పునీత యోహాను - అపోస్తలుడు, సువిశేషకుడు

పునీత యోహాను - అపోస్తలుడు, సువిశేషకుడు, డిసెంబర్ 27, ఉత్సవము

కడరా భోజన సమయమందు రక్షకుని రొమ్ముమీద తలను వాల్చిన యోహాను ఇతడు.  స్వర్గీయ దివ్యదర్శనములను కాంచిన ఈ ధన్య అపోస్తలుడు జీవన దాయక సందేశమును లోకమంతట వ్యాపింప జేసెను.

యోహాను జబదాయి, సలోమియమ్మ (మార్కు. 15:40;16:1; మత్త. 27:56) ల కుమారుడు. జబదాయి గలిలయలో చేపలు పట్టువాడు. అతనికి జీతగాండ్రును ఉండెను (మార్కు. 1:20). బెత్సయిదాపురమునకు (యోహాను. 1:44) దరిలో నివసించేవారు. సలోమియమ్మ దైవభక్తురాలు. క్రీస్తును వెంబడించినస్త్రీలలో ఆమె ఒకరు (మత్త. 27:55; మార్కు. 15:40; 16:1; లూకా. 8:2; 23:55-24:1). మరో అపోస్తలుడైన యాకోబు (మార్కు. 1:19) అతని సహోదరుడు.

అ.కా 4:13 ప్రకారం, యోహాను (అతని సహోదరుడు యాకోబు) పూర్తి విద్యాభ్యాసం పొందలేదని అర్ధమగుచున్నది. విద్య లేనివారు మరియు యూదులలో ఎలాంటి అధికారిక స్థానము లేనటువంటివారు. కాని, తమ తల్లిదండ్రుల సాంఘికస్థితినిబట్టిచూస్తే, సాధారణ విద్యాభ్యాసం పొందియుండవచ్చు. గలిలయతీరమున అప్పటికే విస్తృతముగా వ్యాప్తిచెందిన గ్రీకుభాషతో, గ్రీకుప్రజల జీవనముతో బాగాపరిచయమున్నట్లు తెలుస్తుంది. సువిషేశాలలో ''జబదాయి కుమారులు'' అని వారి తండ్రి పేరిట పిలువబడుతున్నారు. యేసు వారిద్దరికీ ''బోయనేర్గేసు'' అని పేరుపెట్టాడు, అనగా ''ఉరిమెడివారు'' అని అర్ధము (మార్కు. 3:17). దేవుని చట్టాన్ని అనుసరించడంలో , ఏ మానవశక్తికి భయపడకుండా దృఢవిశ్వాసాన్ని కలిగియుండిరి అని సూచిస్తుంది. మొదటగా, వీరు బాప్తిస్మయోహాను శిష్యులై ఉండిరి. తరువాత యేసు, పేతురు, అ౦ద్రెయతోపాటు వీరినికూడా తన శిష్యులుగా పిలచియున్నాడు (యోహాను. 1:35-42). ప్రధమశిష్యులైన సీమోనుపేతురు, అ౦ద్రెయ, యోహాను మరియు యాకోబు యేసుతో యోర్దానునుండి గలిలయకువచ్చి అక్కడ కొంతకాలం ఉండిరి. ఆ తరువాత వారి సాధారణ జీవితాలకు తిరిగి వెళ్ళిరి. తర్వాత యేసే స్వయముగా వారిని గలిలయసరస్సుతీరమున చేపలుపట్టుచున్న సీమోనును, అతని సోదరుడగు అ౦ద్రెయను ''మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టువారలనుగా చేసెదను'' అని పిలిచాడు. మరియు అచటనుండి యేసు మరికొంత దూరము వెళ్లి పడవలో వలలను బాగుచేసికొనుచున్న జబదాయికుమారుడగు యాకోబును, అతని సోదరుడగు యోహానును చూచి పిలిచెను. వారు ఆయనను అనుసరించిరి (మార్కు. 1:16-19; మత్త. 4:18-22). అపోస్తలుల జాబితాలో యోహాను పేరు రెండవది (అ.కా. 1:13), మూడవది (మార్కు. 3:16-19) నాలుగవది (మత్త. 10:2; లూకా. 6:14). ఎప్పుడు యాకోబు తర్వాతనే యోహాను పేరు వస్తుంది. దీనిని బట్టి యాకోబుకన్న యోహాను చిన్నవాడని అర్ధమగుచున్నది.

అపోస్తలులలో యోహానుకి ప్రత్యేకమైనస్థానం ఉన్నది. యేసు యాయీరుకుమార్తెకు ప్రాణదానము చేసినప్పుడు (మార్కు. 5:37), యేసు దివ్యరూపధారణ పొందినప్పుడు (మత్త. 17:1), గేత్సేమనిలో ఆవేదన సమయమున (మత్త. 26:37) యేసుతో ఉన్నాడు. పేతురు, యోహానులను మాత్రమే పాస్కభోజనమునకు సిద్ధముచేయమని యేసు పంపాడు (లూకా. 22:8). కడరాభోజన సమయములో యోహాను యేసుప్రక్కనే, ఆయన వక్ష:స్థలమును ఆనుకొని కూర్చుండియుండెను (యోహాను. 13:23,25). యో 18:15 లో చెప్పబడిన ''మరియొక శిష్యుడు'' యోహానే. యేసు బందియైన తర్వాత యోహాను యేసువెంట ప్రధానార్చకుని ముంగిటలోనికి వెళ్ళెను. యోహానుకి ప్రధానార్చకునితో పరిచయముండెను. యోహాను మాత్రమే సిలువచెంత యేసుకు దగ్గరగాఉండటం చూస్తున్నాం. మరియతల్లిని యేసు ''ఇదిగో నీ తల్లి'' అని యోహానుకి అప్పజెప్పెను (యోహాను. 19:26-27). పునరుత్థానంతర్వాత అపోస్తలులలో మొదటిగా సమాధియొద్దకు పరుగెత్తుకొని వెళ్ళినవారు సీమోను పేతురు మరియు యోహాను. మొదటిగా యేసు పునరుత్తానుడైనాడని విశ్వసించినది యోహానుగారే (యోహాను. 20:2-10). తేబెరియా సరస్సు తీరమున యేసు శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు యోహాను అచ్చట ఉండెను. యేసుప్రేమించినశిష్యుడైన యోహాను పేతురుతో ''ఆయన ప్రభువే'' అని చెప్పినాడు (యోహాను. 21:7).

తను రచించిన యోహాను సువిశేషములో తన పేరు చెప్పకుండా ''ప్రేమించిన శిష్యుడు'' అని వ్రాస్తూ ప్రభువుతో తనకు ఉన్న దగ్గరి సంబంధాన్ని చెప్పియున్నాడు (యోహాను. 21:20-24). యేసుక్రీస్తు పరలోకమునకు కొనిపోబడినతర్వాత, పవిత్రాత్మరాకడ తర్వాత, విశ్వాసము పెంపొందించుటలో, ప్రభువు సంఘమును స్థాపించుటలోను పేతురుతోకలసి యోహానుగారు ప్రాముఖ్యమైన పాత్రను పోషించియున్నారు. దేవాలయముచెంత కుంటివానికి స్వస్థతను చేకూర్చుటలో పేతురుగారితో యోహానుగారినీ చూస్తున్నాం (అ.కా. 3:1). పేతురుతోపాటు యోహానుకూడా చెరపాలయ్యెను (అ.కా. 4:3). మరల పేతురుతోకలసి సమరియాకు వెళ్ళెను (అ.కా. 8:14). ఆ తర్వాత యేరూషలేమునకు వెళ్ళుచూ సమారియాలోని అనేక గ్రామాలలో సువార్తను బోధించిరి (అ.కా. 8:25). పాలస్తీనాలో వారిసువార్త బోధనా ఎంతకాలము జరిగిందో స్పష్టముగా తెలియదు. బహుశా, యోహాను ఇతర అపోస్తలులతో కలసి, దాదాపు 12 సం,,లు అనగా హేరోదు క్రైస్తవులపై హింసకాలము వరకు ఉండియుండవచ్చు (అ.కా. 12:1-17). విశ్లేషకుల ప్రకారం యోహానుగారు సువార్తాబోధనకై ఆసియా ప్రాంతానికి వెళ్ళాడు. క్రీ.శ. 51 వ సం.లో యేరూషలేములో జరిగిన ''అపోస్తోలిక కౌన్సిల్'' కు తిరిగి వచ్చాడు. గలతీయులకు వ్రాసిన లేక 2:9 లో కైస్తవసంఘానికి ఆధారస్తంభాలుగా ఎంచబడినవారు యాకోబు, పేతురు, యోహాను అని పౌలు గారు వ్రాసియున్నారు. పౌలుగారు తన రెండవ మరియు మూడవ సువార్తప్రయాణముల తరువాత, యేరూషలేమునకు వచ్చినప్పుడు యోహానుగారిని కలువలేదు. దీనిని బట్టి, యోహానుగారు 52-55 సం,,ల కాలములో పాస్తీనాను వీడిఉండవచ్చు.

యోహానుగారిని గూర్చి ఇంకా తెలుసుకోవాలంటే, నూతన గ్రంధములో ఆయన వ్రాసినలేఖలు మరియు దర్శన గ్రంధమును చూడాల్సిందే! క్రీస్తు జీవితమునకు, ఆయన కార్యములకు ప్రత్యక్షసాక్షి అని చూస్తున్నాం (1 యోహా. 1:1-5; 4:14). ఆసియా ప్రాంతాలలో, అక్కడవున్న క్రైస్తవ సంఘాలకు నాయకుడుగా అధికారిక గుర్తింపుపొందినట్లుగా తెలియుచున్నది. అంతేగాక, ''దేవుని వాక్కును, యేసుక్రీస్తు సాక్షమును ప్రకటించినందున పత్మాసు ద్వీపమునకు కొనిపోబడెను (దర్శన. 1:9). అచ్చటె దర్శన గ్రంథములోని దర్శనములను అతనికి బయలు పరచబడెను.

రెండవ మూడవ శతబ్దాలలోని క్రైస్తవ రచయితల ప్రకారం అపోస్తలుడు, సువిశేషకుడు అయిన యోహానుగారు మొదటి దశాబ్దపు చివరిశతాబ్దాలలో ఆసియా ప్రాంతములో నివసించాడు. ఎఫేసునుండి అక్కడఉన్న క్రైస్తవసంఘాలను నడిపించియున్నాడు. వేదసాక్షి పునీత జస్టిన్, అపోస్తలుడైన యోహానుగారు ఎఫేసులో వారితో జీవించాడని చెప్పాడు. పునీత ఇరనేయుస్, అపోస్తలుడైన యోహాను ఆసియా ప్రాంతములో ఉండి, ఎఫేసులో తన సువార్తని వ్రాసాడని మరియు ట్రాజాన్ పరిపాలనవరకు అక్కడే నివసించాడని చెబుతున్నాడు. యూఫెబియాస్ మరియు ఇతరులు, యోహాను దోమీశియన్ పాలనా (81-96) కాలములోనే పత్మాసుద్వీపమునకు కొనిపోబడ్డాడని చెప్పారు. దోమీశియన్ మరణానంతరం ట్రాజాన్ కాలములో ఎఫేసుకు మరల తిరిగివచ్చి అక్కడే క్రీ.శ. 100 సం.లో చాలా పెద్ద వయస్సులో మరణించాడు.

No comments:

Post a Comment