పునీత బ్రిజితమ్మ, జూలై 23

పునీత బ్రిజితమ్మ, జూలై 23
(క్రీ.శ. 1303-1373)


జూలై 23న విశ్వ శ్రీసభ, కతోలిక సంఘము, స్వీడన్ దేశపు పునీత బ్రిజితమ్మ పండుగ రోజును కొనియాడుతూ ఉంది. ప్రసిద్ధ క్రైస్తవ భక్తురాలు, పునీతురాలు, వితంతువు. ఆమె జీవితం గృహస్తులకు మరియు మఠవాసులకు ఆదర్శ ప్రాయముగా ఉంటుంది. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కున్నారు, కాని దేవునిపై విశ్వాసాన్ని కోల్పోలేదు.

బ్రిజితమ్మ స్వీడన్ దేశములోని భక్తివిశ్వాసాలు గల, ధనిక, సుసంపన్నమైన క్రైస్తవ కుటుంబములో 1303వ సంవత్సరములో జన్మించింది. బ్రిజితమ్మ తల్లి ఇంజెబోర్గ్ బెంగ్‌ట్స్‌డాటర్, ఆ దేశంలోని అత్యంత ధనవంతుడైన భూస్వామి కుమార్తె. ఈ కుటుంబానికి స్వీడన్ దేశ రాజులతో బంధుత్వం కలిగి ఉండేది. తండ్రి బిర్గర్ పెర్సన్, స్వీడన్ దేశములోని ఉప్ల్యాండ్ ప్రాంత గవర్నరు మరియు న్యాయమూర్తి. చాలా భక్తిపరుడు. తన సంపదను మంచి పనుల కోసం ఉదారముగా ఉపయోగించేవాడు. డబ్బును విరాళంగా ఇచ్చేవాడు. పేదలకు సహాయం చేసేవాడు. న్యాయముగా, నిష్పక్షముగా, అందరినీ సమానముగా చూసేవాడు.

బ్రిజితమ్మకు 10 సంవత్సరముల ప్రాయములోనే తల్లి మరణించింది. అందుకే తండ్రి తన ముగ్గురు పిల్లలను వారి పిన్ని వద్దకు పంపించాడు. వారు అక్కడే పెరిగి విద్యావంతులయ్యారు.

బ్రిజితమ్మ, చిన్ననాటినుండే యేసు శ్రమల పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది. ఏడు సంవత్సరముల ప్రాయమునుండే సిలువ వేయబడిన రక్షకుని అసాధారణ దర్శనాలను పొందుకున్నదితన జీవితాంతం క్రీస్తు శ్రమలను గురించి అనేకసార్లు దివ్య దర్శనాలను పొందినది.

కేవలం పదేళ్ళ వయసు ఉన్నప్పుడు, బ్రిజితమ్మ పొందిన ఒక దర్శనం గూర్చి ఇలా చెప్పబడింది: ఆ దర్శనములో, సిలువపై ఉన్న యేసు, నన్ను చూడు, నా కుమారీ” అని పిలువగా, ఆ చిన్నారి, మిమ్మల్ని ఇలా చేసింది ఎవరు? అని చిన్న బ్రిజితమ్మ ఏడ్చింది. అందుకు యేసు బదులిస్తూ, నన్ను ద్వేషించి, నా ప్రేమను నిరాకరించేవారు” అని చెప్పారు. ఆ క్షణం నుండి, ప్రజలు యేసును అగౌరవపరచకుండా ఆపడానికి ప్రయత్నించింది. ఈ అద్భుత దర్శనాలు ఆమె జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి.

1316వ సంవత్సరములో, తన 13వ యేటనే 18 సంవత్సరాల వయస్సుగల ఉల్ఫ్ గుడ్‌మార్సన్‌ అనే యువకునితో బ్రిజితమ్మకు వివాహమైనది. ఇతను తర్వాత నెరిసియా ప్రావిన్స్‌కు గవర్నర్‌గా పనిచేశాడు. బ్రిజితమ్మ వలెనె అతను కూడా దైవసేవ చేయాలని నిశ్చయించు కున్నాడు. వారికి 8 మంది పిల్లలు - నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. వారిలో ఒకరే పునీత కత్తరీనమ్మ.

బ్రిజితమ్మ మరియు ఆమె భర్త, ఇరువురుకూడా, పేదల పట్ల శ్రద్ధ వహించడంలో ఆమె తండ్రి అడుగుజాడలను అనుసరించారు. బ్రిజితమ్మ తమ ఎస్టేట్‌లో ఒక ఆసుపత్రిని నిర్మించడానికి కూడా ఏర్పాట్లు చేసారు. ఆసుపత్రి అందరికీ అందుబాటులో ఉండేది. వీరిరువురు స్వీడన్ దేశ రాజుగారి ఆస్థానములో కూడా సేవలను అందించారు. బ్రిజితమ్మ రాణి గారికి వ్యక్తిగత సేవకురాలిగా ఉండేది. రాజు మాగ్నస్ మరియు రాణి బ్లాంచె, మెరుగైన జీవితాలను జీవించడానికి వారికి సహాయం చేయ ఎంతగానో ప్రయత్నించింది, కాని, వారు ఆమె మాటలను లెక్కచేయలేదు. బ్రిజితమ్మ ఇతర ఐరోపా పాలకులకు, ప్రముఖులకు కూడా ఆధ్యాత్మిక సలహాలు ఇచ్చారు. ఆమె వారిని క్రైస్తవ విలువలకు కట్టుబడి ఉండాలని, న్యాయబద్ధంగా పాలించాలని, పేదల పట్ల దయ చూపాలని కోరారు. ఆమె దర్శనాలు తరచుగా రాజకీయ, సామాజిక సమస్యలను కూడా ప్రస్తావించాయి.

వివాహం అనంతరం 28 సంవత్సరాలకు, 1344వ సంవత్సరములో ఆమె భర్త మరణించారు. ఆ తరువాత మరో 29 సంవత్సరాలు బ్రిజితమ్మ వితంతువుగానే జీవితాన్ని గడిపారు. భర్త మరణం తర్వాత, సిస్టెర్షియన్ మఠములో చేరి, పశ్చాత్తాపం, ప్రార్థనా జీవితాన్ని గడిపింది. తన ఆస్తులన్నిటినీ దానం చేసి, పేద సన్యాసినిగా జీవించింది. ఆమె తన జీవితాన్ని దైవసేవకు అంకితం చేసుకుంది. భక్తి క్రియలు చేస్తూ దేవుని కృపకు మరింత చేరువ అయింది.

1346వ సంవత్సరములో, బ్రిజితమ్మ ‘పవిత్ర రక్షకుని’ (Most Holy Savior) సభను స్థాపించి, పవిత్ర జీవితాన్ని జీవించేందుకు ఎంతోమందిని ప్రోత్సహించింది. అయితే, సభ స్థాపించిన అనేక సంవత్సరాల తరువాతే, అనగా, 1370వ సంవత్సరములో, ఐదవ అర్బన్ పోపు గారు ఈ సభకు అధికారపూర్వకమైన అనుమతిని ఇవ్వడం జరిగింది. ఆమె ధనిక, పేద అనే తేడా లేకుండా విస్తృతమైన సేవలను చేసింది. నిరాశ్రయులకు, పాపులకు ఆశ్రయం కల్పించింది.

1350వ సంవత్సరములో, బ్రిజితమ్మ రోము నగరమునకు వెళ్లింది. రోము నగరములో ఒక అంటువ్యాధి ప్రబలినట్లు ఆమె తెలుసుకుని, రోగులకు, మరణిస్తున్న వారికి సహాయం చేయడానికి తీర్థయాత్ర చేసింది. రోములో ఉన్నప్పుడు, ఆమె చూసిన అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడింది. ప్రజలందరూ మంచి జీవితం జీవించాలని కోరింది. చెడు పరిస్థితులను మార్చడానికి ఆమె ఎంతగానో కృషి చేసింది. ఆమె మాటలు, ప్రభుత్వం మరియు శ్రీసభ అధికారులను, చివరికి పోపు గారిని కూడా ప్రభావితం చేశాయి!

కొన్ని తీర్థయాత్రలు మినహా తన జీవితాంతం, అనగా 12 సంవత్సరాల పాటు రోము నగరములోనే నివసించింది. తన కూతురు కత్తరీనమ్మ నిరంతరం ఆమెతోనే ఉండేది.

బ్రిజితమ్మ పొందిన దివ్య దర్శనాలను పీటర్ ఓలాఫ్సన్ అనే మఠాధిపతికి చెప్పగా, అతను వాటిని లతీను భాషలోకి అనువదించాడు. ఆమెకు సిలువ వేయబడిన క్రీస్తు అనేక సార్లు ప్రత్యక్షమై, తన శ్రమల గురించి, తన ప్రేమ గురించి సందేశాలు ఇచ్చారని ఆమె రచనలు తెలియజేస్తున్నాయి. ఈ దర్శనాల ఆధారంగానే ఆమె 15 ప్రార్థనలను రూపొందించారు, వీటిని “సిలువ వేయబడిన యేసు రక్తం యొక్క ప్రార్థనలు” అని పిలుస్తారు. ఈ ప్రార్థనలు క్రీస్తు యొక్క గాయాలు, శ్రమలపై లోతైన ధ్యానాన్ని తెలియజేస్తాయి. ఈ ప్రార్థనల ద్వారా, విశ్వాసులు క్రీస్తు త్యాగాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుని, తమ పాపాలకు పశ్చాత్తాపపడి, దైవిక కరుణను పొందాలని ఆశిస్తారు. ఈ 15 ప్రార్థనలను ఒక సంవత్సరం పాటు ప్రతిరోజూ భక్తి శ్రద్ధలతో పఠిస్తే అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని పునీత బ్రిజితమ్మకు చెప్పబడిన దర్శనాలలో పేర్కొనబడ్డాయి. కొన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమనగా: ఆత్మ శుద్ధి మరియు పాప క్షమాపణ, మరణానికి 15 రోజుల ముందు నిజమైన పశ్చాత్తాపం కలిగే అవకాశం, మరణానంతరం విమోచన, కుటుంబ సభ్యులకు రక్షణ, నరకం నుండి విముక్తి... మొదలగునవి.

శ్రీసభ సంస్కరణల గురించి ఆమె ఎన్నో దర్శనాలను గాంచింది. దేవుని నుండి ప్రత్యేక సందేశాలను పొందింది. దర్శనాలలో ప్రభువునుండి పొందిన సందేశాలను, రాజులకు, శ్రీసభ అధికారులకు వినిపించినది. దేవుడు వారి నుండి ఏమి ఆశిస్తున్నాడో ఆమె వినయంగా వారికి వివరించింది. వారంతా తల్లి శ్రీసభ అభివృద్ధికి కృషి చేయునట్లు చేసింది. రాజకీయ నాయకులు సువార్తలలోని సందేశాలను ఆచరిస్తే ప్రపంచంలో నిజమైన శాంతి వెల్లివిరుస్తుంది” అని బ్రిజితమ్మ తెలిపారు.

అవిగ్నాన్ పోపు పాలనను అంతం చేయడానికి, తద్వారా, పోపు గారు రోము నగరమునకు తిరిగి రావడానికి అవిశ్రాంతంగా కృషి చేసింది. “అవిగ్నాన్ పోపు పాలన” అనేది 1309 నుండి 1376 వరకు ఏడుగురు పోపులు రోము నగరంలో కాకుండా ఫ్రాన్స్‌లోని అవిగ్నాన్‌లో నివసించిన కాలాన్ని సూచిస్తుంది. ఇది కతోలిక శ్రీసభ చరిత్రలో ఒక ముఖ్యమైన వివాదాస్పద కాలం. ఒక చీకటి అధ్యాయంగా పరిగణించబడుతుంది. దీనికి ప్రధాన కారణాలు: ఫ్రాన్స్ రాజుల ప్రభావం, రాజకీయ అస్థిరత, ఎనిమిదవ బోనిఫేస్ మరియు నాలుగవ ఫిలిప్ మధ్య ఘర్షణ.

బ్రిజితమ్మ చేసిన ప్రయత్నాలను మనం తప్పక అంగీకరించి అభినందించాల్సిందే! పునీత బ్రిజితమ్మకు అనేక దైవ దర్శనాల సందేశాలలో, యేసుక్రీస్తు మరియు కన్య మరియ ఆమెకు పోపుగారు రోము నగరముకు తిరిగి రావాలని, శ్రీసభ సంస్కరణలను చేపట్టాలని పిలుపునిచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఆమె ఈ సందేశాలను “అవిష్కరణలు” పేరుతో వ్రాశారు, ఇవి విస్తృతంగా వ్యాపించి పోపుగారు రోము నగరమునకు తిరిగి రావాలనే కోరికను ప్రజలలో కలిగించాయి.

బ్రిజితమ్మ అవిగ్నాన్‌లోని పోపులకు, ముఖ్యంగా ఐదవ అర్బన్ పోపు మరియు పదకొండవ గ్రెగొరీ పోపు వారలకు పలు లేఖలు కూడా రాశారు. ఈ లేఖలలో ఆమె వారికి దైవ సందేశాలను తెలియజేసి, రోము నగరమునకు తిరిగి రావాలని మరియు శ్రీసభలో ఉన్న అవినీతి, దుర్వినియోగాన్ని సరిదిద్దాలని బలమైన విజ్ఞప్తి చేశారు. ఆమె వారిని తమ విధిని నెరవేర్చాలని, క్రీస్తు ప్రతినిధులుగా” తమ స్థానాన్ని పునరుద్ధరించాలని కోరారు. పునీత బ్రిజితమ్మ చేసిన ప్రబోధాలు, దైవ సందేశాలు ప్రజలలో, ముఖ్యంగా ఐరోపాలోని భక్తులలో, అవిగ్నాన్ పోపు పాలన’ పట్ల వ్యతిరేకతను పెంచాయి. ఆమె నైతిక, ఆధ్యాత్మిక సందేశాలు, పోపుగారు రోము నగరమునకు తిరిగి రావడానికి ఒక ప్రేరణగా నిలిచింది. ఆమె తన సందేశాలలో పోపులు అవిగ్నాన్‌లో ఉండటం దైవ చిత్తానికి విరుద్ధమని, అది శ్రీసభకు హానికరమని స్పష్టం చేశారు.

1372వ సంవత్సరములో ‘పవిత్ర భూమిని’ సందర్శించమని ఒక దివ్య దర్శనం బ్రిజితమ్మను పురికొల్పింది, అదేవిధముగా, ‘పవిత్ర భూమిని’ సందర్శించినది. అక్కడి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉండగా, ఒక్కొక్క ప్రదేశంలో యేసు చెప్పిన మాటలు, చేసిన కార్యాల గురించి ఆమెకు అద్భుతమైన దివ్య దర్శనాలు కలిగాయి.

రోము నగరమునకు తిరిగి వచ్చిన కొద్దికాలానికే 23 జూలై, 1373వ సంవత్సరంలో ఆమె మరణించింది. ఆమె దేహాన్ని స్వదేశానికి తీసుకొని వచ్చి, తాను స్థాపించిన మఠములోనే భూస్థాపితం చేసారు.

ఆమె జీవించిన పవిత్ర జీవితమును బట్టి, మరణించిన కేవలం 18 సంవత్సరాలకే, 8 అక్టోబరు 1391వ సంవత్సరములో, తొమ్మిదవ బోనిఫసు పోపుగారు బ్రిజితమ్మను పునీతురాలుగా ప్రకటించారు. ఆమె జీవితం గృహస్తులకే గాక, మఠవాసులకు కూడా ఆదర్శం. ‘బ్రిజిత’ అనగా ‘శక్తి’, మరియు ‘ఉన్నత వ్యక్తి’ అని అర్ధము. 

పునీత బ్రిజితమ్మ గారు స్వీడన్ దేశానికి పాలక పునీతురాలు. అయితే, బ్రిజితమ్మ ఐరోపా అంతటా క్రైస్తవ ఐక్యత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ కోసం చేసిన కృషిని గుర్తించి, 1999వ సంవత్సరములో, రెండవ జాన్ పాల్ పోపు గారు, పునీత కత్తరీనమ్మ, మరియు ఎడిత్ స్టెయిన్‌గా పేరుగాంచిన పునీత థెరిసా బెనెడిక్టాక్రాస్’తో పాటు ఐరోపాకు సహ-సంరక్షక పునీతురాలిగా పునీత బ్రిజితమ్మను ప్రకటించారు.

నిజమైన జ్ఞానం, లోకం మెచ్చుకునే గొప్ప ప్రతిభలో కాదు, మనం చేసే చేతలలో ఉంటుంది; ఎందుకంటే లోకం దృష్టిలో జ్ఞానులు ఎవరంటే, దేవుని చిత్తాన్ని అగౌరవపరిచి, తమ కోరికలను ఎలా నియంత్రించుకోవాలో తెలియని మూర్ఖులు” అని స్వీడన్ దేశపు పునీత బ్రిజితమ్మ గారు చెప్పారు.

No comments:

Post a Comment