సర్వాధికారియగు క్రీస్తు రాజు మహోత్సవము, Year B

సర్వాధికారియగు క్రీస్తు రాజు మహోత్సవము, Year B
కడపటి సామాన్య ఆదివారము
పఠనములు: దానియేలు 7:13-14; భక్తి కీర్తన 93:1-2,5; దర్శన గ్రంధము 1:5-8; యోహాను 18:33-37

బలియైన గొర్రెపిల్ల అధికారమును, దైవత్వమును, వివేకమును, శక్తి సామర్ధ్యములను, మహిమలను పొందుటకు అర్హత కలిగియున్నది. దీనికే యుగయుగముల పర్యంతము మహిమ రాజ్యాధికారములు లభించును. సర్వేశ్వరుడు రాజ సింహాసనమందు ఆసీనుడై యుండును. ఆయన తన ప్రజలకు శాంతి వరమును ప్రసాదించును (కీర్తన. 29:10-11).

ఈ రోజు దైవార్చన సం,,లో చివరి ఆదివారము మరియు ఈ రోజు సర్వాధికారియగు క్రీస్తు రాజు మహోత్సవమును కొనియాడుచున్నాము. ప్రపంచ దేశాలెన్నో గతములో రాజులచేత పరిపాలించబడ్డాయి. రాజుల పాలనను మనం చూడక పోయిన, ఎంతగానో వినియున్నాము కాబట్టి, ఎంతో కొంత అవగాహన మనందరికీ ఉన్నది. ఎంతోమంది గొప్ప గొప్ప రాజుల చరిత్రలు మనకు తెలుసు. అలాగే పాలితులను, రాజ్యాలను కొల్లగొట్టి వినాశనము చేసిన రాజుల చరిత్రలూ మనకు తెలుసు. రాజు అనగానే, మన మదిలో మెదిలేది భయం, క్రూరత్వం, సైన్యం, యుద్ధం మొ,,వి. రాజు అనేవాడు తన ప్రజలకు ఓ గొర్రెల కాపరివలె, ప్రేమించే హృదయాన్ని కలిగి యుండాలి. సంఘాన్ని న్యాయముతో, శాంతి పధములో నడిపించగలగాలి. ప్రజల అవసరాలను గుర్తెరిగి వాటిని నెరవేర్చే వాడై ఉండాలి. అలాంటి పరిపాలనను మనం స్వర్ణయుగముతో పోల్చుతూ ఉంటాము.

 ఈనాడు మనం కొనియాడే ఈ పండుగ, క్రీస్తుని సర్వాధికారము మరియు సర్వాధిపతియని తెలియజేస్తుంది. ఈ పండుగ మన భవిష్యత్తును ధ్యానించేలా చేస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజులు. ఐహికత్వం పెరుగుతున్న కాలం. యూరోపు మరియు ఇతర దేశాలలో భయానకర నియంతలు వెలుగులోనికి వస్తున్న కాలం. ఇలాంటి సమయములో, క్రీస్తు ఒక రాజుగా గౌరవించబడాలని, చర్చికి కూడా స్వతంత్ర౦ కలదనే విషయం లోకం తెలుసుకోవాలని, విశ్వాసులు బలాన్ని, ధైర్యాన్ని పుంజుకొంటారని తలంచి, ఈ పండుగను 1925 వ సం.లో 11 వ భక్తినాధ పాపుగారు స్థాపించారు. ప్రతీ దైవార్చన సం,,ర చివరి ఆదివారమున ఈ ఉత్సవం కొనియాడటం జరుగుతూ ఉంది. ఈ పండుగ ద్వారా, మనం గుర్తుకు చేసుకోవాల్సింది, క్రీస్తు మన హృదయాలను, మనసులను పరిపాలించాలి.

ప్రజాస్వామ్యం కలిగిన దేశాలలో 'రాజు', 'ప్రభువు' అన్న పదాలను సంభోదించడం సమంజసం కాదేమో! ఎందుకన, ఇవి నిరంకుశ ప్రభుత్వ పాలనలోంచి పుట్టుకొచ్చాయి కనుక. అనేక సందర్భాలలో, రాజు గర్వానికి, అధికార దుర్వినియోగానికి, యుద్ధాలకు, అవినీతికరమైన జీవితాలకు ప్రతీక. అయితే, క్రీస్తు ప్రభుని  రాజరికం, అణకువ మరియు సేవకు ప్రతీక.

క్రీస్తు తన శిష్యులతో ఇలా అన్నారు: "అన్య జాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనం చెలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైన ప్రముఖుడై ఉండదలచిన అతడు మీకు బానిసయై ఉండవలెను. ఏలయన, మనుష్య కుమారుడు సేవించుటకేగాని, సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను (మార్కు. 10:42-45). యేసు పిలాతుతో ఇలా అన్నారు: "నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. ఇందు కొరకే ఈ లోకమునకు వచ్చితిని" (యోహాను. 18:37).

ఈనాటి మహోత్సవం క్రీస్తు రాజరికపు బిరుదులను స్థిరపరుస్తుంది. మొట్టమొదటిగా, క్రీస్తు దేవుడు, సృష్టికర్త. కనుక తన సర్వాధికారాన్ని సమస్తముపై చాపుచున్నాడు. "దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా, ఆయన కొరకు సృష్టించెను" (కొలొస్సీ. 1:16). రెండవదిగా, క్రీస్తు మన రక్షకుడు; తన పవిత్ర రక్తాన్ని వెలగా పెట్టి మనలను తన స్వంతం చేసుకొన్నాడు. మూడవదిగా, క్రీస్తు శ్రీసభకు అధిపతి. చివరిగా, క్రీస్తు రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.

క్రీస్తు ఈ లోకమున జీవించినప్పుడు, దైవ రాజ్యము గూర్చి భోదించాడు మరియు తన శిష్యులతో, "మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడు" (మత్త. 6:33) అని చెప్పాడు. దేవునికి ప్రధమ స్థానాన్ని ఇవ్వాలని సూచించాడు. తన శిష్యులను సేవకులని గాక స్నేహితులని పిలిచాడు. తన గురుత్వమును, రాజరికాన్ని వారితో పంచుకొన్నాడు. ఆయన మరణించినప్పటికిని, ఈ లోక రాజులవలె గాక, ఆయన ఇష్టపూర్తిగా, తన ప్రజల రక్షణార్ధమై మరణించాడు. ఆయన మరణం యుద్ధము వలన వచ్చినది కాదు. రక్షణ ప్రణాళికలో సృష్టి పూర్వమే ఏర్పాటు చేయబడినది.

ఆయన మహిమతో పుణరుత్తానుడై మోక్షారోహనుడైనాడు. రాజుగా ఈ లోకములో ఒక సేవకునిగా ప్రజల దరికి చేరాడు. తన శిష్యులను సైతం సేవకులుగా ఉండాలని ఆజ్ఞాపించాడు. ఆయన నిజమైన స్వాతంత్రాన్ని ఒసగువాడు.  ఈ విధముగా, 'రాజు'కు ఓ నూతన అర్ధాన్ని ఇచ్చాడు.

మొదటి పఠనములో (దానియేలు 7:13-14), దానియేలు ప్రవక్త, శాశ్వత జీవి, నరపుత్రుని రాకను గూర్చిన దర్శనము గూర్చి తెలియజేయుచున్నాడు. "ఆ నరపుత్రుడు పరిపాలనమును, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతము లేదు. ఈ పఠన౦, దేవుడు రాజుగా కలకాలం ప్రజల చెంత ఉన్నాడని, దేవుని రాజ్యం భూలోకమునకు ఏతెంచినదని నిరూపిస్తున్నది.

రెండవ పఠన౦ (దర్శన. 1:5-8), క్రీస్తును ప్రేమించే రాజుగా వర్ణిస్తుంది. "ఆయన మనలను ప్రేమించుచున్నాడు" (1:5). మనకోసం ఒక రాజ్యాన్ని స్థాపించిన సర్వాధికారియైన క్రీస్తు రాజసత్వమును గూర్చి భోదిస్తుంది. ఈ రాజ్యములో క్రీస్తు మనలను దైవసేవకు అంకితము చేసియున్నాడు. "ఆయన రక్తము ద్వారా, మనలను పాప విముక్తులను చేసి (1:5), తన ప్రేమను నిరూపించుకొన్నాడు. అందుకే, ఆయన సర్వాధికారమునకు పాత్రుడైనాడు. ఆయన మరల మహిమతో తిరిగి వచ్చును. ఆయన "ఆల్ఫా, ఒమేగ" (1:8).

సువిశేష పఠన౦లో (యోహాను. 18:33-37) పిలాతు ఎదుట ప్రభువు తన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని, తన రాజ్యము ఆధ్యాత్మికమైనదని, తన రాజ్యము సత్యము, న్యాయములపై ఆధారపడి ఉన్నదని చెప్పాడు, కాని, పిలాతు అర్ధము చేసుకోలేకపోయాడు. సిలువ క్రీస్తు రాజ్య విజయానికి చిహ్నము. ఈ విజయం జీవితం, సత్యం, ప్రేమ కొరకు.

క్రీస్తు మన రాజు, అందరి రాజు మరియు సర్వాధికారము కలిగిన వాడు. ఆయన మన జీవితాలకు, హృదయాలకు రాజు. ఆయన చూపిన ప్రేమ-సేవ మార్గములో పయనిద్దాం. ఇతరులకు సేవకులమై దేవుని రాజ్యాన్ని ఈ లోకములో బలపరచుదాం.

సర్వ శక్తిగల ఓ సర్వేశ్వరా! సమస్తము మీద రాజ్యాధికారముగల మీ ప్రియతమ పుత్రుని ద్వారా సృష్టినంతటిని పునరిద్దరించ చిత్తగించితిరి. సృష్టి అంతయు పాప దాస్యమునుండి విముక్తి చెంది మీ వైభవ సేవకు అంకితమగునట్లును, నిత్యము మీ స్తుతిగానమందు నిమగ్నమై యుండునట్లును చేయుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. ఆమెన్.

33 వ సామాన్య ఆదివారము, Year B

33 వ సామాన్య ఆదివారము, Year B
దాని. 12:1-3, భక్తి కీర్తన 16:5,8,9-11, హెబ్రీ. 10:11-14,18, మార్కు 13:24-32

ప్రవేశ వచనము
నా ఆలోచనలు శాంతి సమాధాన పూర్వక ఆలోచనలు. దు:ఖ బాధల ఆలోచనలు ఎంత మాత్రము కావు. మీరు ప్రార్ధించిన, నేను మీ ప్రార్ధన నాలకించి, అన్ని స్థలములందు చెదరియున్న మిమ్ము మీ దాస్యము నుండి విడుదల చేయుదును" అను సర్వేశ్వరుడు నుడువుచున్నాడు.

సంఘ ప్రార్ధన
మా కర్తయగు ఓ సర్వేశ్వరా! సర్వ సంపదలు గల స్థిర సేవయందే మాకు సంపూర్ణ శాశ్వతానందము కలదు. కనుక మీ భక్తి పూజలయందు మేమానందించునట్లు మీ కృపను దయచేయుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము.

"మనుష్య కుమారుడు మహా శక్తితో, మహా మహిమతో మేఘారూడుడై వచ్చును" (మార్కు. 13:26)

శ్రమలు-హింసలు, మహోపద్రవములు, లోకాంత్యము మరియు మనుష్య కుమారుని పునరాగమనము గూర్చిన వివరములు మార్కు. 13:5-37 లో వివరించబడ్డాయి. ఇలాంటి సమయాలలో "మిమ్ము ఎవ్వరు మోసగింపకుండ మెలకువ కలిగి ఉండుడు" అని ప్రభువు వారిస్తూ, ముగింపులో "ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు అని హెచ్చరిస్తున్నాడు. అలాగే ప్రభువును స్వీకరించుటకు సిద్దముగా ఉండవలయును.

ఇలాంటి పరిస్థితులలో మనం ఎలా ప్రభువు కొరకు సిద్దముగా ఉండవలయును? ప్రభువు ఈ రోజు, ఈ క్షణమున, దివ్య సంస్కారముల ద్వారా, మన మధ్యన ఉన్నారు.  ఆయనను విశ్వసించుదాం.  ఆయన చూపిన ప్రేమ మార్గములో నడుద్దాం. అవిశ్వాసమునకు, అవిశ్వాసములో నడిపించు వారికి తావు ఇవ్వక, ప్రభునిలో ముందుకు సాగుదాం. ప్రభువు మన కొరకు చేసిన అర్పణ బలిని విశ్వసించుదాం: "క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్ధమైన ఒకే ఒక బలిని సమర్పించెను" (హెబ్రీ. 10:12).

క్షణికమైన మన జీవితాలు ఈ లోకమున ఏదో క్షణమున ముగియునను వాస్తవమును గ్రహించుదాం. ఈ లోక సంపద వాడిపోవునని, కాని ప్రభువు వాక్కు ఎన్నటికి గతించదని గుర్తుకు చేసుకొందాం. క్రీస్తు ప్రభువు మాత్రమే నిత్య జీవపు మాటలను కలిగియున్నాడు. ఆయన వాక్కును విశ్వసించి, ఆయన ఒసగు నిత్య జీవములో భాగస్తులమవుదాం.

ఒక రోజు ప్రభువు తిరిగి వస్తారు. మరణించిన వారికి, జీవించిన వారికి తీర్పు చేయును. ఆ రోజు కొరకు, ప్రభువు న్యాయ తీర్పు కొరకు జాగరూకులమై సంసిద్ధులమవుదాం.

మనం దేవుని రూపములో సృజింపబడినవారమని, ప్రభువు ఒసగు నిత్య జీవములో ప్రవేశించుటకు మనం అర్హులమని, నిత్యం గుర్తుచేయు మన తల్లి శ్రీసభ కొరకు ప్రార్ధన చేద్దాం. మన భౌతిక భాగోగులు చూసుకొనెడి మన సమాజ నాయకులు, ప్రభువు ఆత్మ శక్తితో కృషి చేయాలని ప్రార్ధన చేద్దాం. అనేక సమస్యలతో బాధపడుచున్న వారు, వారి శ్రమల వేదనల ద్వారా, దేవుని మహిమను కొనియాడుచున్నారు. వారి కొరకు ప్రార్ధన చేద్దాం.

దేవుని స్థిర సేవయందును, సర్వేశ్వరుని నమ్మకమందును నాకు సుఖ క్షేమములు గలవు (కీర్తన. 73:18).

32 వ సామాన్య ఆదివారము, Year B

32 వ సామాన్య ఆదివారము, Year B
రాజులు మొదటి గ్రంథము 17:10-16; హెబ్రీ. 9:24-28; మార్కు.  12:38-44

ఓ సర్వేశ్వరా! నా ప్రార్ధన మీ సమక్షము చేరునుగాక. చెవియొగ్గి కనికరముతో నా ప్రార్ధన నాలకింపుడు.

ఈనాటి (32 వ సామాన్య ఆదివారము, 11 నవంబర్ 2012) పఠనాలలో ఇద్దరు విధవరాల్ల జీవితాలను గూర్చి వింటున్నాం. మొదటి పఠనములో (1 రాజు. 17:10-16) సారేఫతుకు చెందిన విధవరాలు తన చెంతనున్న కొద్దిపాటి పిండిని, నూనెను, ఏలియా ప్రవక్తతో పంచుకొనియున్నది.  ఆమె మంచితనం, సహాయత, ఔదార్యతకు దేవుడు గొప్ప ఫలితాన్ని ఇచ్చాడు: కుండలోని పిండిగాని, పిడతలోని నూనెగాని తరిగి పోలేదు. ఈ సంఘటన, సువిషేశములో చెప్పబడిన - ఐదు రొట్టెలు, రెండు చేపల ఉద్దాంత్తాన్ని గుర్తుకు చేస్తుంది.  ఉన్నది కొద్దిదైనా, ఇతరులతో పంచుకొన్నప్పుడు, అందరికీ సరిపడగా, దేవుడు ఇంకా మిగులునట్లు చేయును.

ఈనాటి సువిశేష పఠనములో (మార్కు. 12:38-44) ధర్మశాస్త్రబోధకులు కానుకల పెట్టెయెద్ద కూర్చుండి, అందు ప్రజలు కానుకలు వేయురీతిని పరీక్షించుచుండిరి. వారి యొక్క చూపు ఎక్కువగా డబ్బు వేయు ధనికులపై మాత్రమే ఉండెను. కాని, అక్కడే నున్న యేసుప్రభువు మాత్రం, రెండు రాగి నాణెములను మాత్రమే వేసిన ఒక పేద విధవరాలును చూసెను.  అంతేగాక, ఆయన శిష్యులను పిలచి, "ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరి కంటే, ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినది" అని చెప్పెను.  ధనికులు తన సమృద్ధి నుండి కానుకలు వేసారు. కాని, పేద విధవరాలు, తన లేమినుండి, తనకు ఉన్నదంతయు, తన జీవనాధారమంతయు త్యాగము చేసినది.

మనకు ఉన్న సమస్తాన్ని అర్పించడం అనగా మన సంపూర్ణ జీవితాన్ని అర్పించడం. ఈ సంఘటనలో ప్రభువు, తాను యేరూషలేమునకు వెళ్లి తనను తాను బలిగా అర్పించుకొనుట వలన ఈ లోక పాపాన్ని రూపుమాపును అని గుర్తించాడు (హెబ్రీ. 9:24-28).

ఈ ఇద్దరు విధవరాల్ల జీవితం మనకి, ఈ లోకానికి నేర్పే పాఠ౦: మనం దేవునికి చెందిన వారముగా జీవించాలి. ఎలా? మన జీవమును పరిపూర్ణము చేస్తూ, ఇతరుల జీవితమును పరిపూర్ణము చేయాలి.