31వ సామాన్య ఆదివారము (Year A)

 31వ సామాన్య ఆదివారము (Year A)
మలా 1:14-2:2,8-10; 1 తెస్స 2:7-9,13; మత్త 23:1-12
వినయము, పవిత్రతకు పిలుపు

మనందరం ముఖ్యముగా ఆధ్యాత్మిక నాయకులు వినయము, పవిత్రత కలిగి జీవించాలని, ఆదర్శముగా ఉంటూ, ప్రజలను సన్మార్గములో నడిపించాలని, సువార్తను ప్రకటించాలని నేటిపఠనాలు తెలియజేయుచున్నాయి. మలాకి ప్రవక్త (క్రీ.పూ 5వ శతాబ్దం) మరియు యేసు, వారి సమకాల అవినీతి నాయకులకు విసిరిన సవాలు నేటికి మనకు సవాలుగా ఉంటుంది. మలాకి ప్రవక్తద్వారా, ప్రభువు యాజకులను చీవాట్లు పెట్టుచున్నాడు, ఎందుకన వారు బలిపీఠముపై అపవిత్రమైన ఆహారమును అర్పించుటద్వారా దేవున్ని అగౌరవపరచారు. దేవున్ని చిన్నచూపు చూసారు.  నేటి ఆధ్యాత్మిక నాయకులు వారి వైఫల్యాల గురించి తప్పక ఆత్మపరిశీలన చేసుకోవాలి. సంఘాలు, తమ లక్ష్యాలను సాధించాలంటే, మంచి నాయకత్వం ఎంతో అవసరం. ఇశ్రాయేలు చరిత్రలో అనేక సమస్యలు లోపభూయిష్టమైన నాయకత్వం వల్లనే జరిగాయని నేటి పఠనాలు గుర్తుకు చేయుచున్నాయి. రెండవ పఠనములో పౌలుగారు నిస్వార్ధమైన నాయకత్వము, యేసుచేత ప్రేరేపింపబడిన నాయకత్వాన్ని తెస్సలోనిక సంఘమునకు ఇవ్వాలని, లేనిచో సంఘము నష్టపోవునని ఆందోళన చెందడం చూస్తున్నాము.  

నేటి సువిషేశములో, యేసు యెరూషలేము దేవాలయములో ప్రవేశించి బోధించుచున్నారు (మత్త 21:23). ధర్మశాస్త్రబోధకులు, పరిసయ్యుల గురించి, వారి ఆధ్యాత్మిక నాయకత్వ వైఫల్యాన్ని గురించి ప్రజలను, శిష్యులను యేసు హెచ్చరించుచున్నారు. యాజకులు ఒడంబడిక బాధ్యతలను తెలిపెడి ఆచార సంప్రదాయాలకు సంరక్షకులు. ధర్మశాస్త్రబోధకులు చట్టములోని నిగూఢ అర్ధాన్ని వివరించేవారు. పరిసయ్యులు మతాచారాలను పునరుద్ధరించుటకు ప్రజా ఉద్యమాన్ని ఏర్పాటు చేసినవారు. ఈవిధముగా, వారు మోషే ధర్మాసనమున కూర్చొని ఉన్నారు” (23:2). అనగా ధర్మశాస్త్రాన్ని (దేవుని అధికారము) బోధించడానికి, వివరించడానికి అధికారాన్ని కలిగియున్నారు. అయితే, వారు ఉపదేశములను చేయుదురు, కాని వాటిని పాటింపరు. వారు బోధించునది వారే ఆచరింపరు (23:3). వారి వ్యక్తిగత జీవితం అసహ్యకరమైనది. వారిని వంచకులు అని యేసు సంబోధిస్తున్నారు (23:13). వారు మోయసాధ్యముకాని భారములను ప్రజల భుజములపై మోపుదురేకాని ఆ భారములను మోయువారికి సాయపడుటకు తమ చిటికెన వ్రేలైనను కదపరు (23:4). వారిలో ఎలాంటి వినయముగాని, పవిత్రతగాని లేదు. ప్రజలపట్ల ఎలాంటి జాలి, దయ, కరుణ చూపలేదు. కాని యేసు, “నా కాడిని మీరెత్తుకొనుడు... ఏలన, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది” (మత్త 11:29-30) అని అన్నారు. వారు తమ పనులెల్ల ప్రజలు చూచుటకై చేయుదురు. అగ్రస్థానములను, ప్రధానాసనములను కాంక్షింతురు (23:5-6). కాని యేసు, “ప్రజలు మీ సత్కార్యములనుచూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారియెదుట ప్రకాశింపనిండు” (మత్త 5:16) అని అన్నారు. వారు ‘బోధకుడా’ (రబ్బీ, గురువా) అని పిలిపించుకొనుటకు తహతాహలాడుచున్నారు (23:7-8). యూదాఇస్కారియోతు మాత్రమే యేసును ‘గురువా’ (26:25), ‘బోధకుడా’ (26:49) అని సంబోధించాడు. ‘తండ్రీ’, ‘గురువా’ మరియు ‘బోధకుడా’ అను సంబోధనలను యేసు తృణీకరిస్తున్నారు (23:8-12). యూదులు అబ్రహమును ‘తండ్రీ’ అని భావించేవారు (మత్త 3:9; లూకా 16:24, 30; యోహాను 8:53). కాని యేసు, “మీ తండ్రి ఒక్కడే. ఆయన పరలోకమందున్నారు” (23:9) అని అన్నారు. క్రీస్తు ఒక్కడే మన గురువు (23:10). ప్రభువు, స్పష్టముగా మానవ (మన) జీవితములోని గురువుల, బోధకుల, తండ్రుల పాత్రను తిరస్కరించడంలేదు, కాని అలాంటి హోదాలోనున్నవారు సేవాభావముతో, వినయముతో, పవిత్రముగా జీవించాలని, ఆదర్శముగా జీవించాలని ప్రభువు ఉద్దేశం.

ధర్మశాస్త్రబోధకులు, పరిసయ్యులు చట్టాన్ని ఎరిగియున్నారు, కాని పాటించుటలేదు. వారి స్వలాభంకొరకు మతాన్ని వాడుకొనుచున్నారు. చట్టాన్ని వారిస్వలాభం కొరకు వివరించారు. ప్రజలను మోసము చేయుచున్నారు. అందుకే వారిని యేసు తీవ్రముగా గద్దించారు (23:13-33). యేసు శిష్యులు వారివలె ఉండకూడదు. “మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై యుండవలయును. తననుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తననుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును” (23:11-12; 19:30; 20:16; మత్త 20:25-28). “ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై, అందరకు సేవకుడిగా ఉండవలయును” (మార్కు 9:35).

బాహ్యపరమైన విషయాలకు ప్రాముఖ్యతను యిస్తూ అంత:ర్గత, ఆధ్యాత్మిక విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నామా? ఇంటిని అనేక స్వరూపాలతో, పటాలతో అలంకరిస్తున్నాము, కాని అనుదినం ప్రార్ధన చేస్తున్నామా? కార్లలో, బైకులకు, మెడలో జపమాలలు ఉంటున్నాయి, కాని రోజు జపమాలను ప్రార్దిస్తున్నామా? బైబులును ఇంటి గూటిలో అలంకరించి పెడుతున్నాము, కాని రోజు దేవుని వాక్యాన్ని చదువుచున్నామా, ధ్యానిస్తున్నామా? ప్రతీరోజు పూజలో పాల్గొంటున్నాము, కాని అవసరతలోనున్న పొరుగువారికి సహాయం చేస్తున్నామా? ఏదోవిధముగా, మనందరం శ్రీసభలో వివిధ బాధ్యతలను కలిగియున్నాము. ఆ బాధ్యతలను నిస్వార్ధ నాయకత్వ లక్షణాలను కలిగి, యేసు నాయకత్వముచేత ప్రేరేపింపబడి నెరవేరుస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం.

No comments:

Post a Comment