పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్

 పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ (4 అక్టోబర్)


ఉపోద్ఘాతం:
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ 12వ శతాబ్దంలో జీవించిన గొప్పపునీతుడుమహనీయుడు. ఆయన జీవించిన ‘పేదరికం’, ఎవరూ జీవించి యుండరు. పేదవారిపట్ల ప్రేమ, స్నేహ, సేవా భావముతో జీవించాడు. ఎప్పుడైతే పేదవారిని ప్రేమించగలనో 

, అప్పుడే దేవున్ని పరిపూర్ణముగా ప్రేమించగలనని గ్రహించాడు. ప్రేమ, కరుణ స్వరూపియైన దేవుని మంచితనమును ఫ్రాన్సిస్‌ అలవర్చుకున్నాడు. పవిత్రాత్మచేత ప్రేరేపింప బడ్డాడు. తన ధాతృత్వ సుగుణాన్ని, జీవితాంతం ఆచరణలో పెట్టిన గొప్పవ్యక్తి. “ఇప్పటి వరకు మనం ఏమి చేయలేదు, దేవున్ని సేవించడం ఇప్పటికైనా మొదలు పెడదాం” అని తన మరణావస్థలో తన సహోదరులతో పలికిన గొప్పపునీతుడు ఫ్రాన్సిస్‌. దేవుని సృష్టిపట్ల, ముఖ్యంగా మూగజీవులపట్ల ప్రత్యేకమైన ఆకర్షణని, ప్రేమని, సోదరభావాన్ని వ్యక్తపరచిన చిరస్మరణీయుడు.

కుటుంబ నేపధ్యం: ఇటలీ దేశంలోని అస్సీసి పట్టణంలో క్రీ.శ. 1182వ సం.లో జన్మించాడు. జ్ఞానస్నానం పేరు యోహాను. తరువాత ఫ్రాన్సిసుగా పిలువబడ్డాడు. తండ్రి పీటర్‌ బెర్నార్డ్‌తల్లి పీకా. తండ్రి పెద్ద ధనవంతుడైన బట్టల వ్యాపారి. ఫ్రాన్సిస్‌ చలాకీగా, కలుపుగోలు తనముతో వ్యాపారంలో తండ్రికి సహాయం తోడుగా ఉండేవాడు. కాని, ఫ్రాన్సిస్‌, తోటియువతతో కలిసి విందువినోదాలకు అధికంగా డబ్బు ఖర్చుచేసేవాడు, దుబారా చేసేవాడు. ఒకవైపు తండ్రి తన వ్యాపారంలో ఫ్రాన్సిసు గొప్పవారసుడు కావాలని కలలు కనేవాడు.

కాని, మరోవైపు ఫ్రాన్సిసు యుక్తవయస్సులోనే గొప్పయోధుడు కావాలని కలలు కనేవాడు. యుద్ధాలలో పాల్గొన్నాడు. 1202వ సం.లో పెరూజియన్‌లతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. అయితే అస్సీసి ఓడిపోవడముతో ఖైదీగా పట్టుబడ్డాడు. తన కల చెదరిపోయింది. చెరసాలలోకూడా అందరితో కలవిడిగా తిరుగాడుచూ చతురోక్తులతో నవ్వించేవాడు. ఒక సంవత్సరం తరువాత, చెరసాలనుండి విడుదలయ్యాడు. కాని, కొద్దిరోజులకే తీవ్రజబ్బు బారిన పడ్డాడు. ఈ సమయంలోనే తనలో ఎంతో మార్పు కలిగింది. తన జీవితములోనికి తొంగి చూడటం ప్రారంభించాడు.

దైవపిలుపు: అయినను, మరల 1205వ సం.లో, పోపు సైన్యముతో కలిసి యుద్ధము చేయుటకు బయలుదేరాడు. ఆపూలియా వెళ్ళుత్రోవలో, “ఫ్రాన్సిస్‌, ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు ఎవరిని సేవించగోరుచున్నావు? యజమానుడినా లేదా సేవకుడినా? అని ఒక స్వరాన్ని విన్నాడు. ‘యజమానుడిని’ అని ఫ్రాన్సిస్‌ సమాధానం చెప్పాడు. మళ్ళీ ఆ స్వరం, “కాని, నీవు యాజమానుడినిగాక, సేవకుడిని సేవిస్తున్నావు” అని పలికింది. అప్పుడు ఫ్రాన్సిస్‌, “అయితే, నన్నేమి చేయమంటారు?” అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ స్వరం, “నీవు తిరిగి అస్సీసి నగరానికి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావు” అని చెప్పింది.

ఫ్రాన్సిస్‌ తిరిగి అస్సీసికి వచ్చాడు. అప్పటినుండి ఫ్రాన్సిస్‌ సువార్తధ్యానం మొదలుపెట్టాడు. ధనాన్ని పేదలకు దానంచేసాడు. ఆస్తినంతా త్యజించి, స్వచ్చంధ పేదరికంలో, క్రీస్తుకు నిజమైన శిష్యునిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. దైవపిలుపును అర్ధంచేసుకోవడం మొదలుపెట్టాడు. ఏకాంత ప్రదేశాలకు వెళ్లి, ప్రార్ధన చేయడం ప్రారంభించాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాడు.

          ఈ అన్వేషణలో ఉండగానే, ఫ్రాన్సిసువారి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన మరో అద్భుతమైన, మరపురాని సంఘటన జరిగింది. ఒకరోజు ఫ్రాన్సిస్ తన గుర్రముపై వెళ్ళుచుండగా, ఒక కుష్ఠురోగి ఎదురు పడ్డాడు. యుద్ధానికి వెళ్ళకముందు ఫ్రాన్సిస్ కుష్ఠురోగులను చూసి అసహ్యించుకునేవాడు. వారినుండి దూరముగా తప్పించుకునేవాడు. కాని ఈసారి, ఫ్రాన్సిస్ కుష్ఠురోగి దగ్గరకు వెళ్లి కౌగలించుకొని ముద్దుపెట్టు కున్నాడు. కుష్ఠురోగిని ముద్దాడి, అతనికి సహాయం చేసిన తరువాత, గుర్రముపై తిరిగి వెళ్ళేటప్పుడు, వెనుదిరగగా, అక్కడ ఆ కుష్ఠురోగి కనిపించలేదు. చుట్టూచూడగా అతని జాడ ఎక్కడా కనిపించలేదు. ఆ సమయములో తనను సందర్శించినది స్వయముగా యేసుక్రీస్తు ప్రభువే అని ఫ్రాన్సిస్ గ్రహించాడు. ఈ సంఘటన తన జీవితములో మరువలేని తీయనైన అనుభూతిగా ఫ్రాన్సిస్ వర్ణించాడు. లోకబంధకములనుండి తనను విముక్తిగావించిన అద్భుతమైన సంఘటనగా వర్ణించాడు.

అయితే, ఖచ్చితమైన దైవపిలుపును 14 మే 1208 సం.లో, పునీత మత్తయిగారి పండుగ రోజున అర్ధంచేసుకున్నాడు. ఆనాటి సువార్తా, “క్రీస్తు తన శిష్యులను వేదప్రచారానికి పంపటం” ఫ్రాన్సిస్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. తను అర్ధం చేసుకున్నది వెంటనే ఆచరణలో పెట్టుటకు బయలు దేరాడు.

రోమునగరములోని పునీత పేతురుగారి సమాధిని సందర్శించి తననుతాను దేవునికి అంకితం చేసుకున్నాడు. పేదలకు, రోగులకు, ముఖ్యంగా కుష్ఠురోగులకు సేవలు చేయాలని తీర్మానించుకున్నాడు. ఈవిధముగా, తన జీవితాన్ని, సేవకు (సంఘంనుండి వెలివేయబడినవారికి, పేదవారికి, కుష్ఠురోగులకు) అంకితం చేసుకున్నాడు. అస్సీసి పట్టణ ఆవల జీవిస్తూ ప్రార్ధించాడు, బోధించాడు, రోగులకు సేవచేసాడు. కుష్ఠురోగుల సేవద్వారా తనలో ఆధ్యాత్మిక చింతన పెరిగింది, తన మిషన్‌, తన ప్రేషితసేవను, దేవునిచిత్తాన్ని తెలుసుకోగలిగాడు. కుష్టురోగులను ఆలింగనం చేసుకోవడంద్వారా, సర్వమానవాళిని గౌరవించాలి, రక్షించాలి అని తెలుసుకున్నాడు. సకలసృష్టితో సహోదరభావమును పెంపొందించు కోవడంకూడా నెమ్మదిగా తెలుసుకోగలిగాడు.

అలాగే, సువార్తను జీవించడం మరియు దానిని ప్రకటించడం, బోధించడం ప్రారంభించాడు. దేవునియొక్క ప్రేమను, కరుణను ఇతరులతో పంచుకోవడం ప్రారంభించాడు. సాన్ దమియానో దేవాలయములో సిలువలోని యేసుప్రతిమ ముందు ప్రార్ధించు చుండగా, యేసు కళ్ళు తెరచి, ఫ్రాన్సిసుతో, “వెళ్లి నా దేవాలయాన్ని పునర్నిర్మించు” అని చెప్పడం తన ప్రేషితకార్యానికి మూలమైనది. ఆరంభములో పాడుబడిన దేవాలయాలను పునర్నిర్మించిన ఫ్రాన్సిస్ అతిత్వరలోనే శ్రీసభ పునరుద్ధరణకు దోహద పడ్డాడు. 

ఫ్రాన్సిసు సభ: త్వరలోనే అస్సీసిలో అనేకమంది మన్ననలను పొందాడు. తన పేద, ఆధ్యాత్మిక జీవితాన్నిచూసి ఎంతోమంది ఆయనను అనుసరించారు. ఈవిధంగా, చిన్నసహోదరబృందం ఏర్పడింది. ఫ్రాన్సిస్‌ తన స్వచ్చంధ పేదరికం, సహోదరభావం, సంఫీుభావంద్వారా, లోకాన్నే మార్చివేసాడు.

తన జీవితాన్నిచూసి కొందమంది ఆయన సహోదరులుగాఅనుచరులుగా చేరారు. 1209వ సం.లో, మూడవ ఇన్నోసెంట్‌ పోపుగారు ఈ చిన్న సమూహమును దీవించి, ఫ్రాన్సిస్‌ను డీకన్‌గా అభిషేకించి, ఆత్మల రక్షణార్ధం, ప్రాయశ్చిత్తాన్ని బోధించేందుకుభిక్షమెత్తుకొని దైవసేవ చేయుటకు అనుమతిని ఇచ్చారు. 1219 నాటికి ఫ్రాన్సిస్‌ అనుచరుల సంఖ్య ఐదువేలకు పెరిగింది. ఫ్రాన్సిసువారు స్థాపించిన మఠవాస సభ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఫ్రాన్సిస్‌వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, ఎంతోమంది తమ జీవితాలను అంకితం చేసుకొని, ఫ్రాన్సిసువారి బాటలో నడుస్తూ, సేవామార్గంలో జీవిస్తూ, స్వచ్చంధ పేదరికాన్ని జీవిస్తూ, ప్రపంచమంతటా వారు తమ సేవలను అందిస్తున్నారు. ఫ్రాన్సిస్‌ అనుచరుడనగా ‘స్వచ్చంధ పేదరికం’లో జీవించడం అనగా, సోదరునిగా జీవించడం, మానవగౌరవాన్ని పెంపొందిచడం.

దైవచిత్తాన్వేషి: ఈనాటి మానవుడు ‘కోరికలు’ అనే వలయంలో చిక్కుకున్నాడు. కోరికలు తీరనప్పుడు నిరుత్సాహపడి పోతున్నాడు. సానుభూతి, ఓదార్పుకు నోచుకోలేక పోతున్నాడు. దేవునివాక్యం, దేవునికార్యంపై ధ్యానంచేసిఆయన చిత్తాన్ని అన్వేషించుటకు మానవునికి సమయం, ఆసక్తి లేకుండా పోయింది. దైవచిత్తాన్ని వెదకుటలో, తెలుసుకోవడంలో, ఆచరించడంలోనున్న ఆనందాన్ని, సంతోషాన్ని నేటి మానవుడు గ్రహించలేక పోతున్నాడు.

ఫ్రాన్సిస్‌ దైవచిత్తాన్ని అన్వేషించడంలో పొందిన ఆనందం వర్ణణాతీతం. యుక్తవయస్సులో, చిలిపిగా యువతకు నాయకుడై విచ్చలవిడిగా జీవించినప్పటికిని, మార్పు, మారుమనస్సు అతని జీవితాన్ని ఆవహించాయి. ఏకాంత ప్రదేశాలకు వెళ్లి దేవుని వాక్యంపై, దేవుని ప్రేమపై ధ్యానించడం, ప్రార్ధించడం ప్రారంభించాడు. దమియాను దేవాలయంలోని సిలువలో వ్రేలాడు క్రీస్తుప్రతిమ ఫ్రాన్సిస్‌ హృదిని, మదిని తొలచింది. ఫ్రాన్సిస్‌ దైవపిలుపును అర్ధం చేసుకున్నది ఆ సిలువనుండియే! ఈవిధముగా, తన జీవితములో జరిగిన ప్రతీ సంఘటననుండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాడు.

ప్రకృతి ప్రేమికుడు: ఫ్రాన్సిస్‌ ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిద్వారా దేవుని మహిమను పొగడేవాడు. ప్రకృతిపట్ల గాఢమైన ప్రేమనుగౌరవాన్ని పెంచుకున్నాడు. ప్రకృతిలోని సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూసాడు. సమస్తమును తన సహోదరీసహోదరులుగా పిలిచాడు. సూర్యుడు ఆయన సోదరుడు, చంద్రుడు ఆయన సోదరి. ఆకాశములోని పక్షులకు, నీటిలోని చేపలకు ప్రవచనాలను బోధించాడు. భయంకరమైన తోడేలుకు ఉపదేశం చేసి దానిని సాధుజంతువుగా మార్చాడు. ప్రకృతిపట్ల, ఫ్రాన్సిసువారికున్న ప్రేమవలన, ఈ తరమువారుకూడా ప్రకృతిపట్ల ప్రేమను, దాని నాశనమును కోరుకొనక అభివృద్ధిని కోరుకొనేట్టు ప్రేరేపింపబడాలని ఆశిద్దాం.

శాంతిదాత: ఫ్రాన్సిసువారు తన జీవితముద్వారా ఈ లోకాన్నే మార్చేసారు. క్రూసేడుల కాలములో, శాంతిని నెలకొల్పుటకు మధ్యవర్తిగా ఫ్రాన్సిస్ ధైర్యముగా ఈజిప్టుకు వెళ్లి అక్కడి సుల్తానును కలిసాడు. యుద్ధాన్ని ఆపాలని కోరాడు. ఈ సంఘటన సకల మానవాళిపట్ల ఫ్రాన్సిసువారికున్న ప్రేమ, కరుణను తెలియజేస్తుంది. ఫ్రాన్సిస్ వారు ప్రపంచ శాంతిదూత అని చెప్పడానికి ఆయన చేసే శాంతి ప్రార్ధనయే గొప్పనిదర్శనం.

ప్రభువా! నీ శాంతి సాధనముగా నన్ను మలచుకొనుమయా!
ద్వేషమున్నచోట, ప్రేమను వెదజల్లనీయుము
గాయమున్నచోట క్షమాపణను చూపనీయుము
అవిశ్వాసమున్నచోట విశ్వాసమును నింపనీయుము
నిరాశయున్నచోట ఆశను పెంచనీయుము
అంధ:కారమున్నచోట జ్యోతిని వెలిగింప నీయుము
విచారము నిండినచోట సంతోషమును పంచనీయుము
ఓ దివ్యనాధా!
పరుల ఓదార్పును వెదకుట కంటె, పరులను ఓదార్చు వరము నీయుము
పరులు నన్ను అర్ధము చేసుకొన గోరుట కంటె, పరులను అర్ధముచేసుకొను గుణము నీయుము
పరులు నన్ను ప్రేమించాలని కోరుట కంటె, పరులను ప్రేమింప శక్తినీయుము
ఎందుకన,
యిచ్చుట ద్వారా పొందగలము
క్షమించుట ద్వారా క్షమింప బడగలము
మరణించుట ద్వారా నిత్యజీవము పొందగలము

క్రిస్మస్: పునీత అస్సిసిపుర ప్రాన్సిస్‌ దివ్యబాలయేసుపట్ల ప్రత్యేకమైన భక్తిని కలిగియున్నాడు. 1223వ సం.లో క్రిస్మస్‌ జాగరణ సందర్భంగా పశువుల పాకను ఏర్పాటు చేసి క్రీస్తుజనన సన్నివేశాన్ని సృష్టించిన మొట్టమొదటి వ్యక్తి ఫ్రాన్సిసుగారు. అస్సీసి పట్టణమునకు దగ్గరిలోనున్న గ్రేచియా అనే గుహలో క్రీస్తుజన్మను ఒక ప్రత్యేక అనుకరణములో ఫ్రాన్సిస్‌ పున:సృష్టించాడు. ఈసందర్భంగా అచ్చట దివ్యపూజాబలిలో పాల్గొనాలని, తాను స్వయంగా ఏర్పరచిన పశువులపాకలోని క్రీస్తుజనన సన్నివేశాన్ని దర్శించాలని అచ్చటి పట్టణ ప్రజలను ఆహ్వానించియున్నాడు.

సిలువపట్ల ఆరాధన: ఫ్రాన్సిసువారు యేసు పవిత్ర సిలువను ఎంతగానో ఆరాధించేవారు, గౌరవించేవారు. ఎక్కడ దేవాలయము కనబడిన, వెంటనే మొకాళ్ళూని సిలువను ఆరాధించేవారు. ఆయన ఈవిధముగా ప్రార్ధించేవారు, “ఓ యేసుక్రీస్తువా, ఇక్కడ ఈ దేవాలయమునందును, ప్రపంచములోని ప్రతీ దేవాలయమునందును, ప్రతీ దివ్యమందసమునందునుగల మిమ్ము మేము ఆరాధించుచున్నాము. మిమ్ము స్తుతించుచున్నాము. ఎందుకన, మీ పవిత్ర సిలువద్వారా మీరు ఈ లోకమును రక్షించితిరి.” అందుకేనేమో, యేసు పవిత్ర సిలువ మహోత్సవమునాడే, 14 సెప్టెంబర్‌ 1224వ సం.లో, అల్వెర్నా అనే కొండప్రాంతములో ప్రార్ధన చేయుచుండగా క్రీస్తు పంచగాయాలను తన శరీరముపై పొందాడు.

ముగింపు: సువార్తను అక్షరాల జీవించి, క్రీస్తువలె, క్రీస్తునుపోలి జీవించడానికి ప్రయత్నం చేసిన గొప్ప పునీతుడు ఫ్రాన్సిస్. అందుకే చరిత్రకారులు ఫ్రాన్సిసువారిని ‘మరోక్రీస్తు’ అని పిలిచారు. సంపూర్ణముగా దేవునిపై ఆధారపడి జీవించాడు. అస్సీసిపుర ఫ్రాన్సిసుగారు, 3 అక్టోబర్‌ 1226వ సం.లో స్వర్గస్తులైనారు. మరణించిన రెండేళ్లకే, అనగా 1228వ సం.లో తొమ్మిదవ గ్రెగోరి పోపుగారు, ఫ్రాన్సిసువారిని పునీతునిగా ప్రకటించారు. పునీత ఫ్రాన్సుసువారు ఇటలీ దేశానికి పాలకపునీతుడు.

అలాగే, 1979 నవంబరు 29వ తేదీన రెండవ జాన్ పౌల్ జగద్గురువులు, పునీత అస్సీసి ఫ్రాన్సిసు వారిని పర్యావరణమునకు, వాతావరణ సంరక్షణ, జీవజాల సమగ్రతను కాపాడుటకు కృషిసలుపు వారందరికి పాలక పునీతునిగా ప్రకటించి యున్నారు.

జీవితము ఒసగే సుఖసంపదలను ఒడిసి పట్టుకోవాలని పరుగులు తీస్తున్నప్పుడు, ఫ్రాన్సిస్ క్రిందికి తోయబడ్డాడు. వివిధ రూపాలలో తాను క్రీస్తును కలుసుకొనుట ద్వారా, ఆత్మప్రేరేపితుడై జీవితములో ఏది విలువైనదో, ఏది శాశ్వతమైనదో తెలుసుకున్నాడు. సేవకుడినిగాక, యజమానిని సేవించడం మొదలుపెట్టాడు. సువార్తయే తన నియమాళిగా చేసుకొని జీవించాడు. క్రీస్తులేకుండా ధనవంతునిగా ఉండుట కంటె, క్రీస్తు కొరకు పేదవానిగా ఉండుటకు ఫ్రాన్సిస్ ఇష్టపడ్డాడు.

“క్రైస్తవమతం ఒసగిన వారిలో ఫ్రాన్సిస్ గౌరవ ప్రదమైన వ్యక్తులలో ఒకనిగా నిలిచిపోతాడు. సర్వాన్ని పరిత్యజించి వైరాగ్య జీవితాన్ని జీవించాడు. కుష్ఠురోగులకు సేవలు చేసాడు” అని నెహ్రూజీ ఫ్రాన్సిస్ వారి గురించి చెప్పారు. “ప్రపంచములోని ఏకైక నిజాయితీగల ప్రజాస్వామ్యవాది మరియు మానవతావాది, ప్రధమ హీరో, ధీరుడు, నాయకుడు ఫ్రాన్సిస్” అని జీ.కే. చెస్టర్టన్ రాసాడు. “ప్రపంచములోనే గొప్ప జ్ఞాని ఫ్రాన్సిసుగారు” అని గాంధీజీ ప్రశంసించారు.

మొదటిగా ఫ్రాన్సిస్ తన ఆత్మను చక్కదిద్దుకున్నారు, ఆతరువాత దేవాలయము, అటుపిమ్మట ప్రపంచము! ఫ్రాన్సిసు వారివలె దేవుని కలలను నిజం చేద్దాం. శాంతి, ప్రేమ, నీతి, న్యాయం కలిగిన ప్రపంచం కోసం మనం కలలు కందాం. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనవంతు కృషి చేద్దాం.

No comments:

Post a Comment