ఉపోద్ఘాతము: నేడు పవిత్ర గురువారము. తపస్కాలము
మనలను మనం దైవీకముగా మార్చుకొనుటకు దేవుడిచ్చిన సమయం. అలాంటి తపస్కాలమందు విభూది
బుధవారము నుండి మ్రానికొమ్మల ఆదివారం వరకు ఒక ఎత్తైతే, ఈ చివరి తపస్కాల వారం ఇంకొక ఎత్తు. అటువంటి ఈ తపస్కాల
చివరి వారమందు ఉత్థాన పండుగకు ముందు వచ్చు గురువారమును, పవిత్ర
గురువారముగా పిలుస్తున్నాము. తపస్కాలమందు పవిత్ర గురువారమునకు ఎంతో ప్రాముఖ్యత
కలదు. ఈరోజు నాలుగు ప్రధాన అంశాలను ధ్యానిస్తున్నాం: (1). యేసు
శిష్యుల పాదాలను కడుగుట (2). దివ్యసత్ర్పసాద స్థాపన
(3). పవిత్ర యాజక అంతస్తు స్థాపన (4). నూతన
ఆజ్ఞ.
మొదటి పఠన నేపధ్యం - పాస్క పండుగ, నియమములు (నిర్గమకాండము 12:1-8, 11-14): యూదులు పాస్క పండుగను 8 రోజులపాటు
జరుపుకొనేవారు. ఈ రోజుల్లో, పొంగని రొట్టెలను మాత్రమే
తినేవారు. పాస్క భోజనం “హల్లెల్”
కీర్తనల మొదటి భాగాన్ని పాడడంతో ప్రారంభమవుతుంది (కీర్త 113,114
- పాస్క తిరునాళ్ళ పాట). ఆతరువాత, చేదు మొక్క
కూరను తిని, “హల్లెల్” కీర్తనల
రెండవ భాగాన్ని పాడేవారు (కీర్త 115-116 వందన సమర్పణ).
కుటుంబములో పెద్ద, పాస్క పండుగ ప్రాముఖ్యతను వివరించేవారు. ఆ
తరువాత, నిప్పులో కాల్చిన గొర్రెపిల్ల (రక్తాన్ని బలిగా
ముందుగానే దేవునికి అర్పించేవారు) మాంసమును తిని, ప్రధాన “హల్లెల్” కీర్తనలను పాడేవారు (కీర్త 117-118 - స్తుతి, వందనగీతం). పాస్క (హీబ్రూ) అనగా 'దాటిపోవుట' అని అర్ధము. ఐగుప్తు బానిసత్వమును దాటుటను,
ఎర్రసముద్రాన్ని దాటుటను వారు పాస్క
పండుగగా కొనియాడారు.
ఈనాడు ఇస్రాయేలీయులు పరిశుద్ధమైన మగ గొర్రెపిల్లను చంపి, దాని రక్తమును వారి ఇంటి గుమ్మములకు పూయవలెనని దేవుడు ఆజ్ఞాపించారు. అప్పుడు తాను ఐగుప్తు దేశమునందు జనుల తొలిచూలు పిల్లలను చంపునపుడు ఇస్రాయేలీయుల పిల్లలు క్షేమంగా ఉండెదరు. ఇది దేవుని పాస్క బలి అని, పాస్క నియమములను, పాస్క ఒప్పందము గురించి ప్రభువు విడమరచి చెప్పియున్నారు. ఈ పాస్క గొర్రెపిల్లను ఏ విధముగా తినవలెనో కూడా యావే ప్రభువు చెప్పియున్నారు. ఆ నియమములు ఏమిటంటే, తినునపుడు వారి నడుముకు దట్టి ఉండవలెను, కాళ్ళకు చెప్పులు తొడుగుకొనవలెను, చేతిలో కర్ర ఉండవలెను మరియు మాంసమును త్వరగా తినవలెను.
ఈ నియమములను మనము ఒక్కసారి గమనిచినట్లయితే, ఇవన్ని ఎవరో ముఖ్యమైన వారు వచ్చుచున్నపుడు మనలను మనము
త్వరితగతిన తయారు చేసుకొంటున్నట్లుగా ఉన్నాయి. ఆ విధముగా మనము ఎంత ఉత్కంట భరితముగా
దేవుని పాస్క గురించి తయారు కావలెనో మనము అర్ధము చేసుకొనవచ్చు. ఏ విధముగానైతే ఒక
అధికారి వచ్చినపుడు మనము ఎంత ఉత్కంట భరితముగా ఉంటామో అంతకన్నా ఎక్కువగా దేవుని
పాస్క గురించి ఉత్కంటగా తయారు కావాలనేదే దేవుని ఉద్దేశ్యము! అంటే దేవుని పాస్క
బలిని ఎంతో ఉత్కంటతోను, దీక్షతోను, ఎదురుచూచు
గుణముతోను జరుపుకొనాలి.
ఈ పాస్క బలి ఐగుప్తీయుల బానిసత్వంనుండి ఇస్రాయేలీయులను విడుదల చేయుటకు
సూచనగా జరుపుకొనేవారు. అదేవిధముగా ఈ పాస్క బలి ఎన్నో సంవత్సరముల తరువాత వచ్చు
క్రీస్తు బలికి సూచనగాను జరిగినట్లుగా మనము అర్ధము చేసుకోవచ్చు!
దైవకుమారుడు యేసు, తన పాస్క పండుగను, శిష్యుల పాదాలు కడుగుటతో ప్రారంభించారు. ఇది వినయపూర్వకమైన సేవకు, తన శిష్యులపై తనకున్న ప్రేమకు సూచన! ఇది ఆయన ప్రేమకు, సేవకు ప్రతిరూపం! “మనుష్య కుమారుడు సేవించుటకే గాని, సేవింప బడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్ధము విమోచన క్రయ ధనముగ తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను” (మార్కు 10:45) అన్న మాటలు మనకు స్ఫురిస్తున్నాయి. శిష్యులు కూడా అలాగే చేయాలని ఆజ్ఞాపించారు.
తాను దేవుని కుమారుడైనను శిష్యుల పాదములను కడుగుటకు సిద్ధపడగా, పేతురు ఆ దైవీక చిహ్నమును అర్ధము చేసుకోలేక
నిరాకరించాడు (యో 13:8). అందుకు యేసు “నేను నిన్ను (నీ
పాదములను) కడుగని యెడల, నాతో నీకు భాగము ఉండదు” (యో13:8) అని చెప్పుటద్వారా శిష్యులందరు తన ప్రేషిత
కార్యములోను, శ్రమలలోను, మహిమలోను
భాగము పంచుకుంటారని చెప్పారు. అందుకనే యేసు తన శిష్యులను సేవకులుగా పరిగణింపక
స్నేహితులని పిలిచారు (యో 15:15).
“మీరందరు శుద్దులు కాదు” అని చెబుతూనే యూదా ఇస్కారియోతు కాళ్ళను కూడా
యేసుప్రభువు కడిగారు. ఎందుకనగా, యేసు యుదాతోసహా
శిష్యులందరినీ చివరిదాకా ప్రేమించారు (యో 13:1). యుదా తనను
అప్పగిస్తాడని తెలిసికూడా అతనిని ప్రేమించారు. యుదా కాళ్ళు కడగడము ద్వారా తనలో
యుదాకి కూడా భాగముందని చెప్పకనే చెప్పారు. కాని యుదా ఇస్కారియోతు ప్రభువు మనస్సుని
అర్ధము చేసుకోలేక, ఆ భాగమును నిరాకరించి యేసుని రోమను
సైనికులకు అప్పగించాడు. ఈ కార్యముద్వారా యేసుక్రీస్తు, షరతులు
లేనటువంటి నిష్కల్మషమైన ప్రేమను అర్ధము చేసుకొనవచ్చు. ఈ విధముగా ప్రభువు ప్రేమకు
మంచివారు, చెడ్డవారు అను తారతమ్యములు లేవని నిరూపించు చున్నారు.
అంతేకాకుండా యేసుప్రభువు, తాను ఏవిధముగా చేసెనో తన
శిష్యులను కూడా అనగా మనందరినీ అదేవిధముగా చేయుమని ఆజ్ఞను, ఆదర్శమును
ఇచ్చారు. తద్వారా మనందరికీ ఒకరిలో ఒకరికి క్రీస్తునందు భాగము కలదని తెలియు చున్నది.
ఈవిధముగా ఈ వినమ్ర కార్యం, పరుల ప్రేమకు తార్కాణముగా
నిలుస్తుందని యోహాను మనకు ఈనాటి సువార్తలో చెప్పుచున్నారు.
(2). దివ్య సత్ప్రసాద స్థాపన (1 కొరి 11:23-26; మత్త 26:17-30; లూకా 21:7-23):
ప్రభువు కడరాత్రి భోజనమును, ప్రధమ దివ్యబలి పూజా వేడుకగా మార్చారు. ఏవిధముగా యావే దేవుడు తన పాస్క బలి నియమములను చెప్పియున్నారో, దివ్యసత్ప్రసాద బలి స్థాపన గురించి, బలి ఏవిధముగా జరపాలనే నియమముల గురించి, పవిత్ర యాజక అంతస్తు స్థాపన గురించి, పునీత పౌలు మనకు తెలియజేయు చున్నారు.
కాల్చిన గొర్రెపిల్లను భుజించిన తరువాత, యేసు తన శరీర రక్తములను, రొట్టె ద్రాక్షారస రూపములో శిష్యులకు అందించారు. ఈవిధముగా, యేసు దివ్యసత్ప్రసాదమును స్థాపించారు. ఇది స్వర్గపు శాశ్వత ఆహారానికి, నిత్యజీవానికి, దేవుని శాశ్వత సాన్నిధ్యానికి గురుతు. అలాగే, యేసుప్రభువు తాను అప్పగి౦పబడనున్న రాత్రి దివ్యసత్ప్రసాద బలిద్వారా తనను ఏవిధముగా జ్ఞాపకము చేసుకోవలెనో చెప్పియున్నారు. ఈ దివ్య సత్ప్రసాద బలి యేసుప్రభు యొక్క నిజమైన ప్రాణబలికి గుర్తు. ఈ దివ్య సత్ప్రసాద బలిద్వారానే మనము ప్రతిదినము ప్రభువు చెప్పిన నియమానుసారముగా ఆయన మరణమును స్మరించు కొంటున్నాము. ఈ బలిలో ముఖ్య అంశములు ఏమిటంటే,
(3). పవిత్ర యాజక అంతస్తు స్థాపన:
ఈ రోజు ఇంకొక మహత్తర ఘట్టాన్ని కూడా ఆవిష్కరించ బడిన రోజు. అదే పవిత్ర యాజక అంతస్తు స్థాపన. యేసు ప్రభువు, తాను ఆదినుండి యావే దేవుని ప్రధాన యజకుడైనను, తననుతాను సిలువపై అర్పించుకొనే, యాజకునిగా ఈ లోకానికి పరిచయం చేసికున్నారు. ఆవిధముగా తననుతానే అర్పించుకొని, తనే అర్పకుడుగాను, తనే బలివస్తువుగాను అయి, తన జీవిత చరమాంకానికి తెరతీసారు. తద్వారా తన శ్రమల పర్వాన్ని తనదైన మేలి అర్పణద్వారా మొదలుపెట్టారు. “దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు” (1 కొరి 11:24-25; లూకా 22:19) అని శిష్యులకు ఆజ్ఞాపించి యున్నారో అప్పుడు, ఆ సమయమున అపోస్తలులందరూ యేసు వాక్యములద్వారా గురువులుగా అభిషక్తులయ్యారు, తద్వారా, పవిత్ర యాజక అంతస్థును స్థాపించారు. తరువాత కాలములో, అపోస్తలులు ఎవరినైతే ఎన్నుకొనేవారో, వారికి క్రీస్తు యాజకత్వం దయచేయబడినది. అందుచేత ఈ రోజు క్రైస్తవ గురువులందరి గురించి ప్రత్యేకముగా ప్రార్ధించవలసిన సుదినం.
(4). నూతన ఆజ్ఞ (యోహాను 13:31-35)
యేసు, నూతన పాస్క సాంగ్యాన్ని నూతన ఆజ్ఞను ఇవ్వడముతో
ముగించారు, “నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు.
నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించు కొనుడు” (యో 13:34).
ప్రేమాజ్ఞ దేవునితోను, తోటివారితోను లోతైన
బంధాన్ని ఏర్పరచుకోవడం. నేటి మన బంధాలలో విశ్వసనీయత, నిబద్ధత
కొరవడింది. మన బంధాలు చాలా షరతులతో ముడిపడి ఉన్నాయి. మన బంధాలు స్వార్ధము, నమ్మకద్రోహముతో కూడుకున్నవి. కనుక, సజీవ దేవునితో
ఆధ్యాత్మిక అనుబంధాన్ని కలిగి మనం జీవించాలి. శిష్యరికములో ప్రేమ, విశ్వాసం ఉండాలి. యూదావలె గాక (అతని హృదయములో పిశాచము చెడు ఆలోచనను
కలిగించెను), ప్రియ శిష్యునివలె (క్రీస్తుతో సంపూర్ణ సహవాసం)
మనం మారాలి. తండ్రి దేవునితోను, క్రీస్తుతోను సహవాసము కలిగి
జీవించాలి.
నేడు మన మధ్య ఐఖ్యత
లేకపోవడానికి కారణం, యేసు వలె మనం ప్రేమించక
పోవడమే! షరతులతో కూడిన ప్రేమ విభజనలను సృష్టిస్తుంది. యేసు
వలె మనం ప్రేమించినపుడే, మనలో ఐఖ్యత ఉంటుంది. “మీరు పరస్పరము
ప్రేమ కలిగి ఉన్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు
తెలిసికొందురు” (యోహాను 13:35).
No comments:
Post a Comment