పవిత్ర శుక్రవారము: పరిశుద్ధ సిలువ ఆరాధన
యెష 52:13-53:12; హెబ్రీ 4:14-16, 5:7-9; యోహా 18:1-19:42
ఉపోద్ఘాతము: సకల వరములకు ఊటయగు ఓ దేవా! మీ సేవకుల కొరకు మీ కుమారుడగు క్రీస్తు తన రక్తముద్వారా పాస్క పవిత్ర క్రియలను స్థాపించెను. మీ దయా కటాక్షములను స్మరించుకొని వారిని నిత్య రక్షణతో పవిత్ర పరచుడు.
ఈ రోజు పవిత్ర శుక్రవారము. ఈ రోజుని “గుడ్ ఫ్రైడే” అని అంటున్నాము. యేసు ప్రభువు శ్రమలను పొంది మరణించిన రోజును మనం ఎందుకు మంచిరోజు, పవిత్రమైన రోజు అంటున్నాము? ఎందుకనగా, క్రీస్తు మరణం మనకు విజయాన్ని సంపాదించి పెట్టింది. ఆయనను విశ్వసించు వారందరికి జీవమును, అనుగ్రహమును, రక్షణను, విముక్తిని సంపాదించి పెట్టింది. తన మరణముద్వారా, మనలను పాపదాస్యమునుడి విముక్తి గావించారు. “నిష్కళంకమైన గొర్రెపిల్లవంటి అమూల్యమైన క్రీస్తు బలిద్వారా మీరు విముక్తి కావింప బడితిరి” (1 పేతు 1:19).
పవిత్ర గురువారమున, శిష్యులతో కలసి, ‘పైగది’లో ప్రవేశించి, ప్రభు భోజనములో, దేవుని గొప్పవరమైన దివ్యసత్ప్రసాద భోజనమును స్వీకరించి యున్నాము. క్రీస్తు ప్రభువుని నిజమైన శరీరరక్తములు, ఆత్మదైవత్వమును మనం పొందియున్నాము. ఈనాడు పవిత్ర శుక్రవారమున, శ్రీసభ తల్లియైన మరియమ్మతో కలసి క్రీస్తు సిలువచెంత నిలుస్తున్నాము. పవిత్ర శుక్రవారమున, గొప్ప నమ్మకముతో, ఆశతో, క్రీస్తు సమాధిపై కప్పబడిన రాయి దొరలు సమయము కొరకై వేచి చూస్తున్నాము. ఆ క్షణమున, క్రీస్తు ఉత్థాన ఉజ్వలముతో మన హృదయాలు దేదీప్యమవుతాయి. ఆక్షణమున పరలోకములో పునీతులతో మరియు మన తోటి సహోదరీ సహోదరులతో కలసి, “లెమ్ము, ప్రకాశింపుము. నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగు చున్నది” (యెషయ 60:1) అని ఎలుగెత్తి స్తుతించెదము.
ఈ రోజు క్రీస్తు సిలువచెంత నిలచి యున్నాము. మరియ తల్లివలె, నిర్మల హృదయముతో ఈ సిలువ చెంతకు వచ్చియున్నట్లయితే, దైవప్రేమ పరమ రహస్యాలలోనికి ప్రవేశిస్తాము. సిలువను గాంచుదాం. సిలువలో వ్రేలాడుచున్న క్రీస్తును గాంచుదాం. ప్రేమగల మన ప్రభువు మనకోసం తన ఇష్టపూర్తిగా ఈ సిలువ మరణాన్ని పొందారు. తన సిలువ వేదన, మరణము ద్వారా మనలను రక్షించి యున్నారు. ఆయన మన మరణము నుండి రక్షించారు.
ఈరోజు మనం పాస్క పరమ రహస్యాన్ని ప్రత్యేక విధముగా కొనియాడుచున్నాము. క్రీస్తు సిలువ మరణం ఒక బలి. అది మన పాపాలను పరిహరించే బలి. యావత్ ప్రపంచానికి విమోచనాన్ని, విముక్తిని కలిగించి నటువంటి బలి. ఈ బలిలో గురువు క్రీస్తే మరియు బలి వస్తువు కూడా క్రీస్తే. కలువరి గిరిపై అర్పించిన బలి, తండ్రి దేవుని చిత్తాను సారముగా జరిగి యున్నది. అందుకే, తండ్రి దేవుడు క్రీస్తును మహిమ పరచి మహోన్నత స్థితికి హెచ్చించారు. మనముకూడా తండ్రికి పూర్తిగా విధేయులై, బాధామయ సేవకుడగు క్రీస్తు ప్రభువుతో కలసి పోవాలి. మన దు:ఖాలు, కష్టాలు, శోధనలు, వేదనలన్నింటిని క్రీస్తు బలితో ఒకటిగా చేసి తండ్రి దేవునికి సమర్పించాలి. అప్పుడే సిలువ మార్గములో ప్రభుని అనుసరించే వారందరికి విమోచనము కలుగుతుంది.
ఈ రోజు మనము ప్రత్యేక విధముగా ప్రభువు సిలువ మరణాన్ని స్మరిస్తున్నాము. మన కోసం ఆయన ఎన్నో శ్రమలను, బాధలను అనుభవించారు. అవమానములను భరించారు. సిలువపై ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొంది యున్నారు.
యేసును బంధించుట (యో 18:1-12) గురించి ధ్యానిద్దాం: కడరాత్రి భోజనము తరువాత, యేసు తన శిష్యులతో కేద్రోను లోయ దాటి ఓలీవు కొండపై నున్న, గెత్సేమని తోటకు వెళ్ళారు. యేసు తరుచుగా ప్రార్ధనకై అచటకు వెళ్ళేవారు. యేసును అప్పగింపనున్న యూదా ఇస్కారియోతుకు ఆ స్థలము తెలుసు (18:1-2). యేసు యూదాకు తెలియని స్థలమునకు వెళ్ళలేదు. ఎందుకన, యేసు తననుతాను బలిగా అర్పించు కొనుటకు సిద్ధపడ్డారు (18:4-8, 11). యేసును బంధించుటకు యూదా ఇస్కారియోతు, రోమా సైనికులు, ప్రధానార్చకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులు మరియు అధికారులు వచ్చారు (18:3) - అనగా [అవిశ్వాస, చీకటి] 'లోకమంత' యేసుకు వ్యతిరేకముగా నున్నదని సూచిస్తుంది. ప్రతీ పాపాత్ముడు యేసు మరణానికి కారణం. వారు చీకటిలో, వెలుగును బంధించుటకు వచ్చారు. చివరి వరకు వెలుగులో జీవించువాడు యేసునకు ప్రియ శిష్యుడు. పేతురు ప్రధానార్చకుని సేవకుని (మాల్కుసు) కుడిచెవిని తెగనరికాడు. అప్పుడు యేసు పేతురుతో, “నీ కత్తిని ఒరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా?” (18:10-11), “కత్తిని ఎత్తువాడు కత్తితోనే నశించెదరు” (మత్త 26:52) అని అన్నారు. క్రైస్తవులు హింసలలో, ప్రతీకారాన్ని కోరరాదు. “ఎన్నటికిని మీరు పగ తీర్చు కొనకుడు” (రోమీ 12:19).
న్యాయ పీఠము ఎదుట యేసు మరియు పేతురు బొంకు (యో 18:12-27): యేసును మొదటగా అన్నా యొద్దకు తీసికొని పోయారు. అతను ప్రధానార్చకుడైన కైఫాకు మామ. అన్నా క్రీ.శ. 6-15 వరకు, కైఫా క్రీ.శ. 18-36 వరకు ప్రధానార్చకులుగా పని చేసారు. యేసును విచారించు సమయములోనే, పేతురు, యేసు ఎవరో తెలియదని మూడుసార్లు బొంకాడు (18:15-18, 25-27). పేతురు బొంకు రాత్రి చీకటిలో జరిగినది. వెలుగైన క్రీస్తుతో జీవించినను, పేతురు తన బలహీనత వలన అంధకారములో పడిపోయాడు. ఒకవైపు యేసు “నేనే” అని సమ్మతిస్తుంటే, మరోవైపు పేతురు “నేను కాదు” అని తిరస్కరించాడు. మనము యేసు అనుచరులమే, కాని మన పాపముల వలన సాతానుకు లోబడి జీవిస్తున్నాము. మన చెడు కార్యాల ద్వారా, పాపము ద్వారా, యేసును తిరస్కరిస్తున్నాము!
ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధనలను గురించి ప్రశ్నించాడు (18:19). యేసు చెప్పిన సమాధానముతో (18:20-23), అన్నాకు ఎలాంటి పరిష్కారం దొరకక పోవడముతో, యేసును బంధములతో ప్రధానార్చకుడగు కైఫా యొద్దకు పంపాడు (18:24). యేసులో ఎలాగైనా తప్పు పట్టాలని చూసారు. అయితే, అన్నా, కైఫాలు యేసులో ఎలాంటి దోషమును కనుగొనలేదు.
పిలాతు ఎదుట ప్రభువు - ప్రజలకు లొంగిన పిలాతు (యోహాను 18:28-40; 19:1-16): అందుకే, యూదుల అధికారులు యేసును కైఫా యొద్దనుండి అధిపతి మందిరములోనికి తీసికొని వెళ్ళారు. రోమను గవర్నరు అయిన పిలాతు ఎదుట ప్రభువును నిలబెట్టారు. యూదులకు యేసును చంపాలని ఉన్నది, కాని, మరణ దండన విధించు అధికారము యూదులకు లేకుండెను (18:31).
(1). పిలాతు-యూదులు: నింద / తీర్పు (18:28-32) - తెల్లవారు జామున, యేసును పిలాతు వద్దకు తీసుకొని వచ్చారు. పాస్క భుజించుటకై మైల పడకుండుటకు యూదులు పిలాతు మందిరములోనికి వెళ్ళలేదు. పిలాతు బయటనున్న వారి యొద్దకు వచ్చి, యేసుపై వారి ఆరోపణ ఏమిటి అని అడిగాడు. యేసు నేరస్తుడని, అందుకే తీసుకొని వచ్చామని చెప్పారు.
(2). పిలాతు-యేసు: రాజ్యము / సత్యము (18:33-38) - పిలాతు మందిరము లోనికి వెళ్లి, యేసును పిలిపించి, ‘నీవు యూదుల రాజువా?’ అని ప్రశ్నించాడు. అందుకు యేసు, “నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు” అని సమాధాన మిచ్చారు. పిలాతు యూదుల వద్దకు వెళ్లి, ‘నాకు ఆయనలో ఏ దోషము కన్పించుట లేదు’ అని అన్నాడు.
(3). పిలాతు-యూదులు-బరబ్బ (18:38-40) – యేసును విడుదల చేయడానికి పిలాతు ప్రయత్నం చేసాడు. పాస్క పండుగ సందర్భమున ఒక బందీని విడుదల చేయు ఆచారము ఉన్నందున యేసును విడుదల చేయమందురా అని పిలాతు వారిని అడిగాడు. కాని వారు యేసుకు బదులుగా బందిపోటు దొంగ అయిన బరబ్బను విడుదల చేయుడని కేకలు వేసారు.
(4). యేసును కొరడాలతో కొట్టెను, ముళ్ళ కిరీటము తలపై పెట్టెను, ముఖముపై కొట్టిరి (19:1-3) పిలాతు యేసును కొరడాలతో కొట్టించాడు. సైనికులు ముళ్ళకిరీటం అల్లి, ఆయన తలపై ఉంచి, ఊదారంగు వస్త్రమును తొడిగి, ‘యూదుల రాజా!నీకు శుభము!’ అంటూ యేసును అపహాస్యం చేసారు. ఆయన ముఖముపై కొట్టారు.
(5). పిలాతు-యూదులు: “ఇదిగో ఈ మనుష్యుడు” (19:4-7) - పిలాతు మరలా బయటకు వచ్చి ప్రజలతో ‘ఇదిగో! ఈయనలో నాకు ఏ దోషము కనిపింప లేదు’ అని చెప్పాడు. యేసు ముళ్ల కిరీటముతో మరియు ఊదా రంగు వస్త్రముతో బయటకు రాగా, పిలాతు ‘ఇదిగో ఈ మనుష్యుడు!’ అని అన్నాడు. ప్రధాన యాజకులు మరియు అధికారులు ఆయనను చూడగానే ‘వానిని సిలువ వేయుడు, సిలువ వేయుడు’ అని కేకలు వేసారు. పిలాతు వారిని ‘మీరే ఇతనిని తీసికొనిపోయి మీ చట్టము ప్రకారము సిలువ వేయుడి. నేనైతే ఇతనియందు నేరమేమియు కనుగొనలేదు’ అని చెప్పాడు. యూదులు తమకు ఒక చట్టం ఉందని, ఆయన తనను తాను దేవుని కుమారుడని చెప్పుకున్నందున ఆయన చనిపోవాలని బదులిచ్చారు.
(6). పిలాతు-యేసు: “నీవు ఎక్కడనుండి వచ్చితివి?” (19:8-11) - యూదులు చెప్పిన మాట విని పిలాతు మరింత భయపడి, మరలా లోపలికి వెళ్లి యేసును ‘నీవు ఎక్కడ నుండి వచ్చితివి?’ అని అడిగాడు. కాని యేసు అతనికి సమాధానం ఇవ్వలేదు. అప్పుడు పిలాతు ‘నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారమున్నదనియు, నిన్ను సిలువ వేయుటకును నాకు అధికారమున్నదనియు నీవు ఎరుగవా?’ అని అడిగాడు. అందుకు యేసు “పైనుండి నీకు అధికారము ఈయబడని యెడల నీకు నాపై అధికారము ఏమాత్రము ఉండెడిది కాదు. అందుచే, నన్ను నీచేతికి అప్పగించినవాడు, ఎక్కువ పాపము కట్టుకొను చున్నాడు” అని బదులిచ్చాడు.
(7). పిలాతు-యూదులు: “సీజరు తప్ప మాకు వేరొక రాజు లేడు” (19:12-16) - అప్పటి నుండి పిలాతు ఆయనను విడుదల చేయ ప్రయత్నించాడు, కాని యూదులు ‘నీవు ఇతనిని విడుదల చేసిన యెడల చక్రవర్తికి మిత్రుడవు కావు. తన్ను తాను రాజునని చెప్పుకొనువాడు చక్రవర్తికి విరోధి’ అని కేకలు వేసారు. ఈ మాటలు విని పిలాతు యేసును బయటకు తీసుకువచ్చి, న్యాయపీఠం మీద కూర్చుని ‘ఇదిగో మీ రాజు!’ అని యూదులతో అన్నాడు. అందుకు వారు ‘ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు’ అని కేకలు పెట్టారు. పిలాతు ‘ నేను మీ రాజును సిలువ వేయుదునా?’ అని అడిగాడు. అందుకు ప్రధాన యాజకులు ‘సీజరు తప్ప మాకు వేరొక రాజు లేడు’ అని పలికారు. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించాడు.
ఈవిధముగా, యూదాధికారులు యేసును చంపాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. వారి లక్ష్యాన్ని సాధించడానికి పిలాతును ఉపయోగించు కున్నారు. పిలాతు యేసు యొక్క నిర్దోషిత్వాన్ని గుర్తించినప్పటికీ, యూదుల భయానికి మరియు రాజకీయ ఒత్తిడికి లొంగిపోయాడు. యేసు తన బాధలను నిశ్శబ్దంగా సహించాడు మరియు తండ్రి దేవుని చిత్తానికి లోబడ్డాడు.
సిలువ, మరణము, భూస్థాపితము (యో 19:17-42): సిలువ, సిలువపై బిరుదము (19:16-22); యేసు అంగీకొరకు చీట్లు వేసుకొనుట (19:23-24); సిలువ చెంత మరియ తల్లి, ప్రియ శిష్యుడు (19:25-27); యేసు మరణము (19:28-30); యేసు ప్రక్కలో బల్లెపు పోటు (19:31-37); భూస్థాపితం (19:38-42).
సిలువ మరణం: యేసు తన సిలువను మోసికొని కపాలమను స్థలమునకు వెళ్ళాడు. దానిని హీబ్రూ భాషలో ‘గొల్గొతా’ అంటారు. ఆనాడు, అన్ని శిక్షలలోకెల్ల సిలువ మరణం చాలా క్రూరమైనది, ఘోరమైనది. ఇది బానిసలకు విధించే అతి నీచమైన మరణ దండనగా పిలువ బడేది. యేసు చాలా అవమానకరమైన, అమానుషమైన, అతి భయంకరమైన, హేయమైన, బానిస మరణాన్ని, నేరస్థుని మరణాన్ని పొందియున్నారు. ‘నజరేయుడగు యేసు, యూదుల రాజు’ అను బిరుదమును వ్రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించాడు.
సిలువ: సిలువ క్రీస్తు శ్రమలు, మరణమునకు, ఆయన అర్పించిన బలికి, రక్షణ విజయానికి చిహ్నము. సిలువను చూసినప్పుడెల్ల ఈ పరమ రహస్యమును మనము ధ్యానించాలి. ఈనాడు సిలువను ఆరాధిస్తున్నాము. ప్రతిమలో సిలువపై ఉన్న క్రీస్తు రూపము కొంతవరకు అందముగా ఉంటుంది. కాని, వాస్తవానికి ఇది అతీతం. ఈనాడు సిలువను ఆరాధించ గలగడానికి గల కారణం, అవమానానికి ప్రతీక అయిన సిలువ, క్రీస్తు సిలువపై మరణముతో మహిమకు సాధనముగా, జీవమునకు చిహ్నముగా మారియున్నది.
ఆయన సిలువ మరణాన్ని మనకోసం అంగీకరించారు: “తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయు వానికంటె ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు” (యో 15:13). సిలువ ప్రేమకు గుర్తు. ప్రభువు అందరి కొరకు మరణించారు. సిలువ పరలోక ద్వారము. సిలువ గురుతు ఒక వరం. దీని ద్వారా దేవుని ఆశీస్సులను, అనుగ్రహాలను పొందుచున్నాము.
సిలువ ప్రేమకు చిహ్నం: సిలువ మరణం యేసుకు మనపైగల ప్రేమకు అతిగొప్ప నిదర్శనము. పునీత పౌలు తన లేఖలలో, యేసు మరణాన్ని ప్రస్తావించినప్పుడెల్ల, దైవ ప్రేమను గూర్చి చెప్తారు, “క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే, దేవుని సంతోష పరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను, మన కొరకై తన ప్రాణములను సమర్పించెను” (ఫిలిప్పీ 5:2). యేసు మరణము ద్వారా, దేవుని ప్రేమ వ్యక్తమగుచున్నది. “నీతి మంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా, సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో కాని మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మనకొరకై మరణించెను గదా! ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు” (రోమా 5:7-8). “ఆయన తన స్వంత కుమారునికూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా?” (రోమా 8:32).
సిలువ ఆరాధన: ఈ రోజు శ్రీసభ, కలువరి గిరి క్రీస్తు సిలువవైపు చూస్తూ ఉన్నది. ప్రతి శ్రీసభ సభ్యుడు, సభ్యురాలు, సిలువ మ్రానుద్వారా క్రీస్తు సాధించిన రక్షణ గూర్చి ధ్యానించును. మోకరిల్లి సిలువను ముద్దిడి ఆరాధించడము ద్వారా, సిలువద్వారా క్రీస్తు అందించిన రక్షణకుగాను కృతజ్ఞులమై ఉంటున్నాము. క్రీస్తును ఆరాధిస్తున్నాము, “క్రీస్తువా! మిమ్ము ఆరాధించి, మీకు స్తోత్రములు అర్పిస్తున్నాము. ఎందుకన, మీ సిలువ చేత, ఈ లోకమును రక్షించితిరే.”
ఈరోజు సిలువ మార్గము (Stations of the Cross) అనే ప్రత్యేక ప్రార్థనను నిర్వహిస్తాము. ఇందులో యేసుక్రీస్తు సిలువ మోస్తూ వెళ్ళినప్పుడు జరిగిన 14 ముఖ్యమైన సంఘటనలను గుర్తుచేసుకుంటూ ప్రార్థనలు చేస్తాము. తదనంతరం, గుడ్ ఫ్రైడే సందర్భంగా జరిగే సిలువ ఆరాధన, యేసుక్రీస్తు సిలువ మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు గౌరవం చూపించే ఒక ప్రత్యేకమైన ప్రార్థనను జరుపుకుంటాము. ఈ ఆరాధనలో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి: ఒకటి, వాక్య పరిచర్య (Liturgy of the Word): ఈ భాగములో బైబిల్ నుండి యేసుక్రీస్తు శ్రమలు, మరణానికి సంబంధించిన పాఠ్య భాగాలు చదవబడతాయి. ముఖ్యంగా యోహాను సువార్తలోని యేసుక్రీస్తు శ్రమల ఘట్టాన్ని చదువుతాము. కీర్తనలు, ఇతర ప్రార్థనలు కూడా ఉంటాయి. రెండు, సిలువను ఆరాధించడం (Veneration of the Cross): ఇది ఈ ఆరాధనలో ముఖ్యమైన భాగం. సిలువను (కొన్నిసార్లు కప్పబడిన సిలువను) ఊరేగింపుగా తీసుకువచ్చి, తరువాత ఆ సిలువను ప్రజలందరికీ చూపిస్తారు. విశ్వాసులు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి సిలువ ఆరాధన చేస్తారు. కొందరు మోకరిల్లి ప్రార్థిస్తారు, మరికొందరు సిలువను ముద్దు పెట్టుకుంటారు. సిలువ క్రీస్తు యొక్క త్యాగానికి, మన రక్షణకు చిహ్నంగా భావిస్తాము. మూడు, దివ్య సత్ప్రసాదం (Holy Communion): గుడ్ ఫ్రైడే నాడు ప్రత్యేకంగా బలిపూజ జరగదు. అయితే, గురువారం నాటి బలిపూజలో ప్రతిష్ఠించిన దివ్యసత్ప్రసాదాన్ని ఈ ఆరాధనలో విశ్వాసులకు పంచుతారు. ఇది క్రీస్తు యొక్క శరీర రక్తాలలో పాలుపంచుకోవడం ద్వారా ఆయన త్యాగాన్ని గుర్తుచేస్తుంది.
ఈవిధముగా, గుడ్ ఫ్రైడే సిలువ ఆరాధన అనేది క్రైస్తవులమైన మనకు ఎంతో ముఖ్యమైనది. ఇది యేసుక్రీస్తు మనకోసం చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తుచేసుకోవడానికి, ఆయన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఒక గొప్ప అవకాశము.
కార్యసాధనలో సిలువ మరణం: యేసు ఎందుకు మరణించ వలసి వచ్చినది? ఏ కారణం ఆయన మరణానికి దారితీసింది? దేవునితో మానవ సంబంధాన్ని పునరుద్దరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. లోకమును నీతి న్యాయము, సోదరభావముతో కూడిన జీవితాన్ని స్థాపించడానికి వచ్చారు. లోకమును రక్షించాలని వచ్చారు. దేవుని ప్రేమను, కరుణను, శాంతిని బోధించాలని వచ్చారు. ఈ కార్యసాధనలో ఆయన సిలువ మరణాన్ని పొందాల్సి వచ్చినది.
యేసుక్రీస్తు ఈ లోకమునకు దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చారు. దానికై మారుమనస్సు పొందాలని పిలుపునిచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకమునకు మానవాళికి దేవుని ప్రేమను చూపించడానికి వచ్చాడు. యేసు తన మాటల ద్వారా, ముఖ్యంగా తన చర్యలద్వారా దేవుని అపారమైన ప్రేమను మానవాళికి తెలియజేశాడు. రోగులను స్వస్థపరచడం, పేదలను ఆదరించడం, అణగారిన వారి పక్షాన నిలబడటం ద్వారా ఆయన దేవుని కరుణను, ప్రేమను వ్యక్తం చేశాడు. యేసుక్రీస్తు ఈ లోకమునకు పాపమునుండి విమోచన కలిగించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు మానవాళి యొక్క పాపాల పరిహారం కోసం తనను తాను బలిగా అర్పించుకోవడానికి వచ్చాడు.
యేసు యొక్క సిలువ మరణం ఆయన కార్యసాధనలో ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు. అది దైవ ప్రణాళికలో ఒక ముఖ్యమైన, అనివార్యమైన భాగం. యేసుక్రీస్తు సిలువ మరణం కేవలం ఒక విషాదకరమైన ముగింపు కాదు. అది ఆయన కార్యసాధనలో ఒక కీలకమైన, విజయవంతమైన ముగింపు. ఆయన మరణం ద్వారా మానవాళికి పాప క్షమాపణ, దేవునితో సమాధానం, నిత్యజీవం లభించాయని మనము విశ్వసిస్తున్నాము. సిలువ అనేది క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర చిహ్నంగా మారింది. ఇది త్యాగం, ప్రేమ, విజయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
క్రీస్తు శ్రమలు దైవచిత్తమేనా?: “నేను పరలోకము నుండి దిగివచ్చినది, నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటకే కాని, నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనక, అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపినవాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతీవాడు నిత్యజీవితమును పొందుటయే నన్ను పంపినవాని చిత్తము” (యో 6:38-40). పతనమైన మానవున్ని ఔన్నత్యమునకు చేర్చుటయే దేవుని చిత్తము. దేవుడు ఆశించేది మానవుని సంరక్షణ, సౌభాగ్యమే కాని రక్తపాతము కాదు. క్రీస్తు మానవునికి విముక్తిని, పాపక్షమాపణను, నూతన జీవాన్ని, మరణానంతరము శాశ్వత జీవాన్ని ప్రసాదించడానికి వచ్చియున్నారు.
అయితే, లోతుగా ధ్యానించినట్లయితే, యేసు పొందిన శ్రమలన్ని, దైవనిర్ణయమని అర్ధమగుచున్నది. అయితే, ఆయన గ్రుడ్డిగా శ్రమలను పొందలేదు. దానిలో దైవచిత్తము ఉన్నది. మనలను రక్షించాలనే ప్రేమభావము ఉన్నది. యేసు సిలువపై “సమాప్తమైనది” (యో 19:30) అని పలికారు. దీని అర్ధం: తన శ్రమలు, మరణముద్వారా పాపాన్ని, పూర్తిగా నిర్మూలించారు. శ్రమలు, సిలువ, ముళ్ళకిరీటం అన్నీకూడా ఈ లోకములో ఇమడ గలవు, లేనిచో వాటిని ప్రభువు అంగీకరించేవారు కాదు. మరో మాటలో చెప్పాలంటే, పవిత్ర శుక్రవారము లేనిదే ఈస్టర్ ఆదివారము లేదు. మనం ఈ లోకమున మరణించి నట్లయితేనే, దైవరాజ్యమున జీవించగలము. ముళ్ళకిరీటం ఉన్నచోటనే, దేవుని మహిమ ఉన్నది. క్రీస్తుతో మరణించినప్పుడే, ఆయనతో ఉత్థానమవుతాము. ఇదే దేవుని చిత్తము.
క్రీస్తు సిలువపై “దాహమగుచున్నది” (యో 19:28) అని పలికారు. క్రీస్తు దాహము మన రక్షణము. ఆయన దాహము దైవచిత్త పరిపూర్ణము. ఆయన దాహం మనపై సంపూర్ణ ప్రేమ (యో 4:10-14, 6:54 -56). ఈనాడు సిలువ చెంత ఉన్న మనము, సిలువపై ఉన్న క్రీస్తు మన కొరకు ఎంత దాహమును కలిగి యున్నారో గుర్తించుదాం. దివ్యపూజా బలిలో తన శరీర రక్తముల ద్వారా, క్రీస్తు మన దాహాన్ని తీరుస్తున్నారు. మనలను మనము ఆయనకు సంపూర్ణముగా అర్పించుకొందాము.
మన కర్తవ్యం?: సిలువ మరణం చూడటానికి ఒక ఓటమిలా కనిపించినప్పటికీ, క్రైస్తవులమైన మనకు ఇది ప్రేమ యొక్క విజయం. ద్వేషాన్ని ప్రేమతో, హింసను సహనంతో యేసుక్రీస్తు ప్రభువు జయించాడు. ఆయన మరణం ద్వారా మరణం యొక్క శక్తిని ఓడించాడు. పునరుత్థానానికి మార్గం తెరిచాడు.
క్రీస్తు కడరా భోజన స్మరణ ద్వారా ఆయన మరణమును మనము జ్ఞప్తియందు ఉంచుకొన వలయును (1 కొరి 11:24-25, 1 పే 3:18). యేసు చేసిన పోరాటాన్ని, ఆయన ప్రసాదించే శక్తితో, ఆయన శిష్యులమైన మనము ఈ లోకములో కొనసాగించాలి. యేసు సిలువ మరణం విశ్వాసులమైన మనకు ఒక ఆదర్శాన్ని ఇస్తుంది. కష్టాలలో సహనం వహించడం, శత్రువులను ప్రేమించడం, దేవుని చిత్తానికి లోబడి ఉండటం వంటి విషయాలలో ప్రభువు మనకు మార్గనిర్దేశం చేసాడు. కనుక, సంఘములోని అవినీతి, అన్యాయాన్ని, పేదరికాన్ని, బానిసత్వాన్ని, వ్యాధి బాధలను నిర్మూలించాలి. శాంతిని, ప్రేమను, నీతి, న్యాయాలను, సోదరభావాన్ని స్థాపించాలి. ఇది మన కర్తవ్యం, ధర్మం. ఈ కర్తవ్యం కొరకు ప్రాణాలను సైతం త్యాగము చేసిన మహాత్ములు ఎంతమందో ఉన్నారు. మనము కూడా అన్నీ ఓర్పుతో సహించుదాము. ఓకే సంఘముగా ప్రేమతో జీవించుదాము. పరస్పర క్షమాపణ కలిగి జీవించుదాము.
ఈ రోజున, మనం ప్రత్యేకంగా ప్రార్థనలో గడుపుదాం. యేసుక్రీస్తు శ్రమలను మరియు ఆయన మన కోసం అనుభవించిన బాధలను ధ్యానిద్దాం. మన పాపాల కోసం పశ్చాత్తాప పడదాం మరియు ఆయన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. సిలువ అనేది దుఃఖము మరియు బాధ యొక్క చిహ్నం అయినప్పటికీ, అది మనకు నిరీక్షణ మరియు రక్షణ యొక్క చిహ్నముగా మారింది. యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా మరణంపై విజయం సాధించి, మనకు శాశ్వతమైన జీవితానికి హామీ ఇవ్వబడింది.
యేసుక్రీస్తు యొక్క శాంతి, ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమెన్!
No comments:
Post a Comment