పునీత పౌలు

పునీత పౌలు 


పౌలు భక్తిగల,
అత్యంతాసక్తిగల యూదుడు (ఫిలిప్పీ. 3:6). పౌలు తన యూద మతమును హృదయపూర్వకముగా ప్రేమించాడు. తన మతమును, ముఖ్యముగా ధర్మశ్రాస్త్ర దృక్పధమును, గౌరవనీయ సంప్రదాయాలను, ఆరాధనను, రక్షణను సవాలు చేసి, నూతనముగా ఆవిర్భవించిన “మార్గము”ను (క్రైస్తవ/క్రీస్తు మార్గము) అతడు సహించలేక పోయాడు. అందువలన, స్వమతమందు అతి మూర్కాభిమానుడై క్రైస్తవ సంఘమును నాశనం చేయ ప్రయత్నం చేసాడు. స్తెఫాను పట్ల హింసను, హత్యను ప్రోత్సహించాడు. సౌలు అతని మరణమును ఆమోదించెను” (అ.కా. 7:58-60).

ఆనాటి నుండి యెరూషలేములో “సౌలు క్రైస్తవ సంఘమును నాశనము చేయ ప్రయత్నించుచు ఇంటింట జొరబడి విశ్వాసులయిన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చికొనిపోయి వారిని చెరసాలో వేయించు చుండెను” (అ.కా. 8:3). యెరూషలేములోనే గాక, దమస్కు నగరములో కూడా ప్రభువు మార్గమును అవలంబించుచున్న వారిని పట్టుకొనాలని తలంచి, ప్రధానార్చకుని నుండి అచటి యూదుల ప్రార్ధనా మందిరములకు పరిచయ పత్రములతో బయలుదేరాడు (అ.కా. 9:1-2).

కాని దమస్కు నగరమునకు వెళ్ళు మార్గమధ్యలో ఉత్థాన క్రీస్తును ఆకస్మికముగా ‘కలుసుకొనుట’ వలన (అ.కా. 9:1-9), తన జీవితములో సంపూర్ణ మార్పును చవిచూసాడు. క్రీస్తుకు శత్రువు అయిన పౌలు ఇప్పుడు అత్యంత ప్రియునిగా మారాడు. యేసును దేవునిగా, ప్రభువుగా అంగీకరించాడు (అ.కా. 9:10-20). క్రీస్తు సువార్తకు ప్రచారకునిగా మారాడు. క్రీస్తు విశ్వాసులను విస్మరించి, హింసించే సౌలు, వారి పక్షాన వాదించి, వారిని నిర్మించుపౌలుగా మారాడు. ఈవిధముగా, ప్రభువు పౌలును “తన నామమును తెలియజేయుటకు ఒక సాధనముగా ఎన్నుకొనెను” (అ.కా. 9:15).

ఆసియా మైనరు, అరేబియా మరియు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో సిలువ వేయబడి, ఉత్థాన క్రీస్తునుగురించి ప్రకటించాడు. అనేక చోట్ల క్రైస్తవ సంఘాలనుస్థాపించాడు. క్రైస్తవ విశ్వాసుల బాగోగులు చూసుకొనుటకు, వారిని నడిపించుటకు ఆధ్యాత్మిక నాయకులను నియమించాడు. నోటిమాటగా, వ్రాతపూర్వకముగా క్రైస్తవ పరమరహస్యాలను క్రీస్తానుచరులకు వివరించి యున్నాడు.

నూతన నిబంధనములో మొట్టమొదటిగా వ్రాయబడినవి పౌలు లేఖలే! ఈ లేఖలద్వారా క్రీస్తు బోధనలను ముఖ్యంగా దేవరహస్యములను, దైరాజ్యమును గూర్చిన పరమ రహస్యములను విశదపరచుటకు ప్రయత్నం చేసాడు. పౌలు తన లేఖలద్వారా, తనకు తెలియకనే నూతన నిబంధన సాహిత్యమునకు దోహదపడ్డాడు. ఈ లేఖలు, ప్రధమ ఆధారాలుగా ఆదిమ క్రైస్తవ సంఘ ముఖ వైఖరిని మనకు బహిర్గత మొనర్చుతున్నాయి.

సర్వకాలముల యందు శ్రీసభ నిర్మాణములో పౌలు ఒక గొప్ప శిల్పిగా క్రైస్తవ చరిత్రలో నిలిచిపోతాడు. ఈనాడు మనం చూస్తున్న శ్రీసభ కట్టుబాట్లు, పరిపాలన విధానములను పౌలు ఆనాడే రూపకల్పన చేసియున్నాడు. వివిధ అంతస్తులో శ్రీసభ పరిపాలనను ఇతర నాయకులకు అప్పగించి చక్కటి పరిపాలన వ్యవస్థకు బాటలు వేసాడు. క్రైస్తవ సంఘ (మత) గుర్తింపునకు పౌలు ఎంతగానో కృషి చేసాడు.

నజరేయుడైన యేసు క్రీస్తు సందేశమును తన నాటి ప్రపంచమంతటికిని వ్యాపింప జేసాడు. “క్రీస్తు యేసునందు దేవుని కొరకై నేను చేసిన వానిని గూర్చి గర్వింప వచ్చును. క్రీస్తు నా ద్వారా, నా మాటల వలనను, చేతల వలనను, సూచక క్రియల చేతను, అద్భుతముల చేతను, ఆత్మ యొక్క శక్తి మూలమునను, అన్యజనులను దేవునకు విధేయులను చేయుటకై చేసిన దానిని గూర్చి మాత్రమే ధైర్యము వహించి పలికెదను. కనుక, యెరూషలేము నుండి ఇలూరికం వరకు పయనించుట వలన క్రీస్తును గూర్చిన సువార్తను సంపూర్ణముగా ప్రకటించితిని” (రోమీ. 15:17-19) అని పౌలు తన సువార్తా ప్రేషితత్వమును గూర్చి చెప్పియున్నాడు. స్త్రీలు, పురుషులు, బానిసలు, స్వతంత్రులు, పునీతులు, పాపాత్ములు, ధనికులు, పేదవారు, అమాయకులు, విద్యావంతులు అందరునూ కలిసి సామరస్యంగా జీవించగల బహుళజాతి, జాత్యంతర, వివక్షతలేని సమాజ స్థాపనకు పౌలు ఎంతో కృషి చేశాడు.

పౌలు గొప్ప పండితుడు, వేదాంతి, బోధకుడు, కాపరి, నాయకుడు, ‘అపోస్తలుడు’, ఉత్సాహపూరితుడైన మిషనరీ, మార్మికుడు, పునీతుడు, క్రీస్తు సేవకుడు, క్రైస్తవ రచయిత...

పౌలు అన్యజనులకు అపోస్తలుడు: దమస్కు నగర మార్గమున పౌలు పొందిన క్రీస్తానుభవం ద్వారా, క్రీస్తు పరమ రహస్యాలను, క్రీస్తు మరణ, ఉత్థాన రక్షణ విలువలను గుర్తించాడు (గలతీ. 1:16, 3:13, 1 కొరి. 1:22-25). ఇకనుండి తను ఒక నూతన పాత్రను పోషించవలసి యున్నదని, అదియే అన్యజనులకు అపోస్తులుడుఅని పౌలు తెలుసుకున్నాడు (రోమీ. 11:13). ఇదే విషయాన్ని పౌలు యెరూషలేములో సాక్ష్యమిచ్చి యున్నాడు, “అందుకు ఆయన ‘నీవు పొమ్ము. చాల దూరముగా అన్యుల యొద్దకు నిన్ను పంపుచున్నాను’ అని ఆదేశించెను” (అ.కా. 22:21). ప్రభువు అననియాతో పౌలు గురించి ఇలా తెలిపెను, “నీవు వెళ్ళుము. ఏలయన, అన్యులకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకొంటిని” (అ.కా. 9:15).

పౌలు తాను పొందిన ఈ దైవపిలుకు, దైవ ప్రేషిత కార్యానికి కట్టుబడి యున్నాడు మరియు ఏ విషయములోను రాజీ పడలేదు. అబద్ధపు బోధకులను ధైర్యముగా ఎదుర్కొన్నాడు (గలతీ. 2:4). క్రీ.శ. 49లో జరిగిన యెరూషలేము సమావేశములో తన వాదనలను వినిపించి క్రైస్తవత్వమును యూద మూలాల నుండి స్వతంత్రము చేయుటకు తనవంతు కృషి చేసాడు (అ.కా. 15, గలతీ. 2:1-10).

పౌలు ప్రేషిత ప్రయాణములు: “సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును” (1:16) అన్న పౌలు మాటలు సువార్త బోధనపట్ల, దేవుని ప్రేషిత కార్యము పట్ల తనకున్న దేనికి లొంగని చిత్తశుద్ధి మనకి కనిపిస్తుంది. దమస్కు సంఘటనలో, ఉత్థాన క్రీస్తు పౌలుకు రెండు విషయాలను స్పష్టముగా వెల్లడి చేసాడు: ఒకటి, సుదూర ప్రాంతములకు వెళ్ళవలసి ఉండటం, రెండవది ప్రధానముగా అన్యుల యొద్దకు పంపబడటం (అ.కా. 22:21, 26:16-18). ఉత్థాన క్రీస్తానుభావమును పొందిన పౌలు, “ప్రభువు నామమును అన్యులకు తెలియజేయుటకు సాధనముగా ఎన్నుకొనబడిన” (అ.కా. 9:15) అతని పిలుపు తన ప్రేషితత్వ కార్యానికి, ప్రయాణాలకు ఆయువు పట్టుగా మారినది. పౌలు ప్రేషిత ప్రయాణముల గూర్చి అపోస్తలుల కార్యములులో చూడవచ్చు. పౌలు విస్తృతముగా యెరూషలేము నుండి రోము నగరము వరకు ప్రయాణిస్తూ సువార్తను బోధిస్తూ ఎన్నో క్రైస్తవ సంఘాలను స్థాపించి యున్నాడు. లోకమంతటిని (“భూదిగంతముల వరకు”) తన సువార్త ప్రేషిత క్షేత్రముగా ఆళింగనం చేసుకున్నాడు.

పౌలు తన మూడవ ప్రేషిత ప్రయాణమును క్రీ.శ. 58లో ముగించుకొని యెరూషలేము వచ్చినప్పుడు బంధీగావింప బడ్డాడు (అ.కా. 21:27-36). రోము నగరములో పౌలు రెండు సంవత్సరముల పాటు (క్రీ.శ. 61-63) గృహ నిర్భంధం గావింప బడ్డాడు. అందువలన, తన దగ్గరికి వచ్చిన ప్రజలను ఆయన స్వేచ్ఛగా కలుసుకో గలిగాడు. రోము నగరములో నున్న యూదులు పౌలును కలుసుకున్నారు. పౌలు బోధన ద్వారా వారిలో కొంతమంది యేసు ప్రభువును విశ్వసించారు. రోములోని అన్యులకు కూడా పౌలు సువార్తను ప్రకటించాడు. బహుశా, రెండు సంవత్సరముల పాటు తన బోధనను కొనసాగించినట్లు తెలియుచున్నది (అ.కా. 28:30). పౌలు బహిరంగంగా, నిరాటంకంగా దేవుని రాజ్యం గురించి, ప్రభువైన యేసు క్రీస్తు గురించి వారికి బోధించు చుండెను (అ.కా. 28:31).

ఈ రెండు సంవత్సరముల తరువాత, క్రీ.శ. 63 నుండి పౌలు జీవితంలో జరిగిన సంఘటన గురించి మనకు స్పష్టంగా తెలియదు. బహుశా, గృహ నిర్బంధం తరువాత కొంతకాలం పాటు పౌలు చెరసాలలో బంధింపబడి యుండవచ్చు. చరిత్రకారుడు యుసేబియుస్‌, నీరో చక్రవర్తి పాలనలోని హింసలలో, క్రీ.శ. 64-68 సం.ల మధ్యకాలమున పౌలును విచారణ జరిపించి, మరణ శిక్ష విధించారని సాక్ష్యమిచ్చాడు. సంప్రదాయం ప్రకారం, పౌలు క్రీ.శ. 67లో వేదసాక్షి మరణం పొందాడు.

పౌలు లేఖల సారాంశం: పౌలు తన ప్రేషిత కార్య సిద్ధతలో ఎన్నో క్రైస్తవ సంఘాలను సందర్శించాడు, మరికొన్నింటిని స్థాపించాడు. ఒక సంఘ పెద్దగా, క్రీస్తు శిష్యుడిగా ఆయా సంఘాలలో క్రైస్తవ మత, ఆధ్యాత్మిక, వేదాంత, యదార్ధ నీతి నియమాలు, విశ్వాస జీవితాంశాలను తన లేఖలలో వివరించాడు మరియు పరిష్కరించాడు. పౌలు అందించిన క్రైస్తవ సిద్ధాంతాలు నేటికి ప్రాతిపదికలుగా ఉన్నాయి. పౌలు తన లేఖలలో సంబోధించిన ప్రతి అంశం క్రైస్తవ సంఘాలలో నాటి పరిస్థితులను, సమస్యలను వివరించి, పరిష్కార మార్గాలను, సూచనలను నిర్దేశించాయి. అలాగే ఆయా సంఘాల ఆర్ధిక, సామాజిక, మత పరిస్థితులను వివరించాయి. ఈనాటి మన సంఘాలు కూడా ప్రతి కాలములో, ప్రతి పరిస్థితులలో ఎన్నో రకాల సంక్షోభాలను, సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పౌలు లేఖలనుండి ప్రతి సమస్యకు పరిష్కారం దొరకాలని, మన సంఘాలు ఆధ్యాత్మికంగా బలపడాని ఆశిద్దాం!

No comments:

Post a Comment