ఐదవ పాస్కాకాల ఆదివారము (2 మే 2021)

ఐదవ పాస్కాకాల ఆదివారము
అ.కా. 9:26-31, 1యోహాను 3:18-24, యోహాను 15:1-8

మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణలు మాత్రమే కాదు. అవి చేతలలో నిరూపింపబడు యదార్ధ ప్రేమ కావలయును (1 యోహా 3:18). యేసు తన బహిరంగ జీవితములో అనేక సందర్భాలలో తన చుట్టూ ఉన్న పరిస్థితులను, పరిసరాలను, వ్యక్తులను గమనించి వాటిని ఉదాహరణగా తీసుకొని, గొప్ప పరలోక సత్యాలను, తన శిష్యులకు భోధించేవాడు. ఉదాహరణకు, గొర్రెల కాపరులు, నీరు, వెలుగు, రొట్టె, పరిసయ్యులు... ఉదాహరణగా చేసుకొని అనేక విషయాలను భోధించాడు. ఈ కోవకు చెందిన ఒక ద్రాక్షావల్లిని ఉదాహరణగా తీసుకొని, ఈనాటి సువిశేష పఠనము ద్వారా మనకు బోధిస్తున్నాడు.

యేసు ప్రభువు జీవించిన సమయములో, యూదయా దేశములో ద్రాక్షాతోటలు ఎక్కువగా సాగుచేసేవారు. ద్రాక్షా ఎదుగుదల, ఫలాలు గురించి అందరికికూడా ఒక అవగాహన యుండేది. అందువలననే యేసు ద్రాక్షావల్లిని-తీగలను ఉదాహరణగా చేసుకొని, దానిద్వారా ఆయనను అనుసరించే శిష్యులకు, దేవునితో ఉండవలసిన బంధాన్ని గురించి భోదిస్తూ ఉన్నాడు. కనుక ద్రాక్షావల్లిని గురించి కొంత సేపు ద్యానిద్దాం.

మొదటగా, ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దానియంతట అది ఫలింప జాలదు. ద్రాక్షావల్లి నుండి వేరుచేయబడిన రెమ్మలు జీవింపలేవు. అందుకే, ద్రాక్షావల్లి రెమ్మలు ద్రాక్షావల్లిని అంటిపెట్టుకొని యుంటాయి. అవి ద్రాక్షావల్లిని అంటి పెట్టుకొని ఉండుట వలన అధికముగా ఫలిస్తాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ద్రాక్షారెమ్మల వలన ద్రాక్షావల్లి బలపడుటలేదు. కారణం, మనం ఒక రెమ్మను కత్తిరిస్తే మరియొక రెమ్మ పుట్టుకొస్తుంది. కాని ద్రాక్షావల్లి వలన దాని రెమ్మలు లబ్దిపొందుతూ ఉన్నాయి. ద్రాక్షావల్లి దానిలో ఉన్న జీవాన్ని, బలాన్ని, రెమ్మలకు ఇస్తుందే తప్ప, రెమ్మలనుండి అది జీవం పొందుటలేదు. ద్రాక్షావల్లిని రెమ్మలు అంటిపెట్టుకొని యుండుటవలన, అవి ధృడముగా, ఎదగగలుగు చున్నాయి. మనందరి జీవిత సత్యం కూడా ఇదే! మనం ప్రభువుని విశ్వసించి, ఆయనను అంటిపెట్టుకొని యుండుట వలన, మనముకూడా ఆయన జీవాన్ని, బలాన్ని పొందుతూ ఉన్నాము. ఆయన విశ్వాసములో ధృడముగా ఎదగగలుగుతాము. మన జీవితాలు సంతోషముతో, సమాధానముతో వర్ధిల్లుతాయి. మనము ఆయనతో ఉండుట వలన, జీవితములో ఎదురయ్యే ప్రతీ కష్టాన్ని, సమస్యను, ఆయననుండి వచ్చే బలముద్వారా, పరిశుద్ధాత్మ సహాయ శక్తిద్వారా అధిగమించ గలము. కనుక, ద్రాక్షావల్లియగు క్రీస్తుకు మన జీవితాన్ని అంటిపెట్టినప్పుడు మన జీవితాలు అధికముగా ఫలిస్తాయి.

“నాయందు ఫలింపని ప్రతీ తీగను ఆయన తీసివేయును. ఫలించు ప్రతీ తీగను అధికముగా ఫలించుటకై, ఆయన దానిని కత్తిరించి సరిచేయును.” ద్రాక్షావల్లి అధికముగా ఫలించాలి అంటే, మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దానిని సరిగా అంటు కట్టాలి. కాలమును బట్టి ఎండిన ఆకులను, కొమ్మలను కత్తిరించి సరిచేయాలి. దానికి కావలసిన ఎరువును, నీటిని సకాలములో అందించాలి. ఈ జాగ్రత్తలు పాటించినప్పుడే, ద్రాక్షావల్లి మంచి రుచికరమైన ఫలాలను మనకు అందించగలదు. ద్రాక్షావల్లి క్రీస్తు అయితే, మనమంతా ఆయన రెమ్మలం. ఎండిన ఆకులు, కొమ్మలు మనలో ఉన్న చెడుకు, పాపానికి చిహ్నంగా నిలుస్తాయి. వాటిని ఏవిధముగా కత్తిరించి, ప్రోగుచేసి నిప్పులో వేసి తగులబెట్టుదమో, అదేవిధముగా, మనలో ఉన్న చెడును, చెడు క్రియలకు, ఆలోచనలకు స్వస్తి చెప్పి మనల్ని మనం సక్రమమైన మార్గములో నడచుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనం అధికముగా ఫలించగలుగుతాము.

“నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు.” ద్రాక్షావల్లి ఎదుగుదలకు, మరియు అది ఫలించడానికి దాని తీగలు ఎంతో తోడ్పడుతూ ఉంటాయి. ద్రాక్షా రెమ్మలు, ద్రాక్షావల్లినుండి వచ్చే బలాన్ని, జీవాన్ని స్వీకరించి, అవి బలపడుతూ, ఎదుగుతూ, ద్రాక్షావల్లిని జీవింప చేస్తాయి. అదేవిధముగా ఈ ప్రపంచములో దేవునికి మానవుడుకూడా ఎంతో అవసరము. మన సత్యోపదేశములో చదువుకున్నట్లు, మానవుడు దేవుని ప్రేమించి, సేవించి అటువెనుక మరణము పొందుటకు సృష్టింపబడెను. మనం ఒక వ్యక్తిని ప్రేమించినపుడు లేదా ఒక వ్యక్తి చేత ప్రేమింపబడినప్పుడు, ఆ వ్యక్తి గురించి పదిమందికి చెబుతూ ఉంటాం.

అదేవిధముగా, మానవుడు దేవుని గురించి ఈ ప్రపంచానికి చాటగలగాలి. దేవుని నామాన్ని ఆయన ప్రేమను ప్రకటించటం అంటే ఆయనను ఈ లోకములో జీవింప చేయటం. ఆయన మరణమును ప్రకటించడం అంటే, ఆయనను ఈ లోకములో జీవింప చేయడం. ఆయన మహిమను కొనియాడటం.  ఆయనను స్తుతించి గౌరవించడం. కనుక, క్రీస్తు బిడ్డలుగా ఇది మనందరి కర్తవ్యం.

“మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరప బడును.” ప్రియులారా! మానవ జీవితాన్ని ఒక ఉన్నతమైన దృక్పధముతో చూసినప్పుడు, మనం అనుకున్న ఫలాలకంటే, అధికముగా ఫలిస్తూయున్నాం. మన అనుదిన జీవితములో ప్రతీసారి మనం మంచి చేసినప్పుడు, మంచిని గురించి ఆలోచించినప్పుడు అధికముగా ఫలిస్తూయున్నాం. ప్రేమ, శాంతి, సమాధానాన్ని ఇతరులకు పంచినప్పుడు మనం అధికముగా ఫలించినట్లే... ఇతరులను మన్నించడంద్వారా, మనకున్నదాన్ని ఇతరులతో పంచుకొనుటద్వారా, మనం అధికముగా ఫలిస్తూయున్నాం. మన శత్రువులను ప్రేమించి, వారికోసం ప్రార్ధించినప్పుడు మనం ఫలిస్తూయున్నాం. ఈవిధముగా, ప్రతీసారి, ప్రతీరోజు, మన మాటలద్వారా, క్రియలద్వారా ఫలిస్తూ తండ్రి దేవుని మహిమ పరస్తూ ఉన్నాము. కనుక, మన ఫలములో దేవుని మహిమ  పరచగలగాలి.

“మీరు నా యందు ఉండుడు.” ఈనాటి సువిశేష పఠనములో ఈ వాక్యము 8 సార్లు చెప్పబడింది. అంటే, ఈ వాక్యము ఎంత ముఖ్యమైనచో మనం గ్రహించాలి. కొన్ని సందర్భాలలో, కొంతమంది వ్యక్తులు ఒకే కుటుంబములో జీవిస్తూ ఉంటారు. వారు కలసి ఉన్నప్పటికిని, పరదేశులుగా బ్రతుకుతూ ఉంటారు. ఒకరంటే ఒకరికి పడదు. పట్టించుకోరు. ఒకలాంటి విదేశీ మనస్తత్వాన్ని కలిగియుంటారు. వారి మధ్య ప్రేమలు, ఆప్యాయతలు ఉండవు. నామమాత్రముగా కలసి జీవిస్తూ ఉంటారు. అదేవిధముగా, "ప్రభువు యందు ఉండటం" అంటే నామమాత్రానికే క్రైస్తవులుగాయుండి ఆయన శిష్యుడిని అని చెప్పుకుంటే సరిపోదు. “మీరు నాయందు ఉండుడు” అను వాక్యము ద్వారా, ప్రభువు మనలను తనతో కలసి జీవించటానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు.  ఆయనతో జీవించడం, ఆయనతో పంచుకోవడం, ఆయనతో ఉండటం ఒకరి నుండి మరియొకరు పొందటం, ఒకరిని ఒకరు గౌరవించడం, ప్రభువుయందు ఉండటం అంటే, మన నమ్మకాన్ని ఉత్థాన క్రీస్తుయందు ఉంచటం. ఆయనయందు ఉండటం అంటే, ఆయనలో శాంతిని, సమాధానాన్ని, ప్రేమను పొందటం. నిండైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయనలో కలిగియుండటం. కారణం ఆయన కూడా “నేను మీ యందు ఉందును” అని మనకు మాట ఇచ్చియున్నాడు. కనుక మనం మన జీవితంలో ఎన్ని కష్టాలు, భాదలు, నష్టాలు, రోగాలు ఎదురైనప్పటికిని ప్రభువుతో ఉన్నట్లయితే ఆయనే మనకు బలాన్ని ఇచ్చి, జీవితములో ముందుకు నడిపిస్తాడు. కనుక, ప్రభువుయందు ఉండటానికి ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించమని అర్ధిద్దాం.

చివరిగా, ఇది మే మాసం. ఈ నెల మరియ తల్లికి అంకితం చేయబడిన నెల. ఆమె దేవుని యొక్క తల్లి. ఆమె దేవుని తల్లి కనుక మనందరికీ కూడా తల్లిగా నిలుస్తుంది. ఈ కారణం చేత, మనంకూడా ఆమెను విన్నవించుకోవాలి. రక్షణ చరిత్రలో ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఆమె ఈ ప్రపంచానికి యేసు ప్రభువును అందించింది. ఆమె ‘తన గర్భ ఫలమును’ మనకు కానుకగా ఒసగింది. ఆమె ఇంకా ఈ ప్రపంచానికి ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంది. ఆమె తన విశ్వాస జీవితముద్వారా ప్రభువుయందు ఉంటూ, ఆ ప్రభువులో జీవిస్తూ అధికముగా ఫలించింది. కనుక, ఆమె నిత్యసహాయముద్వారా మనముకూడా అధికముగా ఫలించుటకు ఆమె సహాయాన్ని వేడుకొందాం. ఆమె చూపిన విశ్వాస మార్గములో జీవించడానికి ప్రయాసపడదాం. ఆమెన్.

No comments:

Post a Comment