త్రికాల జపము, ఆదివారము, 21 జూన్ 2026

 పొప్ లియో XIV
త్రికాల జపము
సెయింట్ పీటర్స్ స్క్వేర్
ఆదివారము, 21 జూన్ 2026

ప్రియమైన సహోదరీ సహోదరులారా, మీ అందరికీ ఆదివారపు శుభాకాంక్షలు!

నేటి సువార్త పఠనంలో (మత్త 10:26-33), యేసు ప్రభువు తన శిష్యులను పరిచర్యకు పంపుతూ ఈ విధంగా హెచ్చరిస్తున్నారు: “చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్ల మీరు వెలుతురులో బోధింపుడు; చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుదు” (వ. 27).

మనం ఏకాంతంలో, అనగా మన హృదయ అంతరంగంలో వినేదానికి మరియు అందరికీ మనం ప్రకటించవలసిన దానికి మధ్య ప్రభువు ఒక పోలికను చూపుతున్నారు. సువార్తను ప్రకటించడం అంటే మొదటగా ప్రభువుతో మనకు ఏర్పడిన వ్యక్తిగత అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడమేనని, అది మనలో ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రత్యేకమైనదని మనకు గుర్తుచేస్తున్నారు.

ఏదైనా ఒక దైవ పరిచర్య యొక్క బలం పద్ధతులు, సాధనాలకు అతీతంగా మనలో పరిశుద్ధాత్మ చేసే కార్యం ద్వారా మరియు మనం చూపే నిజాయితీ గల స్పందన ద్వారానే లభిస్తుంది. పునీత థామస్ అక్వినాస్ గారు ‘బోధన’ (ప్రసంగం) గురించి మాట్లాడుతూ, మనం ధ్యానించిన దానిని ఇతరులకు అందించడమే బోధన అని అన్నారు: “contemplata aliis trader (మనం ధ్యానించిన సత్యాలను ఇతరులకు పంచడం).

దైవధ్యానం లేదా ఏకాంత ప్రార్థన అనేది కేవలం కొద్దిమంది సాధువులకు, సన్యాసులకు లేదా మునులకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక అనుభవమని మనం అనుకోకూడదు. మన దైనందిన జీవితంలోని పనుల మధ్య, దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా గడపడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన సంతోషాలను, ఆందోళనలను ఆయనకు అప్పగించడానికి, మరియు మన జీవితాలను ఆయనతో కలిసి పునఃసమీక్షించుకోవడానికి ప్రశాంతమైన క్షణాలను కేటాయించడం ద్వారా మనమందరం దీనిని చేయవచ్చు. ఇది మన విశ్వాసాన్ని మరింత దృఢంగా, స్పష్టంగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి స్థలంలోనూ సువార్త వెలుగును ప్రతిబింబింపజేయడానికి, అలాగే సువార్త విలువలను అర్థం చేసుకోని లేదా అంగీకరించని చోట కూడా దానికి సాక్ష్యంగా నిలవడానికి, నమ్మకమైన మరియు స్వేచ్ఛ గల శిష్యులుగా ఉండటానికి ఇది మనకు తోడ్పడుతుంది.

మనం పైన పేర్కొన్న బైబులు భాగాన్ని రాసిన పునీత మత్తయి కష్టాలతో కూడిన జీవితాన్ని అనుభవిస్తున్న సమాజాల కొరకు దీనిని రాశారు. నేడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చాలా మంది క్రైస్తవులు ఎదుర్కొంటున్నట్లే, నాటి వారు కూడా శత్రుత్వాన్ని, హింసను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సమయంలో నిరాశకు గురవడం, అలసట లేదా భయానికి లోనవడం వంటి శోధనలు ఎంతో ఎక్కువగా ఉండేవి.

అప్పటిలాగే ఇప్పుడు కూడా, యేసు బోధనలకు నమ్మకంగా ఉండటం మరియు ఆయన వాక్యాన్ని ప్రకటించడం ఒక సవాలుగా మారింది: ద్వేషానికి ప్రేమతో, అహంకారానికి నమ్రతతో, మరియు నిరాశకు పట్టుదలతో స్పందించడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం, ఆయనతో మనకున్న ఆత్మీయ బంధంలో మన విశ్వాసపు పునాదులను, మన పరిచర్యను మరింత లోతుగా నాటుకోవాలి (పాప్ ఫ్రాన్సిస్, “ఎవాంజెలి గౌదియమ్”, 8). మనము నిరాశ చెందకుండా, ప్రతి పరిస్థితిలోనూ ఆయన నిరీక్షణ, ప్రేమ మరియు శాంతి సందేశాన్ని అందరితో పంచుకోవడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. ప్రస్తుత లోకానికి ఇది ఎంతో అవసరం!

మనలో ప్రతి ఒక్కరం మన పిలుపుకు తగినట్లుగా, యేసు ప్రభువు యొక్క సువార్త సాక్షులుగా జీవించడానికి మరియమాత మనకు సహాయం చేయును గాక! ఆమెన్.

No comments:

Post a Comment