మూడవ సామాన్య ఆదివారము - YEAR C

మూడవ సామాన్య ఆదివారము - YEAR C
పఠనములు: నెహెమ్యా 8:2-4, 5-6, 8-10; 1 కొరింథి 12: 12-31; లూకా 1:1-4, 4: 14-21

దేవుని ప్రేమ అపారమైనది, అనంతమైనది. దేవుని ప్రేమ సృష్టియందు, రక్షణయందు విశదపరచడమైనది. ఆ ప్రేమకు, ప్రతీ ఒక్కరు వ్యక్తిగతముగా, స్పందించాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. తన పోలికలో సృజించిన మనలను ఆయనతో ఉండటానికి ఆహ్వానిస్తున్నాడు. పాపము వలన, ఆయన సన్నిధినుండి దూరమైన మనలను పశ్చాత్తాపం, మారుమనసు పొంది తిరిగి ఆయన సన్నిధిలోనికి రావలయునని తండ్రి దేవుడు ఆశిస్తున్నాడు. మారుమనస్సు అనగా, మన జీవితాలను మార్చుకోవడం, పాత జీవితమును విడనాడటం, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం, ముఖ్యముగా, మన జీవిత మార్గాన్ని మార్చుకోవడం. పరిపూర్ణమైన మార్పును దేవుడు మనలనుండి ఆశిస్తున్నాడు.

మొదటి పఠనములో విన్నట్లుగా, ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో, ధర్మశాస్త్రము, దేవుని వాక్యము ముఖ్యమైన పాత్రను పోషించింది. ధర్మశాస్త్రమును విని, పాశ్చాత్తాప పడి, దేవుని సన్నిధిలోనికి వచ్చియున్నారు. పడిపోయిన వారి జీవితాలను, సంఘాన్ని పునర్నిర్మించుకొన్నారు. నిర్లక్ష్యము చేసిన దేవాలయాన్ని నిర్మించుకొన్నారు. దేవుని చట్టంయొక్క ప్రాముఖ్యతను, దానిని విధేయించాలని గుర్తించారు. దేవుని చట్టమును విని చేతులు పైకెత్తి 'ఆమెన్ ఆమెన్' అని వారి సమ్మతమును తెలియ జేశారు, నేలపై సాగిల పడి వారి విధేయతను వ్యక్తపరచారు.

రెండవ పఠనములో, క్రీస్తు శరీరమున సభ్యులమైన మన మందరము, ఐక్యతతో జీవించాలని తెలియ జేస్తుంది. ప్రతీ ఒక్కరు కూడా, ప్రభువును స్తుతించుటకు, ఆరాధించుటకు, సేవ చేయుటకై పిలువబడి యున్నాము. అందరూ సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన ఉండకూడదు. ఒకరి నొకరు సహాయము చేసుకొంటూ, ఒకే సంఘముగా, ఒకే శరీరముగా జీవించ వలయును. ప్రస్తుతం మనలో ఉన్న పెద్ద సమస్య ... వ్యక్తిగతముగా జీవించాలని కోరుకోవడం. నేను...నా ప్రపంచం అన్న ఆలోచనా తీరుతో జీవిస్తున్నాము. మన పిలుపు అనేక విధాలైన, మనమందరమూ జీవిస్తున్నదీ, ఒకే ఒక శ్రీసభలో, మరియు మనలను నడిపించేదీ ఒకే ఆత్మయే!

సువార్తా పఠన ధ్యానం: లూకా, పౌలుగారి అనుచరుడు, వైద్యుడు. సువార్తను తెయోఫిలూ (దేవుని ప్రేమికుడు, దేవునికి ప్రియమైన వాడు) అను విశ్వాసునికి వ్రాసియున్నాడు.

యేసు నజరేతున, అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్ధనా మందిరమునకు వెళ్ళాడు. అచట యెషయా గ్రంధమునుండి, వాక్యమును చదివి, "నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరెను" అని పలికాడు. అవును! యెషయా లేఖనమున ఉన్నట్టుగా, ప్రభువు ఆత్మతో నింపబడిన యేసు పేదలకు సువార్తను బోధించుటకై అభిషేకించబడెను. చెరలో నున్నవారికి విడుదల, గ్రుడ్డివారికి చూపును కలుగ జేయుటకు, పీడితులకు విమోచనము కలుగ చేయుటకు, ప్రభు హిత సం.ను ప్రకటించుటకు తండ్రి దేవునిచేత పంపబడెను.

సినగోగున ప్రభువు బోధనలను ప్రజలు ఆలకించారు, కాని వారు సంపూర్ణముగా అర్ధము చేసుకొనలేక పోయారు. అర్ధమైనంత వరకు కొంతమంది ఆయనను విశ్వసించారు. ప్రభు వాక్యాన్ని మనం పరిపూర్ణముగా అర్ధం చేసుకోవాలంటే, పవిత్రాత్మ శక్తి మనలో ఉండాలి. వాక్కు ఈనాటికి మన మధ్య సజీవముగా ఉన్నది. విశ్వాసముతో, అర్ధం చేసుకొని, ధ్యానించి, మన దైనందిన జీవితములో ఆ వాక్కును జీవించాలి.

మనం పేదవారము. దేవుని సంపదయైన వాక్కు లేని పేదవారము, దేవునిపై విశ్వాసము, ప్రేమ లేని పేదవారము. ఒకరిపై ఒకరికి నమ్మకము లేని పేదవారము. దైవాజ్ఞలను, క్రీస్తు బోధనలను పాటించలేని పేదవారము. అదిగో! పవిత్రాత్మతో నింపబడిన ప్రభువు, ప్రతీక్షణం ముఖ్యముగా దివ్యపూజా బలిలో, దివ్యసంస్కారములయందు, తన సువార్తను మనకు బోధిస్తున్నాడు. మనం పాపం, సైతాను అను దుష్టశక్తులకు లోనై వాని చెరలో బంధీలమై ఉన్నాము. ప్రాపంచిక వ్యసనాలతో, స్వార్ధముతో బంధీలుగా జీవిస్తూ ఉన్నాము. అదిగో! మనలను విడుదల చేసి, విముక్తిని గావించి నిజమైన స్వాతంత్ర్యమును ఒసగుటకు ఆత్మ పూరితుడైన ప్రభువు సిద్ధముగా ఉన్నారు.

మనం ఆధ్యాత్మికముగా గ్రుడ్డివారము. ఈ లోకములో నిజమైన జీవితం ఏమిటో తెలుసుకోలేని గ్రుడ్డివారము. నిజమైన వెలుగును చూడలేని గ్రుడ్డివారము. అదిగో! మన ఆధ్యాత్మిక కన్నులను తెరచుటకు ప్రభువు సిద్ధముగా ఉన్నారు. మనం అనేక శారీరక, ఆధ్యాత్మిక, మానసిక సమస్యలతో సతమతమవుచున్న పీడితులం. మనకు విమోచనను కలిగించుటకు ప్రభువు సిద్ధముగా ఉన్నారు.

మనలో ఆరంభం కావలసినది, మారుమనస్సు, పశ్చాత్తాపం. అప్పుడు ప్రభువు తప్పక మనలను కాపాడతాడు, రక్షిస్తాడు. తండ్రి రాజ్యములో భాగస్తులను చేస్తాడు. వాక్కును విశ్వసిద్దాం, దానిని పాటిద్దాం.

No comments:

Post a Comment