క్రిస్మస్ సందేశము

క్రిస్మస్ సందేశము

''మీరు భయపడ వలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను'' (లూకా 2:10-11). ఆహా! ఎంతటి అనుగ్రహం! ఎంతటి భాగ్యం! మనం పొందిన వరాలలోకెల్ల గొప్ప వరం, అనుగ్రహం: క్రిస్మస్ - దేవుడు లోక రక్షకుడిగా జన్మించడం. వాక్కు మానవుడై మన మధ్య నివసించడం. తన ప్రజలకు వాగ్ధానము చేసిన విధముగా, చీకటిలోనున్న ఈ లోకానికి వెలుగును ప్రసాదించడం. నిజముగా ఇది గొప్ప శుభవార్తే! అందుకే పరలోకదూతల సమూహము సైతము ప్రత్యక్షమై ఇట్లు స్తుతించెను:

''మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ,
భూలోకమున ఆయన అనుగ్రహమునకు
పాత్రులగు వారికి సమాధానము కలుగుగాక!'' (లూకా 2:14).


''మనకొక శిశువు జన్మించెను. మనమొక కుమారుని బడసితిమి  '' (యెషయా 9:6). క్రీస్తు పూర్వం 8 వ శతాబ్దములో యెషయా ప్రవక్త ఇస్రాయేలు ప్రజలకు ఇచ్చిన గొప్ప ఊరట కలిగించే ప్రవచనం. ఎందుకన, బలమైన అస్సీరియ దేశం ఇస్రాయేలీయుల మీద దండెత్తుతున్న రోజులు. అస్సీరియా రాజు మరణముతో, 'చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూస్తారని, దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించునని, మెడమీద కాడి (బానిసత్వం), విరగ గొట్టబడునని, భుజముల మీద దండమును (అణచివేయుట) ముక్కలు చేయబడునని, నూతన రాజ్య భారమును వహించుటకు శిశువు జన్మించునని' యెషయా ప్రవచించాడు. యేసు జననం పట్ల ఈ ప్రవచనాలు మనకీ ఊరట కల్గించే ప్రవచానాలే! ఎందుకనగా, మనంకూడా ఈనాడు అనేక విధాలుగా, చీకటిలో, బానిసత్వములో జీవిస్తున్నాం.

క్రీస్తు జన్మము ఇమ్మానుయేలు: దేవుడు మనతో ఉన్నాడు అను ఆనందమును కొనియాడటం. ఆయన మనతో లోకాంతము వరకు ఉంటాడు, మనలను అమితముగా, అనంతముగా ప్రేమిస్తాడు అను దానికి ఆయన జన్మ నిదర్శనం. క్రీస్తు జననం ఒక నూతన సృష్టి. నూతన దివికి, నీతికి నిలయమైన భువికి ఆరంభం (యెషయా 65:17; 2 పే 3:13). పుట్టిన ప్రతీ బిడ్డ ఓ కొత్త ఆరంభం, ఎంతో భవిష్యత్తు.

జన్మించిన రక్షకునిలో జీవముండెను. ఆ జీవము మనకు వెలుగాయెను (యో 1:4). తన కుమారుని జన్మముతో దేవుడు తన శక్తిని, అనంతమైన ప్రేమను మనం తెలుసుకొనేలా చేస్తున్నాడు. తద్వారా, మనము జీవితమును, దానిని సమృద్ధిగా పొందులాగున చేసియున్నాడు. కాని, మనము గుర్తుంచుకోవలసిన విషయం: ''ఆయన తన వారి యొద్దకు వచ్చెను. కాని, తన వారే ఆయనను అంగీకరించలేదు'' (యో 1:11). మనమందరము ఆయనకు చెందినవారమని మన విశ్వాసం. ఈరోజు ఆయన మన మధ్యలో జన్మించాడు. మరి, ఆయనను ఎరిగియున్నామా? వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. అదే క్రిస్మస్. దేవుని మహిమను మనమందరము పొందాలి. తండ్రి యొద్ద నుండి వచ్చే ఏకైక కుమారుని మహిమను మనం చూడాలి, పొందాలి. అప్పుడే, ఈ క్రిస్మస్ కి అర్ధం ఉంటుంది. దేవుని బిడ్డగా, ఏకైక కుమారునిగా జన్మించిన ప్రభువును అంగీకరించి విశ్వసిస్తే మనమూ దేవుని బిడ్డలగు భాగ్యమును పొందుదము (యో 1:12).

క్రీస్తు జన్మించే నాటికి, ఈ లోకం చీకటిలో ఉంది. పాపముతో నిండి యున్నది. మనం అవిశ్వాసములో ఉన్నాము. పాలస్తీనా దేశం సాంఘిక అసమానలతో నిండి ఉన్నది. రోమను సామ్రాజ్యం తన మిలటరీ బలగాలతో మధ్యధరా ప్రపంచాన్నంతటిని తన గుప్పిట్లో ఉంచుకుంది. మతోన్మాదులు విప్లవాలను, రక్త పాతాన్ని, ఉగ్రవాదాన్ని, సృష్టిస్తున్నారు. ధనికులు పేదవారిపై పెత్తనం, మతాధికారులు తమ అధికారాన్ని, ప్రభావాన్ని చాటుకొనుటకు ప్రయత్నంచేసేవారు. యేరుషలేము శతాబ్దాలుగా రక్తపాతాలకు, ఘర్షణలకు నిలయముగా చరిత్రలో చిరస్థాయిగా నిలచినటువంటిది. ఇలాంటి విషమ పరిస్థితులు ఉన్నప్పటికిని, దివ్య బాలుడు ఎదురొడ్డి అద్భుత రీతిన జీవించ గలిగాడు. అతడు పెరిగి పెద్దవాడై శాంతికి మూలాధారమైయ్యాడు. ఇదే దేవుని అపారమైన శక్తికి, కరుణకు నిదర్శనం. అందుకే దివ్య బాలుని జన్మను కృతజ్ఞతతో కొనియాడాలి. ఆయన జన్మతో, ఒక క్రొత్త జీవితం ఆరంభ మైనది, లేత మొక్క అంకురించియున్నది. ఓ నూతన సూరీడు దేదీప్యముగా ప్రకాశించి యున్నది. పెరిగి పెద్దవాడైన తర్వాత, దైవరాజ్యము గూర్చి, న్యాయముగూర్చి భోదిస్తాడు.

16 వ బెనడిక్ట్ పాపుగారు తన క్రిస్మస్ సందేశములో ఇలా చెప్పియున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మనం సాంకేతిక, సామాన్య పరిజ్ఞానములో అపారమైన పురోగతిని సాధించాం. ఈరోజు మనం అన్ని విషయాలలో అపారమైన జ్ఞాన వనరులను కల్గియున్నాము. అయితే, ఇలాంటి పరిస్థితులలో, మానవ మేధస్సుకు, సాంకేతిక పరి జ్ఞానానికి బానిసలయ్యే అవకాశం లేకపోలేదు! అలా బానిసలుగా మారినప్పుడు, మనలో ఆధ్యాత్మిక లేమి, హృదయ శూన్యత సంతరించుకొంటాయి. అందుకే, మనం క్రీస్తు జన్మమునకు మన హృదయాలను, మనస్సులను తెరవాలి. రక్షణ ఘట్టమైన క్రీస్తు జననం ప్రతీ మానవునికి ఒక క్రొత్త నమ్మకాన్ని ఇస్తుంది.

ఈనాడు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినదని భావిస్తున్నాం. కాని, క్రీస్తు వెలుగులేనిచో మన అభివృద్ధికి ఎలాంటి సార్ధకత ఉండదు (యో 1:9). వాక్కు మానవుడై నందునే మానవ జీవితానికి సంపూర్ణ అర్ధమున్నదని శ్రీ సభ పదే పదే భోదిస్తుంది.

ఈ రోజుల్లో అన్ని విభాగాల్లోనూ అన్యాయం, అవినీతి, స్వార్ధం, భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, నైతిక విలువలు లేకపోవడం, ఆర్ధిక అసమానతలు మొ,,గు దుష్ట శక్తులతో మన సమాజం నిండిపోయినది. క్రీస్తు ఆనాడు బెత్లేహేములో పుట్టినట్లుగా, ఈనాడు మన సమాజములోనూ జన్మించాల్సిన అవసరం ఉంది. మనం మారాలి. అప్పుడే, మన సమాజం మారుతుంది. దేవుడు కోరుకొనేది ఒక్కటే: పరలోక రాజ్యం భూలోకమున నెలకొనాలి. దానికి మనందరి సహాయ సహకారం అవసరం.

క్రీస్తు జయంతిని బాహ్యముగా కొనియాడటముతో సరిపోదు. దివ్యబాలుడు ఈ లోకానికి తెచ్చిన పశ్చాత్తాపము, మారుమనస్సు అను సందేశాన్ని మన జీవితానికి అన్వయించుకొన్నప్పుడే, మనం కొనియాడే ఈ పండుగకు అర్ధం ఉంటుంది.

రెండవ జాన్ పౌల్ పాపుగారు 19 డిశంబర్ 1999 వ సం,,రములో, త్రికాలజపముగూర్చి సందేశాన్ని ఇస్తూ ఇలా అన్నారు. క్రీస్తు జయంతి కేవలం 2000 ల సం,,ల క్రితం క్రీస్తు జన్మించిన సంఘటనని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు. ఇది ఒక సజీవమైన వాస్తవము. కనుక, విశ్వాసుల హృదయాలలో ప్రతీ సం,,ము ఈ సజీవ వాస్తవం పునరావృతం కావాలి. ఆనాటి చారిత్రాత్మిక సంఘటన ఈ రోజు ఆధ్యాత్మిక సజీవ వాస్తవముగా మన సాంగ్యాలలో జీవించాలి.

క్రిస్మస్ - దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని శాంతి మరియు దేవుని రక్షణ. ఆమెన్.

No comments:

Post a Comment