మ్రానికొమ్మల ఆదివారము - క్రీస్తు పాటుల స్మరణోత్సవము - 1 April, 2012



మ్రానికొమ్మల ఆదివారము - క్రీస్తు పాటుల స్మరణోత్సవము - 1 April, 2012
యెరుషలేములో క్రీస్తు విజయ ప్రవేశ స్మరణ దినము
Year B: యెష 50:4-7, ఫిలిప్పి 2:6-11, మార్కు 15:1-39


"దావీదు పుత్రునకు హోసాన్న. ఏలినవారి నామమున వేంచేయువారు ఆశీర్వదింపబడినవారు, ఇశ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసాన్న" (మ 21:9).

పాస్కాయత్తకాల ప్రారంభమునుండి మన హృదయాలను పాశ్చాత్తాపము, తదితర ప్రేమపూరిత క్రియల ద్వారా ఆయత్తము చేసికొనిన పిదప, ఈ దినము తిరుసభయంతటితో కలిసి మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యమును స్తుతించుటకు సమావేశమైయున్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చుటకై క్రీస్తు యెరుషలేము నగరమును ప్రవేశించెను. ఆకారణమున మన సంపూర్ణ భక్తి, విశ్వాసమును ఉపయోగించుకొని, ఈ రక్షణాయుత ప్రవేశమును స్మరించుకొనుచు రక్షకుని వెంబడించి, సిలువ ఫలిత కృపయందు భాగస్తులమై, ఆయన పునరుత్థానమందును భాగమును పొందుటకు యోగ్యులమగుదముగాక.

మ్రానికొమ్మల ఆదివారముతో పవిత్రవారములోనికి ప్రవేశించియున్నాము. పవిత్రవారము మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకన, ఈ వారములో క్రీస్తుప్రభువు భూలోక జీవితములోని చివరి ఘట్టాలను ధ్యానిస్తూ ఉన్నాము. ముఖ్యముగా, దివ్య సత్ప్రసాదస్థాపన, శ్రమలు, సిలువమరణం మొ,,గు పరిశుద్ధ కార్యాలతో, ప్రభువు దేవునికి-మానవునికి మధ్య సఖ్యతను, సమాధానమును చేసియున్నాడు. పవిత్ర వారములోని సాంగ్యాల ద్వారా, మన రక్షణ కార్య ఘట్టాలను అనుభవించెదము, మన విశ్వాసాన్ని నూత్నీకరించెదము, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచెదము. మన విశ్వాస యాత్రలో ఓ నూతన జీవితాన్ని, ఆధ్యాత్మిక కన్నులతో చూచెదము. ఈ యాత్ర ఈనాటి మ్రానికొమ్మల ఆదివారముతో మొదలవుతుంది. ఇది రక్షణకార్య పరమరహస్యాలను చేరుటకు తోడ్పడుతుంది. తద్వారా, విశ్వాసములో ఎదిగి క్రీస్తుకు దగ్గర కాగలము.

ఈ రోజు యేసుక్రీస్తు యెరుషలేము విజయ పురప్రవేశమును గుర్తుకు చేసుకొంటున్నాము (లూకా 19:28-40, మార్కు 11:1-11, మత్తయి 21:1-15). ప్రజలు ప్రభువును ఒక మెస్సయ్యగా, రాజుగా ఆహ్వానించారు. ఆయన గాడిద పిల్లపై ముందుకు సాగిపోవుచుండగా, దారిలో తన వస్త్రములను పరిచారు, మ్రానికొమ్మలతో జేజేలు పలుకుతూ స్వాగతించారు. "ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక! పరలోకమున శాంతియు, మహోన్నతమున మహిమయు కలుగునుగాక" అని దేవుని స్తుతించారు.

అలా ప్రభువును స్తుతించిన ప్రజలే కొన్ని రోజుల తర్వాత 'ప్రభువును సిలువ వేయుడు' అని, 'బరబ్బాను విడుదల చేయుడు' అని అరిచారు. వారు హృదయాలతో ప్రభువును స్తుతించలేదు. ఈ రోజు ప్రభువుని స్తుతించిన వారిలో ఎంతమంది ప్రభువుతో సిలువ చెంత ఉన్నారు? గుంపులో ఉండటం చాలా సులువు. కాని, వ్యక్తిగతముగా ప్రభువుతో ఆయన శ్రమలలో, సిలువయాత్రలో ఉండినవారు ఎంతమంది? ప్రభువునకు వారి అవసరం ఉన్నప్పుడు వారు ఆయన సిలువ చెంతకు వెళ్ళలేదు.

కడరాభోజన సమయములో పేతురుగారు ప్రభువుతో చెరసాలకుపోవుటకు, మరణించుటకు సైతము సిద్దముగా ఉన్నానని (లూకా 22:33) చెప్పాడు. కాని కొన్ని గంటల తరువాత అదే రోజు రాత్రి ప్రభువును ఎరుగనని బొంకాడు (లూకా 22:56-62). ఎంత త్వరగా అతను తన మనసును మార్చుకొన్నాడు? మనము కూడా ప్రభువుతో ఎన్నో వాగ్దానాలు చేస్తాం. కాని, శోధనలకు, బలహీనతలకు దాసులమై, వాటిని మరచిపోతూ ఉంటాం. కనీసం పేతురుగారు కోడికూతను విని (లూకా 22:60), ప్రభువు మాటలు గుర్తుకువచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు. పాశ్చాత్తాప పడ్డాడు. కాని, మనం జీవిస్తున్న ఈ లోకములో, ఏ స్వరాన్ని, ఏ కూతని మనం వినలేక పోతున్నాం. అంతగా, పాపములో కూరుకొని పోయియున్నాము. మన అంతరాత్మ ఘోషను మనం వినలేకపోతున్నాము.

ప్రభువు శ్రమలగూర్చి ధ్యానిస్తూ ఎందుకు మన హృదయాలు చలించడములేదు!

ఈనాటి మొదటి పటనములో, ప్రభువు శ్రమలను గూర్చిన ప్రవచనాలను వినియున్నాము:
"నేను అతనికి అడ్డు చెప్పలేదు. అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేనూరకొంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమియు చేయనైతిని" (యెష 50:5-6).

ఈనాటి కీర్తనలో కూడా ప్రభువు శ్రమల గూర్చిన ప్రవచనాలను వినియున్నాం:
"నా వైపు చూచిన వారెల్ల నన్ను గేలిచేయుచున్నారు. ఇతడు ప్రభువును నమ్మెను. అతడు ఇతనిని రక్షించునేమో చూతము. ఇతడు ప్రభువునకు ఇష్టుడైనచో, అతడు ఇతనిని కాపాడునేమో చూతము. శునకములు నన్ను చుట్టుముట్టినవి. దుష్టబృందము నా చుట్టు క్రమ్ముకొనినది. వారు నా కాలు చేతులను చీల్చుచున్నారు. నా ఎముకలన్నింటిని లెక్క పెట్టుచున్నారు. శత్రువులు సంతసముతో నావైపు చూచుచున్నారు. వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు. నా దుస్తుల కొరకు చీట్లు వేసికొనుచున్నారు" (కీర్తన 22:7-8, 16-18).

ఒక పట్టణములో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. చిన్నవాడు ఎప్పుడూ జులాయిగా తిరుగుచూ, త్రాగుచూ రోజూ ఇంటికి ఆలస్యముగా వచ్చేవాడు. అన్న ఎన్నిసార్లు చెప్పినా తన పద్ధతిని మార్చుకోలేదు. ఒక రోజు చేతిలో పిస్తోలు, రక్తపు మరకలతో రాత్రి ఇంటికి వచ్చాడు. 'నేను ఒక వ్యక్తిని చంపాను... నేను కావాలని చంపలేదు. నాకు చావాలని ఇష్టము లేదు' అన్నాడు. అప్పుడే పోలీసులు ఇంటిని చుట్టుముట్టి తలుపులు తట్టారు. తమ్ముడి కోసం అన్న తమ్ముడి బట్టలు వేసికొని పోలీసులకు లొంగి పోయాడు. అతన్ని విచారించి, మరణ దండన విధించారు. తమ్ముడి కోసం అన్న మరణించాడు. తమ్ముడు జీవించాడు.

ఇదంతా ప్రేమకోసమే! అలాగే క్రీస్తుకూడా మన మీద ప్రేమ వలన మనకోసం మరణించాడు. మన శిక్షను ఆయన భరించాడు. మన పాపభారం ఆయన మోసాడు. ఈ అనంతమయిన ప్రేమకు మనం ఎలా స్పందించాలి. పైన సంఘటనలో తమ్ముడు అన్నపట్ల ఎంతో కృతజ్ఞుడై ఉండవచ్చు. అలాగే మనము కూడా దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. అంతేగాక, మన పాతజీవితానికి, పాపజీవితానికి స్వస్తి చెప్పాలి. క్రీస్తులో నూతన జీవితాన్ని జీవించాలి. తమ్ముడు తన జీవితాన్ని మార్చుకోకపోతే, అన్న మరణానికి అర్ధమే ఉండదు. అలాగే క్రీస్తు మరణం. క్రీస్తు మరణములో మనం జీవిస్తున్నాము. కనుక, దానిని సమృద్ధిగా, పవిత్రముగా జీవించుదాం. మన ఈ జీవితం, క్రీస్తు మరణము వలన పొందిన భిక్ష అని ప్రతీ క్షణం జ్ఞప్తియందు ఉంచుకొందాం.

క్రీస్తు శ్రమలు మనలను కదిలించాలి, ఎందుకన ఆయన శ్రమలకు కారణం మనమే కాబట్టి. ఆయన శ్రమలకు పెద్దలు, రోమను సైనికులు మాత్రమే కాదు, మన పాపజీవితం. "అతడు మన తప్పిదములకొరకు గాయపడెను. మన పాపములకొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్షద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బలద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను" (యెష 53:5).

మనం పాపం చేసినప్పుడెల్ల, ప్రభువును సిలువ వేస్తున్నాము. ఈ రోజు, క్రీస్తుపాటుల స్మరణోత్సవ దినము. క్రీస్తుశ్రమల స్మరణ మన జీవితాలు చలించాలి. మన హృదయాలు కరగాలి. మనం పాపజీవితాన్ని విడచి పెట్టాలి. పవిత్రవారములో పాపసంకీర్తనము ద్వారా మరల మనం ప్రభువు చెంతకు తిరిగి రావాలి. దేవునిలో పాశ్చాత్తాప పడాలి, సఖ్యత పడాలి. క్రీస్తు శ్రమలు మనకు స్వస్థతను చేకూర్చును గాక. ఈ పవిత్ర వారాన్ని మనం వృధాచేయకూడదు. క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆయనతో గడుపుదాం. పవిత్ర గురువారమున ప్రభువు ఏర్పాటు చేసిన సత్ప్రసాదవిందులో పాల్గొందాం. పవిత్ర శుక్ర వారమున, ప్రభువు శ్రమలలో పాల్గొందాం. అలాగే పవిత్ర శనివారమున పాస్కా జాగరణ.

క్రీస్తు శ్రమలతో పోలిస్తే, మన బాధలు, కష్టాలు ఏపాటివి? యేసుక్రీస్తు, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు మనలో ఒకనిగా జీవించాడు. మన కష్టాలను, బాధలను ఆ ప్రభువునకు అర్పించుదాం. వాటినుండి పారిపోక (ఆత్మహత్య), ఎదుర్కొను శక్తినివ్వమని, దైవ చిత్తమే జరగాలని ప్రార్ధిద్దాం. దేవుని కుమారుడే శ్రమలను పొందవలసి వచ్చింది. కనుక, మనము కూడా మన జీవితములో వచ్చే కష్టాలను, బాధలను ఎదుర్కొనుటకు దేవుని సహాయమును కోరుదాం.

సర్వ శక్తిగల ఓ నిత్య సర్వేశ్వరా! మానవ జాతికి దైన్య పుణ్యమునకు ఆదర్శముగా మా రక్షకుడు మనుష్యావతారమెత్తెను. సిలువ బాధలను పొందను మీరు చిత్తగించితిరి. ఆయన వేదనలను స్మరించుచు ఆయన పునరుత్థాన భాగ్యములో భాగస్తులమగునట్లు మాకు అనుగ్రహింపుడు. ఆమెన్.

No comments:

Post a Comment