7 వ సామాన్య ఆదివారము Year B, 19 February 2012

7 వ సామాన్య ఆదివారము Year B, 19 February 2012
యెషయా 43:18-25; భక్తి కీర్తన 41:1-4, 12-13;
2 కొరింతు 1:18-22; మార్కు 2:1-12

ఓ సర్వేశ్వరా! మీ దయను నమ్ముకొనియున్నాను. మీ రక్షణయందు నా హృదయము ఆనందించుచున్నది. నాకు మేలుచేసిన సర్వేశ్వరునికి స్తుతిగానము చేయుదను.

చూపుల్లో తేడా!

ఈనాటి మొదటి పఠన సందర్భమును పరిశీలించినచో, బాబిలోనియా దేశములో, బానిసత్వములో మ్రగ్గుతున్న ఇస్రాయేలియుల కష్టాలు, బాధలు, హృదయభారం, ఆవేదన, ఆక్రందన మనం చూడవచ్చు. ఆ సమయమున వారు తమచుట్టూ ఉన్న దుస్థితినిచూస్తూ దు:ఖిస్తున్నారు. పూర్వము దేవుడు తమ పూర్వీకుల జీవితాలలో చేసిన కార్యములను స్మరిస్తూ రోదిస్తున్నారు. ఆ సమయమున యెషయ ప్రవక్త దేవునిచేత ప్రేరేపి౦పబడిన మాటలతో వారికి ఓదార్పును కలిగిస్తున్నాడు. ఈ కష్టాలను, బాధలను, బానిసత్వమును మాత్రమే మీరు చూడవద్దు. చీకటి తర్వాత వచ్చు వెలుగును, రాబోవు కాలములో మీ కొరకు ప్రభువు చేయు కార్యములను చూడండి. మీ చూపును అడ్డంకుల మీద కాకుండా, ఆవలి తీరముపై కేంద్రీకరించండి. దూరదృష్టిని కలిగియుండండి. రాబోవు స్థితి
గతముకంటే ఆశీర్వాదకముగను, దీవెనకరముగను ఉంటుంది. “మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకో నక్కరలేదు. ప్రాత సంఘటనలను తలచుకోనక్కరలేదు. నేనొక నూతన కార్యమును చేసెదను, దానిని వెంటనే చూతురు.” (యెషయ 43:18-19). ఇదే సమయములో, ఇశ్రాయేలీయులు గతమున తాము చేసిన తప్పిదములను గూర్చి తలచుకుంటూ, ప్రభువు ఇంకా తమమీద కోపాన్ని చూపిస్తున్నాడని అనుకొంటున్న తరుణములో, ప్రవక్త వారితో అంటున్నాడు, “ప్రభువు మన పాపములను మన్నించువాడే కాని, వానిని గుర్తుంచుకొనువాడు కాదు" (యెషయ 43:25). అది దేవుని చూపు. నీవు నేను ఏమై ఉంటిమని కాకుండా, ఇప్పుడు ఏమై ఉన్నామని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి మన గతముకంటే మన వర్తమానము, భవిష్యత్తు మీద ఎక్కువ మక్కువ. అదే ఆయన యొక్క ప్రేమగల చూపు.

కొరింతులోని విశ్వాసులను సందర్శిస్తానని చెప్పిన పునీత పౌలుగారు, చెప్పిన సమయానికి వారి వద్దకు రాలేకపోయాడు. దీనిని ఆసరాగా తీసుకొని, సంఘములోనున్న వ్యతిరేకులు, పౌలును విమర్శిస్తున్నారు. పౌలు, మాటలు మార్చువాడని, ఆయన మాటలు నమ్మశక్యము కానివని, క్రీస్తునుగూర్చి ఆయన బోధించిన సందేశమును శంఖిస్తున్నారు. ఈ పరిస్థితికి జవాబుగా పౌలుగారు వ్రాసిన మాటలే ఈనాటి రెండవ పఠనము. కొరింతు సంఘములో విడిపోయిన విశ్వాసులు కొందరు పౌలుగారి అపోస్తలత్వమును, అధికారమును నిరాకరించారు. వర్గ బేధాలతో వారు సంఘమును చీల్చారు. ఈ లేఖద్వారా, పౌలుగారు కొరింతు సంఘస్తుల దృష్టిని (చూపును) మార్చుకోమని చెప్పుచున్నారు. నేను మిమ్ము సందర్శించుటకు రాలేదని, నిష్టూరముతో మీరు నాపై నిందలు మోపుతున్నారు. నా అధికారమును, అపోస్తలత్వమును శంఖించడం ఆపి, నేను మీ వద్దకు ఎందుకు రాలేదో కాస్త ఆలోచించండి అని పౌలుగారు అంటున్నారు. సమస్య నాలో ఉందా? మీలో ఉందా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నిచుకోండి. దృష్టినంతా ఒకసారి కేంద్రీకరించుకోండి. మీ మధ్య సంభందాలను, బంధాలను, విభేదాలను ఒకసారి గమనించండి. ఈ దుస్థితిని చూసి నేను బాధపడి, మిమ్మల్ని బాధపెట్టలేక నేను మీ వద్దకు రాలేదని పౌలుగారు వివరిస్తున్నారు.

సువార్త పఠనమును మనం జాగ్రత్తగా గమనించిన మనకు పలువిధములైన "చూపులు" మనకు తటస్థపడతాయి. మొదటగా పక్షపాత రోగి ‘చూపు’. బహుశా ఇతడు యేసును గూర్చి, ఆయన చేసిన అద్భుతములను గూర్చి వినియుండవచ్చు. నన్నెవరైనా ఆయన యొద్దకు తీసుక వెళ్తే ఎంత బాగుండును అనే ‘ఎదురు చూపు’ ను కలిగియున్నాడు.

రోగి పొరుగు వారి చూపు. ఎందరో వైద్యులచే వైద్యం చేయించారు. అయినా ఫలితం శూన్యం. పరమవైద్యుడైన యేసయ్యకు చూపిస్తే పక్షవాతం నయమవుతుందన్న 'నమ్మకపు చూపు'. ఆ నమ్మకముతో రోగిని యేసు ఉన్న ఇంటి వద్దకు తీసుకువెళ్తే, ఇంటినిండా, ఇంటి చుట్టూ జనం కిక్కిరిసి ఉండగా, ఎలాగైనా రోగిని యేసుకు చూపించాలనే ‘ఏకాగ్రత కలిగిన చూపు’. యేసు చెంతకు ఇంటి పైకప్పు తీసి దింపబడిన రోగిని కాకుండా దించిన వారి విశ్వాసమును ‘చూచి’న యేసు. రోగియొక్క బాహ్యబలహీనతను, పక్షపాతమునుగాక, అంతరంగమున, వాని హృదయములో తిష్టవేసిన పాపమును తీసివేస్తూ, మన్నిస్తూ, విడుదల కలుగజేస్తూ యేసు చూచిన ‘ప్రేమ చూపు’ మరియు ‘కరుణ గలిగిన చూపు’. ఆ కరుణా మూర్తి చుట్టూ ఉన్న వారిలో కొందరు (ధర్మశాస్త్రబోధకులు) ఆ రోగిని పాపిగా, దేవునిచేత శిక్షింపబడిన వానిగా, త్రుణీకరింపబడిన వానిగా, తిరస్కరింపబడిన వానిగా, దేవునియొక్క కోపమునకు గురియైన వానిగా, విమర్శనాత్మకమైన, కఠినమైన చూపును కలిగి యున్నారు. తప్పులను ఎత్తుచూపే ‘చూపు’. చివరిగా, ఆయన చుట్టూ ఉన్న సామాన్య ప్రజల ‘చూపు’. వారిది ‘ఆశ్చర్యకరమైన చూపు’, ‘ఆనందం కలిగిన చూపు’. దేవుణ్ణి ఆరాధించి, స్తుతించి, మహిమ పరచే ‘చూపు’. "ఇట్టివి మనము ఎన్నడును చూడలేదు" (మార్కు 2:12).

సోదరా, సోదరీ!
నీవు, నేను, బాధలలో ఉన్నా, శోధనలో ఉన్నా
ఇబ్బందులలో, ఇక్కట్లలో ఉన్నా
ఆర్ధికముగా కాని, ఆత్మీయముగా కాని, సతమతమవుతున్నా...
ఈ సమయముననే నీవు, నేను దేవునిమీద ఆధారపడి (2 కొరింతు 2:9)
మన నమ్మకమును, ఆయనయందు నిలుపుకొని (2 కొరింతు 2:10)
దేవుడు మనకిచ్చు ఆశీర్వాదం వైపు చూడాలి.
నమ్మకమైన ‘చూపు’ను కలిగి యుండాలి.
నాకున్న సమస్యలన్నీ, ఇతరులవలనే అనుకుంటాం! నా సమస్యలన్నింటికీ, పరులే కారణమనుకుంటాం!
అలాగే నీవు అనుకుంటూ ఉంటే... ఒక్కసారి పౌలుగారు కొరింతు సంఘమునకు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకో!
సమస్య అవతలివైపున కాకుండా నీవైపే ఉందేమో? నీలో ఏదో, ఎక్కడో అస్తవ్యస్తముగా ఉందో గమనించు.
నీ హృదయములోనికి తొంగి చూడు. నీ అంత:రంగిక బంధాలను ఒక్కసారి కదిలించు.
ద్వేషముగాని, పగకాని, అసూయకాని, వర్గబేధముగాని, నిన్ను బాధించేదేమో ఆలోచించు.
సాతాను నీకు సంకెళ్ళువేసి నిన్ను ఆడిస్తుందేమో ఆలోచించు!

నీ ప్రక్క వారికి మంచి జరిగితే, వారి జీవితములో దేవుని ఆశీర్వాదం అధికమైతే, ధర్మశాస్త్రబోధకులవలె విమర్శనాత్మకమైన ‘చూపు’నుగాక, సామాన్య ప్రజల వలె దేవుడు నీ తోటి వారికి, వారియందు చేసిన, చేస్తున్న, చేయబోవుతున్న గొప్ప కార్యములను ఆశ్చర్యకరమైన ‘చూపు’తో చూస్తూ దేవుణ్ణి స్తుతించుదాం!

‘సర్వేంద్రియాన నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు.
ఆ కన్నులతో ప్రేమను చూడు, కరుణను చూడు, దేవున్ని స్తుతించు.
ఆకన్నులతో, ఆ దేహముతో దేవున్ని మహిమ పరచు (1 కొరింతు 6:20; 10:31) ఆమెన్.

No comments:

Post a Comment