క్రీస్తు సాక్షత్కార మహోత్సవము, జనవరి 6, 2013

క్రీస్తు సాక్షత్కార మహోత్సవము, జనవరి 6, 2013 
పఠనాలు: యెషయా 60: 1-6; కీర్తన 72: 1-2, 7-8 , 10-13; ఎఫెసీ 3:2-3, 5-6; మత్తయి 2:1-12 

ఇదిగో! సర్వాధికారియైన సర్వేశ్వరుడు వచ్చుచున్నాడు. తన చేతియందు రాజ్యాధికారము, శక్తి సామర్ధ్యములను కలిగి వచ్చుచున్నాడు. 

దేవుడు నమ్మదగిన వాడు 

మనలో ప్రతి ఒక్కరముకూడా, నమ్మకము కలిగిన వ్యక్తిని కోరుకొంటాం. అలాంటి వ్యక్తికోసం ఎదురు చూస్తూ ఉంటాము. మనలను ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని ఉండటము మాత్రమేగాక, వాగ్దానాలను చేయడం మాత్రమేగాక, మంచి తనము కలిగి చేసిన వాగ్దానాలను నెరవేర్చుటకు కావలసిన శక్తిని కలిగియున్న వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటాం. అధారపడదగిన వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి, విశ్వాసముగల వ్యక్తి మనదరికీ కావాలి... ఆ వ్యక్తియే దేవుడు. జ్ఞానుల శిశు సందర్శనము, దేవుని విస్వసనీయతకు, నమ్మకమునకు, ఋజువుగా, బైబిలు గ్రంధములోనున్న అత్యంత అందమైన ప్రామాణాలలో ఒకటి. 

క్రీస్తు జనమ్మునకు 500 సం,,ల పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా, రక్షణ వెలుగును పంచుకొనుటకు అన్ని దేశములను యేరూషలేమునకు నడిపిస్తానని దేవుడు వాగ్ధానము చేసియున్నాడు (యెషయా 49:6). కీర్తనకారుని ద్వారా, ఇదే వాగ్దానాన్ని మరోమాటలో చేసియున్నాడు: ''తర్శీషు రాజులు, ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. షేబా, సెబా పాలకులు కానుకలు కొనివత్తురు'' (కీర్తన 72:10). 500 ల సం,,లు యుద్ధాలు జరిగినను, ప్రజలు వలసలు పోయినను, చారిత్రాత్మక కలతలు జరిగినను, నాగరికత ప్రపంచములో మూడు వేర్వేరుసార్లు ప్రపంచ పటమును తిరగరాసినను, దేవుడు వాగ్ధానము చేసిన దానిని నెరవేర్చియున్నాడు. మంచి వ్యక్తులు, నమ్మకము కలిగిన వ్యక్తులు మాత్రమే మంచి వాగ్దానాలను నిలబెట్టగలరు. జ్ఞానుల ద్వారా, వారి కానుకలద్వారా, సకల దేశాలు, జాతులు రక్షణ వెలుగులోనికి ప్రవేశించియున్నాయి. 

జ్ఞానుల శిశు సందర్శనము దేవుని మంచితనాన్ని మరియు ఆయన శక్తికలవాడని నిరూపిస్తున్నది. ఆయన మన దేవుడు, అందరి దేవుడు. దేవుని మంచితనము, ఆయన శక్తి మనవే, ఎందుకన, మనము క్రీస్తుకు చెందినవారము. దేవుడు, నీకు, నాకు వ్యక్తిగతముగా విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. ఆయన మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం. అన్నివేళల, అన్నిసమయాలలో, ఆయనను పరిపూర్తిగా విశ్వసించుదాం, పూర్ణహృదయముతో ప్రేమించుదాం. మనమూ ఆయనకు నమ్మదగినవారముగా జీవించుదము. 

రాజైన దేవుడు పరిపాలించుటకు వేంచేయును 

జ్ఞానుల శిశు సందర్శనములో, లోకరాజు జన్మనుగూర్చి ఎరిగి, హేరోదు రాజు కలత చెందాడు. అదే వార్తను ఎరిగిన జ్ఞానులు ఎంతో ఆనందించారు. హేరోదు తన జీవితాంతం హత్యలు చేస్తూ, అన్యాయముగా మరియు స్వార్ధముతో జీవించియున్నాడు. వ్యక్తిగత కీర్తికోసం, పేరు ప్రతిష్టల కోసం రాజ్యాన్ని పరిపాలించాడు. పరలోకమునుండి, గొప్ప అధికారముతో క్రీస్తు లోకరాజుగా ఈ లోకములో ఉద్భవించాడు. హేరోదు భయపడి, క్రీస్తును హంతం చేయకపోతే, తన జీవితం ముగుస్తుందని కలత చెందాడు. మరోవైపు, అన్య దేశాలనుండి వచ్చిన జ్ఞానులు లోకరక్షకుని పట్ల ఎంతగానో సంతోషించారు. లోకరక్షకుడు, రాజునైన క్రీస్తుపైనే వారి జీవితాలు, రాజ్యాలు ఆధారపడియున్నాయని గ్రహించారు. 

క్రీస్తు ప్రతీరోజు అనేక విధాలుగా మనకీ సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. మన మనసాక్షిద్వారా, శ్రీసభ బోధనలద్వారా, దేవుని కృపా వరములద్వారా, మనలోనికి వేంచేస్తూ ఉన్నాడు. హేరోదువలె కలత చెంది, ఆయనను నిర్మూలించుటకు ప్రయత్నింపక, జ్ఞానులవలె, సంతోషముగా, ఆయనను మనలోనికి, మన జీవితములోనికి ఆహ్వానిద్దాం, ఆయనను కలుసుకొందాం. 

దైవ రాజ్యము, శ్రీసభ 

క్రీస్తు ఈ లోకమును పాలించుటకు వచ్చెను, అనగా, సర్వమానవాళిని ఆధ్యాత్మికముగా పాలించి దైవరాజ్యమున చేర్చుటకు ఆధ్యాత్మిక రాజుగా వచ్చాడు. ఆయన ఈలోకమున దైవ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన బోధనల ద్వారా, ఆయన చూపించిన మార్గముల ద్వారా, ముఖ్యముగా, శ్రీసభ ద్వారా ఆ దైవరాజ్యం ఈ నాటికిని కొనసాగుతూనే ఉంది. దైవరాజ్యములో అందరు భాగస్తులే. కాలగతిలో, అనేకమంది శ్రీసభ రూపముననున్న ఈ దైవరాజ్యాన్ని హేరోదు వలె నిర్మూలించాలని ప్రయత్నించారు. వారి ఆధీనములోనుంచుటకు ప్రయత్నించారు. కాని, ఎవరూ నాశనం చేయలేకపోయారు. శ్రీసభ జీవిస్తూనే ఉన్నది, అభివృద్ది చెందుతూనే ఉన్నది, వ్యాప్తి చెందుతూనే ఉన్నది. ఎందుకన, ఈ రాజ్యానికి దేవుడే అధిపతి. ఈ రాజ్యము కలకాలము నిలచును. సర్వము దేవుని ఆధీనములో ఉన్నది. 

నక్షత్రము వలె మార్గ దర్శకులమవుదాం 

''తూర్పు దిక్కున జ్ఞానులు చూసిన నక్షత్రము వారికి మార్గదర్శినీయై, శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలచెను'' (మత్తయి 2:9). ప్రతీ ఒక్కరం ఓ నక్షత్రమువలె ఉండాలి. ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ క్రీస్తు ప్రేమకు సదా సాక్షులమై ఉండాలి. ఈలోకానికి అతీతముగా ఇతరులు వారి కన్నులను పైకెత్తి అనంతమైన దైవరాజ్యమువైపు చూచునట్లు ప్రోత్సహించాలి. క్రీస్తు రాజ్యములో మనం పౌరులం, ఈ లోకమున ఆయన దూతలం లేదా ప్రతినిధులం. 

అందరూ పరిపూర్ణమైన జీవితాన్ని ఆశిస్తారు. కాని, పొందలేకున్నారు. ఎందుకన, ఆ పరిపూర్ణతను వారికున్న సంపదలో, సుఖములో, అధికారములో, మానవ సంబంధాలలో, లోకాశలలో వెదకుచున్నారు. ఇలాంటి వారికి మనము నిజమైన రాజ్యాన్ని, కలకాలము నిలచే రాజ్యాన్ని చూపించగలగాలి. 

మనం చేసే ప్రతీ పని, మనం మాట్లాడే ప్రతీ మాట క్రీస్తును ప్రతిబింబించాలి. మనం మరో క్రీస్తులా మారాలి. ఎలా? మనలను ప్రేరేపించుటకు, మార్గము చూపుటకు పవిత్రాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్ధన చేద్దాం. అలాగే, జ్ఞానులకు మార్గదర్శినీయై క్రీస్తు వద్దకు చేర్చిన నక్షత్రమువలె మనముకూడా మన జీవితాదర్శముద్వారా ఇతరులను క్రీస్తు చెంతకు చేర్చుదాం.

No comments:

Post a Comment