మూడవ దినము: 18 డిశంబర్ 2011 - యేసు పేదరిక జీవితం

మూడవ దినము: 18 డిశంబర్ 2011
యేసు పేదరిక జీవితం

ధ్యానాంశం: దేవుడు తన కుమారుని జన్మమునకు ఈ లోకమున సమస్తమును ఏర్పాటు చేసియున్నాడు. యేసు జన్మించే సమయానికి, సీజరు ఆగస్తు చక్రవర్తి తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరించవలెనని ప్రకటించి అధికారులకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. ఈ విధముగా, యోసేపు దావీదు వంశస్తుడైనందున గలిలయ సీమలోని నజరేతునుండి యూదయా సీమలోని దావీదు పట్టణమగు బెత్లేహేమునకు జనాబా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చిత్తార్ధం చేయబడిన, గర్భవతియైన మరియమ్మను వెంటబెట్టుకొని వెళ్ళాడు. వారికి సత్రములో చోటు దొరకపోవడముచేత, మరియమ్మకు ప్రసవకాలము సమీపించుటచేత వారు పశువులశాలయైన ఒక గుహలో ఉండవలసి వచ్చినది. బెత్లెహేములోని ఈ పశువుల పాకలోనే మరియ పరలోక రారాజునకు జన్మనిచ్చినది.

జ్ఞానులు, గొల్లలవలె, మనముకూడా ఈ పశువులపాకను సందర్శించుదాం. విశ్వాసముతో సందర్శించుదాం. విశ్వాసము లేనిచో ఆగుహలో మనం ఏమీ చూడలేము. విశ్వాసముతో చూస్తే దైవకుమారున్ని, మన పాపాలకోసం శ్రమలను పొందుటకు, మనలను రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యను చూస్తాము.

ప్రార్ధన: ఓ ప్రియమైన దివ్య బాల యేసువా! నాకోసం ఈ భూలోకానికి వచ్చినందులకు నీకు వేలాది కృతజ్ఞతా స్తోత్రములు. నాకొరకు పేదరికములో జన్మించి, శ్రమలనుపొంది నన్ను రక్షించావు. ''నా ప్రభువా! నా దేవా!''. నిన్ను నిత్యము ప్రేమించుటకు నీ అనుగ్రహాన్ని దయచేయండి. నీవుతప్ప నాకింకేమియు అవసరము లేదు.

ఓ మరియమ్మా! నీ దివ్యకుమారున్ని ప్రేమించుటకు, మీ కుమారునిచేత ప్రేమింపబడుటకు ప్రార్ధన చేయండి. ఆమెన్.

No comments:

Post a Comment