క్రీస్తు
బప్తిస్మ పండుగ, Year C
పఠనములు: యెషయ 40:1-5,
9-11; తీతు 2:11-14; 3:4-7; లూకా
3:15-16, 21-22
రక్షకుడు
బప్తిస్మము పొందిన సమయమున, ఆకాశము తెరచు కొనెను. పవిత్రాత్మ పావుర రూపమున
వచ్చి ఆయన మీద నిలచెను. "నాకానందము కలిగించు నా ప్రియతమ పుత్రుడితడే"నను
పిత స్వరము వినిపించెను.
ఈ రోజు మనం యేసు జ్ఞానస్నాన పండుగను
కొనియాడుచున్నాము. బప్తిస్మ యోహాను ఇచ్చే స్నానం పాపాలకై పశ్చాత్తాపాన్ని, హృదయ
పరివర్తనను సూచించే స్నానం. యూదులు అట్టి స్నానాన్ని ఇంతవరకు ఎరుగలేదు; వారు
యూదమతమును స్వీకరించే అన్యులకు 'స్నానం' ఇచ్చేవారు. స్నానం చేసినంత మాత్రాన
సరిపోదు. పాపజీవితాన్ని విసర్జించి, హృదయ పరివర్తన చెందటం ముఖ్యమని యోహాను
బాప్తిస్మంలోని సారాంశం. యేసు యూదుడుగా బాప్తిస్మం అవసరం లేదు, అయినను,
మనందరి రక్షణ నిమిత్తమై ఆయన బాప్తిస్మం పొందారు. ఇదే విషయాన్ని యేసు యోహానుకు
ఈ విధముగా తెలిపారు: "ఇపుడిట్లే జరగనిమ్ము. దేవుని ప్రణాళిక అంతటిని మనము
ఈరీతిగా నెరవేర్చుట సమంజసము" (మత్త 3:15).
యేసు క్రీస్తు జ్ఞానస్నానములో ఇమిడియున్న
పరమ రహస్యము ఏమిటంటే, నీటిలోనికి ప్రవేశించుట, సిలువ
మరణానంతరం ఆయన సమాధి చేయబడుటను సూచిస్తున్నది. నీటిలోనుండి బయటకు వచ్చుట ఆయన
మరణమును సమాధిని జయించుటను సూచిస్తున్నది, ఇచ్చట
జ్ఞానస్నాన సమయములో పవిత్రాత్మను స్వీకరించిన ఆయన మృత్యుంజయుడైన తరువాత
పవిత్రాత్మ వరప్రదాతయని సూచిస్తున్నది. ఆదితల్లిదండ్రుల పాపఫలితముగా మూయబడిన
స్వర్గద్వారము, క్రీస్తు జ్ఞానస్నాన సమయములో తెరువబడెను (మత్త. 3:16).
గొర్రెల కాపరులకు, శుభవార్త
ప్రకటించిన తరువాత, ముగ్గురు రాజులు, అద్భుత
నక్షత్రం ద్వారా నడిపింపబడి, చిన్నారి బాలుని దర్శించిన తరువాత, ఈ రోజు,
దేవుని వాక్కైన క్రీస్తు ప్రభువు, యోర్దాను
నదిలో, తను పొందిన బాప్తిస్మం ద్వారా, తననుతాను
ఇశ్రాయేలు ప్రజలకు తెలియ పరచుకొంటున్నాడు. "ఈయన నా ప్రియమైన కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నాను" (3:22) అని
పలికిన దివ్యవాణి, పావుర రూపమున వేంచేసిన పవిత్రాత్మ, యేసు
ప్రభువు నిజమైన రూపాన్ని, అనగా దేవుని కుమారుడని చాటి చెప్పుతుంది. తండ్రి
దేవుడు తన కుమారుని దైవత్వాన్ని ప్రకటించారు. ఈ
పిలుపు తర్వాతే, యేసు ప్రభువు ఒక కొత్త వ్యక్తిగా మారాడు. 30 సం.ల వరకు ఒక సాధారణ యూదుడుగా, సినగోగు
ప్రార్ధనాలయమునకు వెళ్ళుచూ, దేవుని వాక్యాన్ని చదువుచూ, ధ్యానించుచూ,
జీవితాన్ని కొనసాగించాడు. కాని ఈ రోజు ఇదంతయు కూడా మార్పు చెందినది.
యేసు ప్రవక్తగా, మెస్సయ్యగా, సేవకునిగా తాను
చేయాల్సిన ప్రేషిత కార్యానికి నేడు తండ్రిచేత బలపరచ బడినారు. ఆయన
చేయవలసిన కార్యాన్ని తండ్రి దేవుడు ధ్రువపరిచారు.
యేసు బాప్తిస్మంద్వారా, ఆకాశానికి,
భూమికీ మధ్య తెగిపోయిన సంబంధం, తిరిగి
నెలకొల్పబడినది. ఈ శుభవార్తను యెషయా ప్రవక్త ముందుగానే
తెలియజేశాడు. మొదటి పఠనములో యెషయా నోటిద్వారా, దేవుని
మాటలను విన్నాము. నా ప్రజలను ఒదార్పుడు! ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సం.లు
బానిసత్వములో జీవించారు, దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయారు. ఇటువంటి
సమయములో, ప్రభువు ఇలా తన వ్యాక్యాన్ని తన ప్రజలకు తెలియ
జేశాడు. "యెరుషలేము ప్రజలకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వం
ముగిసినదని, వారి తప్పిదములు మన్నింపబడినవని తెలియ
జెప్పుడు." మన జీవితములో కూడా, బాధలు, కష్టాలు
వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలవలె నమ్మకాన్ని, విశ్వాసాన్ని
కోల్పోతూ ఉంటాము. అలాకాక, కష్ట సమయములోనే, మన
విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి.
మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్ష
మయ్యెను (రెండవ పఠనము) అనెడు వాగ్ధానపు పండుగను, ఈ రోజు
మనం యేసు ప్రభువు పొందిన జ్ఞానస్నానం ద్వారా తెలుసుకొంటున్నాము. ఈ రోజునుండి తను
ఎక్కడనుండి వచ్చినది, ఎక్కడికి వెళ్ళేది, ఏమి
చేయాలన్నది ఎరిగియున్నాడు. తండ్రి సమస్తమును తన చేతుల్లో ఒప్పగించాడని, తనతోపాటు
సమస్తమును తీసుకొని వెళ్ళవలెనని, పవిత్రాత్మ అతనికి సూచించినది. ఆయనయందు
సర్వమానవాళి ఏకమైయున్నది. ప్రతి వ్యక్తి మానవ శరీర వాంఛద్వారా కాక, దేవుని
చిత్త ప్రకారముగా జన్మించెనని తెలుసుకోవాలి.
జ్ఞానస్నానం హృదయ పరివర్తనకు పిలుపు.
యోహాను తన వద్దకు వచ్చిన వారితో ఇలా అన్నాడు: "ఓ సర్పసంతానమా!
రానున్న కోపాగ్నినుండి తప్పించుకొను మార్గమును మీకు సూచించిన దెవరు? మీరు
ఇక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు..." ఇది విన్న పరిసయ్యులు, సద్దుకయ్యులు,
తను ఎవరని ప్రశ్నించగా, "తాను మెస్సయ్య కాదని, దేవుని
మార్గమును సిద్ధము చేయుటకు పంపబడిన స్వరమును మాత్రమే అని, ఇక
హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు..." అని సమాధానమిచ్చాడు. అందుకు జనులు
మేమేమి చేయవలెనని అడుగగా, "తమకు ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేయుడు, ఎవరికీ
అన్యాయం చేయకుడు" అని పలికాడు. ఇక్కడ మనకి ఒక శక్తివంతమైన సందేశం
అర్ధమగుచున్నది. కేవలం జ్ఞానస్నానం తీసుకుంటే సరిపోదు. మన దైనందిన జీవితం దానికి
అనుగుణముగా ఉండాలి. మంచి కార్యాలు చేయాలి. అప్పుడే మన జ్ఞానస్నానానికి అర్ధం
ఉంటుంది. లేనిచో నామమాత్రపు కతోలిక క్రైస్తవులుగా ఉండిపోతాము. అలా ఉండటం దేవునికి
యిష్టం ఉండదు.
యోహాను బాప్తీస్మం ప్రజలను హృదయ
పరివర్తనకు సిద్ధము చేసే స్నానం మాత్రమే, కాని మెస్సయ్య ఒసగు జ్ఞానస్నానం ప్రజల
పాపాలను ప్రక్షాళనం చేసి వారిని పవిత్రాత్మతో నింపుతుంది. ఈ జ్ఞానస్నానం వలన
మానవునిలో కలిగే అంతరంగికమైన మార్పును గురించి యెహెజ్కెలు ప్రవక్త ఈవిధముగా
చెప్పాడు: ‘మీకొక కొత్త హృదయమును, ఒక కొత్త మనస్తత్వమును ప్రసాదించెదను. మీనుండి
రాతి హృదయమును తీసివేసి మీకొక మాంసపు హృదయమును ప్రసాదించెదను. నా మనస్తత్వమును మీ
యందు పుట్టించి, మీరు నా చట్టము ప్రకారము జీవించునట్లును, నేరవేర్చునట్లును
చేయుదును (36:26-27). ఇట్టి జ్ఞానస్నానాన్ని ఒసగు మెస్సయ్య, ఏ పాపం
చేయని తాను, మానవులందరి పాపములను తనపై వేసుకొని, వారి
స్థానములో, యోర్దాను నదిలో, యోహాను
ఎదుట నిలబడి యున్నాడు. తన పాటుల ద్వారా, మరణ ఉత్థానముల ద్వారా, మనలను
శుద్దిచేసి దైవబిడ్డలుగా మార్చడమే ఆయన ధ్యేయం!
యేసుక్రీస్తు బాప్తిస్మ పండుగద్వారా,
వాక్కు లోకమునకు రానైయున్న వెలుగని, గ్రుడ్డివారికి
చూపును, చెరలోనున్న వారికి విముక్తిని ఒసగనున్న నిజమైన
మెస్సయ్య అని మనకు అర్ధమగుచున్నది. ఆశ్చర్యకరమగు విషయమేమనగా, ఆకాశమునుండి
వినబడిన దివ్యవాణి, మనం ఆయన ప్రియమైన బిడ్డలమని, మనం
పాపాత్ముల మైనప్పటికినీ, ఆ ప్రభుని రక్షణ మనలనందరినీ రక్షించినదని తెలియ జేసింది.
ఎవరుకూడా, ప్రభువు వాక్యాన్ని, అది
పండించే ఫలాన్ని, అది చూపించే వెలుగుని ఆపలేరు. దేవుని ప్రేమ ఒక
అగ్నివలె లోకమంతట వ్యాపించును. యోహాను బాప్తిసం ఒక గురుతు మాత్రమే, కాని
మెస్సయ్య ఒసగు బాప్తిసం దేవుని సంపూర్ణ ప్రేమలో, పవిత్రాత్మలో
ముంచుతుంది.
జ్ఞానస్నానం పొందిన ప్రతీ వ్యక్తి దేవుని
బిడ్డ అను గుర్తింపును పొందును. ఈ గుర్తింపు మన అనుదిన జీవితములో ఒక బలముగా,
ప్రేరణగా, దృఢవిశ్వాసముగా ఉండి ముందుకు నడిపించును. మనలను మనం
ప్రశ్నించుకోవలసినది ఏమనగా, మన జ్ఞానస్నానముతో మనం ఏమి చేయుచున్నాము? మన
జ్ఞానస్నానము, క్రీస్తునందే మన గుర్తింపు, క్రీస్తులో
ఐఖ్యతకు సూచన; దేవుని బిడ్డలమని ఒక నిజమైన గురుతు అయినప్పుడు,
మనం విశ్వాసములో జీవించగలగాలి. జ్ఞానస్నానము పొందిన యేసు, దైవరాజ్యమును,
సువార్తను బోధించుటకు వెళ్ళారు. మనంకూడా, మన
అనుదిన జీవిత బాధ్యతలద్వారా, ఆ దైవరాజ్యమును, దేవుని
ప్రేమను, ఆయన సువార్తను ప్రకటించాలి. జ్ఞానస్నానములో
జీవితమును, నమ్మకమును, ఆశను,
విశ్వాసమును, ప్రేమను పొందియున్నాము. అలా మనం జీవిస్తున్నామా?
జ్ఞానస్నానం ఒక నూతన ఆరంభం. యేసు నిజమైన మార్గము, సత్యము,
జీవమని, ఆయనలోనే శాశ్వత జీవమున్నదని పవిత్రాత్మ మనకు
తెలియ బరచునుగాక! ఆమెన్.
కనుక, క్రీస్తు
బాప్తిస్మం తన దైవత్వానికి సూచన; త్రిత్వైక దైవం ప్రదర్శింప బడినది; లోక
పాపాలను యేసు తనపై వేసుకున్నాడు; తండ్రి ప్రణాళికను నెరవేర్చ సంసిద్ధమయ్యాడు.
No comments:
Post a Comment