పునీత స్తెఫాను, (కిరీటప్ప), మొదటి వేదసాక్షి

పునీత స్తెఫాను, (కిరీటప్ప), మొదటి వేదసాక్షి, డిసెంబర్ 26, ఉత్సవము

'స్తెఫాను' అను నామము గ్రీకు అయినప్పటికిని, అతను యూదుడు. బహుశా, పాలస్తీనా సరిహద్దుల బయటఉండిన (Diaspora) వారి కుటుంబములో పుట్టినవాడైనా లేక జీవించినవాడైనా ఉండవచ్చు. అందుకే, వారిపై గ్రీకుసంస్కృతి (Hellenism) ప్రభావం ఎక్కువగాఉన్నది. గ్రీకుభాషలో 'స్తెఫానోస్' (Stefanos) అనగా 'కిరీటం' అని అర్ధం. అందుకే, పునీత స్తెఫానుగారిని, పునీత కిరీటప్ప అనికూడా పిలుస్తున్నాం.

పునీత స్తెఫాను జీవితము, అతనిపై విచారణ మరియు వేదసాక్షి మరణము గురించి అపోస్తలుల కార్యములు 6,7
అధ్యాయాలలో వ్రాయబడియున్నది. క్రైస్తవ అమరుల జాబితాలో, స్తెఫానుయొక్కజీవితము చిరస్మరణీయమైనది, మనస్సును కరిగించేటటువంటిది. స్తెఫాను యేరూషలేములో, క్రీ.శ. 35వ సం.లో వేదసాక్షిమరణాన్ని పొందియున్నారు. ఆయన మొదటి క్రైస్తవవేదసాక్షి (protomartyr).


అపోస్తలులు ఎన్నుకొన్న మొదటి ఏడుగురు సహాయకులలో (డీకనులు), స్తెఫాను మొదటి వాడు మరియు ప్రాముఖ్యుడు (అ.కా. 6:5). నూతననిబంధనలో అతని బాల్యజీవితముగూర్చిగాని, క్రైస్తవ విశ్వాసమును ఎలాస్వీకరించినదిగానీ, చెప్పబడలేదు. బహుశా, మెస్సయ్య మరణానంతరం యేరూషలేములోని క్రైస్తవులలో అతని ప్రాముఖ్యము, స్థానము పెరిగియున్నది. యేరూషలేములోని గ్రీకుదేశస్థులను ఆకట్టుకొనుటకు తనధీశక్తిని, సామర్ధ్యమును ఉపయోగించియున్నాడు. మొట్టమొదటిసారిగా, స్తెఫానుగూర్చి, అ.కా. 6:5 లో చెప్పబడింది. అనుదిన పరిచర్యను అప్పజెప్పుటకు అపోస్తలులు ఏడుగురు సహాయకులను ఎన్నుకొనుటకు నిశ్చయించిరి. దాని నిమిత్తమై, సంఘస్తులు విశ్వాసముతోను, పవిత్రాత్మతోను నిండిన స్తెఫాను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మేనాసు, నికోలా అనువారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. అపోస్తలులు ప్రార్ధన చేసి వారిపై చేతులుంచిరి.

''స్తెఫాను దైవానుగ్రహముతోను, శక్తితోను నిండినవాడై, ప్రజలమధ్య గొప్పఅద్భుతములను, ఆశ్చ్చర్య కార్యములను చేయుచుండెను'' (అ.కా. 6:8). స్తెఫానుమూలమున అనేకులు నూతనవిశ్వాసమును పొందిరి. ఈ సమయానికి, యూదమతఅర్చకులు అనేకులు క్రొత్తవిశ్వాసములోనికి మారియున్నారు. కాని, వారు ఇంకను, మోషే చట్టములోనున్న పాత సంప్రదాయాలను, నియమాలను పట్టుబడి ఉండేవారు. బాహ్యముగా, నిర్వహింపబడు సాంగ్యాలు, ఆచారాలు ఆత్మకన్న ఎక్కువకాదనియు స్తెఫాను బోధించేవాడు. వారిలో కొందరు స్తెఫానుతో వాదనకు దిగియున్నారు. కాని, స్తెఫాను అగపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేకపోయారు. స్తెఫాను బోధనను చూసి వారు ఓర్వలేక పోయారు.

స్తెఫానును, ఆయన బోధనలసారాంశాన్ని వారు అర్దము చేసుకోలేక పోయారు. స్తెఫానుతో వాదనకుదిగినవారు ''స్వతంత్రులు'', కురేనీయులు, అలెగ్జాండ్రీయులు, సిలీషియా, ఆసియాలనుండి వచ్చినవారిలో కొందరు. క్రీ.పూ. 63వ సం.లో రాజకీయనాయకుడు, మిలిటరీకమాండరు అయిన పొంపీ (క్రీ.పూ. సెప్టెంబర్ 29, 106 నుండి సెప్టెంబర్ 29, క్రీ.శ.48 వరకు) కాలములో రోము నగరమునకు బానిసలుగా కొనిపోబడిన యూదులతరం ఈ ''స్వతంత్రులు''. వీరు స్తెఫానును విచారణసభలోనికి తీసుకొనివచ్చి, అతనికి వ్యతిరేకముగా, మోషేమీద, దేవునిమీద దూషణ వాక్యములు పలుకుచున్నాడని అబద్ద సాక్ష్యములు చెప్పుటకు నిర్ణయించిరి. ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్రబోధకులను అతనికి వ్యతిరేకముగా పురిగొల్పిరి.

విచారణసభలో స్తెఫానుపై విచారణ జరుపుతున్నప్పుడు, అతనిముఖము దేవదూతముఖమువలె కనిపించెను. అతనిపై పడిన నిందలకు జవాబుచెప్పుకొనుటకు అవకాశమును ఇచ్చిరి. ఆసమయములో అతను క్షమాపణచెప్పి, ఇక ఇలాంటివి బోధించననిచెప్పియుండవచ్చు. కాని, స్తెఫాను అలాచేయలేదు. దానికిబదులుగా, తన విశ్వాసానికి సాక్ష్యమిచ్చియున్నాడు. తన ప్రసంగములో (అ.కా. 7:2-53) ఇస్రాయేలు ప్రజలను దేవుడు ఎలా నడిపించాడో, వారి విగ్రహారాధన, అవిధేయతగూర్చి బోధించాడు.

స్తెఫాను చెప్పినదివిని వారు అతనిపై మండిపడి అతనివంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి. ''అయినను స్తెఫాను పవిత్రాత్మతో నిండినవాడై, పరలోకమువైపు చూడగా, అతనికి దేవుని మహిమయు, దేవుని కుడిప్రక్కన యేసు నిలువబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు 'చూడుడు! పరలోకము తెరువబడిఉన్నట్లు, నాకు కనబడుచున్నది. మరియు మనుష్యకుమారుడు దేవుని కుడిప్రక్కన నిలువబడి యున్నాడు' అని పలికియున్నాడు'' (అ.కా. 7:55-56). ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొనిపడి, నగరము బయటకు తరుముకొనిపోయి, రాళ్ళతో కొట్టిరి. ఇంకను రాళ్ళతో కొట్టుచుండగా, స్తెఫాను ''యేసుప్రభూ! నా ఆత్మను గైకొనుము.'' అని ప్రార్ధించాడు. మోకరిల్లి, ''ప్రభూ! ఈ పాపము వీరిపై మోపకుము'' అని పలికి వీరవేదమరణాన్ని పొందియున్నాడు.


రాళ్ళతోకొట్టి చంపబడినవారిని విచారణసభ నిర్ణయించిన స్థలములో ఉంచెడివారు. అయితే, ఇలా స్తెఫాను విషయములో జరిగినదని ఖచ్చితముగా చెప్పడానికి ఆధారాలులేవు. ఏది ఏమైనప్పటికిని, ''కొందరు భక్తులు స్తెఫానును సమాధి చేసిరి'' (అ.కా. 8:2). 5 వ శతాబ్దము వరకు ఆయన సమాధిగూర్చి దాఖలులేవు. 415వ సం.లో లూచియన్ అను గురువు తన దివ్యదర్శనములో, స్తెఫాను అవశేషము ఉత్తర యేరూషలేమునకు 20 మైళ్ళ దూరములోనున్న 'కఫార్ గామాల' అను స్థలములో ఉన్నదని గాంచియున్నాడు. అక్కడనుండి, స్తెఫానుగారి అవశేషమును 'సియోను కొండ' పై ఉన్న దేవాలయములో ఉంచిరి. 460వ సం.లో దమాస్కసుగేటు బయట, స్తెఫాను రాళ్ళతోకొట్టబడిన స్థలమునందు యుదోచియ నిర్మించిన దేవాలయములో ఉంచిరి. ఆ స్థలములో ఇప్పుడు స్తీఫాను పేరిట మరో కట్టడమును నిర్మించిరి.

పునీత కిరీటప్పగారిలోని గొప్పసుగుణం, హింసింస్తున్నవారికొరకు మరణసమయములోను వారిని క్షమించమని యేసుప్రభువును ప్రార్ధించడం. ఆయన ప్రభువును ఎంతగానో ప్రేమించాడు. ఎంతగాఅంటే, ప్రభువుగూర్చి బోధించకుండా ఏక్షణమూ ఉండలేకపోయాడు. నిందలకు, అవమానములకు జంకలేదు. అవిశ్వాసులను, అన్యాయముగా జీవించేవారిని మొహమాటము లేకుండా తూర్పారబట్టాడు. సత్యమునకు పాటుబడి, సత్యముకొరకు ప్రాణాలుసైతం అర్పించాడు. స్తెఫాను యేసుప్రభువువలెనె మరణించాడు. ఆయనపై నిందలనుమోపారు, అన్యాయపుతీర్పునకు గురిచేసారు. మరణ సమయములోనూ, ఆయన పెదవులపై మన్నింపుప్రార్ధన మరియు తన కన్నులను విశ్వాసముతో దేవునివైపునకు త్రిప్పియున్నాడు.

స్తెఫాను క్రైస్తవ విశ్వాసానికి ఓ బలం, ఓ శక్తి. ఆయన ఎంతోమందికి ఆదర్శప్రాయుడైయున్నాడు. పరలోకములో తప్పక ఆయన సౌలు, పౌలుగా మారడానికి ప్రార్ధన చేసాడనడములో ఎంతమాత్రము అతిశయోక్తిలేదు!

స్తెఫాను ''పవిత్రాత్మతో నిండినవాడు, జ్ఞానము గలవాడు, మంచి పేరుగలవాడు'' (అ.కా. 6:3).
''విశ్వాసముతోను, పవిత్రాత్మతోను నిండిన వాడు'' (అ.కా. 6:5)
''దైవా నుగ్రహముతో నిండిన వాడు''(అ.కా. 6:8)
గొప్ప అద్భుతములను, ఆశ్చర్య కార్యములను చేసియుండెను'' (అ.కా. 6:8).

No comments:

Post a Comment