తపస్కాల రెండవ వారము - మంగళవారం (II)

  దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల రెండవ వారము - మంగళవారం
యెషయ 1:10, 16-20; మత్త 23:1-12

ధ్యానాంశము: హెచ్చరిక
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై యుండవలయును. తననుతాను హెచ్చించుకొను వాడు తగ్గింపబడును. తననుతాను తగ్గించుకొను వాడు హెచ్చింప బడును" (23:11-12).
ధ్యానము: యేసు యెరూషలేము దేవాలయములో ప్రవేశించి బోధించు చున్నారు (మత్త 21:23). ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యుల గురించి, వారి ఆధ్యాత్మిక వైఫల్యాన్ని గురించి ప్రజలను మరియు శిష్యులను యేసు హెచ్చరించుచున్నారు. వారు "మోషే ధర్మాసనమున కూర్చొని ఉన్నారు" (23:2). అనగా ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, వివరించడానికి అధికారాన్ని కలిగి యున్నారు. అయితే, వారు ఉపదేశములను చేయుదురు, కాని వాటిని పాటింపరు. వారు బోధించునది వారే ఆచరింపరు (23:3). వారి వ్యక్తిగత జీవితం అసహ్యకరమైనది. వారిని వంచకులు అని యేసు సంబోధిస్తున్నారు (23:13). వారు మోయ సాధ్యముకాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయువారికి సాయపడుటకు తమ చిటికెన వ్రేలైనను కదపరు (23:4). కాని యేసు, "నా కాడిని మీరెత్తుకొనుడు... ఏలన, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది" (మత్త 11:29-30) అని అన్నారు. మీరు తమ పనులెల్ల ప్రజలు చూచుటకై చేయుదురు. అగ్రస్థానములను, ప్రధానాసనములను కాంక్షింతురు (23:5-6). కాని యేసు, "ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోక మందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెదుట ప్రకాశింపనిండు" (మత్త 5:16) అని అన్నారు.
వారు 'బోధకుడా' (రబ్బీ, గురువా) అని పిలిపించు కొనుటకు తహతాహ లాడుచున్నారు (23:7-8). యూదా ఇస్కారియోతు మాత్రమే యేసును 'గురువా' (26:25), 'బోధకుడా' (26:49) అని సంబోధించాడు. 'తండ్రీ', 'గురువా' మరియు 'బోధకుడా' అను సంబోధనలను యేసు త్రుణీకరిస్తున్నారు (23:8-12). ఎందుకన, మనమంతా సహోదరీ సహోదరులము. యూదులు అబ్రహమును 'తండ్రీ' అని భావించేవారు (మత్త 3:9; లూకా 16:24, 30; యోహాను 8:53). కాని యేసు, "మీ తండ్రి ఒక్కడే. ఆయన పరలోకమందున్నారు" (23:9) అని అన్నారు. క్రీస్తు ఒక్కడే మన గురువు (23:10).
"మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై యుండవలయును. తనను తాను హెచ్చించుకొను వాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొను వాడు హెచ్చింప బడును" (23:11-12; 19:30; 20:16; చదువుము మత్త 20:25-28). 
ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు చట్టాన్ని ఎరిగి యున్నారు, కాని పాటించుటలేదు. వారి స్వలాభం కొరకు మతాన్ని వాడుకొనుచున్నారు. చట్టాన్ని వారి స్వలాభం కొరకు వివరించారు. ప్రజలను మోసము చేయుచున్నారు. అందుకే వారిని యేసు తీవ్రముగా గద్దించారు (23:13-33). యేసు శిష్యులు వారివలె ఉండకూడదు.
మన జీవితాలను ఆత్మపరిశీలన చేసుకుందాం! బాహ్యపరమైన విషయాలకు ప్రాముఖ్యతను ఇస్తూ అంత:ర్గత, ఆధ్యాత్మిక విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నామా? ఇంటిని అనేక స్వరూపాలతో, పటాలతో అలంకరిస్తున్నాము, కాని అనుదినం ప్రార్ధన చేస్తున్నామా? కార్లలో, బైకులకు, మెడలో జపమాలలు ఉంటున్నాయి, కాని రోజు జపమాలను ప్రార్దిస్తున్నామా? బైబులును ఇంటి గూటిలో అలంకరించి పెడుతున్నాము, కాని రోజు దేవుని వాక్యాన్ని చదువుచున్నామా, ధ్యానిస్తున్నామా? ప్రతీరోజు పూజలో పాల్గొంటున్నాము, కాని అవసరతలోనున్న పొరుగువారికి సహాయం చేస్తున్నామా? 
నేటి మొదటి పఠనములో, పాలకులకు, పౌరులకు ప్రభువు ఇలా తెలియజేయు చున్నారు: "మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసికొనుడు. మీరు నా యెడల దుష్కార్యములు చేయకుడు. చెడ్డను విడనాడుడు. మంచిని చేపట్టుడు. న్యాయమును జరిగింపుడు. పీడితులను ఆదుకొనుడు. అనాధ శిశువులకు న్యాయము చేయుడు... మీ పాపములు సింధూరమువలె ఎర్రగా నున్నను, మంచువలె తెల్లనగును. కెంపువలె ఎర్రగా నున్నను, ఉన్నివలె తెల్లనగును" (యెషయ 1:16-18). కనుక, ప్రభువు అందరిని మారుమనస్సు, హృదయ పరివర్తన పొందాలని కోరుచున్నారు.

No comments:

Post a Comment