివర్తనము)
"హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరు అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను" (లూకా 13:3, 5).

"ఆయన పిలుస్తాడు
పిలుపుతో మలుస్తాడు
మరలిన వారికి బయలు పరుస్తాడు
వారు ప్రతీ అడుగులో బలపరుస్తాడు."

తపస్కాలములోని 3 వ ఆదివారమున ప్రభువు మనకు ఇచ్చు సందేశమిదే!

ఈనాటి మొదటి పఠనమునందు ప్రభువు మోషేను తన పనికొరకు, తన ప్రజలకొరకు, వారి విముక్తికొరకు ఎన్నుకొంటున్నారు. మోషే యొక్క బలహీనతలను తెలిసికూడా అతనిని తన పనికొరకు ఎన్నుకొంటున్నారు. బలహీనుడైన మోషేను, బలపరచి తన ప్రజల యొద్దకు పంపుతున్నారు. ఎందుకంటే, బలహీనుడైన అతడే తన ప్రజల బలహీనతలను బాగా అర్ధం చేసుకోగలడని ప్రభువు యొక్క నమ్మకం. పిలచిన అతన్ని మలస్తున్నారు, తన సేవకుడిగా మార్చుకొంటున్నారు. అతనికి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. "బలహీన సమయమందు బలపరచుటకు నేనున్నాను" అని ధైర్యమును నూరి పోస్తున్నారు. అందుకే, తనను తాను ఉన్నవాడుగా బయలు పరచుకొంటున్నారు. అందుకే, "నా ప్రజల బాధను చూచాను, వారి ఆక్రందనను విన్నాను, వారు వేదనను తెలుసుకొన్నాను" అని పలుకుతున్నారు.

బాధలలో ఉన్న తన ప్రజలకు ప్రేమతో స్నేహాస్తాన్ని అందిస్తున్నారు. మోషే ద్వారా, వారిని తిరిగి తన అక్కున చేర్చుకొనడానికి ప్రయత్నిస్తున్నారు. 'పెక్కు విధములుగా, పెక్కు మార్లు' (హెబ్రీ 1:1) తన జనులు తనతో ఉండాలని ఆశించి, వారిని పిలుస్తున్నారు.

రెండవ పఠనము, ప్రభువుయొక్క పిలుపును, ఆ పిలుపును పెడచెవిన పెడితే జరిగే ఫలితం తెలియజేయబడినది. రెండవ పఠనములో పౌలుగారు కొరింతు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇశ్రాయేలీయులలోని కొందరిని ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. వారు ప్రభువు నీడలో రక్షణను అనుభవించారు. ఎర్ర సముద్రమును ప్రభువు అండతో, మహిమతో దాటారు. నమ్మశక్యం కానివిధముగా, శిలనుండి నీటిని త్రాగారు. ప్రేమతో ప్రభువు చేసిన ఇన్ని అద్భుత కార్యములను చూసికూడా, వారు తమ మనసులను, మార్గములను మార్చుకోలేదు. వారి హృదయ కాఠిన్యమును చూచి ప్రభువు సంతోషించలేదు. అందుకే వారి ప్రేతములు ఎడారినందు చెల్లాచెదరయ్యాయి (1 కొరి 10:5). 

ఇదే సందేశాన్ని ప్రభువు సువార్త పఠనములో తిరిగి వక్కాణిస్తున్నారు: "హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరు అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను" (లూకా 13:3, 5). హృదయ పరివర్తనం అనే ఫలంకొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. మనలనుండి ఆయన ఆశిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వారు అంజూరపు చెట్టువలె తీసుకొనే వారిగా మాత్రమే ఉన్నారు తప్ప ఇచ్చే వారిగా మారలేదు.  అంజూరపు చెట్టుకు తోటమాలి పాదుచేసి, ఎరువువేసి నీళ్లు పోసాడు. అయినను మూడేండ్లనుండి ఎటువంటి ఫలాలను ఇవ్వలేదు. అందుకు ఆ యజమాని ఆ చెట్టును నరికి పారవేయమన్నాడు. నాశనం చేయమన్నాడు. కానీ తోటమాలి మరొక్క ఏడు చూద్దామని, ఓపిక పట్టమని చెప్పాడు. మనం కూడా అంజూరపు చెట్టువలె మన జీవితం, ప్రవర్తన ద్వారా ఎలాంటి ఫలాలను దేవునికి ఇవ్వకపోతే, దేవుడు మనలను కూడా నరికి పారవేస్తాడు. అయితే, ఫలించడానికి మనకు కావలసినంత సమయాన్ని ఇస్తారు. ఆయన దయగలవారు. కనుక, మనం హృదయ పరివర్తనం చెందాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి. శ్రీసభ నాయకులు తోటమాలి వలె, తోటయైన శ్రీసభను సంరక్షించాలి, కాపాడాలి. వారి ఆధ్యాత్మిక పోషణకై సర్వత్రా కృషి చేయాలి. అవసరమైతే, దేవుని ఓపిక కొరకు, దయ, కరుణ కొరకు ప్రాధేయ పడాలి.

మనం ఎలా ఉన్నాము? ఒకసారి హృదయపు లోతులలో పరిశీలించుకొందాం! ఇచ్చే వారిగా, ఫలించే వారిగా ఉన్నామా? లేదా పొందే వారిగా మాత్రమే ఉన్నామా? మన మార్పు కొరకు, హృదయ పరివర్తన కొరకు ప్రభువు ఎదురు చూస్తున్నారు. మోడుపోయిన అంజూరపు చెట్టువలె మన జీవితాలు ఉండకూడదు. ఫలించే అంజూరపు చెట్టువలె మన జీవితాలు ఉండాలి. ఫలించని అజూరపుచెట్టు దేవుని వాక్యాన్ని ఆలకించక పోవడాన్ని, ప్రజల అవిశ్వాసాన్ని సూచిస్తుంది. మన జీవితాలను, దేవుని వాక్కుతో పోషించాలి.

మనం సువార్త పఠనములో విన్నట్లుగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, వాటిలో నశించువారు (పిలాతు సైన్యం గలిలీయ దేశీయులను చంపడం, సిలోయము బురుజు కూలి పదునెనిమిది మంది మరణించడం), లేదా నష్టపోయిన వారు పాపులా? కాదా? అని ఆలోచించడంమాని (ఇతరులపై తీర్పు చేయడం మాని), అవి మనకు ఎటువంటి సందేశాన్ని, మననుండి ఎటువంటి ప్రతిచర్యను, మనకు ఎటువంటి హెచ్చరికను ఇస్తున్నాయో తెలుసుకోవాలి. ఎటువంటి మార్పును ప్రభువు మననుండి కోరుతున్నారో తెలుసుకోవాలి (1 కొరి 10:11-12). 

ఎందుకంటే, ప్రభువు "ఎవరును వినాశనము కావలెనని కోరడు. అందరు పాపమునుండి విముఖులు కావలెనని ఆయన వాంఛ (2 పేతురు 3:9)." ఎవడు చనిపోవుట వలన ఆయన సంతోషించరు. పాపమునుండి వైదొలగి బ్రతుకుటయే ఆయన మననుండి ఆశించునది (యెహెజ్కెలు 18:32).

వైరసులు, ప్రకృతి విపత్తులు, రోగాలు... దేవుని నుండి వచ్చేవి కాదు. అవి మానవ తప్పిదాల వలన సంభవిస్తున్నాయని మనం గ్రహించాలి. ఎవరికైనా ఏదైనా విపత్తు జరిగితే, వారేదో పాపం చేశారని, అందుకే దేవుడు వారిని శిక్షించాడని అనుకోడం తప్పు. అటువంటి మూఢ నమ్మకాలను వదిలేయాలి.

మన మార్గాన్ని మార్చుకొని, తన వైపుకు మరలమని ప్రభువు మనలను పిలుస్తున్నారు. మలపుకోరే, ఆ పిలుపు సందేశం మనకు వినబడిందా? మనం తపఃకాలములో ఉన్నాము. ఇది పరివర్తన చెందు కాలం. దేవుడు మనకు తగిన సమయాన్ని, అవకాశాన్ని ఇస్తున్నారు. ఆత్మపరిశీలన చేసుకొను సమయం. మన తప్పులను మనం తెలుసుకొని సరిచేసుకొను సమయం. పాపాలకు పశ్చాత్తాప పడి, దేవుని వైపునకు మరలుదాం! దేవునితోను, తోటివారితోను సఖ్యత పడుదాం.

1 comment:

  1. Gud sermon fr but I have one doubt why did pilate kill Galilians

    ReplyDelete