యేసుక్రీస్తు ఉత్థాన మహోత్సవము, YEAR B, 8 ఏప్రిల్ 2012

యేసుక్రీస్తు ఉత్థాన మహోత్సవము, YEAR B, 8 ఏప్రిల్ 2012
యెష 55:5-14, రోమీ 6:3-11, మార్కు 16:1-7

జయహో! యేసు నేడు లేచెను, జయహో!

మ'రణం' అనేది ఓ యుద్ధం.
ఆ యుద్ధాన్ని గెలవడమే ఉత్థానం.
ఆ యుద్ధాన్ని గెలిచాడు ఓ సమర యోధుడు
ఆ సమర యోధుడే ... యేసు.
అల్లెలూయ!!!

నలభై రోజుల కఠోర ఉపవాస ప్రార్ధనలు...
సైతానుచే శోధింపులు...
క్రూరమైన బాధలు...
సిలువపై ఘోరమైన మరణం...
మూడవ రోజు ఉత్థానం.

అదే క్రీస్తు పునరుత్థాన పండుగ సారాంశం. విశ్రాంతి దినము గడచి పోగానే యేసుకు సుగంధ ద్రవ్యములను పూయడానికి మగ్దల మరియమ్మతోపాటు మరో ఇద్దరు స్త్రీలు యేసు సమాధి వద్దకు బయలుదేరారు. కాని, అప్పటికే, ఆ పెద్ద సమాధి రాతి తొలగించ బడటము చూసి వారు ఆశ్చర్యచకితులయ్యారు. అక్కడే తెల్లదుస్తులతో ఉన్న ఓ వ్యక్తి వారిని గమనించి వారితో "కలవర పడకుడి. మీరు వెదకుచున్న యేసు ఉత్తానమయ్యాడు. మీరు వెళ్లి ఈ వార్తను వారి శిష్యులకు తెలియ జేయుడు" అని అనెను (మార్కు 16:1-7).

సిలువపై యేసు మరణం ఎవరికోసం? ఎందుకీ త్యాగం? నీ కోసం - నా కోసం - యావత్ మానవాళి పాప ప్రక్షాళన కోసం. ఒక్క మాటలో చెప్పాలంటే మానవాళిపై తనకెంత ప్రేమ ఉందో తన రెండు చేతులు చాచి సిలువపై మరణిస్తూ మనకు చూపించాడు క్రీస్తు ప్రభువు. ఇంతకన్న గొప్ప నిదర్శనం వేరొకటి మనకు అవసరం లేదు.

సిలువను మోస్తున్నప్పుడు అతనిపై వేసిన నిందలు, శారీరక వేదన వర్ణింపతరం కానివి. "అతనిని సిలువ వేయుడు, సిలువ వేయుడు" అని బిగ్గరగా వినిపించిన కేకలు అతని గుండెల్లో గునపములా గుచ్చుకొన్నాయి. ఇన్ని వేదనలను, చీవాట్లను భరించడం ఎవరితరం అవుతుందో చెప్పండి! ఆ నిందలన్నింటినీ భరిస్తూ, ఆకాశానికి భూమికి మధ్య సిలువపై రక్తపు మరకలతో వ్రేలాడుతూ "తండ్రీ, వీరిని క్షమింపుము. వీరు చేయుచున్నదేదో వీరికి తెలియదు" (లూకా 23:34) అని తన తండ్రికి మొరపెట్టుకొన్నాడు. అల్లెలూయ! ప్రేమంటే ఇదే!

ఈనాటి పఠనం యెష 54:10, "పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు" అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనం దైవ ప్రేమకు ఓ చక్కటి ప్రతిరూపం. మరణం అనేది సమాప్తం కాదు. అది ఓ క్రొత్త జీవితానికి ఆరంభం మాత్రమే! ఈనాటి పఠనంలో పునీత పౌలు రోమీయులకు వ్రాసిన లేఖలో ఇలా అంటున్నారు: "ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో, ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. మనము క్రీస్తుతో మరణించి యున్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిమనియు, క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను (రోమీ 6:5,8-11).
 
క్రీస్తు తన ఉత్తానము ద్వారా యావత్ మానవాళికి రక్షణను ప్రసాదించాడు. తన ఉత్థానం ద్వారా పాపాన్ని పటాపంచలు చేశాడు. "మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్ష మయ్యెను" (తీతు 2:11). ఉత్తాన క్రీస్తు యొక్క ప్రేమ, దీవెనలు మనదరితో ఉండునుగాక!

No comments:

Post a Comment