తపస్కాల ఐదవ ఆదివారము, YEAR B, 25 MARCH 2012


తపస్కాల ఐదవ ఆదివారము, YEAR B, 25  
మార్చి 2012
ఇర్మియా 31:31-34; భక్తికీర్తన 51:1-2, 10-13; హెబ్రీ 5:7-9; యోహాను 12:20-30

ఓ సర్వేశ్వరా! మా విరోధులగు దుర్మార్గులమధ్య చిక్కుకొనియున్న నన్ను రక్షించి మీ ధర్మ తీర్పులను వెల్లడి చేయుడు.  పాపాత్ములు, మోసగాండ్రు, తంత్ర కాండ్రనుండి   విడుదల చేయుడు.  ఎందుకన, నాకు శక్తి సామర్ధ్యములిచ్చు దేవుడు మీరే!

ఈనాటి మొదటి పటనములో యిర్మియా ప్రవక్తను గురించి వినియున్నాం.  దేవుడు యిర్మియాను పిలచి తన ప్రవక్తగా నియమించారు.  యావే ప్రభువు ఇస్రాయేలు ప్రజలతో సీనాయి పర్వతముపై చేసికొన్న ఒడంబడిక ప్రకారం వారు నడవలేదు.  ప్రభువైన దేవునిపై అధారపడటానికి బదులు ఈజిప్టు పాలకులతో చేసికొన్న ఒప్పందము మీద ఆధారపడ్డారు.  అందువలన, యావే ప్రభువు యొక్క సంరక్షణ, సహాయం వారు పోగొట్టుకున్నారు.  అందుకు ఫలితముగా ఇస్రాయేలీయులు అనేక కష్టాలకు గురైనారు.

అయినప్పటికినీ, ఇస్రాయేలీయులపట్ల ప్రభువైన దేవునికిగల ప్రేమ ఎంత అపారమైనదో యిర్మియా ప్రవక్తకు తెలుసు: కనుకనే దేవుని ఆదేశం మేరకు భవిష్యత్తులో దేవుడు ఇస్రాయేలీయులతో కుదుర్చుకొన్న "నూతన ఒప్పందం" గురించి యిర్మియా ప్రవక్త ప్రవచించాడు.  ఈ నూతన ఒప్పందము గురించి ఈనాటి మొదటి పటనములో చదువుతున్నాం. రెండవ పటనములో క్రీస్తు ప్రభువు తన జీవితములో ఆవేదన, బాధలను ఎలా అనుభవించాడో చదువుతున్నాం. యేసు ప్రభువు ఎన్నడూ తన బహిరంగ జీవితములో పేరు ప్రతిష్టలకోసం ప్రాకులాడలేదు.  యేసు మానవ రక్షణార్ధం, తనను తాను తండ్రికి బలిగా అర్పించాడు.

క్రీస్తు మరణం ద్వారా తనను తాను సంపూర్తిగా అర్పించుకొన్నాడు.  మానవులందరి తరుపున బలి అర్పించాడు.  క్రీస్తు మనందరి తరుపున బలి అర్పించాడు. గేత్సేమని తోటలో రక్తచమట చెమర్చుతూ యేసు ప్రభు చేసిన ప్రార్ధన, అనంతరం సిలువపై ఆయన అనుభవించిన శ్రమలు, మరణం వర్ణణాతీతం!  ఈ విధముగా ఆయన మనకొక సుమాతృకను నేర్పించారు.  నిత్య జీవన మార్గమును చూపించారు.

ఈనాటి సువార్త పటనములో, "గోధుమగింజ భూమిలోపడి నశించిననే తప్ప అది ఒక గింజగానే యుండును" అని చదువుచున్నాం. గోధుమగింజ భూమిలో పడవలసినదే!  తగిన మార్పు చెందవలసినదే! కానిచో, అది గింజగానే ఉంటుంది.  గింజ నలిగి రూపు లేకుండా చనిపోయినప్పుడే దానిలోనుండి జీవముగల మొక్క పైకి వస్తుంది.  క్రీస్తు ప్రభువు కూడా అట్టి గోధుమ గింజయే!

తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కాని, ఈ లోకమున తన ప్రాణమును ద్వేశించువాడు, దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును.  అని ప్రభువు పలుకుచున్నాడు.  అంటే, తనను తాను పరిత్యజించు కొనుటయే రక్షణమార్గమని మనము నేర్చుకోవాలి.  తనలో ఉన్న గర్వమును అనచుకోవడము చేత, ఈ లోకపు ఆశలను వదలి పెట్టడం చేత మాత్రమే రక్షణ కలదు. కాని, తన జీవితాన్ని ఈ లోకానికి అంటి పెట్టుకొనుట ద్వారా కాదు.  ఈ లోకములో జీవించినంత కాలం, ఈ ప్రపంచ జీవితము కంటే, నిత్య జీవము మేలైనదని మనము గ్రహించడానికి సిద్దముగా ఉండాలి.

నేటి సమాజములో అన్ని రంగాలలో అభివృద్ధిని చూస్తున్నాం.  నేటి సమాజం అన్ని విధాలుగా మనిషిని తన వైపునకు ఆకర్షిస్తుంది.  మనిషి ఈ లోకం ప్రసాదించే భోగాలకు బానిసయై, ఈ లోకాశాలకు దగ్గరై కళ్ళకు కనిపించే ఈ ప్రపంచాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు.  ఈ ప్రపంచముకంటే, నిత్యజీవితం మేలైనదని గ్రహించ లేక పోతున్నాడు.

ఈ లోకములో ఎవరైతే తన జీవితాన్ని అసహ్యించుకొంటారో, నిత్య జీవితానికి దానిని కాపాడుకొంటారు.  క్రీస్తు ప్రభువు, తపస్కాల ఐదవ ఆదివారమున ఈ పిలుపును మనకు ఇస్తున్నాడు.  త్యాగ జీవితం జీవించడం ద్వారా తనను వెంబడించి తన మహిమను పొందుటకు మన సిలువను ఎత్తుకొని తనతో నడువమంటున్నాడు.

తండ్రిని విధేయించి, క్రీస్తు ప్రభువు సిలువ బాధలలో భాగం పంచుకోవడానికి సంసిద్ధులైన వారికి దేవుని మహిమలో భాగముంటుంది.  విధేయత అంటే - స్వార్ధాన్ని వదులుకోవడం.  సుఖభోగాలకు స్వస్తి చెప్పడం.  క్రీస్తు రక్షణలో భాగస్తులమవడం.

తపస్సుకాలం, ఓ పరిశుద్ధ కాలం. కావున, ఆధ్యాత్మిక ఎదుగుదలపై శ్రద్ధ ఉంచాలి. అనుదినం మనం జరుపుకొనే దివ్యబలిపూజ ద్వారా క్రీస్తును, రక్షణ అనుగ్రహాలు పొందుతున్నాం. క్రీస్తు శరీర రక్తాలతో బలపడి, ప్రేమ పూరితమైన జీవితాన్ని జీవిద్దాం.

No comments:

Post a Comment