మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవము, నూతన సంవత్సరము, (Year ABC)

మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవము, నూతన సంవత్సరము (Year ABC)
సంఖ్యా. 6:22-27, గలతీ. 4:4-7, లూకా. 2:16-21

ఈ రోజు మనం మరియమ్మగారి దివ్యమాతృత్వ పండుగను కొనియాడుచున్నాము. కన్యక అయిన మరియ దేవుని తల్లి (Theotokos). Theotokos గ్రీకు భాషలో దేవుణ్ణి మోసేవారు లేక దేవునికి జన్మనిచ్చేవారు అని అర్ధము. 431 వ సం.లో 'ఎఫెసుస్ కౌన్సిల్'నందు మరియ  దేవునితల్లి అని అధికారికముగా ప్రకటించబడి యున్నారు. ఎందుకన, ఆమె కుమారుడు యేసుక్రీస్తు, దేవుడు - మానవుడు, మరియు దైవ స్వభావమును - మానవ స్వభావమును కలిగియున్న ఒకే వ్యక్తి కనుక. ఈ పరమరహస్యాన్ని ధ్యానిస్తూ మరో నూతన సం,,రమును ఆరంభిస్తున్నాము.  మరియ దేవునితల్లి, మరియు మనందరికీ తల్లి కూడా. మరియతల్లిపై భక్తి విశ్వాసాలను పెంపొందిచుకోవడానికి ప్రయత్నం చేద్దాం.

దేవునితల్లియైన మరియమ్మకు మనం ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దేవదూత అందించిన సందేశానికి వినయపూర్వక హృదయముతో 'అవును' అని చెప్పుటవలన, మనకి జీవితాన్ని, రక్షణను తన గర్భములోని శిశువుద్వారా తీసికొని వచ్చింది. ఈ రక్షణకార్యమునకై దేవుడు మరియమ్మను ప్రత్యేకవిధముగా, జన్మపాపరిహితగా ఎన్నుకొన్నాడు. ఈనాటి రెండవ పఠనములో పౌలుగారు చెబుతున్నట్లు కాలము పరిపక్వమైనప్పుడు దేవుని కుమారున్ని మోయుటకు, దేవునికి తల్లిగా మారుటకు ఆమెను ఎన్నుకొని యున్నాడు (గలతీ. 4:4). 

గతమున దేవుడు తనప్రజలతో, ప్రవక్తలద్వారా మాట్లాడియున్నాడు (హెబ్రీ. 2). తన యాజకులద్వారా దేవుడు తనప్రజలను దీవించియున్నాడు.  ఈనాటి మొదటిపఠనములో, యాజకులైన ఆహారోను, అతని పుత్రులు ఏవిధముగా ప్రజలపై దీవెనలు పలుకవలెనో యావే మోషేకు తెలియజేసియున్నాడు (సంఖ్యా. 6:22-27). కాని, ఇప్పుడు దేవుడు తన కుమారుని పంపియున్నాడు.  ఆయన రాజ్యమును, మహిమను తన కుమారునిద్వారా బయలుపరచియున్నాడు.  మరియు సకలమానవాళికి తన రక్షణప్రణాళికను  ఎరుకపరచియున్నాడు. (చదువుము యోహాను. 14:8-9).

యేసు, సృష్టి ఆరంభమునుండి ఎన్నుకొనిన, నడిపింపబడిన దేవుని ప్రజలనుండి ఉద్భవించినవాడు. సువిశేష పఠనములో విన్నవిధముగా (లూకా. 2:21) శిశువుకు సున్నతి చేయడము ద్వారా (ఆది. 17:1-14) అబ్రహాముతో దేవుడు చేసిన ఒడంబడికకు వారసుడు. మనము క్రీస్తునందు జ్ఞానస్నానము పొందుట ద్వారా దేవునికి దత్తపుత్రులుగా మారియున్నాము (కొలస్సీ 2:11; ఫిలిప్పీ 3:3). దేవుని బిడ్డలముగా, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానములకు (ఆది. 12:3; 22:18) మనమును వారసులమగుచున్నాము (గలతీ. 3:14).  యాజకుడైన ఆహారోను ఈ దీవేనలనే దైవప్రజలపై అందించియున్నాడు.  ఈనాడు ఈ దీవెనలను మనముకూడా మరియతల్లిద్వారా, రక్షకుడైన యేసుక్రీస్తుద్వారా పొందుచున్నాము. ఈ గొప్ప ఆనందదాయకమైన శుభసందేశమే, దేవదూత ద్వారా గొల్లలకు తెలియజేయడమైనది (లూకా. 2:10).

యేసు బెత్లేహేములో జన్మించాడు.  యోసేపు, మరియమ్మలకుతప్ప ఆ విషయం ఎవరికినీ తెలియదు.  కాని, వేగముగా గొల్లలకు ఆ శుభసందేశం, లోకరక్షకుని జననపరమరహస్యం తెలియజేయడమైనది.  దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమై "మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభసమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదునగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తుప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి  పశువులతొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు" (లూకా. 2:10-12). దేవుడు తెలియజేసిన ఆ పరమరహస్యాన్ని గాంచుటకు గొల్లలు వెమ్మటే బెత్లేహేమునకు వెళ్ళిరి. అక్కడ పశువులకొట్టములో మరియమ్మను, యోసేపును, తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి.

గొల్లలవలె మనముకూడా వేగముగా మరియ యోసేపులతో యేసును కనుగొనుటకు త్వరపడుదాం. గొల్లలు తాము వినినవానిని, చూచినవానిని గురించి దేవునివైభవమును శ్లాఘించిరి (లూకా. 2:20). దేవుడు ఇచ్చిన ఈ గొప్ప దీవెనలకి మనముకూడా ఆయనను మహిమపరచుదాం.  మరియతల్లివలె, దేవునివాక్యమును మనస్సున పదిలపరచుకొని ధ్యానించాలి.  క్రీస్తుసందేశము మనహృదయాలలో సమృద్ధిగాఉండాలి (కొలస్సీ. 3:16).  అప్పుడే దేవదూతవలె, గొల్లలవలె, జ్ఞానులవలె మనుమును ఈ గొప్ప సందేశాన్ని, దీవెనని , పరమరహస్యాన్ని ఇతరులకు ఇవ్వగలం.

దేవుడు మనకి ఒసగిన మరో గొప్ప వరం 'మరో నూతన సంవత్సరం'. గడచిన సం.న్ని ఒక గొప్ప నమ్మకము, ఆశతో చూద్దాం. మన సమాజములో అభివృద్దితోపాటు, చెడుకూడా పెరుగుతూ ఉంది. భయము, ఆధ్యాత్మికలేమి పెరగుతూ ఉన్నాయి. స్వార్ధము రోజురోజుకి పెరుగుతుంది.  రాజకీయఅంధకారం, పేద-ధనిక భేదం, వ్యభిచారం, రాష్ట్ర విభజన, మాదక ద్రవ్యాలు, కుల వర్గ భేదాలు మొ.గు సమస్యలతో సతమతమగుచున్నాము. ఇలాంటి పరిస్థితులలో గొప్ప ఆశగల నమ్మకముతో ముందుకు సాగాలి. దేవునిపై ఆధార పడాలి.  ఆయన వైపు చూడాలి.  

మన సమస్యలన్నింటికీ ఆయనే పరిష్కారం.  ఈ నమ్మకానికి గొప్ప ఆశ మన యువత. సమాజానికి వారు ఎంతో అభివృద్ధిని తేగలరు. తల్లిదండ్రులు, భోదకులు, యువతపై దృష్టి సారించి విద్యావంతులను చేయడానికి కృషిచేయాలి. ప్రభుత్వము, మీడియా, సంస్థలు యువత అభివృద్ధికి తోడ్పడాలి. అలాగే, పాశ్చాత్య దేశాలలో ఆర్ధికసమస్యలు ఉన్న సమయములో మన భారతదేశ ఆర్ధిక పరిస్థితి చాలా మెరుగుపడిఉంది. అయితే, అధికశాతం అభివృద్ధి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నదని మరచిపోరాదు. కొంతకాలముగా, వ్యవసాయదారులు ఎన్నోకష్టాలను ఎదుర్కొంటున్నారు. నూతన సంవత్సరములో వారి మంచికోసం ప్రార్ధన చేద్దాం.

అన్నింటికన్నా ఎక్కువగా, మనమందరం మంచి మానవతాసంబంధాలను కలిగి జీవించాలి. ఒకరినొకరు అర్ధంచేసికొంటూ, సహాయం చేసికొంటూ ముందుకు సాగాలి. నిజమైన స్వేచ్చ, సత్యములను కనుగొని జీవించుదాము. న్యాయముతో, సామాజిక, నైతికవిలువలతో జీవించుదాము.  శాంతిస్థాపన మరో ముఖ్యఅంశం, ధ్యేయం.  ''శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని బిడ్డలనబడుదురు (మత్త. 5:9).

No comments:

Post a Comment