పవిత్ర గురువారం (Holy Thursday)

పవిత్ర గురువారం
నిర్గమ 12:1-8, 11-14; 1 కొరి 11:23-26; యోహాను 13:1-15

ఉపోద్ఘాతము:
తపస్కాలము మనలను మనం దైవీకముగా మార్చుకొనుటకు దేవుడిచ్చిన సమయం. అలాంటి తపస్కాలమందు విభూది బుధవారము నుండి మ్రానుకొమ్మల ఆదివారం వరకు ఒక ఎత్తైతే, ఈ చివరి తపస్కాల వారం ఇంకొక ఎత్తు. అటువంటి ఈ తపస్కాల చివరి వారమందు ఉత్థాన పండుగకు ముందు వచ్చు గురువారమును, పవిత్ర గురువారముగా పిలుస్తున్నాం. తపస్కాలమందు పవిత్ర గురువారమునకు ఎంతో ప్రాముఖ్యత కలదు. ఈరోజు నాలుగు ప్రధాన అంశాలను ధ్యానిస్తున్నాం: (1). యేసు శిష్యుల పాదాలను కడుగుట; (2). దివ్యసత్ర్పసాద స్థాపన; (3). పవిత్ర యాజక అంతస్తు స్థాపన; (4). నూతన ఆజ్ఞ.

మొదటి పఠన నేపధ్యం - పాస్క పండుగ, నియమములు (నిర్గమకాండము 12:1-8, 11-14): యూదులు పాస్క పండుగను 8 రోజులపాటు జరుపుకొనేవారు. ఈ రోజుల్లో, పొంగని రొట్టెలను మాత్రమే తినేవారు. పాస్క భోజనం “హల్లెల్” కీర్తనల మొదటి భాగాన్ని పాడడంతో ప్రారంభమవుతుంది (కీర్త 113,114 - పాస్క తిరునాళ్ళ పాట). ఆతరువాత, చేదు మొక్క కూరను తిని, 
“హల్లెల్” కీర్తనల రెండవ భాగాన్ని పాడేవారు (కీర్త 115-116 వందన సమర్పణ). కుటుంబములో పెద్ద, పాస్క పండుగ ప్రాముఖ్యతను వివరించేవారు. ఆ తరువాత, నిప్పులో కాల్చిన గొర్రెపిల్ల (రక్తాన్ని బలిగా ముందుగానే దేవునికి అర్పించేవారు) మాంసమును తిని, ప్రధాన “హల్లెల్” కీర్తనలను పాడేవారు (కీర్త 117-118 - స్తుతి, వందనగీతం). పాస్క (హీబ్రూ) అనగా 'దాటిపోవుట' అని అర్ధము. ఐగుప్తు బానిసత్వమును దాటుటను, ఎర్రసముద్రాన్ని దాటుటను వారు పాస్క పండుగగా కొనియాడారు.

ఈనాడు ఇస్రాయేలీయులు పరిశుద్ధమైన మగ గొర్రెపిల్లను చంపి, దాని రక్తమును వారి ఇంటి గుమ్మములకు పూయవలెనని దేవుడు ఆజ్ఞాపించారు. అప్పుడు తాను ఐగుప్తు దేశమునందు జనుల తొలిచూలు పిల్లలను చంపునపుడు ఇస్రాయేలీయుల పిల్లలు క్షేమంగా ఉండెదరు. ఇది దేవుని పాస్క బలి అని, పాస్క నియమములను, పాస్క ఒప్పందము గురించి ప్రభువు విడమరచి చెప్పియున్నారు. ఈ పాస్క గొర్రెపిల్లను ఏ విధముగా తినవలెనో కూడా యావే ప్రభువు చెప్పియున్నారు. ఆ నియమములు ఏమనగా: - తినునపుడు వారి నడుముకు దట్టి ఉండవలెను; - కాళ్ళకు చెప్పులు తొడుగుకొనవలెను; - చేతిలో కర్ర ఉండవలెను; - మాంసమును త్వరగా తినవలెను;

ఈ నియమములను మనము ఒక్కసారి గమనిచినట్లయితే, ఇవన్ని ఎవరో ముఖ్యమైన వారు వచ్చుచున్నపుడు మనలను మనము త్వరితగతిన తయారుచేసుకొంటున్నట్లుగా ఉన్నాయి. ఆ విధముగా మనము ఎంత ఉత్కంటభరితముగా దేవుని పాస్క గురించి తయారు కావలెనో మనము అర్ధము చేసుకొనవచ్చును. ఏ విధముగానైతే ఒక అధికారి వచ్చినపుడు మనము ఎంత ఉత్కంటభరితముగా ఉంటామో అంతకన్నా ఎక్కువగా దేవుని పాస్క గురించి ఉత్కంటగా తయారు కావాలనేదే దేవుని ఉద్దేశ్యము! అంటే దేవుని పాస్క బలిని ఎంతో ఉత్కంటతోను, దీక్షతోను, ఎదురుచూచు గుణముతోను జరుపుకొనవలెను.

ఈ పాస్క బలి ఐగుప్తీయుల బానిసత్వంనుండి ఇస్రాయేలీయులను విడుదల చేయుటకు సూచనగా జరుపుకొనేవారు. అదేవిధంగా ఈ పాస్క బలి ఎన్నో సంవత్సరముల తరువాత వచ్చు క్రీస్తు బలికి సూచనగాను జరిగినట్లుగా మనము అర్ధము చేసుకోవచ్చు!

(1). శిష్యుల పాదాలను కడుగుట (యోహాను 13:1-15):
"యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను. వారిని చివరి వరకు ప్రేమించెను" (యోహాను 13:1; 17:1). "యేసు గడియ" సిలువపై మరణము, ఉత్థానముతో పరిపూర్తియైనది. ఇది క్రీస్తు పాస్కకు, అనగా తండ్రి యొద్దకు 'దాటిపోవుటను' సూచిస్తుంది. క్రీస్తు తన శిష్యులపైనున్న అనంత ప్రేమకు సూచన!
దైవకుమారుడు యేసు, తన పాస్క పండుగను, శిష్యుల పాదాలు కడుగుటతో ప్రారంభించారు. ఇది వినయపూర్వకమైన సేవకు, తన శిష్యులపై తనకున్న ప్రేమకు సూచన! ఇది ఆయన ప్రేమకు, సేవకు ప్రతిరూపం! "మనుష్య కుమారుడు సేవించుటకే గాని, సేవింప బడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్ధము విమోచన క్రయ ధనముగ తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను" (మార్కు 10:45) అన్న మాటలు మనకు స్ఫురిస్తున్నాయి. శిష్యులు కూడా అలాగే చేయాలని ఆజ్ఞాపించారు.

తాను దేవుని కుమారుడైనను శిష్యుల పాదములను కడుగుటకు సిద్ధపడగా, పేతురు ఆ దైవీక చిహ్నమును అర్ధము చేసుకోలేక నిరాకరించాడు (యోహాను 13:8). అందుకు యేసు "నేను నిన్ను (నీ పాదములను) కడుగని యెడల, నాతో నీకు భాగము ఉండదు" (యోహాను 13:8) అని చెప్పుటద్వారా శిష్యులందరు తన ప్రేషిత కార్యములోను, శ్రమలలోను, మహిమలోను భాగము పంచుకుంటారని చెప్పారు. అందుకనే యేసు తన శిష్యులను సేవకులుగా పరిగణింపక స్నేహితులని పిలిచారు (యోహాను 15:15).

"మీరందరు శుద్దులు కాదు" అని చెబుతూనే యూదా ఇస్కారియోతు కాళ్ళను కూడా యేసుప్రభువు కడిగారు. ఎందుకనగా, యేసు యుదాతోసహా శిష్యులందరినీ చివరిదాకా ప్రేమించారు (యోహాను 13:1). యుదా తనను అప్పగిస్తాడని తెలిసికూడా అతనిని ప్రేమించారు. యుదా కాళ్ళు కడగడముద్వారా తనలో యుదాకికూడా భాగముందని చెప్పకనే చెప్పారు. కాని యుదా ప్రభువు మనస్సుని అర్ధము చేసుకోలేక, ఆ భాగమును నిరాకరించి యేసుని రోమను సైనికులకు అప్పగించాడు. ఈ కార్యముద్వారా యేసుక్రీస్తు, షరతులు లేనటువంటి నిష్కల్మషమైన ప్రేమను అర్ధము చేసుకొనవచ్చు. ఈ విధముగా ప్రభువు ప్రేమకు మంచివారు, చెడ్డవారు అను తారతమ్యములు లేవని నిరూపించుచున్నారు.

అంతేకాకుండా యేసుప్రభువు, తాను ఏవిధముగా చేసెనో తన శిష్యులను కూడా అనగా మనందరినీ అదేవిధముగా చేయుమని ఆజ్ఞను, ఆదర్శమును ఇచ్చారు. తద్వారా మనందరికీ ఒకరిలో ఒకరికి క్రీస్తునందు భాగము కలదని తెలియుచున్నది. ఈ విధముగా ఈ వినమ్ర కార్యం, పరుల ప్రేమకు తార్కాణముగా నిలుస్తుందని యోహాను మనకు ఈనాటి సువార్తలో చెప్పుచున్నారు.

(2). దివ్య సత్ప్రసాద స్థాపన (1 కొరి 11:23-26; మత్త 26:17-30; లూకా 21:7-23):
ప్రభువు కడరాత్రి భోజనమును, ప్రధమ దివ్యబలి పూజా వేడుకగా మార్చారు. ఏవిధముగా యావే దేవుడు తన పాస్క బలి నియమములను చెప్పియున్నారో, దివ్యసత్ప్రసాద బలి స్థాపన గురించి, బలి ఏవిధముగా జరపాలనే నియమముల గురించి, పవిత్ర యాజక అంతస్తు స్థాపన గురించి, 
పునీత పౌలు మనకు తెలియజేయు చున్నారు.
కాల్చిన గొర్రెపిల్లను భుజించిన తరువాత, యేసు తన శరీర రక్తములను, రొట్టె ద్రాక్షారస రూపములో శిష్యులకు అందించారు. ఈవిధముగా, యేసు దివ్యసత్ప్రసాదమును స్థాపించారు. ఇది స్వర్గపు శాశ్వత ఆహారానికి, నిత్యజీవానికి, దేవుని శాశ్వత సాన్నిధ్యానికి గురుతు. అలాగే, యేసుప్రభువు తాను అప్పగి౦పబడనున్న రాత్రి దివ్యసత్ప్రసాద బలిద్వారా తనను ఏ విధముగా జ్ఞాపకము చేసుకోవలెనో చెప్పియున్నారు. ఈ దివ్య సత్ప్రసాద బలి యేసుప్రభు యొక్క నిజమైన ప్రాణబలికి గుర్తు. ఈ దివ్య సత్ప్రసాద బలిద్వారానే మనము ప్రతిదినము ప్రభువు చెప్పిన నియమానుసారముగా ఆయన మరణమును స్మరించుకొంటున్నాము. ఈ బలిలో ముఖ్య అంశములు ఏమనగా:
(i). కృతజ్ఞతాబలి: యేసుప్రభు దివ్యసత్ప్రసాద స్థాపనలో మొదటగా దేవునకు కృతఙ్ఞతలు చెల్లించారు. తాను పొందవలసినటువంటి బాధలు తనకు తెలిసినప్పటికీ తాను ముందుగా దేవునకు కృతఙ్ఞతలు చెప్పియున్నారు. అనగా దివ్యసత్ప్రసాద బలి, యేసుక్రీస్తు ప్రాణబలిని సూచించినప్పటికీ, దేవునికి కృతఙ్ఞతలు చెప్పడము ఎంత ముఖ్యమో తెలియుచున్నది. అందుకే దివ్య సత్ప్రసాదబలిని కృతజ్ఞతాబలిగా కొనియాడతాము.
(ii). దివ్య (ప్రాణ) బలి: దేవునికి కృతఙ్ఞతలు తెలిపిన తరువాత తన మరణమునకు సంకేతనముగా 
రొట్టెను త్రుంచి, యేసు తన శిష్యులకు ఇచ్చియున్నారు. ఈవిధముగా ప్రభువు ఇచ్చిన రొట్టె తనకే సూచనగా నిలుచుచున్నది. తాను రొట్టెను తుంచడముద్వారా తననుతాను ఇష్టపూర్తిగా దేవునికి అర్పిస్తున్నట్లు, తాను ఇష్టపూర్తిగా తన ప్రాణమును ధారపోస్తున్నట్లుగా తన మనస్సును తేటతెల్లము చేసియున్నారు.
(iii). దివ్య రక్తము: భోజనము తరువాత యేసుప్రభువు ద్రాక్షరసపు పాత్రను తీసుకొని, అది తాను చిందబోవు రక్తమునకు చిహ్నమని చెప్పియున్నారు (లూకా 22:20). ఈ రక్తపు చిహ్నము నూతన ఒడంబడికగా యేసుప్రభువు చెప్పినవిధముగా పునీత పౌలు అభివర్ణించారు. అందువలన, ప్రతి దివ్యబలిపూజలో ద్రాక్షరసము అర్పింప బడునప్పుడు ప్రభువు మనందరి పాపములను శుద్ధిచేయుటకు చిందిన దివ్యరక్తమును జ్ఞాపకము చేసుకొనుచుందుము. అంతేకాకుండా, ఈ నాటి రెండవ పఠనములో పునీత పౌలు మనకు యేసుప్రభుని రక్తముద్వారా నిత్యమరణము నుండి విముక్తి కలిగినదని చెప్పుచున్నారు. ఎందుకనగా,  ఇశ్రాయేలు సంస్కృతిలో రక్తము జీవమునకు చిహ్నము. యేసుప్రభువు తన రక్తమును చిందించుటద్వారా తన జీవమును స్వచ్చందముగా అర్పించి, తద్వారా మనందరిని నిత్యమరణము నుండి శాశ్వత విముక్తులను చేసారు. యేసుప్రభు రక్తము చిందించుట మనకు మొదటి పఠనములో గొర్రెపిల్ల చంపబడుటను గుర్తుకు తెచ్చును. ఏవిధముగానైతే గొర్రెపిల్ల రక్తము గుమ్మములకు పూయడము ద్వారా ఇస్రాయేలీయుల తొలిచూలు బిడ్డలు రక్షించబడ్డారో, అదేవిధముగా క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనందరమూ రక్షించబడ్డామని తెలియుచున్నది.
(iv). నూతన నిబంధన: మనందరికోసం యేసుప్రభువు చిందించిన రక్తము దేవుడు మనతో చేసుకొన్న నూతన ఒడంబడిక (1 కొరి 11:25). ఈ సమయములో పాత ఒడంబడిక గురించి ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. సినాయి కొండపై యావే ప్రభువు వేంచేసి, ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకొనియున్నారు. కాని తరువాత ఎన్నోసార్లు ఇస్రాయేలీయులు ప్రభువు మాటను, ఒడంబడికను మీరి తప్పు చేసారు. ఐనప్పటికీ ప్రభువు తనదైన కరుణతో ఎన్నోమార్లు వారిని క్షమించారు. చివరికి తన కుమారుడైన క్రీస్తు రక్తమును చిందించి వారితో శాశ్వత నిత్యనిబంధనను చేసుకొనియున్నారు. అయితే, ఈ శాశ్వత నిత్యనిబంధన ఇస్రాయేలీయులకే గాక మానవజాతి అంతటికీ వర్తిస్తుంది. అందువలన ఎవరైతే ఈ నూతన నిత్య నిబంధనలో జ్ఞానస్నానముద్వారా భాగస్తులగుదురో వారందరితోనూ ప్రత్యేకముగా నిబంధనను చేసుకొంటూ ప్రతిఒక్కరికి నిత్య జీవభాగ్యమును ఒసగుచున్నారు.

(3). పవిత్ర యాజక అంతస్తు స్థాపన: 
ఈ రోజు ఇంకొక మహత్తర ఘట్టాన్ని కూడా ఆవిష్కరించ బడిన రోజు. అదే పవిత్ర యాజక అంతస్తు స్థాపన. యేసు ప్రభువు, తాను ఆదినుండి యావే దేవుని ప్రధాన యజకుడైనను, తననుతాను సిలువపై అర్పించుకొనే, యాజకునిగా ఈ లోకానికి పరిచయం చేసికున్నారు. ఆవిధముగా తననుతానే అర్పించుకొని, తనే అర్పకుడుగాను, తనే బలివస్తువుగాను అయి, తన జీవిత చరమాంకానికి తెరతీసారు. తద్వారా తన శ్రమల పర్వాన్ని తనదైన మేలి అర్పణద్వారా మొదలుపెట్టారు. "దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు" (1 కొరి 11:24-25; లూకా 22:19) అని శిష్యులకు ఆజ్ఞాపించి యున్నారో అప్పుడు, ఆ సమయమున అపోస్తలులందరూ యేసు వాక్యములద్వారా గురువులుగా అభిషక్తులయ్యారు, తద్వారా, పవిత్ర యాజక అంతస్థును స్థాపించారు. తరువాత కాలములో, అపోస్తలులు ఎవరినైతే ఎన్నుకొనేవారో, వారికి క్రీస్తు యాజకత్వం దయచేయబడినది. అందుచేత ఈ రోజు క్రైస్తవ గురువులందరి గురించి ప్రత్యేకముగా ప్రార్ధించవలసిన సుదినం.

(4). నూతన ఆజ్ఞ (యోహాను 13:31-35)
యేసు, నూతన పాస్క సాంగ్యాన్ని నూతన ఆజ్ఞను ఇవ్వడముతో ముగించారు: "నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించు కొనుడు" (యోహాను 13:34). ప్రేమాజ్ఞ దేవునితోను, తోటివారితోను లోతైన బంధాన్ని ఏర్పరచుకోవడం. నేటి మన బంధాలలో విశ్వసనీయత, నిబద్ధత కొరవడింది. మన బంధాలు చాలా షరతులతో ముడిపడి ఉన్నాయి. మన బంధాలు స్వార్ధము, నమ్మకద్రోహముతో కూడుకున్నవి. కనుక, సజీవ దేవునితో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కలిగి మనం జీవించాలి. శిష్యరికములో ప్రేమ, విశ్వాసం ఉండాలి. యూదావలె గాక (అతని హృదయములో పిశాచము చెడు ఆలోచనను కలిగించెను), ప్రియ శిష్యునివలె (క్రీస్తుతో సంపూర్ణ సహవాసం) మనం మారాలి. తండ్రి దేవునితోను, క్రీస్తుతోను సహవాసము కలిగి జీవించాలి.
నేడు మన మధ్య ఐఖ్యత లేకపోవడానికి కారణం, యేసు వలె మనం ప్రేమించక పోవడమే! షరతులతో కూడిన ప్రేమ విభజనలను సృష్టిస్తుంది. యేసు వలె మనం ప్రేమించినపుడే, మనలో ఐఖ్యత ఉంటుంది. "మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు" (యోహాను 13:35).

ముగింపు:
చివరిగా, క్రీస్తు మొదటి పఠనములోని ప్రజలకోసం చనిపోవు మరియు లోకపపములను పరిహరించు గొర్రె పిల్లగా (బప్తిస్మ యోహాను ప్రవచనం - యోహాను 1:29, 36) సూచించబడగా, రెండవ పఠనంలో యాజకుడుగాను, బలిఅర్పణగాను సూచించబడగా, సువార్తలో వినమ్రహృదయుడుగాను వర్ణించపడ్డారు. ఈ విధముగా ఈనాటి పఠనాలద్వారా తిరుసభ మనకు క్రీస్తుని గురించి, క్రిస్తుని ప్రేమ గురించి విఫులముగా వివరిస్తున్నది. అనగా యేసుని ప్రేమను ఒక నాణెముగా పరిగణిస్తే, యేసుని యొక్క స్వచ్చంద బలి అర్పణ మరియు సేవాపూరిత ప్రేమలను చెరొక పార్శ్వముగా అర్ధము చేసుకొనవచ్చును. అంతేకాకుండా ఈనాటి పఠనాలు, దేవుడు ఇచ్చిన పాస్క పండుగ నియమాలు, దివ్య సత్ప్రసాదక్రమము, క్రీస్తు ఇచ్చిన వినయాదర్శము ఏవిధముగా ఆచరించవలెనో, ఏవిధముగా జ్ఞాపకము చేసుకోవలెనో సూచనప్రాయముగా తెలియచేయుచున్నాయి. ఈవిధముగా ఈనాటి పఠనాలు ఈ పవిత్ర గురువారము యొక్క ప్రాముఖ్యత గురించి, ఈ పవిత్ర గురువారమును ఎందుకు భక్తిశ్రద్ధలతో జరుపుకొనవలెనో తెలియచేయుచున్నవి.

No comments:

Post a Comment