పునీత మోనికమ్మ (27 ఆగష్టు)

 పునీత మోనికమ్మ (27 ఆగష్టు)
పునీత అగస్టీను తల్లి, ‘మ్మల పాలకపునీతురాలు క్రీ.. 332 - 387


పునీత మోనికమ్మ ఉత్తర ఆఫ్రికాలోని ‘తగాస్తే’ పట్టణంలో మంచి క్రైస్తవ కుటుంబంలో 331లో జన్మించారు. ఆమె పెరిగి పెద్దకాగా 20వ ఏట పెట్రిషియస్ అను అన్యునితో వివాహం జరిగింది. అతడు అవిశ్వాసి. అవినీతిపరుడు. ముక్కోపి. ఆ దంపతులకు అగస్టీను, నజీయసు అను ఇరువురు కుమారులు, పర్ఫెతువా అను ఒక కుమార్తె సంతానంగా కలిగారు. వీరిని తగిన క్రైస్తవ విద్యలో, విశ్వాసములో పెంచడానికి, మోనికమ్మ ఎంతో ప్రయాస పడాల్సి వచ్చింది. ఆమె సహనం, నిరంతర ప్రార్థన, ఆదర్శ జీవితం, ఉద్బోధవల్ల భర్త పెట్రీషియసు, ఆయన తల్లియు క్రీ.. 370లో క్రైస్తవ మతం స్వీకరించి శాంతిమయమైన సాధుజీవితం గడిపారు.

అయితే ఒక ఏడాది గడిచాక అనగా 371లో పెట్రిషియస్ చనిపోగా తన 39వ ఏట అనగా పెండ్లియైన 18వ ఏట మోనికమ్మ విధవరాలయ్యింది. పెద్దకుమారుడు అగస్తీను పైనే ఆయమ్మ ఆశలు పెంచుకున్నారు. అయితే ‘కర్తాగె’ పట్టణంలో విద్యనభ్యసింప వెళ్లిన అగస్టీను తన 17వ ఏట అపమార్గం పట్టారు. క్రైస్తవంపట్ల సానుకూలత లేక ‘మనిచియయిజం’ను (దేవుడు - సైతాను ఇరువురూ నిత్యులు సమానులను మత విధానం) నమ్మారు. మంచిని విడచి సైతాను ఆరాధనా పరమైన చెడు జీవితంకు అలవాటు పడ్డారు. ఒక స్త్రీని తోడుగా ఉంచుకున్నారు. 15 ఏండ్లు అక్రమ జీవితం కొనసాగింది. ఈ పదిహేను సంవత్సరాలు మోనికమ్మ తన కుమారుని మారు మనస్సుకై నిత్య పార్టన ఉపవాస వ్రతం చేపట్టారు. తమను దర్శించే ఒక బిషప్పగార్ని అగస్టీనులో మార్పుకై మనో పరివర్తనకై వెళ్లి కలసి ఉద్బోదించమని పరిపరి విధాల ప్రాధేయ పడింది. అయితే ఆ బిషప్పు కూడ అగస్తీను వారి నమ్మకం త్రోసివేయలేమని సరి పెట్టుకున్నారు. కాని మోనికమ్మగారు నమ్మికతో దేవునికి కన్నీటి ప్రార్థనచేశారు, తన కన్నీరు వృధాకాదని విశ్వసించారు.

అయితే అగస్టీనుగారు క్రీ.. 383లో రోము నగరమునకు వెళ్ల నిశ్చయించారు. అక్కడ కళాశాలల్లో సాహిత్య వ్యాకరణ శాస్త్రాలు బోధింప తలంచారు. తల్లి మోనికమ్మను వెంట తీసికొని వెళ్లడానికి అంగీకరించారు. కాని తాను ఉంచుకున్న స్త్రీని, కుమారుని విడిచి పెట్టి, తన తల్లికికూడ చెప్పకుండ ఒంటరిగా ప్రయాణం కట్టి ఓడనెక్కారు. రోమునగరం క్షేమంగా చేరుకున్నారు. అక్కడనుండి 386లో ‘ఎలానో’ అను నగరం వెళ్లారు. ఇది తెలుసుకున్న తల్లి అగస్టీనుగారిని కలసికోవడానికి ప్రయాణమయ్యారు. ఇటలీ చేరుకుని కుమారుని కలసుకున్నారు. అక్కడే ఆమె బిషప్ అంబ్రోసు గారికి మిత్రురాలయ్యారు. తన కుమారుడు అగస్టీనును మార్చవలసిందిగా బ్రతిమాలింది. ఆ తల్లి వేడుకోలు సఫలీకృతమైంది. ఆంబ్రోసుగారి ఆదర్శ పరిశుద్ధ జీవితం, దృఢచిత్తం, సద్బోధలు అగస్టీనును సమూలంగా మార్చివేశాయి. 387 ఈస్టరు పండుగరోజున ‘మిలానో’ నగర దేవాలయంలో అగస్టీనుగారు దేవుని కృపవల్ల తల్లి ప్రార్థనలవల్ల బాప్తిస్మం పొంది క్రైస్తవుడయ్యారు. గట్టి పునాది రాయిగా మారారు.

ఈ సందర్భంగా తల్లి మోనికమ్మగారు అగస్టీనుగారితో ఇలా అన్నారు. “నా కుమారుడా! నా జీవితంలో నాకు ఒకే ఒక కోరిక ఉంది. అదే నిన్ను ఒక మంచి కతోలికునిగా చూడటం. ప్రభువు నేను సాహసంతో అడిగిన దానికన్నా అధికంగా అనుగ్రహించారు. ఆయనను అనుసరించడానికై ఈ లోకం ప్రసాదించే వాటన్నింటిని తృణీకరించేలా నిన్ను ప్రేరేపించారు. ఇక నీవు నా యీ శరీరాన్ని నీ యిష్టం వచ్చినచోట సమాధిచేయి. నేను నిన్ను కోరేది ఒక్కటే! దేవుని పీఠం ముందు ఏనాడూ నన్ను మరువక జ్ఞాపకం పెట్టుకో!తిరిగి ‘కర్తాగే’ పట్టణం చేరుకోవాలనే తలంపుతో అగస్టీనుగారు తల్లి మోనికమ్మగారితో రోమునగరం దాపులోని ‘ఓస్తియా’ రేవు పట్టణం చేరుకున్నారు. కాని అక్కడే వృద్ధురాలును అనారోగ్యంతో ఉన్న మోనికమ్మగారు పుత్రుడు పునీత అగస్టీనుగారి దివ్యహస్తాల్లో వ్రాలి తమ 54వ ఏట అనగా క్రీ.. 387లో పరలోక ప్రాప్తినొందారు.

‘చెడుపై ‘మంచిజరిపిన పోరాటమే మోనికమ్మగారి జీవితం. ఆయమ్మ పాలక పునీతురాలినిగా పెట్టుకొని 19వ శతాబ్దంలో ఫ్రాన్సులోని పారిస్ నగరంలో క్రైస్తవ తల్లులందరు కలసి ఒక సంఘం పెట్టుకున్నారు. దురలవాట్లతో చెడుమార్గం పట్టిన పిల్లలు, భర్తలు కలిగిన మహిళలందరూ మోనికమ్మగారు ఆదర్శంగా పరస్పర ప్రార్థనలు సల్పే కార్యమ్రం రచించుకున్నారు. సత్ఫలితాలతో సంతృప్తికర జీవితాలు గడిపినట్లు చెప్ప బడుతోంది. ‘మోనిక’ అనగా ఏకాంతం, ఒంటరి అని అర్థం.

No comments:

Post a Comment