తపస్కాల రెండవ ఆదివారము, Year B

తపస్కాల రెండవ ఆదివారము Year B
ఆది కాండము 22: 1-2, 9-13, 15-18; భక్తి కీర్తన 116: 10-18;
రోమీ 8: 31-34; మార్కు 9: 2-10

ఓ సర్వేశ్వరా! మీ ముఖ సౌందర్యమును ఆశించుచున్నాను. మీ ముఖ అందమునే కోరుచున్నాను. కావున, మీ ముఖమును నానుండి త్రిప్పుకొనకుడు అని నా హృదయం మీతో చెప్పుచున్నది.

దైవపిలుపు వ్యక్తిగతమైనది, ఆవశ్యకమైనది. దేవునియందు విశ్వాసముతోను, సంపూర్ణ నమ్మకముతోను, ఆయన పవిత్రతలో ప్రవేశించుటకు ఆహ్వానం దైవపిలుపు. మనతో మాట్లాడే దేవునితో మనం ఎదురుపడుతూ ఉన్నాము. ఆయనను ఆలకించి, ప్రత్యుత్తరమిచ్చుటకు మనం పిలువబడుచున్నాము. తపస్కాల రెండవ వారములోనికి ప్రవేశించిన మనం, మన ఆత్మ పరిశీలన, మార్పు, మారుమనస్సును కొనసాగిస్తూ పాస్కా ఉత్సవమును యోగ్యరీతిన కొనియాడుటకు ముందుకు సాగుదాం. మన ఆలోచనలు దేవుని ఆలోచనల వంటివి కావు. మన మార్గములు దేవుని మార్గముల వంటివి కావు. మానవ మాత్రులమైన మనం మార్పును కోరుకోము, ఇష్టపడము. మార్పును నిరోధించుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఏదేమైనప్పటికిని, మార్పు మన జీవితములో భాగము. గతములో మనం సాధించిన విజయాలపై, కార్యాలపై, ఈ రోజు ఆధారపడలేము. ఈ లోకములో మనం కేవలం ప్రయాణికులము మాత్రమే. మన ఈ ప్రయాణం నిత్యజీవనము వైపునకు, దేవునిలో సంపూర్ణ ఐక్యతవైపునకు కొనసాగుచున్నది.

అబ్రహాము విశ్వాసం - దేవుని వాగ్ధానం
మొదటి పఠనం ఆదికాండము నుండి వినియున్నాం. దేవుడు అబ్రహామును పిలచియున్నాడు. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. తాను ఎంతగానో ప్రేమించే తన కుమారుడైన ఇసాకును బలిగా అర్పించమని దేవుడు ఆదేశించాడు. అబ్రహాము విశ్వాసము చాలా దృఢమైనది. దేవుని ఆదేశాన్ని ఎలాంటి తొట్రుపాటు లేకుండా, ఎలాంటి అనుమానము లేకుండా విధేయించుటకు నిర్ణయించి, మరునాటి వేకువజామునే, ఇసాకుతో ప్రయాణమయ్యాడు. దేవుడు చూపించిన ప్రదేశమునకు చేరగానే, అబ్రహాము బలిపీఠమును నిర్మించి, కట్టెలు పేర్చి తన కుమారున్ని బలిఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆసమయముననే, దేవదూత అబ్రహామును పిలచి, ఇసాకుపై చేయి వెయ్యరాదని ఆజ్ఞాపించియున్నది. దేవుడు అబ్రహాము విశ్వాసమును పరీక్షించాడు. తన కార్యముల ద్వారా, విధేయత ద్వారా, తన హృదయం చాలా స్వచ్చమైనదని అబ్రహాము నిరూపించాడు. అబ్రహాము తన జీవితాంతము దేవునికి విధేయుడై జీవించాడు. తన కుమారునికి బదులుగా, దేవుడు ఒసగిన పొట్టేలును బలిగా అర్పించాడు. అబ్రహాము విధేయతకు ముగ్ధుడైన దేవుడు అతనితో వాగ్దానాన్ని చేసియున్నాడు. అబ్రహాము సంతతి ఆకాశములోని నక్షత్రములవలె, సముద్ర తీరమున ఇసుక రేణువులవలె వ్యాప్తిచెందునని, అన్ని దేశములు ఆయన కుటుంబమునందు ఆశీర్వాదము పొందునని వాగ్దానము చేసియున్నాడు.

మనం ఎందుకు భయపడాలి?
రెండవ పఠనములో, పునీత పౌలుగారు ఓర్పు, సహనము కలిగి విశ్వాసపాత్రులుగా ఉండాలని చెబుతున్నాడు. ఆదిక్రైస్తవులు ఎన్నో హింసలకు గురయ్యారు. వారు తమ ప్రాణాలు కోల్పోతారని భయపడ్డారు. వారిని ఉద్దేశించి, 'దేవుడు మన వైపు ఉన్నప్పుడు మనకు ఎవరు విరుద్ధముగా ఉంటారు?' (రోమీ 8:31) అని పౌలు వారికి ధైర్యాన్ని చెప్పాడు. మనందరికోసం దేవుడు తన ఏకైక కుమారున్ని బలిగా అర్పించాడు. తన కుమారునితో మనకి సకలాన్ని ఇస్తాడు. కనుక, మనం భయపడనవసరము లేదు.

క్రీస్తు తననుతాను, తండ్రి చిత్తానుసారముగా, తండ్రికి విధేయుడై మనందరి కోసం ఒక బలిగా మారాడు. మన పాపాలకోసం ఆయన అర్పించిన బలి మహోన్నతమైన మరియు పరిపూర్ణమైన బలి. ఆయన మనకోసం మరణించి, మృతులలోనుండి సజీవముగా లేచాడు. తండ్రి కుడిప్రక్కన కూర్చుండి, మనందరికోసం తండ్రిని అర్ధిస్తున్నాడు. కనుక, మనం దేనికీ భయపడ నవసరములేదు. మన బాధలలో, కష్టాలలో, హింసలలో, ఓర్పు, సహనము కలిగి తండ్రి దేవున్ని విశ్వసించాలి. "క్రీస్తు ప్రేమనుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దు:ఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం, మనల్ని దూరం చెయ్యగలవా?" (రోమీ 8:35).

యేసు దివ్యరూపధారణ
సువిశేష పఠనములో, యేసు ప్రభు దివ్యరూపధారణ గూర్చి వింటున్నాం (మార్కు 9:2-10). దివ్యరూపధారణ, యేసు జీవితములో జరిగిన మహత్కర సంఘటన. యేసు శ్రమలానంతరం పొందబోవు మహిమకు తార్కాణం. ఇదొక గొప్ప దివ్యదర్శనము. యేసు మెస్సయ్య అని ధృవీకరించబడిన సంఘటన. రాబోవు దైవరాజ్యమునకు సూచన. ఈ అద్భుతమైన సంఘటనను మత్త. 17:1-8; మార్కు. 9:2-9; లూకా. 9:28-36; 2పేతు. 1:16-18లో చూడవచ్చు. తన ప్రియ శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని కైసరియా ఫిలిప్పినుండి ఎనిమిది రోజులు ప్రయాణంచేసి అక్కడనున్న ఒక ఉన్నత పర్వతం పైకి ఎక్కివెళ్లారు. ఆ పర్వతం ఏదని పరిశోధింపగా, అది గలిలీయ ప్రదేశంలో తిబేరియా సరస్సుకు దాదాపు రెండువేల అడుగుల ఎత్తున ఉన్న తాబోరు పర్వతంగా క్రీ.శ. 254లో గుర్తించబడింది.

“అచట వారి యెదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లగానయ్యెను. ఆయనతో మోషే, ఏలీయాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి” (మత్త. 17:2-3; మార్కు. 9:2-3) మోషే ధర్మశాస్త్రానికి గుర్తుకాగా, ఏలీయా ప్రవక్తలకు ప్రతినిధి. వారు యేసు ప్రభువును ఆరాధించారు. ఆయనతో సంభాషించారు. ఇదే సమయంలో, మేఘ మండలము [మేఘము, దైవసాన్నిధ్యానికి సూచన - నిర్గమ 16:10; 19:9, 16; 24:15-18; 33:9; ఆత్మ దేవుని సాన్నిధ్యం] నుండి, పరలోక తండ్రి దివ్యవాణి మరొక్కసారి “ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయనను గూర్చి నేను ఆనంద భరితుడనైతిని. ఈయనను ఆలకింపుడు” (మత్త. 17:5; మార్కు. 9:7) అని వినిపించెను. యేసు నిజముగా ‘దేవుని కుమారుడు’ అని శిష్యులు అర్ధముచేసుకుంటున్న విషయాన్ని, ఆ వాణి ధృవపరుస్తున్నది.

మహోన్నతమైన గొప్పతనంతో ప్రభువు బహిరంగ జీవితం ఆరంభించడానికి, రాబోవు మహిమలో ముందుగానే రుచిచూసిన భాగ్యంపొంది యేసు ప్రభువు అనుభవింపబోతున్న వేదన, శ్రమలు చూసి, బెదరి చెదరిపోకుండ ప్రభుశిష్యులు తమ విశ్వాసంలో బలపడటానికిగాను ఈ యేసు దివ్యరూపధారణ మహాత్మ్యంయొక్క దృశ్యం పేతురు, యాకోబు, యోహానులలో హృదయం నిండా బాగా వేళ్లూనింది.

'దివ్యరూపధారణ' ముఖ్య ఉద్దేశం యేసు దైవత్వమును బహిరంగ పరచడము. ఈ సంఘటన, యేసు తన మరణాన్ని గురించి చెప్పిన తర్వాత జరిగియున్నది. "మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయన్ని త్రుణీకరిస్తారు. ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికి వస్తాడు" (మార్కు 8:31). ఇది శిష్యులను ఎంతగానో కలువర పరచింది. వారు మెస్సయ్యగూర్చి ఎంతో గొప్పగా ఊహించుకున్నారు. ఆయన శ్రమలుపొంది, మరణించవలసి యున్నదని వారు ఎన్నడూ ఊహించలేదు. ఈ సమయములో యేసు దివ్యరూపధారణ వారికి ఊరటను కలిగించి యుండవచ్చు. దివ్యరూపధారణ విశ్వాసముతో సహనము కలిగి జీవించిన వారికి మహోన్నత్వం వేచియున్నదని తెలియ జేయుచున్నది. యోహాను, తన సువిషేశములో, యేసుని మహోన్నత్వమును వారు చూసారని రాసాడు. ఇది యేసు దైవత్వమునకు నిదర్శనం. ఏలియా, మోషేల దర్శనం ప్రవక్తలు, చట్టము యేసు ప్రభువునిలో పరిపూర్ణ మయ్యాయని సూచిస్తున్నది.

"ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయనను ఆలకింపుడు" (మార్కు 9:7) అను స్వరమును శిష్యులు వినియున్నారు. క్రీస్తు తండ్రి దేవుని సందేశమును ఈ లోకానికి తెచ్చియున్నాడు. ఆయన సందేశమును మనం ఆలకించాలి. ఆలకించడము మాత్రమే కాక, ఆ సందేశానికి మన ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి. దేవుడు మనతో అనేక విధాలుగా, అనేక రూపాలలో మాట్లాడు చున్నాడు. ఆయన స్వరమును ఆలకించుదాం. దేవుని పిలుపునకు ప్రత్యుత్తర మిద్దాం. క్రీస్తును ఆలకించాలి. ఎందుకన, ఆయన నిత్య జీవపు మాటలు కలవాడు. ఈనాడు లోకములోనున్న ప్రభుని సాన్నిధ్యాన్ని గాంచుదాం. ఈ తపస్కాలములో మన హృదయాలను తెరచి, ప్రేమను అనుభవించుదాం. ఆ ప్రేమను ఇతరులతో పంచుకొందాం. మన జీవితాలను దేవునికి, ఇతరులకు అర్పించుటకు సిద్ధ పడుదాం.

దివ్యరూప ధారణలో దాగియున్న పరమార్ధం
ఇప్పటి వరకు శిష్యులచేత ఒక బోధకునిగా, నాయకునిగా, రక్షకునిగా, మెస్సయాగా, పరిగణింపబడిన యేసు, తన నిజస్వరూపమును తెలియపరచడం ఎంతోముఖ్యం. ఫలితముగా, శిష్యుల విశ్వాసము దృఢపరచబడినది. ప్రభువులోనున్న దైవత్వమును చూపించి, ఫలితముగా, శిష్యులను బలపరచియున్నారు. తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చుచున్నారు (యెషయ 42:1-4, లూకా. 9:35. యోహాను. 4:34). తాను మోషేతోను (ధర్మశాస్త్రము), ఏలియాతోను (ప్రవక్తలు) మాట్లాడుటద్వారా తాను ప్రవక్తల ప్రబోధములను, ధర్మశాస్త్రమును రద్దుచేయక, సంపూర్ణ మొనర్చుటకు వచ్చితినని (మత్త. 5:17) తెలియ జేయుచున్నారు.
అలాగే, యేసు దివ్యరూపధారణ, పరలోక పరమరహస్య అనుభూతిని తెలియజేయుచున్నది. పరలోకం అంటే ఒక స్థలము కాదని, అది ఒక వ్యక్తి అని, ఆ వ్యక్తి యేసు క్రీస్తు అని తెలియజేయుచున్నది. యేసు ప్రభువే ఆ దైవరాజ్యము. త్రిత్వైక దేవుడే ఆ పరలోక రాజ్యము (నిత్యజీవము).
యేసు ప్రార్ధనా జీవితానికి తార్కాణం ఆయన దివ్యరూప ధారణ. ప్రార్ధన, తండ్రి-కుమారుల మధ్యననున్న బాంధవ్యము. ప్రభువు ప్రేషిత పరిచర్య అంతయు కూడా అతని ప్రార్ధన ఫలమే!

No comments:

Post a Comment