పునీత మరియ వియాన్ని పండుగ: నవదిన ధ్యానాలు (2025)

 పునీత మరియ వియాన్ని పండుగ: నవదిన ధ్యానాలు
1.       ఆత్మల రక్షణ కొరకు తపించిన పునీత జాన్ వియాన్ని

ఫ్రాన్స్ దేశములోని అర్స్ అనే కుగ్రామంలోని గురువు పునీత జాన్ వియాన్ని. దేవుని సేవలో, అపారమైన ఉత్సాహాన్ని చూపిన గొప్ప వ్యక్తి. ఆత్మలను రక్షించడమే ఆయన జీవితానికి ఒకే ఒక్క లక్ష్యం అన్నట్లుగా జీవించిన గొప్ప పునీతుడు. ఆయన పెద్ద వేదాంతి ఏమీ కాదు, మాటలతో మంత్రముగ్ధులను చేసే వక్త అసలే కాదు. కానీ, దేవుడిని, దైవ ప్రజలను అమితంగా ప్రేమించిన ఒక నిరాడంబరమైన గురువు. ఆయన అర్స్ అనే ఆ చిన్న ఫ్రెంచ్ గ్రామాన్ని ఆధ్యాత్మికంగా గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చారు.

ఆయనలోని దైవ ఉత్సాహం నిరంతర ప్రార్థనలలో, కఠినమైన తపస్సులలో, మరియు గంటల తరబడి పాపసంకీర్తనలు వినడంలో స్పష్టంగా కనిపించేది. ప్రజలు ఆయన మాటలను శ్రద్ధగా వినేవారు. పాపం చేసిన వారిని ఓపికగా దేవుని వైపు నడిపించేవారు. తన ప్రజల ఆధ్యాత్మిక అవసరతలను ఆయన లోతుగా అర్థం చేసుకున్నారు. ఆ అవసరతలను తీర్చడానికి తన శరీరాన్ని, ఆత్మను పూర్తిగా దేవునికి అర్పించుకున్నారు. ఆయన చేతలు ఆయన బోధనలకంటే గొప్పగా ఉండేవి ఒక ఆత్మ రక్షణ కోసం తన సుఖాలను, నిద్రను కూడా త్యాగం చేయడానికి జాన్ వియాన్ని సిద్ధంగా ఉండేవారు. ఇది నిజంగా అసాధారణమైన త్యాగం.

నిజమైన సువార్త బోధన, ప్రచారం గొప్ప గొప్ప పనుల గురించి కాదు; ఇతరుల మంచి కోసం నిరంతరం త్యాగాలు చేయడమే అని పునీత జాన్ వియాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. మన చుట్టూ ఉన్నవారి ఆధ్యాత్మిక క్షేమం, ఆత్మల రక్షణ కోసం మనం ఎంత నిబద్ధతతో ఉన్నామో ఆలోచించుకోవాలని ఆయన జీవితం మనల్ని కోరుతుంది. ఆయనకున్న ప్రేమలో కనీసం కొంత భాగమైనా మనలో ఉందా? ఒక ఆత్మ శాశ్వతమైన గమ్యం కోసం మనం శ్రమించడానికి, ప్రార్థించడానికి, వినడానికి, మార్గనిర్దేశం చేయడానికి, క్షమించడానికి సిద్ధంగా ఉన్నామా?

ఈ ప్రపంచం తరచుగా డబ్బు, వస్తువుల వెంట పడుతుంటుంది. ఇలాంటి సమయంలో, పునీత జాన్ వియాన్ని ఆధ్యాత్మికతపై పెట్టిన అచంచలమైన దృష్టి మనకు నిజంగా ఏది ముఖ్యమో గుర్తుకు చేస్తుంది. దేవుని ప్రేమతో నిండిన హృదయం, ప్రతి ఆత్మ రక్షణ పట్ల తీవ్రమైన కోరికతో ఉంటుందని ఆయన బోధిస్తున్నారు. ఇది మంచి కాపరి అయిన క్రీస్తు హృదయాన్ని పోలి ఉంటుంది. ఆయన వారసత్వం గురువులను, సాధారణ భక్తులను పరిశుద్ధంగా జీవించడానికి, మరియు వారిలో కూడా అదే ఆత్మల పట్ల ప్రేమను పెంపొందించుకోవడానికి స్ఫూర్తినిస్తూ ఉంది. గురువులుగా, విశ్వాసులుగా, ఇతరుల ఆధ్యాత్మిక శ్రేయస్సు కొరకు మన వంతు కృషి చేద్దాం!

2. పవిత్ర దివ్యసత్ప్రసాదం పట్ల పునీత జాన్ వియాన్ని గారి అపారమైన భక్తి

పునీత జాన్ వియాన్నిగారు, పవిత్ర దివ్యసత్ప్రసాదం పట్ల అపారమైన ప్రేమను, భక్తిని కలిగి జీవించారు. ఆయన జీవితం, సేవ పూర్తిగా దివ్యసత్ప్రసాదంలో క్రీస్తు యొక్క నిజమైన ఉనికిపై కేంద్రీకృతమై ఉన్నాయి.

గురువు యొక్క ప్రాథమిక బాధ్యత పవిత్ర దివ్యసత్ప్రసాదంలో క్రీస్తును ప్రత్యక్షం చేయడం అని పునీత జాన్ వియాన్నిగారు దృఢముగా విశ్వసించారు. దివ్యబలిపూజ ఈ భూలోకంపైనే అతిగొప్ప కార్యంగా ఆయన భావించారు, ఎందుకంటే “మానవుని కోసం దేవుడు చేసిన గొప్ప త్యాగం” కనుక. దివ్యబలిపూజ ద్వారా ఆత్మలను రక్షించుటకు తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నారు.

పునీత జాన్ వియాన్నిగారు పవిత్ర దివ్యసత్ప్రసాద సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన, ఆరాధనలో గడిపారు. దివ్యసత్ప్రసాద మదసం ఆయనకు అపారమైన ఆధ్యాత్మిక బలాన్ని అందించే ఒక సెలయేరు వంటిది. క్రీస్తు యొక్క నిజమైన ఉనికిలో ఓదార్పును, బలాన్ని పొందేవారు. తన విచారణ సంఘస్తులను కూడా అలాగే చేయమని ఆయన బోధించారు. దివ్యసత్ప్రసాద మదసం ముందు వియాన్నిగారు మోకరిల్లడం లేదా దివ్యబలిపూజను కొనియాడటాన్ని చూడటమే క్రీస్తుపట్ల ఆయనకున్నలోతైన భక్తిని, ప్రేమను తెలియజేస్తుందని సాక్షులు పేర్కొన్నారు. పవిత్ర దివ్యసత్ప్రసాదంలో మరుగైయున్న ప్రభువు పట్ల ప్రేమతో కూడిన మాటలు పలుకుతూ, కళ్ళలో కన్నీటితో తరచుగా దివ్యసత్ప్రసాద మందసం వైపు చూసేవారు.

పునీత జాన్ వియాన్నిగారు దివ్యసత్ర్పసాదము గురించి బోధిస్తూ, పవిత్ర దివ్యసత్ప్రసాదం ఆత్మకు అనివార్యమైన ఆహారం అని అన్నారు. దేవాలయము ఆత్మలకు నిలయం. ఆ ఆత్మలకు దివ్యభోజనం దివ్యసత్ర్పసాద మందసములో ఉంటుంది. యేసు శరీర రక్తాలను “తీసుకోండి, భుజించండి, తీసుకోండి... పానము చేయండి” అని ప్రభువు అందరినీ ఆహ్వానిస్తారు అని బోధించాడు. “ఆత్మ దేవుని కోసం ఆకలిగా ఉంటుంది, దేవుడు తప్ప మరేదీ ఆత్మను సంతృప్తి పరచదు” అని ఆయన నొక్కి చెప్పారు.

పవిత్ర దివ్యసత్ప్రసాద స్వీకరణ అపారమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందని, మానవ హృదయంలోని దేవుని పట్ల లోతైన కోరికను సంతృప్తి పరుస్తుందని ఆయన బోధించారు. చిన్న పాపమైనా సరే, ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగిస్తుందని ఆయన నమ్మారు. విచారణ సంఘస్తులను నిర్మలమైన హృదయాలతో, భక్తితో దివ్యసత్ప్రసాదమును స్వీకరించుటకు సిద్ధం కావాలని కోరారు. తరచుగా దివ్యసత్ప్రసాదమును లోకొనడం ద్వారా. పాపం నుండి విముక్తి పొంది, దేవుని పట్ల లోతైన అనుభూతికి దారితీస్తుందని ఆయన నమ్మారు.

పునీత జాన్ వియాన్నిగారా! మాకొరకు వేడుకోనండి! ఆమెన్.

3. మరియ తల్లి పట్ల పునీత జాన్ వియాన్ని గారి అపారమైన భక్తి

పునీత జాన్ మరియ వియాన్నిగారు, మరియమ్మ పట్ల ప్రగాఢమైన, అంకితమైన భక్తిని కలిగి ఉన్నారు. చిన్న వయస్సు నుండే వారికి మరియమ్మ పట్ల ప్రేమ ఉన్నట్లుగా తెలుస్తుంది. వియాన్నిగారు మరియను “దేవుని అద్భుత సృష్టి”గా చూశారు.

మరియమ్మపట్ల వియాన్నిగారు చూపిన భక్తి ఆయన ఆధ్యాత్మిక జీవితానికి, గురుత్వ పరిచర్యకు కీలకమైనది. ఆత్మల రక్షణ కొరకు నిరంతరం జీవించిన వియాన్నిగారు, మరియమ్మను శక్తివంతమైన మధ్యవర్తిగా, ఆమె ద్వారా కుమారుడైన యేసుక్రీస్తుకు చేరుకోవడానికి ఒక ఖచ్చితమైన మార్గంగా చూపించారు. “మరియ చేతుల గుండా వెళ్ళకుండా స్వర్గం నుండి ఎలాంటి కృప రాదు” అని వియాన్నిగారు బోధించారు. ఆయన మరియను “స్వర్గం యొక్క ద్వారపాలకురాలు”గా పోల్చారు. ఆమె దేవున్ని ఎప్పుడూ అగౌరవపరచలేదు కాబట్టి, ఆమె ద్వారా సమర్పించబడిన ప్రార్థనలు దేవునికి మరింత యోగ్యతతో చేరుతాయని వియాన్నిగారు గట్టిగా నమ్మారు. ఒకవేళ, నరకం పశ్చాత్తాపపడితే, మరియమ్మ దానికి దేవుని క్షమాపణను తీసుకొని రాగలదని కూడా వియాన్నిగారు పేర్కొన్నారు.

వియాన్నిగారు తరచుగా తన విచారణ సంఘస్తులను, అలాగే యాత్రికులను జపమాల ప్రార్థన చేయమని ప్రోత్సహించారు. జపమాల ప్రార్థనను “రుచికరమైన, తీపి, పోషకమైన” మరియు “ఎప్పుడూ విసుగు అనిపించని” ప్రార్థనగా ఆయన అభివర్ణించారు. సువాసనగల చేతులు తాకిన ప్రతి వస్తువును సుగంధభరితం చేసినట్లే, మన ప్రార్థనలు మరియ చేతుల ద్వారా వెళ్ళినప్పుడు మరింత సుగంధభరితమవుతాయని ఆయన బోధించారు.

మరియమ్మపట్ల వియాన్నిగారి భక్తి కేవలం సిద్ధాంతపరమైనది కాదు; ఆ భక్తిని ఆయన తన విచారణ సంఘములో స్పష్టంగా వ్యక్తపరిచారు. ఆర్స్ లోని ప్రతి ఇంటి ముందు మరియతల్లి చిన్న స్వరూపాలు ఉండేవి. అంతేకాదు, ఆయన ప్రతి ఇంటికి మరియతల్లి రంగుల చిత్రాలను బహుకరించారు. ఆయన తన దేవాలయ పీఠం చెంత నిష్కళంక హృదయమాత పెద్ద విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. అలాగే, తన విచారణ సంఘాన్ని, ఏ పాపం లేకుండా గర్భం దాల్చిన మరియమాతకు అంకితం చేశారు.

కష్ట సమయాల్లోనూ, ప్రలోభాలు ఎదురైనప్పుడూ మరియను ఆశ్రయించడం ఓదార్పునూ, బలాన్నీ ఇస్తుందని ఆయన బోధించారు. “మీరు ప్రలోభపడినప్పుడు కన్య మరియను ప్రార్థిస్తే, ఆమె వెంటనే మీ సహాయానికి వస్తుంది, సాతాను మిమ్మల్ని విడిచిపెడతాడు” అని ఆయన ప్రసిద్ధంగా పేర్కొన్నారు.

అయితే, పునీత వియాన్నిగారికి మరియమ్మ పట్ల ఉన్న భక్తి ఎప్పుడూ క్రీస్తు-కేంద్రీకృతమైనదే. ఆత్మలను యేసు వద్దకు మరింత దగ్గరగా నడిపించడమే మరియతల్లి ఏకైక లక్ష్యం అని ఆయన అర్థం చేసుకున్నారు. ఆమె మనల్ని తన కుమారుడైన యేసు వద్దకు చేరుస్తుంది.

ఈవిధముగా, పునీత జాన్ మరియ వియాన్ని గారికి, మరియమ్మ కేవలం ఒక భక్తిపరురాలైన వ్యక్తి మాత్రమే కాదు. ఆమె ఆత్మలను మోక్షానికి మరియు దేవునితో లోతైన సహవాసానికి నడిపించడంలో అనివార్యమైన పాత్రను పోషించిన చురుకైన, ప్రేమగల తల్లి మరియు శక్తివంతమైన మధ్యవర్తి. పునీత జాన్ వియాన్నిగారా! మాకొరకు వేడుకోనండి! ఆమెన్.

4. పునీత జాన్ వియాన్ని: పాపసంకీర్తనం పట్ల అపారమైన అంకితభావం

పునీత జాన్ మరియ వియాన్నిగారు, ఆర్స్ యొక్క గురువుగా ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధులు. పాపసంకీర్తనం అను దివ్యసంస్కారం పట్ల ఆయనకు అపారమైన అంకితభావం ఉండేది. ఎంతో మందిని దేవుని మార్గంలో నడిపించి, వారికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేయడంలో ఆయన విశేషంగా ప్రసిద్ధి చెందారు.

పునీత జాన్ వియాన్నిగారు తన జీవితంలో ఎక్కువ భాగాన్ని, అంటే రోజుకు 12 నుండి 16 గంటల సమయాన్ని, కేవలం పాపసంకీర్తనాలు వినడానికే కేటాయించేవారు. ముఖ్యంగా వేసవి కాలంలో, వేలాది మంది యాత్రికులు ఆర్స్ గ్రామానికి తరలివచ్చేవారు. కొన్నిసార్లు ఆయన తెల్లవారుజామున పాపసంకీర్తనాలను వినడం ప్రారంభించి, అర్ధరాత్రి వరకు కొనసాగించేవారు. ఆయనకు విశ్రాంతి చాలా తక్కువగా ఉండేది. అలసిపోకుండా అంతసేపు కూర్చోవడం, ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా శ్రద్ధగా సలహాలు ఇవ్వడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయేవారు. దీని వెనుక దైవిక సహాయం ఉందని వారు బలంగా నమ్మేవారు. ఈ అంకితభావం కారణంగానే ఆయనను పాపసంకీర్తనం వినే గురువులకు పాలక పునీతునిగా పరిగణిస్తారు. వియాన్నిగారు కేవలం పాపసంకీర్తనాలను వినడమే కాకుండా, పశ్చాత్తాపపడిన ఆత్మలకు దైవిక కరుణను అనుభవించడానికి సహాయపడేవారు.

పునీత జాన్ వియాన్నిగారిలోని లోతైన ఆధ్యాత్మికత, అలాగే ఆయనకు లభించిన అతీంద్రియ వరాలు - ఉదాహరణకు, ప్రజల హృదయాలను చదవగలగడం, భవిష్యత్తును చెప్పగలగడం, రోగాలను నయం చేయగలగడం - వంటివి ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. ఈ వరాల కారణంగా, సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు. వారు పునీత వియాన్నిగారి నుండి మార్గదర్శకత్వం పొందడానికి, ముఖ్యంగా పాపమన్నింపు దివ్యసంస్కారము ద్వారా, దేవునితో సఖ్యత పొందడానికి వచ్చేవారు.

ప్రజలు తమ పాపాలను చెప్పకముందే, ఆయన కొన్నిసార్లు వారి అంతర్గత ఆలోచనలను, పాపాలను బయటపెట్టేవారు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచేది, ఒక్కోసారి భయపెట్టేది కూడా! కొంతమంది ఆయనను పరీక్షించడానికి, అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించినా, ఆయన వెంటనే వారి అసలు ఉద్దేశాలను పసిగట్టేవారు. ఇది చాలా మందిని తమ పాపాలను నిజాయితీగా ఒప్పుకోవడానికి ప్రేరేపించేది.

పునీత జాన్ వియాన్నిగారు కరుణగల వాడైనప్పటికీ, నిజమైన పశ్చాత్తాపం లేనివారికి పాపమన్నింపు ఇవ్వడానికి నిరాకరించేవారు. పశ్చాత్తాపం లేకుండానే పాపమన్నింపు పొందాలనుకునే వారిని, లేదా తమ పాపాలను వదులుకోవడానికి సిద్ధంగా లేని వారిని ఆయన సున్నితంగా వెనక్కి పంపేవారు. ఇది వారిని నిజమైన పశ్చాత్తాపానికి పురిగొల్పేది. ఆయన ఎల్లప్పుడూ దేవుని దయను, క్షమాపణను నమ్మేవారు, కానీ దానికి ముందు నిజమైన పశ్చాత్తాపం ఉండాలని స్పష్టం చేశారు.

పునీత వియాన్నిగారి బోధనలు, ప్రార్థనలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తెచ్చాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు! ఆయన తన జీవిత చివరి క్షణం వరకు పాపసంకీర్తనాలను విన్నారు. వృద్ధాప్యంలో, తీవ్ర అనారోగ్యంగా ఉన్నప్పటికీ, ప్రజలకు సేవ చేయాలనే తపనతో కొనసాగారు. తన ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా, ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు, ఆయన బలహీనమైన స్వరంతో వారికి ఆశీర్వాదం ఇచ్చేవారు.

ఇవన్నీ కూడా పునీత జాన్ వియాన్నిగారికి పాపసంకీర్తన సంస్కారం పట్ల ఉన్న అంకితభావాన్ని, ఆయనకు ఉన్న దైవిక వరాలను, ప్రజల ఆధ్యాత్మిక జీవితాలపై ఆయన చూపిన ప్రభావాన్ని స్పష్టం చేస్తాయి.

పునీత జాన్ వియాన్నిగారా! మాకొరకు వేడుకోనండి! ఆమెన్.

5. పునీత జాన్ వియాన్నిగారి నిరాడంబరత మరియు వినయము

పునీత జాన్ వియాన్నిగారు నిరాడంబరతకు, వినయానికి గొప్ప ఉదాహరణ. తన జీవితాన్ని ఇతరులకు సేవ చేయడానికే అంకితం చేశారు. వ్యక్తిగత లాభాలు, హోదా కన్నా ప్రార్థన, దివ్యసంస్కారాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. దేవుని దయకు తాను కేవలం ఒక సాధనం మాత్రమే అని నమ్మడం, కష్టాలను, వ్యక్తిగత తపస్సును స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం ఆయన వినయ స్వభావానికి నిదర్శనం.

నిరాడంబరత

పునీత జాన్ వియాన్నిగారు పేదరికంలో, నిరాడంబరంగా జీవించారు. విలాసాలకు దూరంగా ఉంటూ, తన విచారణలోని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రీస్తును అనుసరించాలనే తన దీక్షను ప్రతిబింబిస్తూ, ఆయన సరళమైన జీవనశైలిని ఎంచుకున్నారు. పునీత జాన్ వియాన్నిగారి నిరాడంబరతకి కొన్ని ఉదాహరణలు: జీవితాంతం ఒక చిన్న, నిరాడంబరమైన ఇంట్లో నివసించారు. విలాసాలకు, అనవసరమైన వస్తువులకు దూరంగా ఉన్నారు. ఖరీదైన వస్త్రాలు కాకుండా, సాధారణమైన, అవసరమైన దుస్తులనే ధరించేవారు. తన వద్దకు వచ్చే పేదలకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. తన వద్ద ఉన్న కొద్దిపాటి వనరులను కూడా వారితో పంచుకునేవారు.

ఆయన ప్రసంగాలు సరళమైన భాషలో ఉన్నప్పటికీ, లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉండి ఎంతో మంది హృదయాలను హత్తుకున్నాయి. ముఖ్యంగా పాపసంకీర్తనం మరియు దివ్యసత్ప్రసాదము వంటి దివ్యసంస్కారాలపై ఎక్కువ దృష్టి పెట్టారు.

వినయం

పునీత జాన్ వియాన్నిగారు అద్భుతమైన ఆధ్యాత్మిక విజయాలు సాధించినప్పటికీ, తన అయోగ్యత గురించి, సామర్థ్యం లేదనే భావనతో పోరాడారు. తన సేవ విజయవంతం అవ్వడానికి తాను కారణం కాదని, దేవుని దయ వల్లే అని ఆయన నమ్మారు. ఆయన వినయం చాలా మందిని ఆయనను ఆశ్రయించేలా చేసింది. ఎందుకంటే ప్రజలు ఆయనలోని నిజాయితీని, చిత్తశుద్ధిని గుర్తించారు. తన సలహా కోసం వచ్చిన వారిని ఓపికగా స్వాగతించేవారు. ఆయన వినయం కేవలం ఒక లక్షణం కాదు, ఆయన జీవితం మొత్తం, ఆయన సేవ అంతటా వ్యాపించిన ఒక చురుకైన సద్గుణం. పునీత జాన్ వియాన్నిగారి వినయానికి కొన్ని ఉదాహరణలు: తన ఆధ్యాత్మిక సామర్థ్యాలపై తరచుగా సందేహపడేవారు. తాను ఒక సాధారణ మనిషినే అని, దేవుని కృప వల్లే తన సేవ ఫలిస్తుందని గట్టిగా నమ్మేవారు. తన విజయాలకు దేవుడికే ఘనత నిచ్చేవారు. “నేను కేవలం ఒక పనిముట్టును, దేవుడే అంతా చేస్తాడు” అని తరచుగా చెప్పేవారు. ఆధ్యాత్మిక జీవితంలో ఇతరుల నుండి సలహాలు తీసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడలేదు, తాను అన్ని విషయాలు తెలిసినవాడినని భావించలేదు. తప్పు చేసినప్పుడు వెంటనే క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉండేవారు, అది ఆయన వినయానికి నిదర్శనం.

పునీత జాన్ వియాన్నిగారు తన వినయం వల్ల ఆయన అన్ని నేపథ్యాల వారికి చేరువయ్యారు. తన పాపాలను తెలుసుకోవడానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి వినయం ఎంత ముఖ్యమో ఆయన గుర్తించారు. ఆయన వినయం దేవుని గొప్పదనం, తన స్వంత అల్పత్వం పట్ల ఆయనకు ఉన్న లోతైన అవగాహన నుండి వచ్చింది. వినయం అన్ని ఇతర సద్గుణాలకు పునాది అని వియాన్నిగారు గట్టిగా నమ్మారు.

పునీత జాన్ వియాన్నిగారి జీవితం, నిజమైన పరిశుద్ధత అనేది ఈ లోక సంబంధమైన విజయం లేదా హోదాలో కాదని స్పష్టంగా తెలియచేస్తుంది. అది దేవుని చిత్తానికి వినయంగా, నిరాడంబరంగా లొంగిపోవడం, ఇతరులకు నిస్వార్థంగా సేవ చేయడంలోనే ఉందని ఆయన జీవితం మనకు తెలియజేస్తుంది. పునీత జాన్ వియాన్నిగారా! మాకొరకు వేడుకోనండి! ఆమెన్.

6. పునీత జాన్ వియాన్నిగారు - శ్రమలలో సహనం

పునీత జాన్ మరియ వియాన్నిగారి జీవితం ఓపికకు, సహనానికి గొప్ప నిదర్శనం. లోకజ్ఞానం కంటే, భగవంతునిపట్ల దృఢ విశ్వాసమే పవిత్రతకు మార్గం అని ఆయన జీవితం మనకు స్పష్టంగా తెలియ జేస్తుంది. వియాన్నిగారు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. విద్యాపరమైన సవాళ్ళను, ముఖ్యంగా లతీను భాషను నేర్చుకోవడంలో వారు ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, ఆయన ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. రాత్రిపూట కూడా చదువుకుంటూ, కష్టపడి లాటిన్ నేర్చుకోవడానికి ప్రయత్నించారు. తన బలహీనతలను దేవుని దయతో అధిగమించగలనని నమ్మారు. చివరకు, ఒక గురువు తన ప్రతిభను గుర్తించి, ఆయనకు ప్రత్యేక బోధన ఇచ్చి, గురువుగా మారడానికి సహాయపడ్డారు. దేవుని చిత్తాన్ని నమ్మి, ప్రార్థన మరియు పశ్చాత్తాపంతో కూడిన జీవితాన్ని గడిపారు.

ఆయనలోని ఇదే పట్టుదల, “క్యూర్ ఆఫ్ ఆర్స్‌”గా ఆయన సేవలో కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. ఆధ్యాత్మికంగా అంతగా ఆసక్తి లేని ‘ఆర్స్’ అనే గ్రామానికి ఆయన విచారణ గురువుగా వెళ్ళారు. ఆ గ్రామంలోని ప్రజలు ఆధ్యాత్మికంగా చాలా నిర్లక్ష్యంగా ఉండేవారు; గుడికి రావడం, ప్రార్థనలు చేయడం చాలా తక్కువ. గ్రామస్తులు ఆయన పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ఆయన ఏమాత్రం నిరాశ చెందలేదు. అలుపెరగని ప్రార్థనలు, ఉపవాసాలు, మరియు సుదీర్ఘ గంటలపాటు పాపసంకీర్తనాలను వినడం ద్వారా, వారు తన గ్రామస్తుల హృదయాలను క్రమంగా మార్చారు. ఆవిధముగా, వేల సంఖ్యలో యాత్రికులు ఆయన దగ్గరకు రావడం మొదలుపెట్టారు.

దేవుని కోసం తన సేవ, ప్రభావం చూపుతున్నందు వలన, సాతాను ఆయనను అనేక విధాలుగా శోధించింది. ఆయన నివసించే చిన్న గదిలో వింత శబ్దాలు, వస్తువులు కదలడం, మరియు కొన్నిసార్లు శారీరక దాడులు కూడా జరిగాయని చెబుతారు. సాతాను ఆయనను ఎగతాళి చేసేదట, ఎందుకంటే ఆయన చాలా నిరాడంబరంగా జీవించేవారు.

పునీత జాన్ మరియ వియాన్నిగారి జీవితం, మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే, కష్టాలు మరియు బాధలు, దేవుడు మనల్ని వదిలేశాడని చెప్పవు, కానీ ఆయనపై మన నమ్మకాన్ని మరింత పెంచుకోవడానికి అవి నిజమైన అవకాశాలు. పట్టుదలతో మనం మన కష్టాలను స్వీకరించాలని వియాన్నిగారి జీవితం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే, పట్టుదల ద్వారా దేవుడు మన బలహీనతలను కూడా తన రాజ్యానికి గొప్ప పనులను చేయడానికి ఉపయోగించుకోగలడని మనకు తెలుస్తుంది. పునీత జాన్ వియాన్నిగారా! మాకొరకు వేడుకోనండి! ఆమెన్.

7. పునీత జాన్ వియాన్నిగారు – పేదలు, బాధితులపట్ల అపారమైన ప్రేమ

పునీత జాన్ మరియ వియాన్ని, ఆర్స్‌ గురువుగా ప్రసిద్ధి చెందినవారు. ఆయన తన గొప్పతనాన్ని ఆడంబరాల ద్వారా చాటుకోలేదు. బదులుగా, ఆయన సాధారణమైన, నిస్వార్థ సేవలతో తన ఆదర్శాన్ని నిరూపించుకున్నారు. పేదలు, బాధల్లో ఉన్నవారి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ ఆయన సేవా జీవితంలోనే ప్రధాన భాగం.

దాతృత్వం, పేదరికం నిండిన జీవితం: వియాన్ని గారి జీవితం కఠినమైన పేదరికం, స్వీయనిరాకరణతో సాగింది. పేదల కోసం తన దగ్గర ఉన్నదంతా ఇచ్చివేసి, ఆయన చాలా సాధారణంగా, ఆడంబరాలు లేని జీవితాన్ని గడిపారు. ఒక పేద రైతు కుటుంబంలో పుట్టడం వల్ల, ఆయనకు పేదరికం అంటే ఏమిటో స్వయంగా తెలుసు. ఈ అనుభవమే కష్టాల్లో ఉన్నవారి పట్ల ఆయనలో లోతైన కరుణను నింపింది. ఆయన తరుచుగా, “నా రహస్యం చాలా సులభం; అది అన్నింటినీ ఇచ్చివేయడం, నా కోసం ఏమీ ఉంచుకోకపోవడం” అని చెప్పేవారు. తన దగ్గర ఇవ్వడానికి డబ్బు లేనప్పుడు, ఆయన తన వద్దకు వచ్చిన పేదలతో, “ఈరోజు నేను మీలాగే పేదవాడిని, నేను మీలో ఒకడిని” అని చెప్పేవారు.

ఆయన దాతృత్వం కేవలం తన సొంత ఆస్తులను ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన అవసరంలో ఉన్నవారి కోసం చురుకుగా నిధులు సేకరించేవారు. తన విచారణ పరిధిలోని పేదల కోసం డబ్బు పోగు చేయడానికి ఆయన తరచుగా సమీప నగరంలోని వీధుల్లో భిక్షాటన చేసేవారు.

అనాథలు, రోగులకు ఆదర్శం: పునీత జాన్ మరియ వియాన్ని గారి పేదల పట్ల ప్రేమ అనాథాశ్రమాలు స్థాపించడం వంటి నిర్దిష్ట సేవా కార్యక్రమాలకు దారితీసింది. ఆయన ఇద్దరు సహాయకులతో కలిసి, ఆర్స్‌లో బాలికల కోసం “లా ప్రొవిడెన్స్” అనే గృహాన్ని స్థాపించారు. ఇది వారికి కేవలం నివాసం మాత్రమే కాదు, వారికి కతోలిక విద్య, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కూడా అందించే స్థలం. ఆయన అనాథలకు, నిస్సహాయులకు ఆశాదీపంగా నిలిచి, వారికి సురక్షితమైన వాతావరణంలో ఎదిగే, నేర్చుకునే అవకాశం కల్పించారు.

పేదల పట్ల ఆయన చూపిన శ్రద్ధతో పాటు, ఆయన రోగుల పట్ల కూడా అపారమైన కరుణను ప్రదర్శించారు. ఆయన రోగులను, వారి కుటుంబాలను క్రమం తప్పకుండా సందర్శించి, వారికి ఓదార్పు, ఆధ్యాత్మిక మద్దతు ఇచ్చేవారు. ఆయన ప్రార్థనల ద్వారా అనేక శారీరక స్వస్థతలు కూడా జరిగాయి. ఇది విశ్వాసులను ఆశ్చర్యపరచడమే కాకుండా, ఆయన పరిశుద్ధతకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇతరుల బాధలను క్రీస్తు బాధలతో ఏకం చేసే అవకాశంగా ఆయన భావించారు. అంతేకాదు, ప్రజలు తమ కష్టాలను ప్రేమతో అంగీకరించేలా ప్రోత్సహించేవారు.

ఆయన సేవలోని ప్రతి అంశంలో, పునీత జాన్ మరియ వియాన్ని గారి పేదల, బాధల్లో ఉన్నవారి పట్ల ప్రేమ, దేవుని పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమకు ప్రత్యక్ష ప్రతిబింబం అని చెప్పవచ్చు. అవసరంలో ఉన్నవారికి సేవ చేయడం అంటే క్రీస్తుకు సేవ చేయడమే అని వియాన్నిగారు దృఢంగా నమ్మేవారు. పునీత జాన్ వియాన్నిగారా! మాకొరకు వేడుకోనండి! ఆమెన్.

8. పునీత జాన్ వియాన్నిగారు – దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయత

పునీత జాన్ మరియ వియాన్నిగారు, దేవుని చిత్తానికి చూపిన అచంచలమైన విధేయత మనందరికీ ఒక గొప్ప ఆదర్శం. జీవితాంతం, ఎన్నో కష్టాలను, త్యాగాలను ఎదుర్కొన్నా, తన సొంత కోరికల కంటే దేవుని చిత్తానికే ఆయన ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. పునీత జాన్ వియాన్ని గారు దేవుని చిత్తాన్ని ఎలా పాటించారో, ఎలా బోధించారో ధ్యానిద్దాం:

గురువు కావాలనే తపన ఉన్నప్పటికీ, వియాన్నిగారికి చదువు, ముఖ్యంగా లతీను బాషను నేర్చుకోవడం చాలా కష్టంగా ఉండేది. అయినా ఆయన పట్టుదల, తన ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకత్వంతో ముందుకు సాగారు. ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ, దేవుడు తనను గురువుగా పిలుస్తున్నాడని నమ్మి, ఆ పిలుపును నిలకడగా కొనసాగించడం ఆయన విధేయతకు గొప్ప నిదర్శనం.

విశ్వాసపరంగా అంతగా చురుకుగా లేని ఒక చిన్న గ్రామం అయిన ఆర్స్‌కు వియాన్నిగారిని పంపినప్పుడు, అప్పటి బిషప్ ఇలా అన్నారట: “ఆ విచారణ సంఘంలో దైవప్రేమ తక్కువగా ఉంది; దాన్ని నింపే బాధ్యత నీదే” అని. వియాన్నిగారికి ఏకాంత జీవితం గడపాలని ఉన్నా, ఈ సవాలును స్వీకరించారు. ఆర్స్‌ను విడిచి పలుమార్లు వెళ్ళిపోవాలని ప్రయత్నించినా, తన బిషప్ ఆజ్ఞకు విధేయత చూపించి తిరిగి వచ్చారు. తన కోరికలకు విరుద్ధంగా ఉన్నా, ఉన్నతాధికారులకు ఆయన చూపిన విధేయత విశేషమైనది.

పునీత జాన్ మరియ వియాన్నిగారు పేదరికం, బ్రహ్మచర్యం, స్వీయ-త్యాగంతో కూడిన కఠినమైన జీవితాన్ని గడిపారు. ఆయన తరచుగా ఆహారం, నిద్ర, వ్యక్తిగత సౌకర్యాలను త్యజించేవారు. రాత్రిపూట కేవలం కొన్ని గంటలు మాత్రమే నేలపై నిద్రించేవారు. ఈ కఠినమైన నియమాలు కేవలం తన కోసమే కాక, (పునీత పౌలు అన్నట్లుగా), “తన శరీరాన్ని దేవుని సేవకు అంకితం చేయడానికి”, క్రీస్తు ఆశించిన విధంగా జీవించడానికి, తన పవిత్రత కోసం, ఆత్మల రక్షణ కోసం దేవుని చిత్తానికి విధేయతగా చేశారు.

వియాన్నిగారు రోజుకు 12 నుండి 18 గంటల పాటు పాపసంకీర్తనాలను వినేవారు. ఆర్స్ గ్రామానికి వచ్చిన లక్షలాది మంది యాత్రికులకు ఆయన సేవలందించారు. శారీరకంగా, మానసికంగా ఎంతో అలసట కలిగించే పని అయినా, దేవునిపై ప్రేమతో, ఆత్మల రక్షణ కొరకై ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ పనిని చేశారు. ఆయన చూపిన ఈ అవిశ్రాంత అంకితభావం తన గురుత్వ విధులపట్ల ఆయనకున్న విధేయతకు నిదర్శనం.

మోక్షానికి అత్యవసరమైనదిగా భావిస్తూ, దేవుని వాక్యాన్ని వినడం, పాటించడం ఎంత ముఖ్యమో ఆయన నొక్కి చెప్పారు. ఆయన ప్రసంగాలు చాలా సరళంగా, హృదయాన్ని తాకేలా ఉండేవి. అవి విన్న చాలామంది మారుమనస్సు పొందారు. విశ్వాసాన్ని బలపరచుకున్నారు. దేవుని చిత్తానికి నిజమైన విధేయత అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించడమే అని వియాన్నిగారు నమ్మారు.

పునీత జాన్ మరియ వియాన్నిగారికి పవిత్ర దివ్యసత్ప్రసాదం పట్ల అపారమైన భక్తి ఉండేది. అది ఎంత ముఖ్యమో ఆయన బోధించారు. దివ్యపూజ అనేది మనం చేయగలిగే అత్యంత గొప్ప కార్యంగా, దేవుని స్వంత కార్యంగా ఆయన భావించారు. తరచుగా దివ్యసత్ప్రసాదం స్వీకరించమని విశ్వాసులను ప్రోత్సహించారు. దివ్యసత్ప్రసాదంపై వియాన్నిగారు చూపిన భక్తి, విశ్వాసం, తన గురుత్వ జీవితంలో కీలకమైనది. ఇది కతోలిక బోధనలకు, మోక్షం గూర్చిన దేవుని ప్రణాళిక పట్ల వియాన్నిగారి విధేయతకు నిదర్శనం!

పునీత జాన్ మరియ వియాన్నిగారి జీవితమే విధేయతకు వారు చేసిన గొప్ప ప్రసంగం, గొప్ప సాక్ష్యం. వారు పెద్ద పెద్ద వేదాంత గ్రంథాలు రాయకపోయినా, ఆయన చేతలే ఆయన సిద్ధాంతాలను తెలియజేసాయి.

“విధేయత అనే సద్గుణం సంకల్పాన్ని బలపరుస్తుంది. అత్యంత కష్టమైన పనులను నెరవేర్చడానికి ధైర్యాన్ని ఇస్తుంది” అన్న వియాన్నిగారిమాటలు, విధేయత అంటే గుడ్డిగా లోబడిపోవడం కాదు, అది ఒక ఆధ్యాత్మిక సాధన అని, ఇది సవాళ్లతో కూడిన పనులను కూడా సరిగ్గా చేయగల శక్తిని ఇస్తుందని వారి నమ్మకాన్ని తెలియజేస్తుంది.

దేవున్ని ప్రేమించడం అంటే కేవలం భావాలు కలిగి ఉండటం కాదని, ఆయన ఆజ్ఞలను, క్రైస్తవ విధులను చురుకుగా పాటించడమే అని వియాన్నిగారు బోధించారు. “మన ప్రేమ చురుకుగా ఉంటే, అది చేతల ద్వారా వ్యక్తమవుతుంది. ఎందుకంటే దేవుని ప్రేమ కేవలం ఇష్టపడే ప్రేమ మాత్రమే కాదు, అది విధేయతతో కూడిన ప్రేమ. ఇది ఆయన ఆజ్ఞలను పాటించేలా చేస్తుంది; క్రైస్తవ విధులను నెరవేర్చే క్రియాశీల ప్రేమ అవుతుంది” అని వియాన్నిగారు బోధించారు.

నిజమైన విధేయత అంటే దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని, దానిని అమలు చేయడమే తప్ప, తన సొంత ఇష్టాలను రుద్దడం కాదని వియాన్నిగారు నమ్మారు. “దేవుడిని సేవించడానికి రెండు మార్గాలు ఉండవు. ఒకే ఒక మార్గం ఉంది: ఆయన ఎలా సేవ చేయబడాలని కోరుకుంటున్నాడో అలాగే ఆయనను సేవించండి” అని వియాన్ని గారు చెప్పారు.

ముగింపుగా, పునీత జాన్ మరియ వియాన్నిగారి జీవితం దేవుని చిత్తానికి “వినడం, దానికి అనుగుణంగా ప్రవర్తించడం” అనే నిరంతర ప్రక్రియతో సాగింది. విధేయతకు సంబంధించిన బైబిలు భావనలో ఇది లోతుగా పాతుకుపోయింది. అపారమైన త్యాగం, ఓర్పు అవసరమైనా, దైవప్రణాళికతో తన జీవితాన్ని వినయంగా సమలేఖనం చేయడంలోనే నిజమైన పవిత్రత ఉందని వియాన్నిగారు రుజువు చేశారు. పునీత జాన్ వియాన్నిగారా! మాకొరకు వేడుకోనండి! ఆమెన్.

9. పునీత జాన్ వియాన్నిగారు – గురువులకు ఆదర్శం

పునీత జాన్ మరియ వియాన్నిగారు, ముఖ్యంగా విచారణ గురువులకు, సాటిలేని ఆదర్శంగా నిలిచారు. గురువుగా ఆయన చూపిన అద్భుతమైన సద్గుణాలు, మరియు విశ్వాసుల ఆధ్యాత్మిక జీవితాలపై ఆయన కలిగించిన అపారమైన ప్రభావమే దీనికి కారణం. ఆయన ఎలా ఆదర్శంగా నిలిచారో ధ్యానిద్దాం:

ప్రార్థనతో కూడిన జీవితం, దివ్యసత్ప్రసాదము పట్ల ఎనలేని భక్తి: పునీత జాన్ మరియ వియాన్నిగారి సేవకు ఆధారం ఆయన లోతైన ప్రార్థనా జీవితం. ఆయన చాలా గంటలు దివ్యసత్ప్రసాదం ముందు ప్రార్థనలో గడిపేవారు. దివ్యసత్ప్రసాద ప్రభువు నుండి శక్తిని, జ్ఞానాన్ని, ప్రేమను పొందేవారు. క్రీస్తుతో ఆయనకున్న ఈ లోతైన వ్యక్తిగత సంబంధమే ఆయన ఆదర్శవంతమైన జీవితానికి మూలం. గురువులు తమ వ్యక్తిగత జీవితాలకు, వారి సేవా జీవితాలకు ప్రార్థన ఎంతో అవసరమని వియాన్నిగారు చూపారు. ప్రార్థన లేకుండా వారి ప్రయత్నాలు ఫలించవని అర్థం చేసుకోవాలి.

పాపసంకీర్తన సంస్కారం పట్ల అచంచలమైన అంకితభావం: పునీత జాన్ మరియ వియాన్నిగారు రోజుకు దాదాపు 16 గంటల వరకు పాపసంకీర్తనలు వినేవారు. ఇది దేవుని దయకు గురువు యొక్క ముఖ్యమైన బాధ్యతను స్పష్టం చేస్తుంది. వియాన్నిగారు చూపిన ఓపిక, దయ, విచక్షణతో కూడిన పాపసంకీర్తన విధానం, గురువులు ఈ సంస్కారానికి ప్రాధాన్యత ఇవ్వడానికి, దేవుని క్షమాపణను, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అవిశ్రాంతంగా అందించడానికి గొప్ప ఆదర్శంగా ఉంటుంది.

సాధారణ జీవనం, స్వీయత్యాగం: వియాన్నిగారు చాలా సరళమైన, కఠినమైన జీవితాన్ని జీవించారు. తరచుగా ఆహారం, నిద్రను కూడా త్యజించారు. లోక సుఖాల నుండి దూరంగా ఉండటం ఆయన దేవునికి, తన ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండటానికి సహాయపడింది. గురువులందరూ ఇంత కఠినమైన తపస్సు చేయాల్సిన అవసరం లేకపోయినా, వియాన్నిగారి త్యాగస్ఫూర్తిని, భౌతిక వస్తువుల పట్ల ఆసక్తి లేకపోవడాన్ని, మరియు తాత్కాలిక విషయాలకంటే కంటే ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని ప్రోత్సహిస్తుంది. గురువుల జీవితాలు వారి స్వంతం కావని, క్రీస్తుకు, ఆయన శ్రీసభకు అంకితం చేయబడినవని వియాన్నిగారి జీవితం గుర్తుకు చేస్తుంది.

ఆధ్యాత్మిక ఉత్సాహం, ఆత్మల పట్ల ప్రేమ: ఆత్మల రక్షణ కోసం వియాన్నిగారు చేసిన కృషి ప్రతి గురువుకు గొప్ప ఆదర్శం. ఆయన ఉదాసీనంగా ఉన్న ఆర్స్ అనే గ్రామానికి వెళ్లి, తన ప్రయత్నాల ద్వారా దానిని శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. ప్రజలను దేవునికి మరింత దగ్గర చేయడానికి ఎంతగానో కృషి చేశారు. ఇది ప్రతి గురువు కలిగి ఉండవలసిన మిషనరీ స్ఫూర్తికి, ఉత్సాహానికి ఒక గొప్ప ఉదాహరణ, ప్రజలను క్రీస్తు వద్దకు నడిపించాలనే బలమైన కోరికను తెలియజేస్తుంది.

వినయం, సరళత: వియాన్నిగారికి అపారమైన ఆధ్యాత్మిక వరాలు ఉన్నప్పటికీ, వేలాది మంది ఆయన వద్దకు వచ్చినా, ఆయన గొప్ప వినయాన్ని ప్రదర్శించారు. ప్రతీ మంచి కార్యాన్ని కూడా దేవునికి ఆపాదించారు. గురువులకు ఈ వినయం చాలా ముఖ్యం. ఎందుకంటే వారు దేవుని చేతుల్లో సాధనాలు తప్ప, కృపకు మూలం కాదని ఇది వారికి గుర్తు చేస్తుంది.

ప్రభావవంతమైన బోధన: వియాన్నిగారి ప్రసంగాలు, విశ్వాస బోధనలు శక్తివంతమైనవి. అందరి హృదయాలను తాకేవి. ఆయన హృదయం నుండి మాట్లాడేవారు. విశ్వాసం యొక్క ప్రాథమిక సత్యాలను ప్రజల జీవితాలకు అన్వయించేవారు. ప్రభావవంతమైన బోధన కేవలం మేధోపరమైన జ్ఞానం నుండి మాత్రమే కాకుండా, ప్రార్థనతో నిండిన జీవితం, సత్యాలను జీవించడం, దేవుని వాక్యాన్ని తెలియజేయాలనే నిజమైన కోరిక నుండి వస్తుందని వియాన్నిగారి జీవితం చెబుతుంది.

శ్రీసభ అధికారం పట్ల విధేయత: పునీత జాన్ మరియ వియాన్నిగారు ఏకాంత/ధ్యాన జీవితాన్ని కోరుకున్నారు. అనేకసార్లు ఆర్స్ గ్రామాన్ని విడిచి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ తన బిషప్ ఆదేశాలకు విధేయుడై ఉన్నారు. ఈ అచంచలమైన విధేయత గురుత్వ జీవితానికి ఒక మూలస్తంభం. శ్రీసభ మార్గదర్శకత్వం, దేవుని చిత్తంపై నమ్మకాన్ని ఇది ప్రదర్శిస్తుంది.

వ్యక్తిగత పవిత్రతకు ఆదర్శం: 23వ జాన్ పోపుగారు తన లేఖలో, వియాన్నిగారి యొక్క “ఏకైక ఉద్దేశం దేవుని ప్రేమ, తన పొరుగువారి ఆత్మల రక్షణ” అని నొక్కి చెప్పారు. వియాన్నిగారి జీవితం ఒక విచారణ గురువు యొక్క సాధారణ, కష్టతరమైన విధులలో పవిత్రతకు ఒక జీవన సాక్ష్యం. పవిత్రత అసాధారణ పరిస్థితులకు మాత్రమే పరిమితం కాదని, సేవ యొక్క రోజువారీ జీవితంలో కూడా సాధించవచ్చని వియాన్నిగారు చూపారు.

పునీత జాన్ మరియ వియాన్నిగారు గురుత్వ సేవలో పూర్తిగా నిమగ్నమైన గురువులకు ఒక గొప్ప ఆదర్శం. ప్రార్థన, దివ్యసంస్కారాలు, ధ్యానం, విశ్వాసుల సేవకు అంకితభావం ద్వారా ఆయన “మరో క్రీస్తుగా” గుర్తింపు పొందారు. ఒక గురువు యొక్క వ్యక్తిగత పవిత్రత, సువార్తీకరణకు, మరియు సమాజ మార్పుకు అత్యంత శక్తివంతమైన సాధనం అని ఆయన నిరూపించారు.

No comments:

Post a Comment