5 వ సామాన్య ఆదివారము, Year B

 5 వ సామాన్య ఆదివారము, Year B
యోబు 7:1-4; 6-7, భక్తి కీర్తన 147; 1-6, 1 కొరి 9:16-19, 22-23; మార్కు 1: 29-39
"రండు, మనలను సృజించిన సర్వేశ్వరుని ముందు సాగిలపడి ఆయనను ఆరాధింతము. ఎందుకన, ఆయనే సర్వాధికారి, ఆయనే మన కర్త."
"అందరు మిమ్ము వెదకుచున్నారు" (మార్కు 1:37 ) - ప్రార్ధన ప్రాముఖ్యత

ఉపోద్ఘాతము: శ్రమల అంతర్యము

బాధలు మన జీవితములో అనివార్యము. ఈలోక బాధలలో చివరిది మరియు తీవ్రమైనది మరణం. నాశనం చేయబడ వలాసిన చివరి శత్రువు మృత్యువు (1 కొరి 15:26). మన బాధలలో మనం అశక్తులం. అందుకే, మన బాధలకు అర్ధాన్ని వెదకుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాము. క్రైస్తవులకు, క్రీస్తును విశ్వసించి అనుసరించు వారైన మన బాధలకు, క్రీస్తు శ్రమలు అర్ధాన్ని చేకూర్చుతున్నాయి. బాధలను, మరణాన్ని జయించుటకు క్రీస్తు ఒక రక్షకునిగా ఏతెంచాడు. క్రీస్తు శారీరక బాధలను మాత్రమే గాక, సంపూర్ణ వ్యక్తిని స్వస్థత పరచును. అంతర్గత స్వస్థత, పాపమన్నింపు ఆయన ప్రేషిత కార్యాలు. మన బాధల ఉపశమనము కొరకు, దేవుడు మన జీవితాలలో జోక్యము చేసికొనును. అయినప్పటికిని, బాధలను ఆయన అనుమతించును. "దేవుని మహిమ వీనియందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను" (చూడుము యో 9:1-3). బాధలలోనున్న వ్యక్తి, దేవున్ని వెదకుటకు ప్రయత్నిస్తాడు.

మొదటి పఠనం - శ్రమలను ఎలా అర్ధం చేసుకోవాలి?

ఈనాటి మొదటి పఠనం యోబు జీవిత గాధనుండి వింటున్నాం. యోబు ఆయన జీవితములో ఎన్నోకష్టాలను, బాధలను అనుభవించాడు. ఆయన పొందే బాధలను మాటలలో వ్యక్తపరస్తున్నాడు. తన స్నేహితులు ఆయన విడచిపోయారు. యోబు పాపం చేసాడని ఒకరు, పశ్చాత్తాప పడాలని ఒకరు, చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని మరొకరన్నారు. చివరికి, ఆయన భార్యకూడా శంకించింది. 'దేవున్ని శపించి మరణింపుము' అని కోరింది. కాని, యోబు, "దేవుడు మనకు శుభములు దయచేసినప్పుడు స్వీకరించితిమి. కీడులను పంపినపుడు మాత్రము స్వీకరింప వలదా?" అని ప్రశ్నించాడు. ఆవిధముగా, బాధలలోనే యోబు ఇంకా ఎక్కువగా దేవున్ని వెదికాడు, ప్రార్ధించాడు. ఆయనకు మరింత దగ్గరయ్యాడు. యోబు విశ్వాస ప్రార్ధనకు దేవుడు జవాబు ఇచ్చాడు.

మనముకూడా, మన కష్టాలకు, బాధలకు కృంగి కృశించక, ఆధ్యాత్మిక హృదయముతో, వాటిద్వారా దేవుడు మనకి అందిస్తున్న సందేశాన్ని తెలుసుకొనడానికి ప్రయత్నం చేయాలి. బాధలలో, ప్రభువు మనలను పరిశుద్ధులను చేయుచున్నాడా? మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా / బలపరుస్తున్నాడా? మన నిలకడను పరీక్షిస్తున్నాడా? మన దైవ/సోదరప్రేమను పరీక్షిస్తున్నాడా? మనం తప్పక గ్రహించాల్సిన విషయం, 'ప్రార్ధనతో, పవిత్రాత్మ శక్తితో జవాబు వెదకిన వారికి సరియైన సమాధానం దొరకును'.

సువిశేష పఠనము: శ్రమలలో ప్రభువును వెదకాలి

ఈనాటి సువిశేష పఠనములోకూడా, కష్టాలలో, బాధలలోనున్న ప్రజలందరు ప్రభువు కొరకు వెదకుచున్నారు. ప్రార్ధనా మందిరములో అధికారపూర్వకముగా బోధించి, అపవిత్రాత్మ ఆవేశించిన వానిని స్వస్థత పరచి, ఇంకా మరెంతోమందిని స్వస్థత పరచాడు. వేకువ జామున, ఒక నిర్జన ప్రదేశమున ప్రార్ధన చేయుచుండగా, సీమోను అతని సహచరులు ప్రభువును వెదకుచు వెళ్లి ఆయనను కనుగొని, "అందరు మిమ్ము వెదకుచున్నారు" అని చెప్పారు.

ప్రార్ధన జీవితముతో ప్రభువును వెదకాలి: ఈ రోజుకి కూడా, అందరు ఆయన కొరకు వెదకుచున్నారు. మన కష్టాలు, బాధలు ఎంతవైనను, ఆత్మశక్తితో వాటన్నింటిని జయించవచ్చు. దేవుని కృపవలన, యేసు నామమున ఎలాంటి బాధలనైనను ఎదుర్కొనవచ్చు. దేవునినుండి మనం ఎన్నో అనుగ్రహాలను పొందియున్నాము. ఏదీ ఆశించకుండా, ఇతరులతో ఆ వరాలను పంచుకొందాం. మన జీవితానికి ఓ అర్ధాన్ని చేకూర్చుకోవాలని ప్రభువు ఆశిస్తున్నారు. ప్రార్ధనతో కూడిన జీవితం, దేవునికి దగ్గరగా చేరు జీవితం, ఇతరులతో పంచుకొను జీవితం, స్వస్థత, పశ్చాత్తాపముతో కూడిన జీవితాన్ని జీవించాలని ప్రభువు ఆశిస్తున్నారు. తండ్రి చిత్తాన్ని కనుగొనుటకు యేసు ప్రతిదినం ప్రార్ధన చేసాడు. ఆయన ప్రార్ధానా మందిరములలో, అలాగే ఏకాంత ప్రదేశాలలో ప్రార్ధన చేసాడు. యేసు ప్తరభువుకు కూడా, తన ప్రేషితకార్యములో ప్రార్ధన ఎంతో ప్రధానమైనది. దేవుని కుమారుడైనప్పటికినీ, ప్రార్ధన అవసరత, తండ్రి దేవునితో సంభాషించడం ఎంతో అవసరమని గుర్తించాడు. మరి మనికింకా ఎంత అవసరమో గుర్తించాలి!  అందులకే, దైవచిత్తాన్ని తెలుసుకొనుటకు, ప్రభువు మనకు కూడా ప్రార్ధన నేర్పించాడు. 

మన జీవిత అంధకారమునుండి బయటపడుటకు ప్రార్ధన ఎంతో ప్రాముఖ్యం. క్రీస్తానుచరులుగా, క్రీస్తువలే మారుటకు ప్రయత్నంచేద్దాం. తండ్రి చిత్తం, ప్రభువు కార్యమైనప్పుడు, అదే దేవుని చిత్తం, ప్రభువు కార్యం, మన కార్యముకూడా కావలయును. తండ్రితో ప్రభువు ఇలా ప్రార్ధించాడు: "నీవు నాకు అప్పగించిన పనిని పూర్తిచేసి, నిన్ను ఈ లోకమున మహిమ పరచితిని" (యో 17:4). మనతో ప్రభువు ఇలా అంటున్నాడు, "ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెడల ప్రకాశింపనిండు" (మ 5:16).

ప్రభువు ప్రేషిత కార్యములో మనమూ భాగస్తులమే. తండ్రి కుమారున్ని పంపినట్లే, మనలను కూడా పంపియున్నాడు. "నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యో 14:12).

రెండవ పఠనము - శ్రమలలో పౌలు ఆదర్శం

ఈనాటి రెండవ పఠనములో పౌలుగారు ఇలా అంటున్నారు, "ఈ పనిని (సువార్తా బోధన) నేనే చేసినచో ప్రతిఫలమును ఆశింపవచ్చును. కాని, ఇది నా విధి అని భావించినచో, నాకు ఒక పని ఒప్పచెప్పబడినదని అర్ధము (1 కొరింతి 9:17). పౌలుగారు యేసువలెనె దైవకార్యాలను చేసియున్నాడు. అన్ని ఇబ్బందులను, బాధలను ధైర్యముతో ఎదుర్కొని, సువార్తను బోధించి తన జీవితాన్ని అర్పించాడు. యో 9:4 లో ప్రభువు చెప్పిన మాటలను తన జీవితములో పాటించాడు: "పగటి వేళనే నన్ను పంపిన వాని పనులు మనము చేయుచుండవలెను. రాత్రి దగ్గర పడుచున్నది. అపుడు ఎవడును పని చేయలేడు." మనం ఏ పని చేసిన ప్రభువు పేరిట చేసినచో ఆనందాన్ని పొందగలము. ప్రతీది ఆయన కొరకు చేద్దాం. మన బాధలను, కష్టాలను, మన అనుదిన కార్యాలను ఆయన చెంతకు తీసుకొని వద్దాం. "భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను" (మ 11: 28).

No comments:

Post a Comment