4 వ సామాన్య ఆదివారము, Year B

4 వ సామాన్య ఆదివారము, Year B
ద్వితీ. 18:15-20; భక్తి కీర్తన 95:1-2, 6-9; 1 కొరి 7:32-35; మార్కు 1:21-28
దేవుని వాక్కు శక్తి గలది: ఆలకింపుము

ఉపోద్ఘాతము: దేవుని వాక్కు శక్తిగలది
"మా కర్తయగు ఓ సర్వేశ్వరా! మమ్ము అన్ని దేశములనుండి రప్పించి తిరుగ ఏకము చేయుడు. అపుడు మేము మీ నామ సంకీర్తనము చేయుచు మీకు ప్రస్తుతి చేయుటలో ఆనందము కలిగియుందుము".
గతవారం, "కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు" (మార్కు 1:14) అంటూ యేసు దైవరాజ్యమును ప్రకటించియున్నాడు.  ఈ వారం యేసు తన సువార్తా వాక్య బోధనద్వారా, తన అధికారముతో, శక్తితో, సాతానును గద్దించి పారద్రోలుచున్నాడు. దేవుని వాక్యం మన మధ్యలోనికి అనేక విధాలుగా వచ్చును. "దేవుని వాక్యం సజీవమును, చైతన్యవంతమునైనది. అది కత్తివాదరకంటే పదునైనది. జీవాత్మల సంయోగస్థానము వరకును, కీళ్ళు మజ్జ కలియు వరకును, అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను, ఆలోచనలను, అది విచక్షింపగలదు" (హెబ్రీ 4:12). దేవుని వాక్యం, మన హృదయములోనికి దూసుకొని పోగలదు. మన ఆలోచనలను, మన జీవితాలను మార్చగలదు. మనలను శుద్ధులను గావించి, మనలోని పాపమును తొలగించగలదు. ఈలోక విలువలకు వ్యతిరేకముగా, దైవరాజ్య విలువల వైపునకు మనలను నడిపించ గలదు. దేవుని వాక్యమునకు పాపోశ్చరణ శక్తిగలదు. మనలోని విభేధములను తొలగించి, ఒకటిగా చేయగలదు.
మొదటి పఠనము: దేవుడు పంపు ప్రవక్త బోధను ఆలకింపుము
మోషే ప్రవక్త (క్రీ.పూ 13వ శతాబ్దం) ఇశ్రాయేలు ప్రజలకు తన చివరి వీడ్కోలు సందేశమును ఇస్తున్నాడు. వాగ్ధత్తభూమిలోనికి ప్రవేశించు వారికి, వారిని నడిపించుటకు, జీవిత మార్గమును చూపుటకు దేవునివాక్యం వారితో ఎల్లప్పుడు ఉంటుందని చెప్పాడు. తన మరణం తర్వాత, దేవుడు వారిని విడచి వేయక వారితో తన ప్రవక్తలద్వారా మాట్లాడతాడని అభయాన్ని ఇచ్చాడు. మోషే ప్రవక్తను ఆలకించిన విధముగా, రాబోవు ప్రవక్తలను, వారి ప్రవచనాలను ఆలకించాలి. ప్రవక్తలను నిర్లక్ష్యము చేసిన యెడల, వారి జీవితాలు ప్రమాదములో పడిపోతాయి. యోర్దాను నది దాటి, వాగ్ధత్త భూమిలోనికి ప్రవేశించిన తర్వాతకూడా, దేవునికి విధేయులై జీవించడం చాలా ముఖ్యమని వారికి మోషే గుర్తుకు చేస్తున్నాడు. దేవుని ఒప్పందాలకు విశ్వాసపాత్రులుగా జీవించిన యెడల, వారు అనేక దైవవరములను పొందెదరు. నిబంధనలను ఉల్లంఘించిన యెడల వారికి కష్టాలు తప్పవు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఉన్నపుడు, వారికి దేవుడు ఎలా అవసరపడి యున్నాడో, అలాగే, వాగ్ధత్త భూమిలో కూడా, దేవుని అవసరం, సహాయం, శక్తి వారికి అవసరమని వారు గుర్తుంచుకోవాలి. అనేక ప్రవక్తలద్వారా వచ్చు దేవుని సందేశమును, వాక్యమును శ్రద్ధగా ఆలకించి, పాటించాలి.
ఈవిధముగా మోషే, భవిష్యత్తులో రాబోవు గొప్ప ప్రవక్త (యేసు క్రీస్తు) ను గూర్చి ప్రవచిస్తున్నాడు. "నీ వంటి ప్రవక్తనొకనిని వారి జనము నుండియే వారిచెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగింతును. నేను చెప్పుము అనిన సంగతులన్నియు అతడు వారితో చెప్పును" (ద్వితీ 18:18). క్రీస్తునందు ఈ ప్రవచనం నెరవేరినది. క్రీస్తుద్వారా మనం నిజమైన వాగ్ధత్తభూమికి (పరలోకం, నిత్యజేవము) నడిపించాడు. కనుక దేవుని చిత్తమును, సత్యమును బయలుపరచు నిజ ప్రవక్తల బోధనలను శ్రద్ధగా ఆలకించాలి.
రెండవ పఠనము: వివాహితుల బాధ్యతలు
దేవునిచేత ప్రత్యేకముగా ఒసగబడిన పిలుపును విశ్వాసముతో జీవించాలని, పునీత పౌలుగారు బోధిస్తున్నారు. ప్రత్యేక పిలుపు అనేది కేవలం అవివాహితులకు మాత్రమేగాక, వివాహితులకుకూడా అని గుర్తించాలి. సకల విచారముల నుండియు దూరము కావలయుననియు, అత్మచేత ప్రేరేపింపబడి, ప్రభువును నమ్మిన పౌలుగారు చెబుతున్నారు. అవివాహితులు, విధవరాండ్రు దేవుని విషయములందు నిమగ్నులై ఉండాలి. దేవున్ని సంతోష పెట్టుటకు ప్రయత్నించాలి. అలా శారీరకముగా, ఆత్మయందును పరిశుద్ధులై ఉండెదరు. వివాహితులు ఈలోక విషయాలలో చిక్కుకొని ఉండెదరు. భర్త భార్యను, భార్య భర్తను ఎలా సంతోషపెట్ట వలయునని లౌకిక వ్యవహారములలో చిక్కుకొని ఉండెదరు. వారి జీవితం దేవునికి-లోకానికి మద్య విభజింప బడుతూ ఉంటుంది. వారు విచారములనుండి దూరము కావలయునంటే, ప్రభువునకు సంపూర్ణముగా వారి జీవితాలను అర్పించుకోవాలి మరియు క్రమశిక్షణ అలవరచు కోవాలి. కుటుంబ భాధ్యతలను నేరవేరుస్తూనే, దేవుని విషయాలయందుకూడా నిమగ్నులై యుండాలి. పొరుగువారిని ప్రేమిస్తూ, దైవాజ్ఞలను విధేయిస్తూ, సజీవ విశ్వాసము కలిగి క్రీస్తునందు వారు జీవించగలగాలి.
సువిశేష  పఠనము: యేసు బోధ అధికారము గలది
యేసు విశ్రాంతి దినమున (సబ్బాతు) కఫర్నాములోని (గలిలీయ సముద్ర తీరమున ఒక చిన్న గ్రామము; పేతురు అతని సోదరుడు అంద్రేయ అక్కడ నివసించిరి; నజరేతును వీడిన యేసు, కఫర్నామును తన నివాస మేర్పరచు కొనెను మత్త 4:13; మా 2:1) యూదుల ప్రార్ధన మందిరములోకి (సినగోగు - ప్రార్ధన, బోధన, ఆరాధన, సంఘకూడిక) ప్రవేశించి, ధర్మశాస్త్రబోధకులవలెగాక (యూదచట్టం యొక్క అధికారిక వ్యాఖ్యాతలు), అధికారపూర్వకముగా బోధించాడు. అనగా ఆత్మవిశ్వాసముతో లేఖనాలను వివరించాడు. ధర్మశాస్త్రబోధకులు, ఆత్మసంబంధమైన విషయాలకుగాక, బాహ్యపరమైన విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చారు. "వారు బోధించునది వారే ఆచరింపరు" (మత్త 23:3) అని వారి గురించి యేసు చెప్పాడు
యేసు దైవీక అధికారాన్ని కలిగియున్నాడు. ఆయన బోధనలయందును, కార్యములందును శక్తిగల ప్రవక్త, మెస్సయ్య. ఆయన బోధకు అచ్చటనున్నవారు ఆశ్చర్యపడ్డారు. మార్కు సువార్తలో, ప్రభువును, ఒక బోధకునిగా, గురువుగా, ఆశ్చర్యకరునిగా, ప్రార్ధనాపరునిగా చూస్తాము. ఇవన్నియు, ప్రభుని అనుదిన చర్యలో భాగాలే! ఆయన, ఓ గొప్ప గురువు, బోధకుడు. ప్రజలకు దర్మశాస్త్రమును గూర్చి బోధించాడు. ఆయన వద్దకు విశ్వాసముతో వచ్చిన ప్రతీవారిని స్వస్థపరచాడు. గురువు తన వ్యక్తిగత జీవితముద్వారా, అనుభవముద్వారా, జ్ఞానాన్ని ఇతరులకు ఒసగుతాడు. ప్రభువు, తన జీవితాంతముకూడా, దేవుడు తనకు అప్పగించిన ప్రజలకు సువార్తను బోధించాడు. సువార్తను అర్ధము చేసికొనుటకు, ఉపమానాలద్వారా విశదపరచాడు. క్రీస్తు బోధన కేవలం మదిలోనికేగాక, హృదయములోనికి కూడా ప్రవేశిస్తుంది. ప్రజలు అతని చర్యలలో దేవుని దయను, కరుణను అనుభవించారు. రోగులను, పాపాత్ములను, సమాజముచే వెలివేయబడిన వారిని ప్రేమతో ఆదరించాడు. నేటి సువార్తలో దయ్యము పట్టినవానికి స్వస్థతను చేకూర్చాడు (మార్కు 1:23-26). అందుకే ప్రజలు, ఆశ్చర్యపడి "ఇది యేమి? ఈ నూతన బోధయేమి?" (మార్కు 1:27) అని గుసగుసలాడారు.
యేసు తండ్రిప్రేమను బోధించాడు. యేసు అధికారము - తండ్రి దేవుని ప్రేమ యొక్క శక్తి. ఆయన నిశ్చయముగా, అధికార పూర్వకముగా బోధించాడు, ఎందుకనగా, ఆయన బోధన తండ్రిచిత్తమని, తండ్రివాక్కు అని ఎరిగియున్నాడు. యేసుప్రభువు దేవుని వాక్యమును బోధించాడు. దేవునిగూర్చి, రక్షణ ప్రణాళికనుగూర్చి బోధించాడు. ప్రజలు ఆయన బోధనను ఆలకించడానికి ఆసక్తిని చూపారు. ఈ సందర్భాలలోనే ఆయన ఎన్నో అద్భుతాలను చేసాడు. ఈనాడు, అపవిత్రాత్మతో ఆవేశించిన వానిని, ప్రభువు స్వస్థపరచాడు. ఆ అపవిత్రాత్మ ప్రభువు శక్తిని అణగత్రొక్కుటకు ప్రయత్నం చేసింది. కాని, ప్రభువు దానిని తన శక్తితో, అధికారముతో గద్దింపగా, అది వదలి పోయింది. క్రీస్తు అధికారపూర్వకముగా బోధించాడు. యేసు బోధనలు అధికార పూర్వకమైనవి, ఎందుకన, ఆయన దేవుడు, నిత్యజీవపు మాటలు కలవాడు. అందుకే, ఆయన బోధ మనసున, హృదయమున నాటుకొని పోతుంది. అదే యేసుప్రభువునకు, ధర్మశాస్త్రబోధకులకు మధ్యనున్న వ్యత్యాసము. యేసు తన అధికారాన్ని ఇతరుల శ్రేయస్సు, స్వస్థత, రక్షణ కొరకు ఉపయోగించాడు (చదువుము మా 10:45). మనం కూడా యేసువలె జీవించాలి (చదువుము మా 10:42-43). ఎందుకన, మన జ్ఞానస్నాముద్వారా, యేసు అధికారములో భాగస్వామ్యం అవుతున్నాము. ఇతరుల సేవకై మనకున్న అధికారాన్ని వినియోగించాలి.
సందేశము
అయితే, ఈ రోజుల్లో, 'అధికారం' ఓ చెడు పదముగా మారింది. అధికారం అంటే డబ్బు, పదవులు, ఆధిపత్యం, విజయాలు అని తప్పుగా భావిస్తున్నాం. దేవుని దృష్టిలో, అధికారం అనగా, సేవ, వినయము, ప్రేమ.
ఈనాడు మనం ఇతరుల అధికారాన్ని చూసి వారికి గౌరవాన్ని ఇస్తాం. అలా అధికారముతోగాక, మన మంచి జీవితముద్వారా, ఇతరుల గౌరవాన్ని పొందాలి. అప్పుడే, మనం చేసే బోధనని ఇతరులు ఆలకిస్తారు. ఆరవ పౌలు పాపుగారు, ఓ సందర్భములో 'ఈ లోకం బోధకులకన్న ఎక్కువగా సాక్షులు అవసరం ఎంతో ఉన్నది' అని అన్నారు. ఈ రోజు, గురువులను, బోధకులను గౌరవిస్తున్నారంటే, వారికున్న అధికారమునుబట్టి కాదు. కాని వారి జీవితమును బట్టి. వారు ఎలాంటి వ్యక్తులు, ఎలా జీవిస్తున్నారో వారి బోధనలను బట్టి చెప్పగలరు. యేసు ప్రభువు అధికారపూర్వకముగా బోధించాడు. ఆయన గొంతెత్తి బోధించాడనో , శిక్షనుగూర్చి బోధించాడనో కాదు. ఆయన బోధన ఆయన జీవిత ఆదర్శానుసారముగా సాగింది. ఆయన జీవించినదే, బోధించాడు. అందుకే, అధికారముతో బోధించగలిగాడు.
పునీత అస్సీసి పుర ఫ్రాన్సిసు వారు ఒకసారి, ఒక సహోదరుని పిలచి, మనం పట్టణానికి వెళ్లి దేవుని సువార్తను బోధిద్దాం అని చెప్పాడు. అలాగే, ఆ ఇరువురు పట్టణ వీధులలో తిరిగి, ఒక్క వాక్యమైన బోధించకుండా, దారిలో కలిసిన వారందరిని పలుకరించి తిరిగి వచ్చారు. ఆ సహోదరుడు, ఎందుకు మనం ఏమీ బోధించలేదని అడుగగా, మనం పట్టణములో నడచినంత సేపూ మన జీవిత ఆదర్శము ద్వారా బోధించామని ఫ్రాన్సిసువారు చెప్పారు. మన బోధ కేవలం మాటలద్వారా మాత్రమేగాక, మన బోధ జీవితమై యుండాలి.
క్రీస్తు ఓ గొప్ప బోధకుడు. మనమందరం ఆయన శిష్యులం, అనుచరులం. దేవుడు, జ్ఞానస్నానము ద్వారా, మనకొక్కరికి ఓ విధమైన పిలుపునిచ్చి ఆయన బిడ్డలుగా జీవించునట్లు చేసాడు. ఆ పిలుపునకు మనం ఎల్లప్పుడు స్పందించాలి. ఎలాంటి విచారములకు లోనుకాకుండా, లోకవ్యవహారములలో చిక్కుకొనక, ప్రభునిలో నమ్మకముంచి, ముందుకు సాగిపోవాలి. మనలోనున్న అపవిత్రాత్మ శక్తులను, లోకవ్యామోహములను గద్దింపమని ప్రభువుని ప్రార్దన చేద్దాం. యేసుక్రీస్తు శక్తిని, అధికారాన్ని మన అనుదిన జీవితాలలో గుర్తించి ప్రతిస్పందించాలి. 
దయ్యములను వెడలగొట్ట బడటం పాత నిబంధనలో 1 సమూ 16:14-23; తోబితు 8:1-3); పాత నిబంధనలో ప్రేషిత సేవలో భాగముగా చూడవచ్చు (మత్త 9:32-34; 12:22-32; మా 1:22-27; 3:14-30; 5:1-206:7; 7:24-30; 9:17-29; 16:17; అపో.కా. 5:16; 8:7; 19:12). ఇది శ్రీసభ పరిచర్యలో కూడా భాగమే (శ్రీసభ చట్టం 1172 1,2).
తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, గురువులుగా, మఠవాసులు, మఠకన్యలుగా, పాలకులుగా, ప్రజాధికారులుగా మనం కలిగియున్న అధికారము, మనము జీవించే జీవిత విధానమునుండి (సేవ, వినయము, ప్రేమ) రావాలి. అప్పుడే, మనం చెప్పేదానిని ఇతరులు ఆలకిస్తారు. మనమూ గౌరవాన్ని పొందగలము. 
నేడు ప్రార్ధనాలయములాంటి మన హృదయములో అధికారముతో మనకు బోధిస్తున్నారు. ఆయన మాటలను హృదయపూర్వకముగా ఆలకించు చున్నామా? ప్రస్తుత కాలములో ఎన్నో విధములైన ‘అపవిత్రాత్మలతో’, నిండియున్నాము, శోధింప బడుచున్నాము. స్వస్థపరచమని యేసు క్రీస్తును వేడుకుందాం.

No comments:

Post a Comment