రెండవ పాస్కా ఆదివారము, 28 ఏప్రిల్‌ 2019

రెండవ పాస్కా ఆదివారము, 28 ఏప్రిల్‌ 2019
దివ్య కారుణ్య ఆదివారము 
అ.కా. 5:12-16, దర్శన. 1:9-13, 17-19, యోహాను. 20:19-31

క్రీస్తు ఉత్థానం - నూతన సృష్టి 

క్రీస్తు ఉత్థానం క్రైస్తవ విశ్వాసానికి మూలం. ''క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే. మీ విశ్వాసమును వ్యర్ధమే (1 కొరి. 15:14). శిష్యులకు క్రీస్తు ఉత్థానం ఓ దివ్యానుభూతి. క్రీస్తు ఉత్థానములోని పరమ రహస్యాన్ని వారు పూర్తిగా అర్ధము చేసుకొనలేక పోయారు. కాని, క్రీస్తు ఉత్థానం వారి విశ్వాసాన్ని బలపరచినదని అనడములో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యాన్ని వారు అనుభవించారు. క్రీస్తు ఉత్థానం వారిని మనుషులుగా, దృఢవిశ్వాసులుగా మార్చినది. విశ్వాసులుగా హింసలను, అవమానములను ధైర్యముగా ఎదుర్కొనుటకు వారిని బలపరచినది. ఉత్థానమైన తరువాత, క్రీస్తు వారితో ఉన్నాడు, వారితో మాట్లాడాడు, వారితో భుజించాడు, వారికి బోధించాడు. ఇప్పుడు వారు ఇతరులలో విశ్వాసాన్ని నింపడానికి పిలువబడినారు. అనాది క్రైస్తవుల దృఢవిశ్వాసం ఎంత గొప్పదో మనదరికి తెలిసిన విషయమే! జ్ఞానస్నానము పొందిన క్రైస్తవులు, ఎప్పుడైతే యేసు 'మెస్సయ్యా' అని విశ్వసించారో, మరణమునుండి ఉత్థానమైనాడని విశ్వసించారో, వారు నూతన జీవితాన్ని, జీవనాన్ని పొందారు. నూతన వ్యక్తులుగా రూపాంతరం చెందారు. క్రీస్తుకొరకు హింసలను భరించుటకును, మరణించుటకును సిద్ధపడ్డారు. 

మొదటి పఠనములో అపోస్తలులు ఉత్థాన క్రీస్తునకు సాక్షులుగా, క్రీస్తు దైవకార్యాన్నిఈ లోకములో కొనసాగించడం చూస్తున్నాము. ఉత్థాన క్రీస్తు నామమున అనేకమైన అద్భుతములను, సూచక క్రియలను చేసియున్నారు. దీనిమూలముగా, ''అనేకులు మరియెక్కువగ, విశ్వాసులై ప్రభువు పక్షమున చేరిరి.'' ప్రజలు అపోస్తులలో ఉన్న దేవుని శక్తిని విశ్వసించారు. ''పేతురు నడచి పోవునప్పుడు కనీసము అతని నీడనైన కొందరిపై పడగలదు అను ఆశచేత వారు రోగులను చాపలమీద, పరుపుల మీద పెట్టుకొని, మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. యెరుషలేము చుట్టుపట్టులనున్న పట్టణములనుండి జనులు వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అట్లు తీసుకొని రాబడిన వారందరు స్వస్థత పొందిరి. క్రీస్తు ఉత్థానముద్వారా, దేవుడు మనకు నూతన జీవితమును, సంతోషమును ఒసగుచున్నాడు. అయితే, మన భూలోక జీవితమున మన క్రైస్తవ జీవితమునకు విశ్వాసులుగా ఉండవలయును. క్రీస్తు మరణమును జయించి మనందరికి శాశ్వత జీవమును ఏర్పాటు చేసియున్నాడు. 

సువిశేష పఠనములో ఉత్థాన క్రీస్తు శిష్యులకు దర్శనమివ్వటం చూస్తున్నాము. యూదుల భయముచే శిష్యులు ఇంటిలో తలుపులు మూసుకుని యుండిరి. యేసు వచ్చి వారిమధ్య నిలువబడి, ''మీకు శాంతి కలుగునుగాక!'' అనెను. శాంతి (షాలొమ్‌) వచనాలతో వారిలోనున్న భయాన్ని తొలగించాడు. ఆయన ఉత్థాన క్రీస్తు అని తెలియజేయుటకు వారికి తన చేతులను, ప్రక్కను చూపగా, వారు ప్రభువును చూచి ఆనందించిరి. ఆ తరువాత ఆయన వారిమీద శ్వాసను ఊది, ''పవిత్రాత్మను పొందుడు'' అని చెప్పెను. తాను ఆరంభించిన పనిని తన శిష్యులు కొనసాగించాలని ఆదేశించాడు. పవిత్రాత్మను పొందడం అనగా నూతన సృష్టిని పొందడం. తండ్రి తనను పంపినట్లుగా, ప్రభువు తన శిష్యులను దైవకార్యమునకై పంపుచున్నారు. యేసు శిష్యరికములో ఈ దైవకార్యం చాలా ప్రాముఖ్యమైనది. వారుకూడా ప్రభువువలె జీవించుటకు, ఇతరులను ప్రభువు మార్గములో నడిపించుటకు పిలువబడి యున్నారు. పవిత్రాత్మ శక్తివలన, పాపములను క్షమించు అధికారమును శిష్యులు పొందియున్నారు, ''మీరు ఎవరి పాపములనైనను, క్షమించిన యెడల అవి క్షమించబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని యెడల అవి క్షమింపబడవు.'' దీనిద్వారా, ఈ లోకములో ఒకే మనస్సు, ఒకే హృదయముగల ఒకే కుటుంబమును ఏర్పాటు చేయవలసి యున్నది. మానవాళిని దేవునితో సఖ్యపరచవలసిన అవసరము ఉన్నది. 

తోమాసు-యేసు దర్శనము: సువిశేష రెండవ భాగములో  అపోస్తలుడు తోమాసు, ప్రభువు దర్శనాన్ని గూర్చి చూస్తున్నాము. పాస్కా ఆదివారమున యేసు శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు, తోమాసు వారితో లేకుండెను. యేసు దర్శనాన్నిగూర్చి తోమాసుకు తెలియజేసినప్పుడు, అతను విశ్వసించడానికి నిరాకరించాడు, ''నేను ఆయన చేతులలో చీలల గురుతు చూచి, అందు వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను'' అని అన్నాడు. యేసు ఉత్థానాన్ని విశ్వసించుటకు వ్యక్తిగతముగా ప్రభువు సాన్నిధ్యాన్ని అనుభవించాలని ఆశించాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. తోమాసు అవిశ్వాసి అని చెప్పడం సబబు కాదు. వ్యక్తిగా తోమాసుగారు చాలా ధైర్యవంతుడు, విశ్వాసపరుడు. లాజరు మరణించినప్పుడు, తోమాసుగారు, ''మనముకూడ వెళ్లి ఆయనతో పాటు చనిపోవుదము'' (యోహాను. 11:16) అని తోడి శిష్యులతో అన్నాడు. అయితే, ఇక్కడ తోమాసుగారు, తన అవిశ్వాసాన్ని ప్రకటించడానికి కారణం, ఉత్థాన ప్రభువును దర్శించిన ఇతర శిష్యులు ఇంకా ఎందుకు యూదులకు భయపడి ఇంటిలో తలుపులు మూసుకొని ఉన్నారు? ఉత్థాన క్రీస్తుకు ధైర్యముగా సాక్ష్యమీయవలసి ఉన్నది కదా! అని తలంచి యుండవచ్చు. వాస్తవానికి, తోమాసుగారు దృఢవిశ్వాసి. ఆయన విశ్వాసము కొరకు ఎంతో దూరమునుండి భారత దేశమునకు వచ్చి తన విశ్వాసము కొరకు మరణించాడు. 

ఎనిమిది దినముల పిమ్మట ఆయన శిష్యులు మరల ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగనే యేసు వచ్చి వారిమధ్య నిలువబడి, ''మీకు శాంతి కలుగును గాక'' అనెను. అపుడు తోమా ''నా ప్రభూ! నా దేవా! అని పలికి తన విశ్వాసాన్ని ప్రకటించాడు. అయితే, చివరిగా ప్రభువు, ''నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా! చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు'' అని ప్రభువు పలికి యున్నారు. 

దివ్యకారుణ్య మహోత్సవము: క్రీస్తు పునరుత్థాన పండుగ తరువాత ఆదివారమును దివ్యకారుణ్య పండుగగా జరుపుకోవాలని పరిశుద్ధ రెండవ జాన్‌ పౌల్‌ పాపుగారు పిలుపునిచ్చారు. అప్పటినుండి రోమను కతోలిక సంఘమునందు ఈ పండుగను జరుపు కొంటున్నారు. 

'దివ్యకారుణ్యం' అనగా ఏమి? ఈ పండుగ జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి? దివ్యకారుణ్యం అనగా, 'దేవుని కరుణ' అని అర్ధం. 'కరుణ' అనే తెలుగు మాటకు ఆంగ్లములో ావీవతీషవ' అందురు. 'వీవతీషవ' అనే ఆంగ్ల మాట 'మెర్సెదెం' (mercedem) లేదా 'మెర్సెస్‌' (merces) అనే లాటిన్‌ మాట నుండి ఉద్భవించినది. 'మెర్సెదెం' లేదా 'మెర్సెస్‌' అనే మాటకు ప్రతిఫలము, జీతము, కిరాయి అనే అర్ధాలు గలవు. బైబిలు పరిభాషలో ఈ మాటకు (వీవతీషవ) ప్రతిఫలము లేదా జీతము లేదా కిరాయి చెల్లించబడినది అని అర్ధము. 

దివ్య కారుణ్య అపోస్తరాలుగా పిలువబడే పునీత ఫౌస్తీనమ్మ గారి మాటలలో చెప్పాలంటే, ఈ పండుగ ముఖ్య ఉద్దేశాలు మూడు: 
- దేవుని కరుణను కోరుకోవడం,
- యేసుని అనంత కరుణను నమ్మడం, 
- మనం పొందిన/పొందుతున్న ఆ దేవుని కరుణను ఇతరులకు పంచడం.

నీకు తెలిసిన వారు ఎవరైనా అకస్మాత్తుగా తటస్థపడితే ఏమి చేస్తావు? లేదా ఏమి అడుగుతావు? నీకు మంచి చేసినవారైతే, మేలు చేసినవారైతే, నీ అభివృద్ది కోరేవారైతే, వారు మనల్ని చూడకపోయినా, మనమే ఎదురెళ్లి, వారికి అగుపడి గతమున చేసిన మేలును జ్ఞప్తికి తెచ్చుకొని కృతజ్ఞతలు తెలియజేసి, కుశల ప్రశ్నలు అడుగుతాం! అదే మనకు చెడు చేసినవారైతే, మనల్ని మోసగించిన వారైతే, మన నమ్మకాన్ని వమ్ముచేసినవారైతే, వంచనతో మన స్నేహాన్ని కోరినవారైతే, స్వార్ధం కొరకు ప్రేమగా నటించినవారైతే, వారిని చూసినా కాని, చూడనట్లు నటించి వారి చూపులనుండి, వారి చుట్టు ప్రక్కల నుండి తప్పించుకొనడానికి ప్రయత్నిస్తాం! కొద్దిగా దైర్యవంతులైతే, తప్పు చేయని వాడిని నా కెందుకు భయం అని చూసి చూడనట్లుగా వెళతాం! ఇంకా అతను/ఆమె కాని మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తే, 'జరిగింది, చేసింది, చెప్పింది చాలు! ఇక వెళ్ళు' అంటాం! ఇంకా మాట్లాడాలని ప్రయత్నిస్తే మోసగించిన, వంచన చేసిన, అవమానము, ఆ సందర్భము, ఆ సందర్భములో జరిగిన మాటలు, సంభాషణ అవి హదయపు లోతులలో చేసిన గాయాలను గుర్తుకు తెచ్చుకొని కోపపడతాము లేదా బాధపడతాము! 

ఇదంతా ఎందుకు వివరిస్తున్నానంటే, యేసు ప్రభువు అటువంటి పరిస్థితులలోనే ఉన్నా, దానికి భిన్నముగా ప్రవర్తించారు. ఆయనే వారికి అగుపడుచున్నారు. ఆయనే వారితో మాట్లాడుచున్నారు. యూదుల భయముతో ఉన్న వారికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఏమి చేయాలో అని పాలుపోని స్థితిలో, ఏమి చేయాలో, ఎలా చేయాలో చెప్పుచున్నారు. బాధను, భయమును పోగొడుచున్నారు. ఇంత జరిగినా, ఏమీ జరగనట్లు, ఏమీ తెలియనట్లు ఉన్నాడు. 

అదే మనమైతే, 'నాయవంచాకులారా! విశ్వాస ఘాతకులారా! గురుద్రోహులారా! పిరికి పందల్లారా! అని అనే వాళ్ళం! కాని ఆయన మాత్రం, షాలోం (శాంతి) సమాధానం కలుగుగాక! సమద్ధి కలుగునుగాక! ఆనందం సంతోషం వర్ధిల్లుగాక! అని వారిని సంభోదిస్తూ ఉన్నారు. ఎందుకంటే, (ఆయన) మన పాపాలకు తగినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు (కీర్తన. 103:10). 

ఆయన కరుణగలవాడు, దయగలవాడు.అతడు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు. సులభముగా కోపపడువాడు కాదు. ప్రేమామయుడు, విశ్వాసమందు అనంతుడు (నిర్గమ. 34:6). అందుకే నమ్మని తన శిష్యులకు, తనకు కలిగిన గాయాలను చూపిస్తున్నాడు. ఈ సందర్భములో మనమైతే, ఇదిగో మీ/నీ నయవంచనకు మోసమునకు, విశ్వాస ఘాతమునకు, గురు ద్రోహమునకు గుర్తు! అని అంటాం!  కాని ప్రభువు అంటున్నాడు: ఇదిగో మీ రక్షణ చిహ్నాలు, మీ పాపమునకు పరిహారముగా సిలువ మీద నన్ను సమర్పించుకున్నాను అనడానికి చిహ్నాలు - మీ పాపములకు జీతము/ప్రతిఫలము/కిరాయి చెల్లించ బడినది అనుటకు గుర్తు. 

మీ కొరకై, మీ విముక్తి కొరకై, అమ్మబడ్డాను, చంపబడ్డాను/ పరిహార బలిగా అర్పింపబడ్డాను అని అనడానికి గుర్తు. మీపై గల ప్రేమకు, రక్షణకు, కరుణకు గుర్తులు నా తీపి జ్ఞాపకాలు. మీరు చెల్లించవలసిన మూల్యం (అప్పు) చెల్లించబడినది అని నిరూపించే రసీదు. మీరు పొందిన ఈ పరిహారమును, మన్నింపును, విముక్తిని, మీతోనే, మీకొరకే, పరిమితం చేసికొనకుండా, ఇతరులకు పంచండి. మన్నింపులోని మహత్యమును కరుణలోని కమనీయతను వెదజల్లండి అని బోధిస్తున్నాడు యేసు. 

ఇంకా ఈ కరుణకు దూరముగా ఉంటే, కరుణకు దగ్గరవ్వాలని కోరుకుందాం! మనకు దగ్గరయి, మనలను దేవుని దరికి చేర్చిన క్రీస్తు కరుణను నమ్ముదాం! నమ్మిన ఆ కరుణను పొంది, మన తోటి వారందరికీ పంచుదాం!

No comments:

Post a Comment